breaking news
Twin explosions
-
సిటీ పేలుళ్లలో ఐఎం ఉగ్రవాది హస్తం?
సాక్షి, హైదరాబాద్: ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) ఉగ్రసంస్థ నగరంలో 2007, 2013ల్లో పాల్పడిన జంట పేలుళ్ల కేసులో ఈ సంస్థ వ్యవస్థాపక సభ్యుడు అబ్దుల్ సుభాన్ ఖురేషీ అలియాస్ తౌఖీర్ పాత్రపై రాష్ట్ర నిఘా విభాగం లోతుగా ఆరా తీస్తోంది. దశాబ్దకాలంగా పరారీలో ఉన్న ఈ ఉగ్రవాదిని ఢిల్లీ స్పెషల్ సెల్ అధికారులు అక్కడి ఘాజీపురలో శనివారం అరెస్టు చేసిన నేపథ్యంలో అతడిని విచారించేందుకు రాష్ట్రంలోని నిఘా విభాగానికి చెందిన ఓ ప్రత్యేక బృందం ఢిల్లీకి వెళ్లింది. సిమిలో ఉండగా సిటీకి మధ్యప్రదేశ్లోని రామ్పూర్కు చెందిన తౌఖీర్ కంప్యూటర్ కోర్సు కోసం ముంబై వెళ్లి అక్కడే స్థిరపడ్డాడు. స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా (సిమి) ఆలిండియా చీఫ్ సఫ్దర్ నఘోరీ పరిచయంతో ఓ సంస్థలో ఉన్నతోద్యోగానికి 2001లో రాజీనామా చేశాడు. సిమి వెలువరిస్తున్న ‘ఇస్లామిక్ మూవ్మెంట్’ పత్రికకు ఎడిటర్గా వ్యవహరించాడు. ఈ సమయంలోనే నఘోరీతో కలసి హైదరాబాద్ వచ్చి సిమి సానుభూతిపరుల్ని కలిశాడు. వీరికి గుజరాత్ అల్లర్లు, రెచ్చగొట్టే ప్రసంగాలతో కూడిన వీడియోలు ఉన్న హార్డ్డిస్క్ను ఓ వ్యక్తి ఇచ్చినట్లు నిఘా వర్గాలు చెప్తున్నాయి. ఈ ఒక్క ‘పర్యటనే’రికార్డుల్లోకి ఎక్కినప్పటికీ వీరు పలుమార్లు నగరానికి వచ్చినట్లు అనుమానాలున్నాయి. ఐఎం ఏర్పాటులో కీలకంగా బండ్లగూడలోని ఓ విద్యాసంస్థలో పని చేసి, అహ్మదాబాద్ పేలుళ్ల కేసులో అరెస్టయిన ముఫ్తీ అబు బషర్ను తౌఖీర్ కలసినట్లు అనుమానిస్తున్నాయి. 2001 సెప్టెంబర్లో కేంద్రం సిమిపై నిషేధం విధించడంతో అతడితోపాటు మరికొందరు అప్పట్లో ముంబైలో ఉంటున్న రియాజ్ భత్కల్, ఇక్బాల్ భత్కల్లను కలసి ఐఎంను స్థాపించారు. బాంబుల తయారీలో నిష్ణాతుడిగా పేరున్న తౌఖీర్ పేరు అహ్మదాబాద్, ముంబై పేలుళ్లలో నేరుగా వెలుగులోకి వచ్చింది. అప్పట్నుంచి పరారీలో ఉన్న అతడు కొన్నాళ్ల పాటు పాక్, దుబాయ్ల్లో తలదాచుకున్నట్లు నిఘా వర్గాలు చెబుతున్నాయి. ఆ రెండు పేలుళ్ల వెనుక ఐఎం గోకుల్చాట్, లుంబినీపార్క్ (2007), దిల్సుఖ్నగర్ (2013)లో జంట పేలుళ్లకు పాల్పడింది. ఈ రెండు కేసుల్లోనూ రియాజ్ భత్కల్, ఒకదాంట్లో ఇక్బాల్ భత్కల్, అమీర్ రజా ఖాన్ నిందితులుగా ఉన్నారు. వీటికి సంబంధించిన సమావేశాల్లో భత్కల్ సోదరులతో పాటు తౌఖీర్ కూడా పాల్గొని ఉండొచ్చని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఇది రూఢీ అయితే నగరంలోని జంటపేలుళ్లకు సంబంధించిన నాలుగు కేసుల్లో ఇతడు వాంటెడ్గా మారతాడు. -
గౌహతిలో జంట పేలుళ్లు, నలుగురికి గాయాలు
అసోం: అసోంలోని గౌహతిలో శనివారం జంట బాంబు పేలుళ్లు సంభవించాయి. నిత్యం రద్దీగా ఉండే ఫ్యాన్సీ బజార్ ప్రాంతంలో ఓ దేవాలయానికి సమీపంలోని చెత్త డంప్లో ఒక్కసారిగా నాటు బాంబులు పేలడంతో నలుగు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. గౌహతి పోలీస్ కమిషనర్ ముఖేష్ అగర్వాల్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఉల్ఫా తీవ్రవాదులే ఈ ఘటనకు పాల్పడి ఉంటారని ఆయన పేర్కొన్నారు. పేలుడు పదార్థాలను దేవాలయానికి దగ్గరలో చెత్తకుండి డంప్ కింద అగంతకులు పెట్టినట్టుగా అనుమానిస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. -
నైజీరియాలో బాంబు పేలుళ్లు.. 44 మంది మృతి
లాగోస్: నైజీరియాలో రెండు వరుస బాంబు పేలుళ్లు చోటుచేసుకొని 44 మంది మృతిచెందారు. మరో 48మందికి పైగా తీవ్రంగా గాయాలపాలయ్యారు. వీరిలో చాలామంది పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. నేషనల్ ఎమర్జెన్సీ మేనేజ్ మెంట్ ఏజెన్సీ(ఎన్ఈఎంఏ)కు చెందిన డైరెక్టర్ మహ్మద్ అబూ సలేం ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ఉత్తర నైజీరియాకు చెందిన జాస్ నగరంలో కొద్ది సమయం వ్యవధిలో రెండు పేలుళ్లు చోటుచేసుకున్నాయని, అయితే, వీటి బారి నుంచి రక్షించే విషయంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.