breaking news
Tire Industries
-
టైర్ల పరిశ్రమకు ప్రీమియం దన్ను
న్యూఢిల్లీ: ప్రీమియం ఉత్పత్తులకు డిమాండ్, ఎగుమతులు పెరుగుతుండటం వంటి సానుకూల అంశాల తోడ్పాటుతో దేశీ టైర్ల పరిశ్రమ రాబోయే రోజుల్లో గణనీయంగా వృద్ధి చెందనుంది. 2047 నాటికి పరిశ్రమ ఆదాయం 12 రెట్లు పెరిగి రూ. 13 లక్షల కోట్లకు చేరనుంది. ఆటోమోటివ్ టైర్ల తయారీ సంస్థల సమాఖ్య ఏటీఎంఏ, కన్సల్టెన్సీ సంస్థ పీడబ్ల్యూసీ ఇండియా సంయుక్తంగా రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దేశీయంగా వాహనాల తయారీ సంస్థలు (ఓఈఎం), రీప్లేస్మెంట్కి సంబంధించి టైర్లకు డిమాండ్ నెలకొనడం, వాహన ఎగుమతులు వేగవంతం కావడంలాంటి అంశాలు టైర్ల పరిశ్రమ వృద్ధికి దోహదపడతాయని నివేదిక వివరించింది. 2047 నాటికి దేశీయంగా టైర్ల తయారీ పరిశ్రమ ఉత్పత్తి పరిమాణం సుమారు నాలుగు రెట్లు పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. ఈ వ్యవధిలో ఆదాయం 12 రెట్లు వృద్ధి చెంది రూ. 1,300 కోట్ల మేర పెరగవచ్చని రిపోర్ట్ తెలిపింది. నివేదిక ప్రకారం ‘వికసిత భారత్ 2047’ లక్ష్యం దిశగా భారత్ ప్రస్థానం సాగిస్తుండటం, టైర్ల పరిశ్రమకు గణనీయంగా అవకాశాలు కల్పిస్తుంది. దేశీ కస్టమర్ల ఆకాంక్షలను నెరవేర్చడమే కాకుండా అమెరికా, యూరోపియన్ యూనియన్లాంటి కీలక మార్కెట్లకు వాణిజ్య, ప్యాసింజర్ వాహనాలకు ఉపయోగపడే టైర్లను మరింతగా ఎగుమతి చేసేందుకు కూడా ఇది తోడ్పడుతుందని పీడబ్ల్యూసీ ఇండియా పార్ట్నర్ కవన్ ముఖ్తియార్ తెలిపారు. వినియోగదారులు, మొబిలిటీ ధోరణులు మారుతుండటం, అంతర్జాతీయంగా వ్యాపార పరిస్థితులు ఎప్పటికప్పుడు కొత్త మార్పులకు లోనవుతుండటం, పర్యావరణహితమైన ఆవిష్కరణలపై ఆసక్తి పెరుగుతుండటమనే విషయాలు, భారతీయ టైర్ల పరిశ్రమ తనను తాను కొత్తగా మల్చుకునేందుకు ఒక చక్కని అవకాశం కల్పిస్తాయని పేర్కొన్నారు. రిపోర్ట్ ప్రకారం మౌలిక సదుపాయాలపై వ్యయాలు, దేశీయంగా వినియోగం పటిష్టంగా ఉండటంతో ఆర్థిక కార్యకలాపాలు పుంజుకోవడం వల్ల ఓఈఎం, రీప్లేస్మెంట్ టైర్లపరమైన ఆదాయాలు 2047 ఆర్థిక సంవత్సరం నాటికి వార్షికంగా 10 శాతం మేర వృద్ధి చెందనున్నాయి. ఇక ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నందున భారతీయ టైర్లకు విదేశీ మార్కెట్లలోను అవకాశాలు పెరగనున్నాయి. -
ఎంఆర్ఎఫ్కు ఎక్స్ప్రెస్ లాభాలు
న్యూఢిల్లీ: టైర్ల రంగంలో అగ్రగామి సంస్థ ఎంఆర్ఎఫ్ జూన్తో అంతమైన మూడు నెలల కాలంలో తన పనితీరును గణనీయంగా మెరుగుపరుచుకుంది. కన్సాలిడేటెడ్ నికర లాభం క్రితం ఏడాది ఇదే కాలంలో పోలిస్తే ఐదు రెట్లు పెరిగి రూ.589 కోట్లకు దూసుకుపోయింది. కన్సాలిడేటెడ్ ఆదాయం సైతం రూ.6,440 కోట్లకు వృద్ధి చెందింది. క్రితం ఏడాది ఇదే కాలానికి లాభం రూ.123 కోట్లు, ఆదాయం రూ.5,696 కోట్ల చొప్పున ఉన్నాయి. ముఖ్యంగా ముడిసరుకుల వ్యయాలు తగ్గడం కలిసొచి్చంది. ముడి సరుకులపై చేసిన వ్యయాలు రూ.3,781 కోట్లుగా ఉన్నాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో ముడి సరుకుల కోసం అయిన వ్యయాలు రూ.4,114 కోట్లుగా ఉండడం గమనార్హం. వ్యయాలు రూ.5,567 కోట్ల నుంచి రూ.5,728 కోట్లకు పెరిగాయి. ఎండీగా ఉన్న కేఎం మామెన్ను చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ)గా 2024 ఫిబ్రవరి 8 నుంచి ఐదేళ్ల కాలానికి నియమిస్తూ కంపెనీ బోర్డ్ నిర్ణయం తీసుకుంది. విమలా అబ్రహాంను ఇండిపెండెంట్ డైరెక్టర్గా రెండో విడత మరో ఐదేళ్ల కాలానికి నియమించింది. -
పల్లెలపై కాలుష్యం పంజా
ప్రకృతికి నెలవైన పచ్చని పల్లెలు కాలుష్యం కోరల్లో చిక్కుకుంటున్నాయి. స్వచ్ఛమైన గాలి విషతుల్యమవుతోంది. పరిశ్రమల నుంచి వెలువడుతున్న దుర్వాసనతో ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు. పరిశ్రమల ఇష్టారాజ్యంతో పంట పొలాలు నిస్సారంగా మారుతున్నాయి. ఇవేమీ పట్టించుకోని కాలుష్య నియంత్రణ బోర్డు అధికారులు పరిశ్రమలకు కొమ్ముకాస్తూ అంటీ ముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు కొండాపూర్ మండల ప్రజల నుంచి వినిపిస్తున్నాయి. -కొండాపూర్ కొండాపూర్ మండల పరిధిలోని తేర్పోల్, చెర్లగోపులారం, మల్లెపల్లి, ఎదురుగూడెం, గుంతపల్లి గ్రామాల్లో నాలుగు మద్యం పరిశ్రమలు, పది టైర్ల పరిశ్రమలు ఉన్నాయి. మద్యం పరిశ్రమల నుంచి వెలుబడుతున్న వ్యర్థాలు, కాలుష్యంతో సమీపంలోని పొలాల్లో ఏ పంట వేసినా పండడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే టైర్లను కాల్చి ఆయిల్ తీసే క్రమంలో వచ్చే పొగ, దుర్వాసనతో ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు. పగలు.. రాత్రి తేడా లేకుండా... పగలు, రాత్రీ అనే తేడా లేకుండా పరిశ్రమలు వ్యర్థాలను యథేచ్చగా బయటకు వదులుతున్నాయని ఆయా గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. రాత్రి అయితే పరిస్థితి మరింత దారుణంగా తయారైందని పేర్కొంటున్నారు. ముక్కుపుటాలు అదిరే దుర్వాసనతో నిద్రకూడా పట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కలుషితమైన గాలి పీల్చడం వల్ల చిన్నారులు శ్వాసకోశ వ్యాధులకు గురవతున్నారని చెప్పారు. ఇదే క్రమంలో గొల్లపల్లికి చెందిన ఓ మహిళకు గర్భస్రావం జరిగినట్లు గ్రీవెన్స్డేలో కలెక్టర్కు ఫిర్యాదు చేసినా సంబంధిత అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ప్రజల ఆరోగ్యం గురించి పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న పరిశ్రమపై చర్యలు తీసుకోవాలని గతంలో గుంతపల్లి గ్రామస్తులు టైర్ల పరిశ్రమ ఎదుట పలుమార్లు ధర్నా నిర్వహించినా... అధికారులతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు కూడా కంపెనీల యాజమాన్యాలకే వత్తాసు పలుకుతున్నారని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కాలుష్యాన్ని విడుదల చేస్తున్న పరిశ్రమలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. భయంగా ఉంది నేను నిత్యం తేర్పోల్ నుంచి సంగారెడ్డికి ద్విచక్ర వాహనంపై వెళ్తుంటాను. గ్రామ శివారులోని టైర్ల పరిశ్రమ నుంచి వచ్చే పొగ రోడ్డును కమ్మేస్తోంది. సాయంత్రం వేళ కంపెనీ దరిదాపుల్లోకి వెళ్లాలంటే భయమేస్తుంది. - ప్రభు, తేర్పోల్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం కంపెనీల నుంచి వస్తున్న కాలుష్యంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అనేక మంది రోగాలపాలవుతున్నారు. రాత్రి వేళ నిద్రకూడా పట్టడం లేదు. అధికారు లు స్పందించి కాలుష్య నివారణకు చర్య తీసుకోవాలి. -చంద్రమోహన్, గొల్లపల్లి