breaking news
Vertical Garden
-
‘ఇలాంటి చర్యలకు పాల్పడటం సిగ్గు చేటు’
-
చ. మీ. చోటులోనే నిలువు తోట!
బెంగళూరులోని భారతీయ ఉద్యాన తోటల పరిశోధనా సంస్థ(ఐ.ఐ.హెచ్.ఆర్.) శాస్త్రవేత్తలు ఓ చదరపు మీటరు విస్తీర్ణంలో ఒదిగిపోయే నిలువు తోట చట్రం(వర్టికల్ గార్డెన్ స్ట్రక్చర్)ను రూపొందించారు. దీని పై భాగంలో నీటి కంటెయినర్ను అమర్చి, దాని ద్వారా మొక్కలకు సునాయాసంగా నీటిని అందించే ఏర్పాటు చేశారు. దీనికి అడుగున చక్రాలు ఏర్పాటు చేయడంతో సులభంగా అటూ ఇటూ జరుపుకోవడానికి వీలుంది. కుటుం ం అవసరాల కోసం కోరుకున్న కూరగాయలు, ఆకుకూరలు, ఔషధ, పూల మొక్కలను ఇంటిపట్టున (పెరట్లో ఎండతగిలే చోట, బాల్కనీ లేదా మేడ పైన) తక్కువ స్థలంలో ఎక్కువ మొక్కలు విత్తుకోవడానికి ఈ నిలువు తోట ఉపయోగపడుతుంది. ఇనుముతో తయారైన ఈ నిలువు తోట స్ట్రక్చర్లో మూడు భాగాలు.. బేస్ ఫ్రేమ్, మెయిన్ సెంట్రల్ సపోర్టు, కుండీలు/ గ్రోబాగ్స్కు సపోర్టుగా ఉండే ఊచలు ఉన్నాయి. కుండీలు/ గ్రోబాగ్స్లో మట్టి–సేంద్రియ ఎరువు మిశ్రమాన్ని లేదా మట్టి లేకుండా కొబ్బరి పొట్టు–ఎరువు మిశ్రమాన్ని ఉపయోగించి ఇంటిపంటలు పండించుకోవచ్చు. నిలువు తోట ప్రయోజనాలు 1. కేవలం ఒకే ఒక్క చదరపు మీటరు స్థలంలో దీన్ని పెట్టుకోవచ్చు. 2. రసాయనాలు వాడుకుండా తనకు తాను పండించుకున్న ఆకుకూరలు, కూరగాయలను తాజాగా తినవచ్చు. 3. వేర్వేరు సైజుల కుండీలు / గ్రోబాగ్స్ను ఏర్పాటు చేసుకోవచ్చు. 4. మనిషికి నిలబడితే చేతికి అందేంత ఎత్తులో కుండీలు / గ్రోబాగ్స్ ఉంటాయి. కూరగాయలు, ఆకుకూరలు కోసుకోవడానికి, చీడపీడలను గమనించుకోవడానికి సులువవుతుంది. దీనికి చక్రాలున్నాయి కాబట్టి ఎండను బట్టి, అవసరాన్ని బట్టి అటూ ఇటూ కదిలించవచ్చు. 2 అడుగుల వరకు ఎత్తు ఎదిగేందుకు అవకాశం ఉన్న టమాటో వంటి కూరగాయ మొక్కలు (కుండీ సైజు 16 అంగుళాల చుట్టుకొలత, 12 అంగుళాల ఎత్తు), మిరప, వంగ, చెట్టు చిక్కుడు, బఠాణీ తదితర మొక్కలు (కుండీ సైజు 12 అంగుళాల చుట్టుకొలత, 10 అంగుళాల ఎత్తు) పెరగడానికి కొంచెం పెద్దకుండీలతోపాటు తగినంత ఎక్కువ మట్టి – ఎరువు మిశ్రమం అవసరం. అందువల్ల వీటిని నిలువు తోట స్ట్రక్చర్లో కింది భాగంలో పెట్టుకోవాలి. తోటకూర, కొత్తిమీర, పాలకూర వంటి ఆకుకూరలు (కుండీ సైజు 26 అం. పొడవు “ 8 అం. వెడల్పు“ 6 అం. ఎత్తు), బ్రహ్మి, పుదీన, అమృతవల్లి, మధునాశని, పిప్పళ్లు, అశ్వగంధ, శతావరి వంటి ఔషధ మొక్కల(కుండీ సైజు 14 అం. పొడవు “ 8 అం. వెడల్పు “ 6 అం. ఎత్తు)ను నిలువు తోట పై భాగంలో పెట్టుకోవాలి. దీని పైన 25 లీటర్ల ప్లాస్టిక్ కంటెయినర్ను ఏర్పాటు చేసి.. దాని నుంచి డ్రిప్ లేటరల్స్ను, మైక్రో ట్యూబులను, డ్రిప్పర్లను బిగించుకుంటే ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు కంటెయినర్ కుళాయిని తిప్పటం ద్వారా మొక్కలకు నీరు అందేలా ఈ నిలువు తోటను డిజైన్ చేశారు. మొక్కను బట్టి ఒక పంట కాలంలో ఒక్కో మొక్క నుంచి 200 గ్రాముల నుంచి 5 కిలోల వరకు దిగుబడి పొందవచ్చని, ఈ వర్టికల్ గార్డెన్ స్ట్రక్చర్ తయారీకి రూ. 22 వేలు ఖర్చవుతుందని ఐ.ఐ.హెచ్.ఆర్. శాస్త్రవేత్తల అంచనా. స్థానిక మెకానిక్లకు చూపించి ఇదే మాదిరిగా తయారు చేయించుకోవచ్చు. లేదా బెంగళూరులోని ఐ.ఐ.హెచ్.ఆర్.ను 080 2308 6100 నంబరులో సంప్రదించి కొనుగోలు చేయవచ్చు. -
‘పీవీ ఎక్స్ప్రెస్ వే’కు హరిత శోభ
- పిల్లర్ల మీద వర్టికల్ గార్డెన్ ఏర్పాటుకు సన్నాహాలు - హెచ్ఎండీఏ, బెంగళూరు ‘సే ట్రీస్’ బృందం అధ్యయనం సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ను జీవవైవిధ్య నగరంగా మలిచేందుకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ(హెచ్ఎండీఏ) చర్యలు తీసుకుంటోంది. ఒకవైపు కాలుష్యాన్ని నియంత్రిస్తూనే, మరోవైపు పచ్చదనంతో నగరవాసులను ఆహ్లాదపరిచేందుకు కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా పీవీ నర్సింహారావు ఎలివేటెడ్ ఎక్స్ప్రెస్ వేలో గ్రీన్వాల్స్ ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. బెంగళూరుకు చెందిన ‘సే ట్రీస్’సంస్థ సభ్యులతో కలసి నగరంలోని 11.6 కిలోమీటర్ల మేర ఉన్న పీవీ ఎక్స్ప్రెస్ వేలో హెచ్ఎండీఏ అర్బన్ ఫారెస్ట్రీ అధికారులు బుధవారం అధ్యయనం చేశారు. దేశంలోనే తొలిసారిగా బెంగళూరులోని హసూర్ రోడ్డు ఎలక్ట్రానిక్స్ సిటీ ఫ్లైఓవర్లోని పిల్లర్లపై పది రకాల మొక్కలతో 3,500 శాంప్లింగ్ మొక్కలను వర్టికల్ గార్డెన్ ద్వారా పెంచుతున్న విధానాన్ని సే ట్రీస్ సభ్యులు వివరించారు. ‘‘పిల్లర్ల వర్టికల్ గార్డెన్లో ఆటోమేటెడ్ డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ ఉంటుంది. రోజుకు 100 మిల్లీలీటర్ల డోస్తో నీరు అందుతుంది. వర్టికల్ గార్డెన్ ఒక్కోవైపు యూనిక్ డిజైన్ ఉండేలా చూస్తాం. ఈ గార్డెన్లతో అన్ని పిల్ల ర్లను కవర్ చేస్తున్నాం. దీనివల్ల నగరంలో ఉన్న వేడి తగ్గుముఖం పడుతుంది. పొగమంచుతోపాటు గాలి కాలుష్యాన్ని కూడా తగ్గిస్తుంది. పక్షులు,కీటకాలు ఆరోగ్యకరమైన నివాసాలను ఏర్పరుచుకునే అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ విలువ కూడా పెరిగే అవకాశముంది. ఈ గ్రీన్వాల్స్ వల్ల బయోడైవర్సిటీని నగరంలో పటిష్టం చేసినవారమవుతాం’’ అని సే ట్రీస్ సభ్యులు తెలిపారు.