breaking news
Visakha Greater Municipal Corporation
-
స్వగృహ ప్రాప్తిరస్తు
సాక్షి, విశాఖపట్నం: నవరత్నాల అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం దూకుడుగా వ్యవహరిస్తోంది. అధికారంలోకి రాగానే నవరత్నాలపై దృష్టి సారించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆ దిశగా నడిపిస్తున్నారు. ఇందులో భాగంగా నగర పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఇళ్లులేని లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేసేందుకు చర్యలు చేపడుతున్నారు. ఇందుకోసం జీవీఎంసీ పరిధిలో ఇళ్లు లేని వారి జాబితాను సిద్ధం చేస్తోంది. గత ప్రభుత్వం వివిధ ప్రాంతాల్లో ఇళ్లు నిర్మించేందుకు వివిధ ప్రాంతాల్లో నిర్మాణాలు తలపెట్టింది. ఆ గృహ నిర్మాణాలకు సంబంధించిన టెండర్ల ప్రక్రియ సక్రమమా.. కాదా.. అనే విషయాలపై ప్రభుత్వం ఆరా తీస్తోంది. దానికనుగుణంగా తదుపరి నిర్మాణాలు పూర్తి చేసి అందరికీ ఇళ్లు మంజూరు చెయ్యాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ముందస్తుగా లబ్ధిదారుల సమాచారం సేకరణ ప్రక్రియ ప్రారంభించింది. వార్డు వలంటీర్ల ద్వారా సర్వే.. నగర పరిధిలో ఇళ్లు లేని లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియను ఇప్పటికే జీవీఎంసీ ప్రారంభించింది. ఇటీవల నియమితులైన వార్డు వలంటీర్లు ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఒక్కో వలంటీరు 50 నుంచి 100 ఇళ్లకు వెళ్లి వారి వివరాలు సేకరిస్తున్నారు. ప్రజాసాధికార సర్వేలో నమోదై, సొంత ఇల్లు కానీ, స్థలం కానీ లేని వారి వివరాలు, ఆధార్ నంబర్లు, రేషన్కార్డు వివరాలు తీసుకొని ఆయా జోన్ పరిధిలో ఉన్న అర్బన్ కమ్యూనిటీ డెవలప్మెంట్(యూసీడీ) అధికారులకు అందజేస్తున్నారు. ఆధార్ కార్డులు, ఇతర డాక్యుమెంట్ల ఆధారంగా అధికారులు లబ్ధిదారులను గుర్తించి.. దరఖాస్తులు సిద్ధం చేస్తున్నారు. ఈ దరఖాస్తుల్ని నవరత్నాలు హౌస్సైట్స్ వెబ్సైట్లో అప్లోడ్ చేస్తున్నారు. ఈ నెలాఖరు నాటికి లబ్ధిదారులకు సంబంధించిన దరఖాస్తులన్నీంటినీ వార్డు, జోన్ వారీగా అప్లోడ్ చెయ్యాలని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ అండ్ డైరెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు యూసీడీ అధికారులు ఈ ప్రక్రియను వేగవంతం చేశారు. త్వరితగతిన లబ్ధిదారుల జాబితా రూపొందించి నివేదికల్ని సిద్ధం చేసి అప్లోడ్ చేసేందుకు జీవీఎంసీ అధికారులు, సిబ్బంది ప్రయత్నాలు ముమ్మరం చేశారు. వెంటపడుతున్న దళారులు.. గత ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో గృహాలు మంజూరు చేసే ప్రక్రియ ప్రారంభించింది. నాలుగు విడతల్లో 56,059 ఇళ్లు ఇవ్వాలని టీడీపీ ప్రభుత్వం గాలిలో లెక్కలు వేసి.. కేవలం వందల సంఖ్యలో మాత్రమే కేటాయింపులు జరిపింది. కానీ ఎన్నికలు వస్తున్న సమయంలో ప్రజల్ని మభ్యపెట్టి లక్షలాది మంది వద్ద నుంచి దరఖాస్తులు స్వీకరించేశారు. తీరా ఎన్నికలయ్యాక ఆ దరఖాస్తుల్ని తిరిగి ప్రజలకు ఇచ్చేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పైగా ప్రభుత్వం మారిన తర్వాత కొందరు టీడీపీ దళారులు కొత్త వ్యాపారం ప్రారంభించారు. ఇప్పటికే ఇళ్లు మంజూరైన వారి వద్దకు వెళ్లి కొత్త ప్రచారం నిర్వహిస్తున్నారు. ‘కొత్త ప్రభుత్వం వచ్చిన నేపథ్యంలో మీకు ఇచ్చిన ఇళ్లు రద్దు అయిపోతాయి.. కాబట్టి.. మాకు ఎంతో కొంత ధరకు అమ్మేస్తే.. ఆ తర్వాత మేము వాటిని కాపాడుకోగలమని కొందరు మభ్యపెడుతున్నారు’. లబ్ధిదారుల వద్దకు వెళ్లి మీకు మంజూరైనప్పటికీ ఫైనల్ లిస్టులో పేరు తొలగించకుండా ఉండాలంటే.. డబ్బులు చెల్లించాలంటూ ఇంకొందరు రూ. 5 నుంచి రూ.10 వేల వరకు వసూలు చేస్తున్నారు. పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక.. లబ్ధిదారుల ఎంపికను ప్రభుత్వం పారదర్శకంగా నిర్వహిస్తోంది. వలంటీర్లు స్వయంగా ప్రతి ఇంటికీ వెళ్లి వారి వివరాలు నమోదు చేస్తున్నారు. పూర్తిస్థాయి డేటా తీసుకొని ప్రభుత్వం వద్ద ఉన్న రికార్డుల ద్వారా డేటాను పరిశీలించి అసలైన లబ్ధిదారులుగా గుర్తించేందుకు కసరత్తులు చేస్తున్నారు. రేషన్కార్డు, ఆధార్కార్డు, ప్రస్తుతం నివసిస్తున్న ఇల్లు ఎవరిది.. ఇలా మొత్తం సమాచారం అధారంగా అప్లికేషన్లు స్వీకరిస్తున్నారు. మొత్తంగా ఈ నెలాఖరునాటికి దరఖాస్తుల స్వీకరణ పూర్తి చేసేందుకు జీవీఎంసీ యూసీడీ ప్రాజెక్టు డైరెక్టర్ వై శ్రీనివాసరావు నేతృత్వంలో సిబ్బంది తీవ్రంగా కృషిచేస్తున్నారు. వదంతులు నమ్మొద్దు.. నవరత్నాల్లో భాగంగా అందరికీ ఇళ్లు కేటాయింపునకు ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. ముఖ్యమంత్రి ఆలో చనలకు అనుగుణంగా జీవీఎంసీ పరిధి లో హౌస్ సర్వే నిర్వహించి దరఖాస్తులు స్వీకరిస్తున్నాం. దరఖాస్తుల్ని నవరత్నాలు వెబ్సైట్లో అప్లోడ్ చేసే ప్రక్రియ వేగవంతమవుతోంది. గతంలో ఇళ్లు కేటాయింపులు పూర్తయిన వారు చాలా మంది వదంతులు నమ్ముతున్నారని తెలిసింది. ఎలాట్మెంట్ చేసినవారి దగ్గరికి కొంద రు వెళ్లి వాళ్ల ఎలాట్మెంట్ క్యాన్సిల్ అయ్యిందనీ.. ఇప్పుడే దాన్ని తమ పేరుపై రాయకపోతే కట్టిన డబ్బులు వృథా అని మాయమాటలు చెబుతున్నారని ఫిర్యాదులు వస్తున్నా యి. జీవీఎంసీ కమిషనర్ పేరుతో అధికారికంగా ప్రకటనలు వచ్చేంత వరకూ ఎవ్వరూ ఏ విషయాన్ని నమ్మవద్దు. – జి.సృజన, జీవీఎంసీ కమిషనర్ -
పోరుబాట పడదాం
‘రైతులు, మహిళలు, ఇతర వర్గాలకు ఇచ్చిన ఒక్క హామీని కూడా ప్రభుత్వం నెరవేర్చడం లేదు. కల్లబొల్లి కబుర్లతో ప్రచారం చేసుకుంటోంది తప్పా ఒక్కరికీ కూడా సాయం అందడం లేదు. దీనిపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉంది. ప్రజల్లోకి వెళ్లండి. ప్రభుత్వ వైఫల్యాలపై వారిని చైతన్యవంతులను చేయండి’. ‘గ్రేటర్ విశాఖ ఎన్నికల్లో పార్టీ కచ్చితంగా విజయం సాధించి మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలి. అందుకు నేతలందరూ సమన్వయంతో పనిచేయండి. పార్టీ కూడా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళి కను రూపొందిస్తుంది’ అని వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్.జగన్మోహన్రెడ్డి జిల్లా పార్టీ నేతలు, శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: హైదరాబాద్ లోటస్పాండ్లోని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయంలో అధినేత వైఎస్.జగన్మోహన్రెడ్డి జిల్లా పార్టీ నేతలతో శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలు, ఎన్నికల హామీలు అమలు చేయకుండా ప్రభుత్వ దొంగాట, ఇంతవరకు తుపాను బాధితులకు అందని ప్రభుత్వ సహాయం తదితర అంశాలపై సవివరంగా చర్చించారు. జిల్లాలో పార్టీ స్థితిగతులు, పార్టీ బలోపేతం దిశగా కార్యాచరణ తదితర అంశాలను సమీక్షించారు. ఈ సమావేశానికి జిల్లా పార్టీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్, ఎమ్మెల్యేలు గిడ్డి ఈశ్వరి, కిడారి సర్వేశ్వరరావు, బూడి ముత్యాల నాయుడులతోపాటు జిల్లాలో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తలు, రాష్ట్ర పార్టీ కార్యదర్శులు, ఇతర ముఖ్యనేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్దాం అధికారంలోకి వచ్చేందుకు టీడీపీ అబద్ధపు హామీలు ఇచ్చి ప్రజలను మోసగించిందని వైఎస్.జగన్మోహన్రెడ్డి విమర్శించారు. ఇప్పుడు కూడా హామీలు నెరవేర్చకుండా మీడియాలో పబ్లిసిటీ చేసుకుంటూ కాలం గడుపుతోందన్నారు. రైతు రుణమాఫీ హామీ అపహాస్యం పాలు చేసిందని దుయ్యబట్టారు. డ్వాక్రా మహిళల రుణాల మాఫీ ఊసే ఎత్తడం లేదని విమర్శించారు. ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామన్న చంద్రబాబు ఆ మాటే మరిచిపోయారన్నారు. ఇవన్నీ ప్రజలు గ్రహిస్తున్నారని ఆయన అన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి విసృ్తతంగా తీసుకువెళ్లాలని పార్టీ నేతలను ఆదేశించారు. 5న విశాఖ ధర్నాకు హాజరవుతా.. ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్ర ప్రజలకు వైఎస్సార్ సీపీ అండగా ఉండాలని పార్టీ శ్రేణులను ఆయన ఆదేశించారు. ఎన్నికల హామీలు నెరవేర్చకుండా ప్రజలను మోసగిస్తున్న ప్రభుత్వాన్ని నిలదీయాలన్నారు. అందుకోసం పార్టీ రూపొందించిన నిరసన కార్యక్రమాల్లో పార్టీ నేతలు, శ్రేణులు పెద్దఎత్తున పాల్గొనాలన్నారు. డిసెంబర్ 5న రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్ల వద్ద చేపట్టనున్న ధర్నాలను విజయవంతం చేయాలన్నారు. విశాఖపట్నంలో నిర్వహించే ధర్నాకు తాను హాజరవుతానని ఆయన చెప్పారు. గ్రేటర్ ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేయాలి త్వరలో జరగనున్న గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీ నేతలు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని ఆయన ఆదేశించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి వారి మద్దతు కూడగట్టాలన్నారు. పార్టీ విజయం సాధించేందుకు పుష్కలంగా ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. జీవీఎంసీ మేయర్ పీఠాన్ని కచ్చితంగా పార్టీ గెలుచుకోవాలని స్పష్టం చేశారు. అందుకోసం పార్టీ అధిష్టానం ప్రత్యేక ప్రణాళికను రూపొందిస్తుందని కూడా ఆయన చెప్పారు. జిల్లాలో నేతలకు జీవీఎంసీలో పార్టీ బాధ్యతలు అప్పగిస్తానని ఆయన తెలిపారు. ఎన్నికల కోసం ఇప్పటి నుంచే డివిజన్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలని, నిత్యం ప్రజల్లో ఉండాలని నేతలకు కర్తవ్యబోధ చేశారు. పార్టీ నేతలతో ప్రత్యేక సమావేశాలు జిల్లా పార్టీ నేతలతో సమావేశం అనంతరం వారితో ఆయన విడివిడిగా భేటీ అయ్యారు. పార్టీ నిర్మాణం, ఉద్యమ కార్యాచరణ తదితర అంశాలపై వారు తమ అభిప్రాయాలను వెల్లడించారు. వారి సూచనలకు ఆయన సానుకూలంగా స్పందించారు. అందరి అభిప్రాయాలను క్రోడీకరించి పార్టీ భవిష్యత్ కార్యాచరణను అమలు చేస్తామన్నారు. ఈ సమావేశంలో పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యులు సజ్జల రామకృష్ణారెడ్డి, మైసూరారెడ్డి, బొబ్బిలి ఎమ్మెల్యే సుజయ్కృష్ణ రంగారావు, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, మాజీ ఎమ్మెల్యేలు బలివాడ సత్యారావు, గొల్ల బాబూరావు, తైనాల విజయకుమార్, మళ్ల విజయప్రసాద్, కరణం ధర్మశ్రీ, తిప్పల గురుమూర్తి రెడ్డి, చెంగల వెంకట్రావులు పాల్గొన్నారు. వారితోపాటు నియోజకవర్గ సమన్వయకర్తలు వంశీకృష్ణ, కోలా గురువులు, తిప్పల నాగిరెడ్డి, పెట్ల ఉమాశంకర్ గణేష్, ప్రగడ నాగేశ్వరరావులతోపాటు పార్టీ నేతలు బొడ్డేటి ప్రసాద్, కంపా హనోక్, జాన్వెస్లీ, సత్తి రామకృష్ణారెడ్డి, వీసం రామకృష్ణ, కొయ్య ప్రసాదరెడ్డి, పోతల ప్రసాద్, గుడ్ల పోలిరెడ్డి, దామా సుబ్బారావు, భూపతిరాజు శ్రీనివాసరాజు, అంకంరెడ్డి, జమీల్, పక్కి దివాకర్, అదీప్రాజు, పీలా ఉమారాణి, ఉషాకిరణ్, పీలా వెంకటలక్ష్మి, నీలం శారద, డాక్టర్ రాజశేఖర్, రవిరెడ్డి, ఉరుకూటి అప్పారావు, జీలకర్ర నాగేంద్ర తదితరులు హాజరయ్యారు. వ్యక్తిగత పనులు ఉన్నందున తాము ఈ సమావేశానికి హాజరుకాలేమని ఎమ్మెల్సీ సూర్యనారాయణ రాజు, భీమిలి సమన్వయకర్త కర్రి సీతారాం పార్టీకి ముందుగానే సమాచారమిచ్చారు.