breaking news
venkatapathy raju
-
తెలుగు నేలపై విరిసిన పద్మాలు
సంగీతం.. దేవుడిచ్చిన వరం తన సంగీతంతో శ్రోతలను ఉర్రూతలూగిస్తూ ఇటీవల ‘80వ గోల్డెన్ గ్లోబ్ అవార్డు’, ‘28వ క్రిటిక్స్ చాయిస్ అవార్డు’అందుకున్న ఎంఎం కీరవాణి తాజాగా పద్మశ్రీ అవార్డుకు ఎంపికయ్యారు. కీరవాణి నాలుగో ఏటనే తండ్రి వేలు పట్టుకుని సంగీతం వైపు తొలి అడుగులేశారు. ఆరేళ్లప్పుడు రాయచూరులోని దత్తప్ప అనే విద్వాంసుడి వద్ద సంగీతం అభ్యసించారు. వయోలిన్పై పట్టు సాధించారు. ఇంజనీర్ కావాలని శ్రమించినా సీటు రాలేదు. ఆ తర్వాత కీరవాణి‘జాలీ ఫ్రెండ్స్’అనే ఆర్కెస్ట్రా ట్రూపులో చేరి, పాటలు పాడారు. చెన్నైకి వెళ్లి సినిమా అవకాశాల కోసం ప్రయత్నించారు. ఆ తర్వాత సంగీత దర్శకుడు చక్రవర్తి వద్ద అసిస్టెంట్గా చేరారు. తర్వాత వేటూరి వద్ద అసిస్టెంట్గా చేరారు. వేటూరి సిఫార్సుతో కీరవాణికి ‘మనసు–మమత’సినిమాకి సంగీత దర్శకునిగా తొలి అవకాశం వచ్చింది. ఆయన ఇప్పటివరకు తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో 250కి పైగా సినిమాలకు సంగీతం అందించారు. ఆర్చిడ్ మొక్కలపై పరిశోధనలకు నాగేశ్వరరావుకు పద్మశ్రీ ఏలూరుకు చెందిన డాక్టర్ అబ్బారెడ్డి నాగేశ్వరరావు పద్మశ్రీ అవార్డుకు ఎంపికయ్యారు. ఆయన ఆర్చిడ్ రకానికి చెందిన అరుదైన మొక్కలపై పరిశోధనలు చేస్తున్నారు. సెంటర్ ఫర్ ఆర్చిడ్ జినీ కన్జర్వేషన్ ఆఫ్ ఈస్ట్రన్ హిమాలయన్ రీజియన్ డైరెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. శాస్త్రవేత్తగా చేసిన పరిశోధనలకు గానూ లిమ్కాబుక్ ఆఫ్ రికార్ట్స్లో ఇప్పటికే తన పేరును నమోదు చేసుకున్నారు. 35 రకాల నూతన ఆర్చిడ్ జాతి మొక్కలను కనుగొన్నారు. సేవామూర్తి చంద్రశేఖర్ కాకినాడ రూరల్: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మశ్రీ అవార్డు కాకినాడకు చెందిన సంకురాత్రి ఫౌండేషన్ వ్యవస్థాపకుడు డాక్టర్ సంకురాత్రి చంద్రశేఖర్కు లభించింది. ఆయన 1943 నవంబర్ 20న సింగరాయకొండలో అప్పల నరసయ్య, రామయ్యమ్మ దంపతులకు జన్మించారు. కెనడాలో ఉన్నత విద్యను అభ్యసించి అక్కడే స్థిరపడ్డారు. 1985లో విమాన ప్రమాదంలో చంద్రశేఖర్ భార్య మంజరి, కుమారుడు కిరణ్, కుమార్తె శారద మృతి చెందారు. దీంతో ఇండియాకు వచ్చేసిన ఆయన 1989లో సంకురాత్రి ఫౌండేషన్ను స్థాపించారు. కాకినాడ రూరల్ మండలం పెనుమర్తి వద్ద కంటి ఆస్పత్రి, విద్యాలయం స్థాపించి సేవలు అందిస్తున్నారు. ఏటికొప్పాక కళాకారుడికి పద్మశ్రీ సాక్షి, అనకాపల్లి: అనకాపల్లి జిల్లా ఏటికొప్పాక గ్రామానికి చెందిన సీవీ రాజు(చింతలపాటి వెంకటపతి రాజు)కు పద్మశ్రీ పురస్కారం లభించింది. ఆయన రూపొందించిన ఏటికొప్పాక బొమ్మలు బాగా ప్రాచుర్యం పొందాయి. మొదట సీవీ రాజుది వ్యవసాయ వృత్తే అయినా... 1988లో బొమ్మల తయారీని చేపట్టారు. పిల్లల ఆట వస్తువులు, కుంకుమ భరణిలు డిజైన్ చేసి ఎగుమతి చేశారు. 2020లో మన్ కీ బాత్లో ప్రధానమంత్రి మోదీ.. రాజుతో సంభాషించారు. మళ్లీ గత ఆదివారం కూడా రాజు తయారుచేసిన బొమ్మలను ప్రధాని ప్రశంసించారు. బొమ్మల తయారీలో నైపుణ్యానికి రాష్ట్రపతి అవార్డు రాజుకు లభించింది. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డుల్లోనూ చోటు దక్కించుకున్నారు. హరికథా సామ్రాజ్య సార్వభౌమ.. తెనాలి: తెలుగునాట ప్రసిద్ధి చెందిన హరికథకుడు.. కోట సచ్చిదానందశాస్త్రి భాగవతార్. రామాయణ, భారత, భాగవతాలను శ్రావ్యంగా, జనరంజకంగా గానం చేస్తూ విశేష ప్రాచుర్యం కల్పించారు. తన సేవలకు గుర్తుగా తాజాగా పద్మశ్రీ పురస్కారానికి ఎంపికయ్యారు. సచ్చిదానంద శాస్త్రి స్వస్థలం.. ప్రకాశం జిల్లా అద్దంకి. 14 ఏళ్ల వయసులో తండ్రి మరణంతో పౌరోహిత్యం చేస్తూనే.. స్వయంగా హరికథాగానం సాధన చేశారు. చతురోక్తులు, సరస సంభాషణలతో వీక్షకుల మనసు తనపైన లగ్నమయ్యేవరకు కాలక్షేపం చేసి, కథాంశంతో హరికథను ఆరంభించేవారు. ఆకాశవాణిలో టాప్ ఏ గ్రేడ్ ఆర్టిస్టయ్యారు. విజయగుప్తాకు పద్మశ్రీ సాక్షి ప్రతినిధి, బాపట్ల: వ్యవసాయ శాస్త్రవేత్తగా ఉన్న విజయగుప్తా అందించిన సేవలకు పద్మశ్రీ దక్కింది. విజయగుప్తా మంచినీటి చేపల పెంపకం కోసం తక్కువ ఖర్చుతో కూడిన పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేశారు. నీలి విప్లవం ద్వారా చేపల ఉత్పత్తిని పెంచిన ఘనతను సొంతం చేసుకున్నారు. విజయగుప్తా చేసిన విశిష్ట పరిశోధనలకు ఇప్పటికే దేశ,విదేశాల్లో పురస్కారాలను అందుకున్నారు. బాపట్లలో జన్మించిన ఆయన గుంటూరు ఏసీ కళాశాలలో బీఎస్సీ, బెనారస్ హిందూ యూనివర్సిటీలో ఎమ్మెస్సీ చదివారు. పశ్చిమ బెంగాల్ మత్స్యశాఖలో వివిధ హోదాల్లో పని చేశారు. 22 దేశాల్లో పరిశోధనలు నిర్వహించారు. ఇద్దరు శాస్త్రవేత్తలకు పద్మశ్రీ శాస్త్ర విజ్ఞాన రంగంలో కేఎన్ గణేశ్, పీసీ సూద్కు పురస్కారాలు సాక్షి, అమరావతి: శాస్త్ర విజ్ఞాన రంగంలో చేసిన విశిష్ట కృషికి ప్రముఖ శాస్త్రవేత్త కేఎన్ గణేశ్కు పద్మశ్రీ పురస్కారం దక్కింది. ప్రముఖ బయో ఆర్గానిక్స్ శాస్త్రవేత్త అయిన కేఎన్ గణేశ్ తిరుపతిలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్(ఐఐఎస్ఈఆర్) వ్యవస్థాపక డైరెక్టర్గా ఉన్నారు. కేంబ్రిడ్జ్ వర్సిటీ నుంచి పీహెచ్డీ చేశాక భారత్కు తిరిగి వచ్చి 1980లో హైదరాబాద్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాలిక్యులర్ బయాలజీలో చేరారు. భారత్లో మొదటి డీఎన్ఏ సింథసిస్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. డీఎన్ఏ గుర్తింపులో రసాయన సూత్రాలు, డీఎన్ఏ నిర్మాణానికి సంబంధించిన అంశాలపై విశేష పరిశోధనలు నిర్వహించారు. అణు భౌతిక శాస్త్రంలో పీసీ సూద్కు.. అణు భౌతిక శాస్త్రంలో చేసిన విశేష కృషికిగాను పీసీ సూద్కు పద్మశ్రీ లభించింది. పుట్టపర్తిలోని శ్రీసత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్లో భౌతిక శాస్త్రవేత్తగా ఆయన పనిచేస్తున్నారు. న్యూక్లియర్ ఫిజిక్స్, థియోరాటికల్ ఫిజిక్స్, ఎలిమెంటరీ పార్టికల్ ఫిజిక్స్ల్లో పరిశోధనలు చేశారు. న్యూక్లియర్ స్ట్రక్చర్ అంశంలో 300కుపైగా పరిశోధన పత్రాలు సమర్పించారు. వాటిలో 158 పత్రాలు అంతర్జాతీయ జర్నల్స్లో ప్రచురితమయ్యాయి. మృదు మధురమైన కంఠస్వరం.. వాణీజయరామ్ సొంతం ‘తెలి మంచు కరిగింది తలుపు తీయనా ప్రభూ’.. ఎంత కమ్మని గొంతు. ఉషోదయం వేళ మనసుని ఉల్లాసంగా తట్టిలేపే మృదు మధురమైన కంఠస్వరం వాణీ జయరామ్ సొంతం. ‘స్వాతి కిరణం’లోని ఈ పాటను తమిళ పొన్ను (అమ్మాయి) వాణీ జయరామ్ స్పష్టంగా తెలుగులో పాడిన తీరు అద్భుతం. ‘శంకరాభరణం’సినిమాలో ‘పలుకే బంగారమాయెనా..’అని పాడితే ‘మీ పాటే మధురమాయెనే..’అని శ్రోతలు కితాబునిచ్చారు. ‘అందెల రవమిది పదములదా..’అంటూ ‘స్వర్ణకమలం’కి పాడితే శ్రోతల మనసులు నాట్యం చేశాయి. ఐదు దశాబ్దాలకు పైబడిన కెరీర్లో వాణీ జయరామ్ పదివేల పాటలు పాడారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ, గుజరాతీ, మరాఠీ, బెంగాలీ.. ఇలా దాదాపు 20 భాషల్లో పాడారు. ఎనిమిదవ ఏటనే ఆమె ఆల్ ఇండియా రేడియో కార్యక్రమంలో పాల్గొన్నారు. కర్ణాటక సంగీతం, హిందుస్తానీ అభ్యసించిన ఆమె చదువుని నిర్లక్ష్యం చేయలేదు. డిగ్రీ పూర్తయ్యాక చెన్నైలో ఆమెకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం వచ్చింది. ఆ తర్వాత హైదరాబాద్కి బదిలీ అయ్యారు. 1969లో జయరామ్ని పెళ్లి చేసుకున్నాక కొన్నేళ్ల పాటు ముంబైలో ఉన్నారు. ఏ భాషలో పాడితే అదే ఆమె మాతృభాష అన్నట్లుగా పాడిన వాణీ జయరామ్కి ఎన్నో అవార్డులూ రివార్డులూ దక్కాయి. తాజాగా ఆమెను ‘పద్మ భూషణ్’వరించింది. -
మార్పుకోసం
నటుడిగా సుదీర్ఘ ప్రయాణం చేసిన ప్రసన్నకుమార్ లీడ్ రోల్లో నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘మరో అడుగు మార్పుకోసం’. త్వరలో రిలీజ్ కానున్న ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్ని ప్రముఖ క్రికెటర్ వెంకటపతి రాజు విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘ప్రసన్నకుమార్ నాకు చిన్నప్పటి నుంచి మిత్రుడు. వైజాగ్లో తరచూ అతని జిమ్కి వెళ్లేవాళ్లం. ఈ సినిమా కథ విని, ఆశ్చర్యపోయా. ఇలాంటి కాన్సెప్ట్తో బోల్డ్ అటెంప్ట్ చేసినందుకు అభినందిస్తున్నా. ఈ సినిమా మంచి విజయం సాధించాలి’’ అన్నారు. ‘‘సినిమా మీద ప్యాషన్తో ఈ రంగంలో కొనసాగుతున్నాను. అదే బాధ్యతతో ఈ చిత్రం తీశా. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఈ సినిమా పూర్తి చేశా’’ అన్నారు ప్రసన్నకుమార్. ‘‘సినిమాను నమ్మితే తప్పకుండా గొప్పవాళ్లను చేస్తుంది. ప్రసన్నకుమార్ కష్టం నాకు తెలుసు. మా బ్యానర్లో వచ్చిన ‘బిచ్చగాడు’లా ఈ సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నా’’ అన్నారు నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు. ప్రముఖ నృత్యదర్శకులు శివసుబ్రమణ్యం రాజు దంపతులను సన్మానించారు. దర్శకుడు అజయ్ కుమార్, నటుడు అఖిల్ కార్తీక్ పాల్గొన్నారు. -
'మన క్రికెటర్లు పూర్తిగా సన్నద్ధం కాలేదు'
టెస్టు క్రికెట్.. బ్యాట్స్మన్, బౌలర్ల సహనాన్ని పరీక్షిస్తుందని మాజీ క్రికెటర్ వెంకటపతి రాజు అన్నాడు. విజయం సాధించాలంటే ఆటగాళ్లు సహనం కలిగిఉండాలని సూచించాడు. కాగా మన ఆటగాళ్లు టెస్టు క్రికెట్కు తగినంతగా సన్నద్ధం కాలేదని రాజు చెప్పాడు. వెంకటపతి రాజు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. టెస్టు క్రికెట్లో భారత్ వైఫల్యాలకు గల కారణాలను వెల్లడించాడు. 'సచిన్, ద్రావిడ్, గంగూలీ వంటి దిగ్గజ ఆటగాళ్లు దేశవాళీ క్రికెట్కు సమయం కేటాయించేవారు. ఈ రోజుల్లో టీమిండియా ఆటగాళ్లు దేశవాళీ క్రికెట్ తక్కువగా ఆడుతున్నారు. తీరికలేని అంతర్జాతీయ షెడ్యూల్, ఐపీఎల్ దీనికి కారణం కావచ్చు. టెస్టు క్రికెట్ ఆడటంలో ప్రస్తుత భారత జట్టుకు అనుభవం తక్కువ. టీమిండియా ఆటగాళ్లు దేశవాళీ క్రికెట్కు సమయం కేటాయించేలా బీసీసీఐ దృష్టిసారించాలి' అని వెంకటపతి రాజు అన్నాడు. -
నాకంటే బెస్ట్ బ్యాట్స్మన్ లక్ష్మణ్!
అజహరుద్దీన్ ప్రశంస సాక్షి, హైదరాబాద్ : మణికట్టు మాయాజాలంతో మంత్రముగ్ధులను చేస్తూ పరుగుల వరదను పారించే బ్యాట్స్మెన్ అంటే హైదరాబాదీల తర్వాతే ఎవరైనా అనేది క్రికెట్ ప్రపంచం చెప్పే మాట. అజహరుద్దీన్, ఆ తర్వాత అదే శైలిలో వీవీఎస్ లక్ష్మణ్ భారత క్రికెట్లో తమదైన ముద్ర వేశారు. తమ ఇద్దరి ఆటకు సంబంధించి మాజీ కెప్టెన్ అజహరుద్దీన్ ఆసక్తికర వ్యాఖ్య చేశారు. ‘లక్ష్మణ్ నాలాగే ఆడుతున్నాడని చాలా మంది నాతో చెప్పేవారు. సరిగ్గా చెప్పాలంటే మా ఇద్దరి స్టయిల్ ఒకటే. నేనే కొన్నిసార్లు అతడిని అనుకరించానేమో! ఎందుకంటే హైదరాబాద్ అం దించిన అత్యుత్తమ బ్యాట్స్మన్ వీవీఎస్. అందులో సందేహం లేదు’ అని అజహర్ ప్రశంసించారు. ఆదివారం హైదరాబాద్ వెటరన్ క్రికెటర్స్ సంఘం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో వీరిద్దరు పాల్గొన్నారు. వెంకటపతి రాజు, అర్షద్ అయూబ్ తదితరులతో పాటు పలువురు రంజీ ఆటగాళ్లు పాల్గొన్నారు. -
కఠోర శిక్షణతోనే సాధ్యం: వెంకటపతిరాజు
మౌలాలి, న్యూస్లైన్: క్రికెట్లో రాణించేందుకు కఠోర శిక్షణ అవసరమని మాజీ టెస్టు ఆటగాడు వెంకటపతిరాజు అన్నారు. ఆదివారం చంద్రగిరి కాలనీలోని నలంద హైస్కూల్లో జరిగిన నంది క్రికెట్ అకాడమీ వార్షికోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వివిధ పాఠశాలలు క్రికెట్లో ప్రత్యేక శిక్షణ ఇచ్చి నాణ్యమైన క్రీడాకారులను తయారు చేస్తున్నాయని చెప్పారు. అండర్-16 బాలికల విభాగంలో హైదరాబాద్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న అకాడమీ విద్యార్థిని చిత్రను ఆయన అభినందించి ప్రోత్సాహక బహుమతిని అందజేశారు. ఈ కార్యక్రమంలో రంజీ మాజీ క్రికెటర్, కోచ్ ఐ.వి.రావు, వసంత్, ఛటర్జీ తదితరులు పాల్గొన్నారు.