breaking news
total expenditure
-
లోక్సభలో ఎన్నికల్లో 45% ఖర్చు బీజేపీదే
న్యూఢిల్లీ: గత ఏడాది జరిగిన లోక్సభ ఎన్నికల్లో రాజకీయ పార్టీలన్నీ కలిపి చేసిన మొత్తం వ్యయంలో 45 శాతం వాటా భారతీయ జనతా పార్టీదేనని అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రిఫామ్స్(ఏడీఆర్) శుక్రవారం ఒక నివేదికలో వెల్లడించింది. ఈ ఎన్నికల్లో బీజేపీ రూ.1,494 కోట్లు ఖర్చు చేసినట్లు తెలియజేసింది. విపక్ష కాంగ్రెస్ రూ.620 కోట్లు ఖర్చు పెట్టిందని, మొత్తం వ్యయంలో ఆ పార్టీ వాటా 18.5 శాతమని వివరించింది. మొత్తం 32 జాతీయ, ప్రాంతీయ పార్టీల ఎన్నికల ఖర్చుల రికార్డులను ఏడీఆర్ విశ్లేషించింది. 2024లో మార్చి 16 నుంచి జూన్ 6 దాకా లోక్సభ ఎన్నికలతోపాటు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ప్రదేశ్, ఒడిశా, సిక్కిం అసెంబ్లీ ఎన్నికలు సైతం జరిగాయి. ఈ ఎన్నికల కోసం 32 పార్టీలు రూ.3,352.81 కోట్లు ఖర్చు చేసినట్లు ఏడీఆర్ తెలియజేసింది. ఇందులో జాతీయ పార్టీల వాటా రూ.2,204 కోట్లు(65.75 కోట్లు) అని పేర్కొంది. విరాళాలు, నిధుల రూపంలో జాతీయ పార్టీలకు రూ.6,930.24 కోట్లు, ప్రాంతీయ పార్టీలకు రూ.515.32 కోట్లు అందినట్లు వివరించింది. అంటే మొత్తం నిధుల్లో జాతీయ పార్టీలకు 93.08 శాతం, ప్రాంతీయ పార్టీలకు 6.92 శాతం అందినట్లు స్పష్టమవుతోంది. ఏయే పార్టీలు ఎన్ని నిధులు ఖర్చు చేశాయన్నది ఆయా పార్టీలు ఎన్నికల సంఘానికి సమర్పించిన ‘వ్యయ నివేదికల’ఆధారంగా ఏడీఆర్ గుర్తించింది. లోక్సభ ఎన్నికలు పూర్తయిన తర్వాత 90 రోజుల్లోగా, అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన తర్వాత 75 రోజుల్లోగా పార్టీలు వ్యయ నివేదికలు సమర్పించాల్సి ఉంటుంది. కానీ, బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ చాలా ఆలస్యంగా ఈ నివేదికలు ఇచ్చినట్లు ఏడీఆర్ పేర్కొంది. పార్టీలు ఎన్నికల ప్రచారం కోసమే అత్యధిక నిధులు ఖర్చు చేసినట్లు తెలిపింది. అన్ని పార్టీలు ప్రచారం కోసం రూ.2,008 కోట్లు వెచ్చించినట్లు తేల్చింది. అంటే మొత్తం ఖర్చులో ఇది 53 శాతంగా తెలుస్తోంది. ఆ తర్వాత రవాణా కోసం రాజకీయ పార్టీలు ఎక్కువ ఖర్చు పెట్టినట్లు వెల్లడించింది. ఎన్నికల సంఘం గుర్తింపు పొందని 690 పార్టీలు కూడా గత ఏడాది ఎన్నికల్లో పోటీ చేసినట్లు ఏడీఆర్ తెలియజేసింది. ఎన్నికల్లో రాజకీయ పార్టీలు చేసే ఖర్చుపై నిఘా పెట్టడానికి ప్రత్యేకంగా పరిశీలకులను నియమించాలని ఎన్నికల సంఘానికి సూచించింది. -
లోక్సభ ఎన్నికలకు ప్రభుత్వ వ్యయం.. 3426 కోట్లు!!
ఈసారి జరుగుతున్న లోక్సభ ఎన్నికలు అత్యంత ఖరీదైనవి. వీటికి కేవలం ప్రభుత్వ వ్యయమే ఏకంగా రూ. 3426 కోట్లుగా తేలింది. ఇంతకుముందు 2009లో జరిగిన ఎన్నికల వ్యయం కంటే ఇది 131 శాతం ఎక్కువ. ఐదేళ్ల క్రితం జరిగిన లోక్సభ ఎన్నికలకు అప్పట్లో రూ. 1483 కోట్లు ఖర్చుకాగా, అదే చాలా ఎక్కువని అనుకున్నారు. తొమ్మిది దశలుగా జరిగిన ఈ ఎన్నికల్లో మొత్తం దాదాపు 30వేల కోట్లు ఖర్చయినట్లు భావించగా, అందులో ప్రభుత్వ వ్యయం పది శాతం మాత్రమే. 1952లో ఒక్కో ఓటరుకు సగటున 60 పైసల వరకు ఖర్చు కాగా, 2009లో అది 12 రూపాయలకు చేరుకుంది. 1952లో మొత్తం వ్యయం రూ. 10.45 కోట్లు మాత్రమే. 2009 నాటికి అది రూ. 1483 కోట్లకు చేరుకుంది. పోలింగ్ శాతాన్ని గణనీయంగా పెంచేందుకు పలు చర్యలు తీసుకోవడం, ఎన్నికల నిర్వహణకు అయ్యే వ్యయం కూడా భారీగా పెరిగిపోవడం వల్లే ఈసారి మూడువేల కోట్లను దాటి ఖర్చయినట్లు ఎన్నికల కమిషన్ చెబుతోంది. ఈసారి అనేక పార్టీలు రాజకీయాల్లోకి కొత్తగా రావడం, పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థుల సంఖ్య కూడా పెరగడం కూడా ఎన్నికల వ్యయం ఎక్కువ కావడానికి కారణంగా తేలింది. ఓటరు స్లిప్పులను ఇంతకుముందు రాజకీయ పార్టీలు పంచేవి. ఈసారి ఎన్నికల కమిషన్ ప్రత్యేకంగా సిబ్బందిని ఏర్పాటుచేసి వాళ్లతోనే స్లిప్పులు పంపిణీ చేయించింది. దీనికి కూడా ఖర్చు ఎక్కువే అయ్యింది.