breaking news
vijayaram
-
రోహిణీలోనే దేశీ వరి
దేశీ వరి విత్తనాలను ఇంటి ఆహారపు అవసరాల కోసం కనీసం ఒక ఎకరంలో నైనా వేసుకొంటే మంచిదని, దేశీ వరి విత్తనాలను ఆరు తడి పద్ధతిలో మామూలు పద్ధతితో పోల్చితే 10 శాతం నీటితోనే సాగు చేయవచ్చని ప్రకృతి వ్యవసాయదారుడు, సేవ్ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు విజయరామ్ తెలిపారు. ఈ పద్ధతిలో 90 శాతం నీటిని ఆదా చేయవచ్చు. కలుపు నియంత్రణ కోసం మొక్కకు మొక్కకు దూరం, అలానే వరుసకు, వరుసకు మధ్య దూరం 45 సెం.మీ. ఉండేటట్లు నాటుకోవాలి. ఆరు తడి పద్ధతిలో వరిలో అంతర పంటలను కూడా వేయవచ్చు. అలా వేద్దాం అనుకున్న వారు మొక్కకు మొక్కకు దూరం, అలానే వరుసకు, వరుసకు మధ్య దూరం 60 సెం.మీ. ఉండేటట్లు నాటుకోవాలన్నారు. 180 నుంచి 210 రోజుల పంట కాలం ఉండే వరి రకాలు (మా పిళ్లై సాంబ, మొలగొలుకులు, మడుమురంగి లాంటివి) రోహిణి కార్తె (మే 25 నుంచి ప్రారంభం)లో నాట్లు వేసుకుంటేనే అనుకూలం. అలా అయితేనే 2వ పంటకు వీలు దొరుతుందన్నారు. జనవరి ఆఖరు లోపు నేల స్వభావం, నీటి వసతిని బట్టి పుచ్చకాయ, దోస, కూరగాయలు, నువ్వులు లేక పశుగ్రాసపు పంటలు వేసుకోవచ్చు. కొత్తగా ప్రకృతి వ్యవసాయం చేసే రైతులు మొదట ఏడాది ఒక ఎకరంలో మాత్రమే ఈ పద్ధతిని అనుసరించాలన్నారు. దేశీ వరి విత్తనాలతో మొదటి సంవత్సరం దిగుబడి 10 బస్తాల నుండి 20 బస్తాల వరకు రావచ్చని, తదుపరి కొంత పెరుగుతుందన్నారు. కేవలం వరిని మాత్రమే కాకుండా పప్పు ధాన్యాలు, కూరగాయలు, నూనె గింజలు పండించే ప్రయత్నమూ చేయాలి. వర్షము పడినప్పుడు పొలములో కొన్ని రోజుల వరకూ నీరి నిలిచిపోయే పరిస్థితి ఉన్న వారు (మాగాణి భూముల వారు, కోస్తా ప్రాంతాల వారు) కనీసం 200 గజాల స్థలంలోనైనా 2 అడుగుల ఎత్తులో మట్టిని వేసి ఇంటి అవసరాల కోసం కూరగాయలు పెంచుకోవాలన్నారు. దేశీ వరి విత్తనాలను పండించే రైతులు ఇప్పుడు ప్రతి జిల్లాలోనూ ఉన్నారని, వారి దగ్గరి నుంచి విత్తనాలు తీసుకోవచ్చని విజయరామ్ వివరించారు. వివరాలకు హైదరాబాద్లోని సుభాష్ పాలేకర్ ప్రకృతి వ్యవసాయం కేంద్ర కార్యాలయానికి (04027654337 , 04027635867) ఫోన్ చేయవచ్చు. పొద్దున 10 గం. నుంచి సా. 6 గం. వరకు. గురువారం సెలవు. -
పాలేకర్ సాగు విధానం మేలు
గో ఆధారిత వ్యవసాయ నిపుణుడు విజయరామ్ సింగలూరు(గుడ్లవల్లేరు) : పాలేకర్ సాగు విధానం మేలని గో ఆధారిత వ్యవసాయ నిపుణుడు విజయరామ్ అన్నారు. మహాత్మాగాంధీ జయంతి వేడుకల్లో భాగంగా సింగలూరు బండారు బ్రహ్మారావు, సీతామహలక్ష్మమ్మ కమ్యూనిటీ హాల్లో శనివారం ప్రజలకు పర్యావరణానికి రక్ష – కుటీర పరిశ్రమల పేరిట నిర్వహించారు. భారత వికాస పరిషత్, భాగ్య విధాత చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ బండారు శ్యామ్కుమార్ సంయుక్తంగా చేపట్టిన సదస్సుకు విజయరామ్ హాజరయ్యారు. పాలేకర్ సూచించిన పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయంలో వానపాములే సాగు చేస్తాయని అన్నారు. తన వద్ద 300 రకాల వరి విత్తనాలు దేశీయ రకాలున్నాయని విజయరామ్ చెప్పారు. తాను పెద ముత్తేవి, తలకటూరులోని 15ఎకరాల్లో ఐదేళ్లగా వరి పండిస్తున్నానని తెలిపారు. తొలుత గాంధీజీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా వారి చిత్రపటాలకు ఎంపీడీవో ఆర్.కేశవరెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో డాక్టర్ బండారు శ్యామ్కుమార్, జాప్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ఎన్జే ప్రసాద్ పాల్గొన్నారు.