అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్
సూర్యాపేట మున్సిపాలిటీ గరుడ బస్సుల్లో తిరుగుతూ ప్రయాణికుల సూట్కేసులు, బ్యాగుల్లో ఉన్న విలువైన వస్తువులను అపహరిస్తున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను బుధవారం సూర్యాపేట పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టణ ఇన్స్పెక్టర్ వై.మొగలయ్య పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ముఠా వివరాలు వెల్లడించారు. తెల్లవారుజామున 5 గంటలకు విశ్వసనీయ సమాచారం మేరకు పట్టణంలోని హైటెక్ బస్టాండ్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించామన్నారు. వారి వద్ద ఉన్న బ్యాగులను తనిఖీ చేయగా బ్యాగుల్లో 20 తులాల బంగారు ఆభరణాలు, వేయింగ్ మిషన్ లభించినట్లు తెలిపారు. వీరు ఉత్తరప్రదేశ్కు చెందిన ఎండీ ఇర్ఫాన్ అలియాస్ బాయ్, ఎండీ హనీస్లు హైదరాబాద్ కేంద్రంగా ముఠాగా ఏర్పడ్డారన్నారు.
వీరు హైదరాబాద్ నుంచి విజయవాడ, గుంటూరు వెళ్లే గరుడ బస్సుల్లో చోరీలకు పాల్పడుతున్నారని చెప్పారు. తిరిగి వారి స్వస్థలాలకు వెళ్లే సమయంలో గత వారం క్రితం ఐదుగురిని పట్టుకోగా వారిలో ముగ్గురు ఎండీ.ఇర్ఫాన్, మక్సూద్ అహ్మద్, అహ్మద్ హసన్లు పట్టుబడగా వీరిద్దరు పరారీ అయ్యారు. కాగా ఈ ఇద్దరు బుధవారం జైలులో ఉన్న ముగ్గురిని కలిసి వెళ్లేందుకు వచ్చి పట్టుబడినట్లు వివరించారు. వీరిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చినట్టు తెలిపారు. సమావేశంలో పట్టణ ఎస్ఐలు ఎంఏ జబ్బార్, ఎ.శ్రీనివాస్, ఐడీ పార్టీ సిబ్బంది గొర్ల కృష్ణ, గోదేశి కరుణాకర్, చనగాని వెంకన్నగౌడ్, కరణం అరవింద్, సంగి నరేందర్, ఎల్లారెడ్డి, దైద రాజు, జి.కిషోర్ తదితరులు పాల్గొన్నారు.