breaking news
Sri Padmavati Mahila Visvavidyalayam
-
తిరుపతిలో లా విద్యార్థిని ఆత్మహత్య
సాక్షి, తిరుపతి: తిరుపతిలో ఎల్ఎల్బీ చదువుతున్న విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది. వైఎస్సార్ జిల్లాకు చెందిన సుష్మిత, తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో లా చదువుతుంది. తిరుపతిలోని ప్రైవేటు హాస్టల్లో ఉంటున్న సుష్మిత గురువారం హాస్టల్ గదిలోనే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సుష్మిత ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సుష్మిత మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. కాగా, ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఎన్ఆర్ఐ విద్యార్థులకు ఎస్పీఎంవీవీ సర్టిఫికెట్లు
డల్లాస్: వంది మంది ఎన్ఆర్ఐ విద్యార్థులకు శ్రీ పద్మావతి విశ్వవిద్యాలయం(ఎస్పీఎంవీవీ) మ్యూజిక్ కోర్సు సర్టిఫికెట్లను ప్రదానం చేసింది. ఎస్పీఎంవీవీ సహకారంతో ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) ఆధ్వర్యంలో అమెరికాలో క్లాసికల్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ కోర్సులను గత సంవత్సరం ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా శ్రీ పద్మావతి విశ్వవిద్యాలయ వైస్చాన్స్లర్, ప్రొఫెసర్ వి. దుర్గా భవానితో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమాన్ని టెక్సాస్లో ప్లానోలోని మినర్వా హోటల్లో తానా సభ్యులు నిర్వహించారు. సుస్వర మ్యూజిక్ అకాడమీకి చెందిన విద్యార్థులు ఆలపించిన మధురమైన గీతాలు అందిరిని ఆకట్టుకున్నాయి. తానా, ఎస్పీఎంవీవీ సహాకారంతో అందిస్తున్న కల్చరల్ డ్యాన్స్, మ్యూజిక్ కోర్సులను నేర్చుకోవడం వల్ల విద్యార్థులకు కలిగే ప్రయోజనాలను డా. ప్రసాద్ తోటకూర వివరించారు. ఈ సందర్భంగా మ్యూజిక్ కోర్సులను విజయవంతంగా పూర్తిచేసిన 100 మంది విద్యార్థులకు ప్రొఫెసర్ భవాని సర్టిఫికేట్స్ను అందజేశారు. కార్యక్రమానికి హాజరైన విద్యార్థులు, వారి తల్లీతండ్రులను ఉద్దేశించి భవాని మాట్లాడారు. విజయవంతంగా కోర్సులను పూర్తి చేసిన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తానా డల్లాస్ ప్రాంతీయ ప్రతినిధి సుగన్ చాగర్లమూడి, తానా కల్చరల్ సర్వీసెస్ కోఆర్డినేటర్, తానా ఎస్పీఎంవీవీ డ్యాన్స్ కోర్సుల నేషనల్ కోఆర్డినేటర్ డా. రాజేష్ అడుసుమిల్లి, తానా-ఎస్పీఎంవీవీ మ్యూజిక్ కోర్సుల నేషనల్ కోఆర్డినేటర్ అనిపింది మీనాక్షి, తానా బోర్డ్ చైర్పర్సన్ చల కొండ్రకుంట, ప్రముఖ డ్యాన్స్ గురు కళారత్న సత్యనారాయణలు పాల్గొన్నారు. -
ఎన్నారై విద్యార్థులకు తానా సంగీతం కోర్సులు
డల్లాస్, టెక్సాస్: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా), శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం అనుసంధానంతో సంగీతంలో అడ్వాన్స్డ్ డిప్లొమా కోర్సులు ప్రారంభించింది. తానా అధ్యక్షులు డాక్టర్ జంపాల చౌదరి ఆ వివరాలను ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మన సంస్కృతీ సంప్రదాయాలను పెంపొందించేందుకు తానా తీసుకున్న మరో మెట్టు ఇది. ఎంతో శ్రమించి పద్మావతి మహిళా విశ్వవిద్యాలయ అధికారులతో చర్చలు జరిపి ఈ కార్యక్రమం రూపుదాల్చడంలో కృషిచేసిన తానా పూర్వాధ్యక్షులు డాక్టర్ ప్రసాద్ తోటకూర, విశ్వవిద్యాలయ అధికారులకు జంపాల చౌదరి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తానా ఇంటర్నేషనల్ ఎడ్యుకేషనల్ అఫిలియేషన్ ఛైర్మన్ డాక్టర్ ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ.. “ఆంధ్రప్రదేశ్ పూర్వ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ చేతుల మీదుగా ప్రారంభమైన శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంతో తానా సంగీత కోర్సులు ప్రారంభించడం తానా చరిత్ర లో ఒక మైలు రాయి. ఈ వర్సిటీ రూపొందించిన సంగీత పాఠ్య ప్రణాళికను విద్యార్థులు పాటిస్తే, ఇక్కడే పరీక్షలు రాసి, అన్ని స్థాయిలు పూర్తి చేసిన తరువాత వర్సిటీ డిప్లొమా సర్టిఫికెట్స్ పొందవచ్చు. అమెరికా సంగీత ప్రియులు తమ ప్రతిభా పాఠవాలను పరీక్షించుకోవాలనే దీర్ఘకాలిక కలను సాకారం చేసినందుకు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ వి.దుర్గాభవానీ, డీన్ ప్రొఫెసర్ డి.శారద, వర్సిటీ సిబ్బంది నా ప్రత్యేక ధన్యవాదాలు. మీనాక్షి అనిపిండి.. పద్మావతి వర్సీటీ నుంచి సంగీతంలో బంగారు పతకంతో పట్టభద్రులయ్యారని, అమెరికాలో ఉన్న గొప్ప సంగీత విద్వాంసులలో ఒకరని కొనియాడారు. ఎన్నారై విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సంగీతం కోర్సుల్లో వెంటనే నమోదు కావల్సినదిగా విజ్ఞప్తి చేస్తున్నానని” చెప్పారు. తానా నేషనల్ మ్యూజిక్ కోఆర్డినేటర్ మీనాక్షి అనిపిండి మాట్లాడుతూ “ సంగీత కోర్సుల్లో నమోదు చేసుకోవడం ద్వారా ఎన్నారై స్టూడెంట్స్ భారత్కు వెళ్లకుండానే ఇక్కడే పరీక్షలు వ్రాసి, డిప్లొమా సర్టిఫికెట్స్ పొందడానికి గొప్ప అవకాశం. లెవెల్ 1, లెవెల్ 2 కోర్సులకు వెంటనే అప్లై చేసుకోవాలనిని సంగీత విద్యార్థులను ప్రోత్సహించవలసిందిగా ఉత్తర అమెరికాలోని తల్లిదండ్రులను, సంగీత ఉపాధ్యాయులను అభ్యర్ధిస్తున్నాను. తానా సంస్థతోను, తానా మాజీ అధ్యక్షులు డాక్టర్ ప్రసాద్ తోటకూరతో కలిసి పనిచేయడం నాకు ఎంతో ఆనందదాయకమని” చెప్పారు. డల్లాస్ లో తానా నిర్వహించిన “సంగీత కోర్సుల” నమోదు కార్యక్రమంలో వందకు పైగా విద్యార్థులు పాల్గొని, ఎంతో ఉత్సాహభరితంగా లెవెల్ 1 మరియు లెవెల్ 2 లో నమోదయ్యారు. ఉత్తర అమెరికా లో నివసిస్తున్న ఆసక్తి గల విద్యార్థులెవరైనా మార్చి 20, 2017 లోగా ఈ కోర్సుల్లో నమోదు కావచ్చు. ప్రసాద్ తోటకూర, మీనాక్షి అనిపిండి ఓ ప్రకటనలో ఈ క్రింది వివరాలు వెల్లడించారు. అకాడమిక్ మ్యూజిక్ ప్రోగ్రామ్స్: Level 1 – Diploma in Introductory Music Level 2 – Diploma in Music Level 3 – Diploma in Music Level 4 – Advanced Diploma in Music ప్రస్తుతం, విద్యార్థులు లెవెల్ 1 మరియు లెవెల్ 2 సంగీతం కోర్సుల్లో నమోదు కావచ్చు. ఒక్కో లెవెల్ కు 12 క్రెడిట్స్ ఇస్తుంది. పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం నుండి విద్యార్థులు అందుకున్న డిప్లొమాలు ఎన్నారై విద్యార్థులకు అదనపు విద్యా కార్యక్రమంగా భావిస్తారు. అమెరికాలోని కొన్ని విశ్వవిద్యాలయాలు ఈ క్రెడిట్స్ ను గుర్తించవచ్చు. మేము వారు దరఖాస్తు చేసినప్పుడు వారి సంబంధిత అధికారులతో తనిఖీ చేసుకోవాలని విద్యార్థులను సూచిస్తున్నాము. విద్యార్థులు ఉత్తర అమెరికాలో ఎక్కడనుంచి అయినా ఏ సంగీత ఉపాధ్యాయుల నుంచి అయినా సంగీతం నేర్చుకోవచ్చు. ఈ సంగీత కోర్సుల్లో నమోదుకు కనీస వయసు 10 సంవత్సరాలు కాగా, విద్యార్థినులు మాత్రమే నమోదు కాగలరు. పరీక్షా ఫీజుతో కలిపి ఒక్కో లెవెల్ కు ఫీజు 300 డాలర్లు మాత్రమే. లెవెల్ 1, 2, 3 చివర్లో విద్యార్థుల నైపుణ్యతను తానా నేషనల్ మ్యూజిక్ కోఆర్డినేటర్, వారి బృందం కలిసి నిర్ణయిస్తారు. లెవెల్ 4కు విశ్వవిద్యాలయ అధికారులు వ్యక్తిగతంగా సమీక్షించి థియరీ అండ్ ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తారు. విద్యార్థులకు డిప్లొమాలను అమెరికాలో ఒక అధికారిక స్నాతకోత్సవంలో బహుకరిస్తారు. ప్రతి లెవెల్ లో ఉత్తీర్ణులు అవ్వడానికి కనీసం 45% మార్కులు సాధించాలి. 70 శాతం సాధిస్తే "డిస్టింక్షన్" గా పరిగణిస్తారు. దయచేసి నమోదు ఫారం కోసం www.tana.org ను సందర్శించి పేర్కొన్న విధంగా ప్రక్రియను పూర్తి చేయాలి. మరిన్ని వివరాలకు: www.tana.org ను సందర్శించండి లేదా: మీనాక్షి అనిపిండి, తానా నేషనల్ మ్యూజిక్ కోఆర్డినేటర్ tanamusiccoordinator@gmail.com, డాక్టర్ ప్రసాద్ తోటకూర, ఛైర్మన్- తానా ఇంటర్నేషనల్ ఎడ్యుకేషనల్ అఫిలియేషన్ 817-300-4747, లేదా tanaieachair@gmail.com, డాక్టర్ జంపాల చౌదరి, తానా అధ్యక్షులు- 937-475-7809 లేదా president@tana.org ఫోన్ నెంబర్లలో గానీ, మెయిల్స్ లోగానీ సంప్రదించగలరు. ఈ కార్యక్రమంలో పాల్గొని అధిక సంఖ్యలో నమోదయిన విద్యార్థులకు, పద్మావతి మహిళా విశ్వవిద్యాలయానికి, టచ్ నైన్ రెస్టారెంట్ యాజమాన్యానికి, మీడియా వారికి తానా ప్రాంతీయ ప్రతినిధి శ్రీకాంత్ పోలవరపు, తానా సంయుక్త కోశాధికారి డాక్టర్ రాజేష్ అడుసుమిల్లి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. -
పద్మావతి వర్సిటీలో బయోమెట్రిక్ విధానం
యూనివర్సిటీ క్యాంపస్(తిరుపతి): తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన బయోమెట్రిక్ విధానాన్ని వీసీ రత్నకుమారి గురువారం ప్రారంభించారు. ర్యాగింగ్ కారణంగా నాగార్జున విశ్వవిద్యాలయంలో రుషితేశ్వరి ఆత్మహత్యతో రాష్ట్రంలోని అన్ని వర్సిటీల్లో బయోమెట్రిక్ విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు మహిళా వర్సిటీ అధికారులు ఈ విధానాన్ని ఏర్పాటు చేశారు. అన్ని వసతి గృహాల్లో సీసీ కెమెరాలు, బయోమెట్రిక్ పరికరాలు ఏర్పాటు చేయడమేగాక విద్యార్థులకు ఎలక్ట్రానిక్ ఐడెంటిటీ కార్డులు మంజూరు చేశారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ.. విద్యార్థులు వసతి గృహంలోకి వెళ్లేటప్పుడు, బయటకు వచ్చేటప్పుడు వేలిముద్రల ద్వారా హాజరు నమోదు చేసుకోవాలన్నారు. సర్వర్ రిమోట్ ద్వారా దీన్ని అనుసంధానం చేసినట్లు వివరించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ పి.విజయలక్ష్మి, వార్డెన్ పి.వాణి పాల్గొన్నారు. -
భవనం పైనుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్య
తిరుపతి (చిత్తూరు) : కాలేజీ భవనం పైనుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన శుక్రవారం తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. నగరంలోని బాలాజీ కాలనీకి చెందిన హిందూసా(18) పద్మావతి విశ్వవిద్యాలయంలో ఒకేషనల్ డిగ్రీ కోర్సు రెండవ ఏడాది చదువుతుంది. కాగా హిందుసా చిన్నప్పటి నుంచి మానసిక వ్యాధితో బాధపడుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే శుక్రవారం మధ్యాహ్నం స్నేహితులతో కలిసి భోజనం చేసిన అనంతరం కాలేజీ భవనం పైకి ఎక్కి అమాంతం దూకేసింది. ఇది గమనించిన తోటి విద్యార్థులు వెంటనే ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ఆమె మృతి చెందింది. విషయం తెలిసిన పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.