breaking news
Temples entry
-
మార్మోగిన శివనామ స్మరణ
నేరడిగొండ(బోథ్) : ఓం నమఃశివాయ.. శంభో శంకర.. హరహర మహాదేవా.. అంటూ భక్తుల శివనామస్మరణతో ఆలయాలు మార్మోగాయి. మహా శివరాత్రి పర్వదినం పురస్కరించుకుని మండలంలోని శివాలయాల్లో భక్తులు మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వడూర్ గ్రామంలోని శివలింగాయనం, మహాదేవుని ఆలయం, కుమారి, సవర్గాం గ్రామాల్లో రాజరాజేశ్వర ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్రంలోనే ఎత్తయిన జలపాతంగా పేరొందిన కుంటాల జలపాతం వద్ద సహజ సిద్ధంగా ఏర్పడిన సోమేశ్వర ఆలయంలో శివలింగం, నందీశ్వర విగ్రహాలకు అభిషేకంతోపాటు భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లా నుంచే కాకుండా ఇతర జిల్లాలతోపాటు మహారాష్ట్ర, తదితర ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి గుహలోని శివలింగం, నందీశ్వర విగ్రహాలకు మొక్కులు చెల్లించారు. శివరాత్రికి మాత్రమే దర్శనం.. కుంటాల జలపాతం వద్ద సహజ సిద్ధంగా ఏర్పడిన గుహలో శివలింగం, నందీశ్వరుడిని దర్శించుకోవాలంటే మహా శివరాత్రి సందర్భంగా రెండు రోజులపాటు దర్శనానికి వీలుంటుంది. దీంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు దర్శనం కోసం ఆతృతగా ఎదురు చూస్తుంటారు. కనిపించని వసతులు.. కుంటాల జలపాతం వద్ద మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఏటా ఇక్కడ జాతర నిర్వహిస్తారు. ఈసారి జాతరలో కనీస వసతులు కల్పించకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. దర్శనానికి వెళ్లే భక్తులకు నీటి సౌకర్యం కల్పించకపోవడంతో ఇక్కట్లు ఎదుర్కొన్నారు. నేరడిగొండ, సిరికొండ ఎస్సైలు వెంకన్న, రాముగౌడ్ కుటుంబ సభ్యులు సోమేశ్వరుని దర్శించుకున్నారు. పోలీసులు, అటవీ శాఖ అధికారులు బందోబస్తు ఏర్పాటు చేశారు. -
సంప్రదాయ దుస్తులు తప్పనిసరి
సంప్రదాయ దుస్తులతోనే ఆలయాల ప్రవేశం 1వ తేదీ నుంచి అమలు చెన్నై, సాక్షి ప్రతినిధి: ఆలయాల సందర్శన సమయంలో భక్తులు విధిగా సంప్రదాయ దుస్తులు ధరింపజేసేలా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయం వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ నుంచి అమలులోకి రానుంది. ఈమేరకు దేవాదాయశాఖ శనివారం ఆదేశాలు జారీ చేసింది. తమిళనాడులో పారంపర్య, ఆచారాలు, అలవాట్లతో కూడిన ఆలయాలు ఉన్నాయి. విదేశీ పర్యాటకులు భారతదేశ పర్యటనలో వచ్చినపుడు ఆలయాల సందర్శనకే అధిక ప్రాధాన్యత నిస్తారు. ఈ సమయంలో విదేశీ నాగరికతను ప్రతిబింబించే దుస్తులను పక్కన పెట్టి పంచె, చీరలు వంటి హిందూ సంప్రదాయ దుస్తులను ధరిస్తుంటారు. అయితే పలు స్వదేశీ భక్తులు మాత్రం జీన్స్, టీ షర్ట్, టాప్, లెగింగ్స్ వంటి విదేశీ సంప్రదాయ దుస్తులతో వస్తున్నారు. స్వామి, అమ్మవార్ల దర్శనార్థం వస్తున్న కొందరు భక్తులకు ఫ్యాషన్ దుస్తులు ఇబ్బందికరంగా భావించగా, ఒక సామాజిక కార్యకర్త మదురై హైకోర్టు శాఖలో ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) దాఖలు చేశాడు. ఈ వ్యాజ్యాన్ని అనుసరించి కోర్టు జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం రాష్ట్ర దేవాదాయ శాఖ అన్ని ఆలయాలకు ఆదేశాలు జారీచేసింది. ఆలయాలకు వచ్చే భక్తులు హిందూ సంప్రదాయం ప్రకారం మగవారు పంచె, చొక్కా, పైజామా, కుర్తా ధరించాలి. అలాగే మహిళలు చీర, పవిట, పావడా ధరించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. సంప్రదాయ దుస్తుల ఉత్తర్వులను అన్ని ఆలయాల్లో బోర్డులపై ప్రదర్శించాలని సూచించారు. ఈ ఉత్తర్వులను జనవరి 1వ తేదీ నుంచి అమలు చేయాలని స్పష్టం చేశారు. సంప్రదాయ దుస్తుల నిబంధనను స్వాగతించిన చెన్నై ట్రిప్లికేన్ పార్థసారధి ఆలయ నిర్వాహకులు వెంటనే బోర్డు పెట్టేశారు. దేవాదాయశాఖకు చెందిన ఒక అధికారి మాట్లాడుతూ, ఆలయాల పవిత్రను ఇనుమడింప జేయడం భక్తుల కర్తవ్యమని అన్నారు. కొందరు భక్తులు ఆలయానికి వచ్చినపుడు సైతం ఏదో తమ ఇంటిలో ఉన్నట్లుగానే భావిస్తూ సంప్రదాయ కట్టుబొట్టును కాలరాస్తున్నారని చెప్పారు. దేశమంతా కీర్తింపబడుతున్న తమిళుల సంస్కృతి, సంప్రదాయాలు ఇక ఆలయాల్లో ప్రతిబింబిస్తాయని చెప్పారు.