breaking news
tps
-
ట్రంప్కు భారీ ఊరట.. టీపీఎస్ రద్దుకు గ్రీన్సిగ్నల్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు భారీ విజయం దక్కింది. వలస విధానాల విషయంలో ఆయన తీసుకున్న ఓ నిర్ణయాన్ని సమర్థించేలా అమెరికా సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. దీంతో లక్షలాది మందిని వెనక్కి పంపించేందుకు(Deport) కొన్నేళ్లుగా ఆయన చేస్తున్న ప్రయత్నాలకు మార్గం సుగమమైంది. ట్రంప్ సర్కార్కు అనుకూలంగా అమెరికా సుప్రీం కోర్టు తాజాగా తీర్పు ఇచ్చింది. హైతీ, సిరియా దేశాలకు చెందిన లక్షలాది మంది వలసదారులకు ఇప్పటివరకు లభిస్తున్న టెంపరరీ ప్రొటెక్టెడ్ స్టేటస్ (TPS) రక్షణను రద్దు చేసేందుకు అనుమతి ఇచ్చింది. దీంతో అమెరికాలో చట్టబద్ధంగా నివసిస్తూ, ఉద్యోగాలు చేస్తున్న లక్షలాది మంది ఒక్కసారిగా డిపోర్టేషన్ ముప్పును ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడింది. ఈ తీర్పును ట్రంప్ ప్రభుత్వం "చట్టానికి దక్కిన విజయం"గా అభివర్ణిస్తుండగా.. మానవ హక్కుల సంఘాలు మాత్రం "వేలాది మంది ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టే నిర్ణయం" అంటూ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.ఏళ్లుగా.. లక్ష్యంగా.. డొనాల్డ్ ట్రంప్ తన తొలి అధ్యక్ష పదవీకాలం (2017-2021) నుంచే వలస విధానాలను కఠినతరం చేయాలని ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా టెంపరరీ ప్రొటెక్టెడ్ స్టేటస్ పేరుతో అనేక మంది అమెరికాలో శాశ్వతంగా ఉండిపోతున్నారని అప్పటినుంచే ఆయన విమర్శిస్తున్నారు. తన మొదటి టర్మ్లోనే హైతీ, ఎల్సాల్వడోర్, నికరాగువా, సూడాన్ తదితర దేశాలకు ఇచ్చిన టీపీఎస్ను రద్దు చేసేందుకు ప్రయత్నించారు. అయితే అప్పట్లో ఫెడరల్ కోర్టులు పలుమార్లు ట్రంప్ నిర్ణయాలను నిలిపివేశాయి. 2021లో ఆయన పదవి వీడటంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది.తిరిగి.. 2025 జనవరిలో రెండోసారి వైట్హౌస్లో అడుగుపెట్టిన తర్వాత ట్రంప్ ప్రభుత్వం మళ్లీ అదే అజెండాను వేగవంతం చేసింది. ఇప్పటికే వెనెజువెలా వలసదారుల టీపీఎస్పై చర్యలు తీసుకున్న ప్రభుత్వం.. ఇప్పుడు హైతీ, సిరియాపై కూడా దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో వచ్చిన తాజా సుప్రీంకోర్టు తీర్పు ట్రంప్కు అత్యంత కీలక విజయంగా భావిస్తున్నారు.TPS అంటే ఏంటంటే.. 1990లో అమెరికా కాంగ్రెస్ తీసుకొచ్చిన చట్టం ప్రకారం.. యుద్ధాలు, అంతర్యుద్ధాలు, ప్రకృతి విపత్తులు, తీవ్ర రాజకీయ అస్థిరత లేదంటే మానవతా సంక్షోభం ఎదుర్కొంటున్న దేశాల పౌరులకు అమెరికా తాత్కాలిక రక్షణ(Temporary Protected Status.. TPS) కల్పిస్తుంది. ఈ హోదా పొందిన వ్యక్తులను వారి స్వదేశాలకు బలవంతంగా పంపించరు. అమెరికాలో చట్టబద్ధంగా ఉద్యోగాలు చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. అయితే ఇది గ్రీన్కార్డు లేదంటే పౌరసత్వానికి మార్గం కాదు. పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకున్న తర్వాత ప్రభుత్వం ఈ హోదాను రద్దు చేయవచ్చు.అయితే 2010లో సంభవించిన భారీ భూకంపం తర్వాత హైతీ పౌరులకు టీపీఎస్ ఇచ్చారు. 2012లో సిరియా అంతర్యుద్ధం ప్రారంభమైన తర్వాత అక్కడి ప్రజలకు కూడా ఈ రక్షణ కల్పించారు. అనంతరం ఆయా దేశాల్లో పరిస్థితులు పూర్తిగా మెరుగుపడకపోవడంతో వరుస ప్రభుత్వాలు ఈ గడువును పొడిగిస్తూ వచ్చాయి.అసలు వివాదం ఎలా మొదలైంది?2025లో తిరిగి అధికారంలోకి వచ్చిన ట్రంప్.. వలసవాదుల విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరిస్తున్నది చూస్తున్నదే. ఈ క్రమంలో ఈ హక్కును "తాత్కాలిక రక్షణ"గా కాకుండా "శాశ్వత వలస మార్గం"గా మార్చేశారని ఆరోపిస్తూ వస్తున్నారాయన. ఈ క్రమంలోనే హోంల్యాండ్ సెక్యూరిటీ శాఖ హైతీ, సిరియా దేశాలకు ఇచ్చిన TPSను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే దీనిపై వలసదారుల సంఘాలు కోర్టును ఆశ్రయించాయి. ప్రస్తుతం.. హైతీలో గ్యాంగ్ హింస, కిడ్నాప్లు, రాజకీయ అరాచకాలు కొనసాగుతున్నాయని, సిరియాలో అంతర్యుద్ధం ప్రభావం పూర్తిగా తొలగిపోలేదని వాదించాయి. ఈ పరిస్థితుల్లో వారిని తిరిగి పంపడం ప్రాణాంతకమని పేర్కొన్నాయి. న్యూయార్క్, వాషింగ్టన్లోని ఫెడరల్ కోర్టులు కూడా ఇదే అభిప్రాయంతో ట్రంప్ ప్రభుత్వ నిర్ణయాన్ని తాత్కాలికంగా నిలిపివేశాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.సుప్రీంకోర్టు సంచలన తీర్పు తొమ్మిది మంది న్యాయమూర్తులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం తాజాగా.. 6-3 మెజార్టీతో ట్రంప్ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. జస్టిస్ శామ్యూల్ అలిటో తీర్పు ఇస్తూ.. టీపీఎస్ ఇవ్వాలా? రద్దు చేయాలా? అనేది పూర్తిగా కార్యనిర్వాహక వ్యవస్థ పరిధిలోని అంశమని స్పష్టం చేశారు. అలాంటి నిర్ణయాలను కోర్టులు సమీక్షించే అధికారం చట్టం ఇవ్వలేదని పేర్కొన్నారు. అందువల్ల దిగువ కోర్టులు ట్రంప్ ప్రభుత్వ నిర్ణయాన్ని నిలిపివేయడం సరైనది కాదని తేల్చిచెప్పారు.భిన్నాభిప్రాయంలో.. ఈ తీర్పుతో లిబరల్ న్యాయమూర్తులు ఎలీనా కేగన్, సోనియా సోటోమేయర్, కేతంజీ బ్రౌన్ జాక్సన్ తీవ్ర విభేదించారు. జస్టిస్ కేగన్ తన భిన్నాభిప్రాయంలో ట్రంప్ గతంలో హైతీ ప్రజలపై చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. హైతీ వలసదారులపై జాతి వివక్షతో కూడిన వ్యాఖ్యలు చేసిన వ్యక్తి తీసుకున్న నిర్ణయాన్ని కోర్టు మరింత లోతుగా పరిశీలించాల్సి ఉందన్నారు. ప్రభుత్వం చట్టబద్ధమైన ప్రక్రియను పాటించిందా లేదా అన్నది కోర్టులు పరిశీలించే హక్కు ఉందని అభిప్రాయపడ్డారు.ఎంతమందిపై ప్రభావమంటే.. ఈ తీర్పు తక్షణ ప్రభావం.. సుమారు 3.5 లక్షల మంది హైతీ పౌరులు, 6,100 మంది సిరియా పౌరులపై పడనుంది. వీరంతా ప్రస్తుతం అమెరికాలో ఉద్యోగాలు చేస్తూ, కుటుంబాలతో కలిసి నివసిస్తున్నారు. అయితే దీని ప్రభావం ఇంతటితో ఆగే అవకాశం లేదు. ప్రస్తుతం 17 దేశాలకు చెందిన సుమారు 13 లక్షల మంది టీపీఎస్ కింద అమెరికాలో నివసిస్తున్నారు. ఇప్పుడు వచ్చిన తీర్పు ఆధారంగా.. భవిష్యత్తులో ఇతర దేశాల TPSలను కూడా రద్దు చేసే అవకాశాలు పెరిగాయని వలస నిపుణులు చెబుతున్నారు.మానవ హక్కుల సంఘాల తీవ్ర ఆందోళనఈ తీర్పుపై పలు మానవ హక్కుల సంస్థలు, వలసదారుల హక్కుల సంఘాలు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. హైతీ, సిరియాలో పరిస్థితులు బాగోలేవని అంటున్నాయి. హైతీ వలసదారుల తరఫు న్యాయవాదులు.. "ఈ తీర్పు వేలాది మంది అమాయకుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టే అవకాశం ఉంది" అని హెచ్చరించారు. అమెరికాలోని ప్రముఖ పౌరహక్కుల సంస్థ NAACP కూడా ఈ తీర్పును తీవ్రంగా తప్పుబట్టడం గమనార్హం. అమెరికా అభివృద్ధికి ఎన్నో ఏళ్లుగా సేవలందిస్తున్న హైతీ కుటుంబాలను ఒక్కసారిగా అనిశ్చితిలోకి నెట్టివేయడం మానవతా దృక్పథానికి విరుద్ధమని పేర్కొంది. ఒహాయోలోని హైతీ సపోర్ట్ సెంటర్ ప్రతినిధులు కూడా "ఇప్పటికే వేలాది కుటుంబాలు భయాందోళనలో ఉన్నాయి. పిల్లలు పాఠశాలలకు వెళ్లాలా? ఉద్యోగాలకు వెళ్లాలా? లేక ఎప్పుడు డిపోర్ట్ చేస్తారో తెలియని పరిస్థితి ఏర్పడింది" అని ఆవేదన వ్యక్తం చేశారు.ట్రంప్ ప్రభుత్వం స్పందన ఇదే..అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ శాఖ ఈ తీర్పును స్వాగతించింది. TPS అసలు ఉద్దేశాన్ని దుర్వినియోగం చేసి శాశ్వత వలస మార్గంగా మార్చేశారని పేర్కొంది. వైట్హౌస్ డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ స్టీఫెన్ మిల్లర్ ఈ తీర్పును "పదేళ్లుగా ఎదురుచూస్తున్న విజయం" గా అభివర్ణించారు. ఇప్పుడు హైతీ వలసదారులను స్వదేశాలకు పంపే ప్రక్రియ ముందుకు సాగుతుందని చెప్పారు.'బిగ్ రిలీఫ్' ఎందుకంటే..రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ట్రంప్ అమలు చేస్తున్న కఠిన వలస విధానాలకు కోర్టుల్లో వరుస సవాళ్లు ఎదురవుతున్నాయి. అయినప్పటికీ ఇటీవల వెనిజులా టీపీఎస్ కేసుతో పాటు, ఆశ్రయం కోరే వలసదారులపై పరిమితుల విషయంలోనూ సుప్రీంకోర్టు ట్రంప్ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పులు ఇచ్చింది. ఇప్పుడు హైతీ, సిరియా టీపీఎస్ కేసులో కూడా ట్రంప్కు మద్దతుగా తీర్పు రావడంతో ఆయన వలస విధానాలకు అత్యున్నత న్యాయస్థానం నుంచి మరోసారి బలమైన మద్దతు లభించినట్టైంది. అందుకే ఈ తీర్పును అమెరికా రాజకీయ వర్గాలు ట్రంప్కు బిగ్ రిలీఫ్ గా అభివర్ణిస్తున్నాయి. ఇక ఈ నిర్ణయం అమెరికా వలస విధానాల భవిష్యత్తును గణనీయంగా ప్రభావితం చేసే అవకాశముందని న్యాయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. -
సర్కారు వారి పబ్లిక్ స్కూల్
పబ్లిక్ స్కూల్ అంటే మనకు వెంటనే గుర్తుకొచ్చేది హైదరాబాద్ పబ్లిక్ స్కూల్. అక్కడ చదువుతోపాటు ఆటపాటలు, సరికొత్త ఆలోచనలతో కూడిన బోధన, అభ్యసన కార్యక్రమాలు కొనసాగుతాయి. ఇలాంటి పాఠశాలను ఏకంగా ప్రభుత్వమే నిర్వహిస్తే ఇంకేముంది.. పేద, మధ్యతరగతి పిల్లలంతా పరుగెత్తి అందులో చేరిపోతారు. అలాంటిదే ఇక్కడా జరిగింది.రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్ల గ్రామంలో తెలంగాణ రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి మార్గనిర్దేశంలో ఏర్పాటైన తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఇప్పుడు ఈ ప్రాంతంలో అత్యంత ప్రాచుర్యం పొందింది.ఒకవైపు మౌలిక వసతుల కల్పన కొనసాగుతుండగానే... వందల మంది విద్యార్థులతో ఇప్పుడు ఈ పాఠశాల కళకళలాడుతోంది. పూర్వ ప్రాథమికం నుంచి ఇంటర్ వరకు ఒకే ప్రహరీలో బోధన సాగుతోంది. సాక్షి, హైదరాబాద్: రెసిడెన్షియల్ విధానంలో కాకుండా డే స్కాలర్ పద్ధతిలో మరిన్ని స్కూళ్లు ఏర్పాటు చేసే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలతో తెలంగాణ రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి తెలంగాణ పబ్లిక్ స్కూల్ (టీపీఎస్)పై కొన్ని సూచనలు చేశారు. దీంతో రాష్ట్రంలో నాలుగు చోట్ల టీపీఎస్లు ఏర్పాటయ్యాయి. ఒకే ప్రాంగణంలోకి ప్రాథమిక, ఉన్నత పాఠశాలలను జతచేయడంతోపాటు అక్కడే పూర్వప్రాథమిక పాఠశాలతోపాటు జూనియర్ కాలేజీ ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. ఇలా రంగారెడ్డి జిల్లాలో ఆరుట్ల, మంచాల, నాగర్కర్నూల్ జిల్లా వంగూరు, పోల్కంపల్లిలో వీటిని ఏర్పాటు చేశారు. ఆరుట్ల టీపీఎస్లో ఇప్పటికే వివిధ మౌలిక వసతుల కల్పన ప్రక్రియ వేగవంతంగా సాగుతోంది.నాలుగు చోట్ల ఇలా... ⇒ ఆరుట్ల టీపీఎస్: ప్రాథమిక, ఉన్నత పాఠశాలతోపాటు తెలంగాణ మోడల్ స్కూల్ను ఒకే చోటకు తీసుకొచ్చారు. ఇక్కడ నర్సరీ నుంచి ఇంటర్వరకు తరగతులు నిర్వహిస్తున్నారు. ⇒ మంచాల టీపీఎస్: ప్రాథమిక పాఠశాలతో పాటు జెడ్పీహెచ్ఎస్(బాలికలు), జెడ్పీహెచ్ఎస్(బాలురు)లను ఒకే చోటకు తీసుకొచ్చారు. ఇక్కడ నర్సరీ నుంచి పదోతరగతి వరకు ఉంది. ⇒ వంగూరు టీపీఎస్: ఎంపీపీఎస్ వంగూరు, జెడ్పీహెచ్ఎస్(బాలికలు), జెడ్పీహెచ్ఎస్(బాలురు), కేజీబీవీ, ప్రభుత్వ జూనియర్ కాలేజీలను ఒకే చోటకు తీసుకొచ్చారు. ఇక్కడ నర్సరీ నుంచి ఇంటర్ వరకు తరగతులు కొనసాగుతాయి. ⇒ పోల్కంపల్లి టీపీఎస్: ప్రాథమిక పాఠశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఒకే చోటకు చేర్చాలని ఆదేశించింది. ఇక్కడ నర్సరీ నుంచి పదోతరగతి వరకు బోధన జరుగుతోంది. ఎస్డీఎంసీ కీలకం... తెలంగాణ పబ్లిక్ స్కూళ్లలో పాఠశాల అభివృద్ధి నిర్వహణ కమిటీ (ఎస్డీఎంసీ)లే కీలక పాత్ర పోషిస్తాయి. పాఠశాల పరిధిలో ఎలాంటి పనులైనా టెండర్లు లేకుండా కేవలం ఎస్డీఎంసీల ఆమోదం, పర్యవేక్షణలోనే నిర్వహించాలి. ప్రస్తుతం ఆరుట్ల టీపీఎస్లో ఇదే తరహాలో అబివృద్ధి పనులు సాగుతున్నాయి. ఎస్డీఎంసీలో 23 మంది సభ్యులున్నారు. ⇒ ఇప్పటికే బాస్కెట్బాల్ కోర్టు, బాక్స్ క్రికెట్ , కోకో గ్రౌండ్ పూర్తయ్యాయి. ⇒ గ్రంథాలయం, డైనింగ్ హాళ్లు, సీసీరోడ్డు పనులు కొనసాగుతున్నాయి. ⇒ క్లాస్రూమ్లు కూడా రంగురంగుల్లో అత్యాధునిక ఫర్నిచర్తో ఏర్పాటు చేశారు. ⇒ వివిధ రకాల ఆటవస్తువులు అందుబాటులో ఉండడంతో చిన్నారులు ఎంతో ఉత్సాహంగా బడికి వస్తున్నారు. అప్పుడు 700 మంది.. ఇప్పుడు 1,629 మంది విద్యార్థులు ప్రస్తుతం ఆరుట్ల టీపీఎస్ పరిధిలో పూర్వ ప్రాథమిక పాఠశాలను కొత్తగా ఏర్పాటు చేశారు. ఇందులో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీలు రెండేసి సెక్షన్లున్నాయి. మొత్తం ఆరు సెక్షన్ల పరిధిలో 126 మంది చిన్నారులున్నారు. ⇒ ప్రాథమిక పాఠశాల, ఉన్నత పాఠశాల, మోడల్ స్కూల్ ముందు నుంచే కొనసాగుతున్నాయి. ఈ మూడింటిలో 700 మంది ఉండగా... టీపీఎస్ తర్వాత విద్యార్థుల సంఖ్య 1,629కు చేరింది. ⇒ ప్రాథమిక పాఠశాలలో ఇదివరకు 90 మంది విద్యార్థులుండగా... ఇప్పుడా సంఖ్య 514కు చేరింది. ⇒ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు 250 నుంచి 360కి పెరిగారు. మోడల్ స్కూల్లో విద్యార్థుల సంఖ్య 350 నుంచి 629కి చేరింది. ⇒ ప్రీప్రైమరీ టీచర్లను కమిటీ ఆధ్వర్యంలో ఔట్సోర్సింగ్ పద్ధతిలో నియమించారు. ఒక్కో టీచర్కు రూ.15 వేలు, ఆయాకు రూ.10 వేలు వేతనాలిస్తున్నారు. బస్సుల నిర్వహణకు రాయితీ బస్సుల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం రాయితీ ఇస్తోంది. ఒక్కో బస్సుపై గరిష్టంగా రూ.12.5 లక్షలు రాయితీ ఉంది. ఆరుట్లలో మూడు బస్సులు నడుపుతూ 200 మంది విద్యార్థులను సమీప గ్రామాల నుంచి రోజూ స్కూల్కు చేర్చుతున్నారు. బస్సు నిర్వహణ కోసం వాటిల్లో వచ్చే విద్యార్థుల నుంచి నామమాత్రంగా ఫీజులు తీసుకుంటున్నారు. సీఎస్ఆర్ కింద రూ.3 కోట్లు వచ్చాయిపాఠశాల అభివృద్ధికి ప్రభుత్వం ఇచ్చే నిధులకు అదనంగా సీఎస్ఆర్ నిధులు కూడా దాదాపు రూ. 3 కోట్ల వరకు రాగా, అభివృద్ధి పనులకు ఖర్చు చేశాం. పనులను విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. –ఎస్.గిరిధర్, గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుడు టీచర్ల పిల్లలూ ఇక్కడే... మా పాఠశాలలో దాదాపు 20 మంది పిల్లల తల్లిదండ్రులు ఇక్కడ టీచర్లుగా పనిచేస్తున్నారు. ప్రతి శనివారం ఎస్డీఎంసీ సమావేశం జరుగుతుంది. కమిటీ సభ్యులు తప్పకుండా హాజరవుతారు. ఆ సమావేశంలో చర్చలు జరిపి అవసరాలకు అనుగుణంగా తీర్మానం చేసి కార్యాచరణ మొదలు పెడతాం. – కంబాలపల్లి భాస్కర్, ఎస్డీఎంసీ సభ్యుడు -
గోడకు నిధులిస్తే.. డ్రీమర్లకు గడువిస్తా
వాషింగ్టన్: అమెరికాలో కొనసాగుతున్న షట్డౌన్కు ముగింపు పలికేందుకు ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాజీ ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. డెమొక్రాట్లు మెక్సికో సరిహద్దులో గోడ నిర్మాణానికి ఆమోదం తెలిపితే, దాదాపు 7 లక్షల మంది డ్రీమర్లకు(బాల్యంలోనే అమెరికాకు అక్రమంగా వచ్చినవారు) మూడేళ్ల పాటు తాత్కాలిక రక్షణ హోదా కల్పిస్తామని ట్రంప్ ప్రకటించారు. వైట్హౌస్ నుంచి శనివారం(స్థానిక కాలమానం) ప్రజలు, రాజకీయ నేతలనుద్దేశించి ప్రసంగించిన ట్రంప్.. ‘వాషింగ్టన్లోని రెండు పక్షాలు(రిపబ్లికన్లు, డెమొక్రాట్లు) ఓ అంగీకారానికి రావాల్సిన అవసరం ఉంది. దేశంలోని 7,00,000 మంది డ్రీమర్లకు మరో మూడేళ్ల పాటు తాత్కాలిక రక్షణ హోదా(టీపీఎస్) కల్పిస్తాం. స్వదేశాల్లో హింస, అంతర్యుద్ధం కారణంగా అమెరికాలో ఉంటున్న 3 లక్షల మంది విదేశీయులకు టీపీఎస్ను మూడేళ్ల పాటు పొడిగిస్తాం. ఇందుకు ప్రతిగా అమెరికా–మెక్సికో సరిహద్దులో గోడ నిర్మాణానికి ఆమోదం తెలపాల్సి ఉంటుంది’ అని ట్రంప్ స్పష్టం చేశారు. అమెరికా–మెక్సికో సరిహద్దులో గోడ కోసం 5.7 బిలియన్ డాలర్లు(రూ.40,615 కోట్లు) ఇవ్వాలని ట్రంప్ కోరుతున్న సంగతి తెలిసిందే. అధ్యక్షుడి ప్రతిపాదన ఆచరణసాధ్యం కాదని డెమొక్రటిక్ నేత, ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ స్పష్టం చేశారు. ప్రభుత్వాన్ని షట్డౌన్ చేయడాన్ని ట్రంప్ గర్వంగా భావిస్తున్నారనీ, దీనిని ఎత్తివేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. -
నీ అంతు చూస్తాం
నగరపాలక సంస్థ అధికారులపై టీడీపీ నేతల దౌర్జన్యం రోజురోజుకూ పెచ్చుమీరుతోంది. ఎన్నడూ లేని విధంగా దాడులు చేస్తూ, నోరు పారేసుకుంటున్నారు. ఇలాగైతే తాము ఇక్కడ పని చేయలేమంటూ అధికారులు, సిబ్బంది చర్చించుకోవడం దుమారం రేపుతోంది. అనంతపురం న్యూసిటీ: రాంనగర్లోని వెంకటేశ్వర దేవాలయం సమీపంలో టౌన్ ప్లానింగ్ అనుమతులు తీసుకోకుండా ఓ యజమాని నిర్మాణాలు చేపట్టాడు. టౌన్ప్లానింగ్ సూపర్వైజర్ (టీపీఎస్) వినయ్కుమార్ చాలాసార్లు బిల్డర్ (యజమాని)కి చెప్పినా ప్రయోజనం లేకుండా పోయింది. ఈ క్రమంలో ఈ నెల 29న నిర్మాణ పనులు మరింత వేగవంతం చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో శుక్రవారం టీపీఎస్ టౌన్ ప్లానింగ్ సిబ్బందితో వెళ్లి అనధికార నిర్మాణం చేపడుతున్న గోడను తొలగించారు. స్థల యజమాని కుమారుడు, ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి కుమారుడు మిత్రులు. విషయం ఎమ్మెల్యే వర్గీయుల దృష్టికి వెళ్లింది. ఫోన్లో నటేష్చౌదరి వార్నింగ్ చివరకు కార్పొరేటర్ నటేష్చౌదరి రంగంలోకి దిగి టీపీఎస్ను ఫోన్లో దుర్భాషలాడాడు. తనకు తెలియకుండా, తన అనుమతిలేకుండా తన డివిజన్లోకి అడుగుపెట్టి నిర్మాణాన్ని తొలగిస్తావా అంటూ ఆగ్రహించాడు. తనపై ఇదివరకే మర్డర్ కేసు ఉందని, కేసులు కొత్తేమీ కాదని.. నీ అంతు చూస్తానంటూ బెదిరించాడు. అంతటితో ఆగక ఎక్కడున్నావంటూ గద్దించడంతో ఆఫీసులో ఉన్నానని టీపీఎస్ తెలిపాడు. కార్పొరేటర్ మందీమార్బలంతో వస్తున్నాడని పరిస్థితి అదుపుతప్పే అవకాశం ఉందని భావించిన అధికారులు టీపీఎస్ను అక్కడి నుంచి పంపించేశారు. అనుకున్నట్టుగానే నటేష్చౌదరి కార్యాలయానికి చేరుకుని టీపీఎస్ ఎక్కడున్నాడంటూ వీరంగం వేయడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టార్గెట్ టీపీఎస్ ఎమ్మెల్యే వర్గీయులు టీపీఎస్ వినయ్కుమార్ను తరచూ టార్గెట్ చేస్తున్నారు. రెండు నెలల క్రితం ఆరో రోడ్డులో తెలుగుదేశంపార్టీ ఫ్లెక్సీ తొలగించినప్పుడు కార్పొరేటర్లు సద్దల హేమలత, విజయశ్రీ, నాయకులు సద్దలశేఖర్, సరిపూటి శ్రీకాంత్ తదితరులు నగరపాలక సంస్థలో హంగామా చేశారు. -
ట్రంప్ సంచలన నిర్ణయం
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సుమారు 7వేల మంది సిరియన్ వలస వాదులను అమెరికాలో కొనసాగేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ‘‘ప్రస్తుతం సిరియా అంతర్యుద్ధంతో సతమతమవుతోంది. ఈ నేపథ్యంలో తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు వారిక్కడే(అమెరికాలో) నివసించేందుకు ఎలాంటి అభ్యంతరం లేదు. మానవత్వ కోణంలో వారికిక్కడ తాత్కాలిక రక్షణ హోదాను (టీపీఎస్) కల్పిస్తున్నాం. దానిని మరికొంత కాలం కొనసాగించబోతున్నాం’’ అంటూ ట్రంప్ కార్యాలయం నుంచి ఓ ప్రకటన వెలువడింది. అయితే కొత్తగా వచ్చే శరణార్థుల దరఖాస్తులను మాత్రం అంగీకరించబోమని అమెరికా స్పష్టం చేసింది. ఇక ఈ ప్రకటనను అమెరికా హోంలాండ్ కార్యదర్శి క్రిస్ట్జెన్ నీల్సన్ ధృవీకరించారు. ఒక్క సిరియానే కాదు.. మిగతా దేశాల(నిషేధం ఎదుర్కుంటున్న 10 దేశాలు) శరణార్థుల విషయంలోనూ పునరాలోచన చేస్తున్నామని ఆయన వెల్లడించారు. తాజా ఉత్తర్వులతో అమెరికాలో ప్రస్తుతం ఆశ్రయం పొందుతున్న సిరియన్లు.. మరో 18 నెలలపాటు నిరభ్యరంతంగా జీవించొచ్చు. అయితే ఎల్ సాల్వెడొర్, హైతి, నికారగువా తదితర ప్రాంతాల నుంచి శరణార్థుల తాకిడి ఎక్కువగా ఉంటుండటంతో.. ఆ మధ్య టీపీఎస్ విధానాన్ని ఆయా ప్రాంతాలకు రద్దు చేస్తూ ట్రంప్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2007లో అప్పటి అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా శరణార్థుల ప్రవేశానికి అనుమతి ఇచ్చారు. ట్రంప్ అధికారంలోకి వచ్చాక అమెరికాలో శరణార్థుల ప్రవేశంపై ఆంక్షలు విధించారు. అయితే నిషేధం ఎదుర్కొంటున్న 11 దేశాలపై మాత్రం 90 రోజుల పాటు సమీక్షించాలని గతేడాది అక్టోబర్లో ట్రంప్ ప్రభుత్వం నిర్ణయించింది. -
టీపీఎస్గా అలివేలు
అనంతపురం న్యూసిటీ : నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ సూపర్వైజర్గా అలివేలు నియమితులయ్యారు. మడకశిరలో బిల్డింగ్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్న ఆమె పదోన్నతిపై అనంతకు వచ్చారు. బుధవారం కమిషనర్ సత్యనారాయణ వద్ద రిపోర్ట్ చేసుకున్నారు.


