breaking news
Telugu basha brahmostavalu
-
ఖతర్లో ఘనంగా తెలుగుభాషా దినోత్సవం
ఖతర్లో తెలుగు వారంతా తెలుగు భాషా దినోత్సవాన్ని ఎంతో ఘనంగా జరుపుకున్నారు. దోహాలోని భారత రాయబారి కార్యాలయం ఆధ్వర్యంలోని ఇండియన్ కల్చరల్ సెంటర్ తెలుగు లిటరేచర్ క్లబ్ అనుబంధ సంస్థలైన తెలుగు కళా సమితి, తెలంగాణ ప్రజా సమితి, తెలంగాణ జాగృతి, ఆంధ్ర కళా వేదిక ఈ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించాయి. ఎంతో అద్భుతమైన ఈ కార్యక్రమం తెలుగు సంఘాల ఐక్యతకు నిదర్శనంగా నిలిచింది.ప్రపంచంలోని అత్యంత ప్రాచీనమైన, గొప్ప భాషలలో ఒకటైన "తెలుగు" భాషను గౌరవిస్తూ, గొప్ప తెలుగు కవి, వ్యవహారిక భాష శ్రీ గిడుగు వెంకట రామమూర్తి గారి పుట్టినరోజునాడు నాలుగు తెలుగు సంస్థలు - హరీష్ రెడ్డి (అధ్యక్షులు - TKS), శ్రీనివాస్ గద్దె (అధ్యక్షులు - TPS), నాగ లక్ష్మి (ఉపాధ్యక్షులు - TJQ), విక్రమ్ సుఖవాసి (ఆపద్ధర్మ అధ్యక్షులు - AKV) నాయకత్వంలో ఈ వేడుకను దిగ్విజయముగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి తెలుగు సంస్థల కార్యవర్గ సభ్యులతో పాటు, ఐసీసీ కార్యవర్గ సభ్యులు, తెలుగు భాషాభిమానులు, వర్ధమాన కవులు, తెలుగు పండితులు ఎంతో ఉత్సాహంగా హాజరయ్యారు. శాస్త్రీయ నృత్య ప్రదర్శనలతో, వివిధ కూరగాయలు, పండ్ల పేర్లను ఉపయోగించి అందమైన తెలుగు కథా కథనాలతో, వేమన పద్యాలు, తెలుగు పొడుపు కథలు/మెదడును చురుకుగా ఉంచే ఆటలతో, ఆశక్తికరమైన సంభాషణలతో తెలుగు భాషలో వారి సృజనాత్మకతను ప్రదర్శించారు. అంతేగాక, ప్రపంచ వేదికపై వివిధ రంగాలలో తెలుగు ప్రజల విజయాలు,వారి కృషిని గురించి కొనియాడారు. తెలుగు భాష పై నిర్వహించిన క్విజ్ అందరినీ అలరించింది.గిడుగు వెంకట రామమూర్తి గారి కవిత్వాన్ని, ఇంకా వారి గ్రామంలో కొనసాగుతున్న సంస్కృతిని వివరిస్తూ.. తాము ఆ గ్రామానికి చెందినవారమని ఒక ప్రేక్షకురాలు గర్వంగా చెప్పినప్పుడు కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులు అందరూ ఎంతగానో ఆనందించారు. ఈ కార్యక్రమం తెలుగు భాష గొప్పదనాన్ని చాటి చెప్పిన ఒక ప్రత్యేకమైన కార్యక్రమంగా పేర్కొనవచ్చు. ఈ కార్యక్రమంలో అత్యధిక యువత భాగస్వామ్యం కావడం విశేషం. దీన్ని బట్టి చూస్తే మన సంస్కృతి ప్రస్తుత తరానికి వారసత్వంగా అందుతోందని ఆశించటం అతిశయోక్తి కాదనిపించింది. ఇటువంటి కార్యక్రమాల ముఖ్య ఉద్దేశ్యం మాతృదేశానికి దూరంగా ఉంటున్న యువత తమ మూలాలను గుర్తించి గౌరవించడం అని తెలియ చేశారు.ఈ కార్యక్రమం ఐసిసి తెలుగు లిటరేచర్ క్లబ్, హెచ్ఆర్, అడ్మిన్ అండ్ కాన్సులర్ హెడ్ రాకేష్ వాఘ్ హృదయపూర్వక స్వాగత ప్రసంగంతో ప్రారంభమైంది. ఖతర్లో తెలుగు సమాజం తమ సంస్కృతిని నిరంతరం సజీవంగా ఉంచడంలో చేస్తున్న కృషిని ఆయన ప్రశంసించారు. ఐసిసి జనరల్ సెక్రటరీ అబ్రహం కె జోసెఫ్ తన అధ్యక్ష ప్రసంగంలో వివిధ వర్గాలు ఐక్యతను పెంపొందించడంలో భాష ప్రముఖమైన పాత్ర వహిస్తుందని నొక్కి చెప్పారు. ప్రపంచ స్థాయి కవులు, తత్వవేత్తలు, కళాకారులను తయారుచేసే తెలుగు వారసత్వాన్ని ఆయన ప్రశంసించారు. అలాగే వారి రచనలు తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటాయన్నారు.ఐసిసి అనుబంధ విభాగాధిపతి రవీంద్ర ప్రసాద్, ఐసిసి అంతర్గత కార్యకలాపాల విభాగాధిపతి వెంకప్ప భాగవతుల ప్రత్యేక అభినందన ప్రసంగాలు చేశారు. సాహిత్యంలో మాట్లాడే మాండలికాన్ని ఉపయోగించడం కోసం ఉద్యమానికి మార్గదర్శకత్వం వహించిన ప్రముఖ తెలుగు రచయిత, సామాజిక సంస్కర్త గిడుగు వెంకట రామమూర్తి జన్మదినాన్ని స్మరించుకునే తెలుగు భాషా దినోత్సవం శాశ్వత వారసత్వాన్ని, తెలుగు సాహిత్య సాంస్కృతిక సంపదను ప్రవాసులలోని పిల్లలు, యువతకు అందించాల్సిన అవసరాన్ని వారు నొక్కి చెప్పారు. ఈ కార్యక్రమాన్ని చక్కగా ముందుకు నడిపించిన సౌమ్య, శిరీష, హారిక, నాగలక్ష్మి గార్లకు ఐ సి సి నాలుగు తెలుగు సంస్థల తరపున అభినందనలు తెలియజేశారు.(చదవండి: వర్జీనియాలో అంగరంగ వైభవంగా గ్లోబల్ మున్నూరు కాపు అసోసియేషన్ మహాసభ) -
కీర్తనలు, భజనలతో సంస్కృతి రక్షణ
మారిషస్ తెలుగువారికి వక్తల ప్రశంసలు తెలుగు భాషా బ్రహ్మోత్సవాల ముగింపు పోర్ట్ లూయిస్: భారతదేశంలో కీర్తనలు, భజనలు మరిచిపోతున్న ఈ రోజుల్లో వాటి ద్వారానే భాషను, సంస్కృతిని కాపాడుకుంటున్న ఘనత మారిషస్ తెలుగు ప్రజలదేనని వాసిరెడ్డి అమర్నాథ్ అన్నారు. మహాత్మాగాంధీ మూకా వారి ఆధ్వర్యంలో ఆంధ్ర మహాసభ ఈ 27న ప్రారంభించిన తెలుగు భాషా బ్రహ్మోత్సవ కార్యక్రమాలు శనివారం ఘనంగా ముగిశాయి. మారిషస్ ఒక మినీ ఇండియా అయినా ఇక్కడ కులాల ప్రస్తావన మచ్చుకైనా కనిపించని తెలుగు జాతిని చూశానని అమర్నాథ్ పేర్కొన్నారు. మొదటగా గిడుగు రామ్మూర్తి పంతులు చిత్రపటానికి పూలమాల వేసి, మా తెలుగు తల్లికి మల్లెపూదండ గీతాలాపనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 150కు పైగా పాఠశాలల్లో విద్యార్థులకు పోటీలను నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలుగు రాష్ట్రాల విద్యావేత్త, స్లేట్ స్కూలు వ్యవస్థాపకుడు వాసిరెడ్డి అమర్నాథ్ రెడ్డిని మారిషస్ కేంద్రమంత్రి శాంతారామ్ సన్మానించారు. మంత్రి శాంతారామ్ మాట్లాడుతూ.. వాసిరెడ్డి అమర్నాథ్ మారిషస్ విద్యావ్యవస్థలో తీసుకురావాల్సిన మార్పులను సూచించారని, వాటిని మనం తప్పకుండా ఆచరిస్తామని చెప్పారు. స్లేట్ ద స్కూల్ ఆధ్వర్యంలో చేపట్టిన స్టూడెంట్ ఎక్చేంజ్ కార్యక్రమానికి విధివిధానాలను రూపొందిస్తామన్నారు. తెలుగు సంఘం అధ్యక్షుడు శ్రీరామస్వామి, మహాత్మాగాంధీ సంస్థ, రవీంద్రనాథ్ ఠాగూర్ సంస్థల డైరెక్టర్ గయన్, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
మారిషస్ లో తెలుగు భాషా బ్రహ్మోత్సవాలు
పోర్ట్ లూయిస్: మహాత్మాగాంధీ మూకా వారి ఆధ్వర్యంలో మారిషస్ ఆంధ్ర మహాసభ వారు ఈ 27, 28, 29 తేదీలలో తెలుగు భాషా బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాలలో భాగంగా ఈరోజు తెలుగు భాషా బోధన, పిల్లల్లో తెలుగు భాషాపై ఇష్టాన్ని పెంచడానికి ఒక వర్క్షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రముఖ విద్యావేత్త, స్లేట్ ద స్కూల్ వ్యవస్థాపకులు వాసిరెడ్డి అమర్నాథ్ మట్లాడుతూ.. ఇక్కడి తెలుగు ప్రజలు, తెలుగు సంస్కృతిని ఏళ్ల తరబడి సజీవంగా కాపాడుతూ వస్తున్నారని పేర్కొన్నారు. తెలుగు భాషాభివృద్ధి, సంస్కృతిని కాపాడటానికి ఆయన చేసిన కృషిని గుర్తించిన మారిషస్ తెలుగు మహాసభ వారు 'మారిషస్ తెలుగు మిత్ర' అన్న బిరుదునిచ్చి అమర్నాథ్ గారిని ఈ సందర్భంగా సత్కరించారు. బాలబాలికలు దీన్ని గర్వపడాల్సిన విషయంగా చూడాలని, కానీ వాళ్లు తెలుగులో మాట్లాడటానికి, భాష నేర్చుకోవడాన్ని ఇబ్బందిగా ఫీలవుతున్నారని వ్యాఖ్యానించారు. ఇక్కడి నుంచి ఎంపిక చేసిన కొందరు విద్యార్థులను హైదరాబాద్, తెలుగు రాష్ట్రాలలోని మరికొన్ని ప్రాంతాలకు తీసుకెళ్లి 20 రోజుల పాటు వారికి తెలుగు భాషపై అవగాహన పెంచి, అనర్గళంగా మాట్లాడేటట్లు చేస్తామని చెప్పారు. ఇందుకై ప్రయాణ ఖర్చులు విద్యార్థులు భరిస్తే, వసతి, బస తాను ఏర్పాటు చేస్తానని ఆయన తెలిపారు.