దానవులకు శుక్రాచార్యుని శాపం!
దానవులకు శుక్రాచార్యుని శాపందేవ దానవ యుద్ధంలో దానవులు ఓటమి పాలయ్యారు. ఇంద్రుడికి త్రిలోకాధిపత్యం తిరిగి వచ్చింది. శుక్రాచార్యుడు దేవతల పక్షంలోకి చేరాడు. అది చూసి రాక్షసులు కలవరపడ్డారు. ‘ఆచార్యా! మమ్మల్ని వదిలి నువ్వు వెళ్లిపోతే, మేము దిక్కుకానని వాళ్లమవుతాము’ అని మొరపెట్టుకున్నారు.శుక్రాచార్యుడు రాక్షసుల మొరను ఆలకించి, ‘ఓషధులు, మంత్రాలు నా వద్దనే ఉంటాయి. వాటిలో నాలుగో వంతు దేవతలకు చెందితే చెందవచ్చుగాక. మిగిలిన సర్వస్వాన్నీ మీకు ఇస్తాను’ అని వారికి చెప్పాడు.దేవతలు ఈ రహస్యాన్ని తెలుసుకుని, కనిపించిన రాక్షసులనల్లా తుదముట్టించడం ప్రారంభించారు. రాక్షసులు శుక్రాచార్యుడిని శరణు వేడుకున్నారు. శుక్రుడు దేవతల వద్దకు వెళ్లి, ‘పన్నెండు సంగ్రామాలలో రాక్షసులు ఎందరో హతులయ్యారు. ఇకనైనా మీరు పగను విడిచిపెట్టి, మిగిలిన రాక్షసులను బతకనివ్వండి’ అని చెప్పాడు.తర్వాత రాక్షసులతో రహస్యంగా సమావేశమై, ‘నేను శంకరుడి గురించి తపస్సు చేసి, మంత్రశక్తులను సంపాదించుకుని వస్తాను. అప్పుడు మీకు జయం కలుగుతుంది. అప్పటి వరకు నా తండ్రి భృగు మహర్షి ఆశ్రమంలో మీరంతా తలదాచుకోండి’ అని చెప్పి, తపస్సు చేసుకోవడానికి అడవులకు వెళ్లాడు.శుక్రాచార్యుడు తపస్సు చేస్తుండగా, శంకరుడు ప్రత్యక్షమయ్యాడు. ‘శుక్రా! నువ్వు తలకిందులుగా తపస్సు చేయి. అప్పుడే నీకు మంత్రాలన్నీ వశమవుతాయి’ అని చెప్పాడు.శుక్రాచార్యుడు ఘోరనిష్ఠతో శంకరుడు చెప్పిన ప్రకారమే తలకిందులుగా ఒక చెట్టుకు వేలాడుతూ తపస్సు చేయడం ప్రారంభించాడు.శుక్రుడు తపస్సు చేస్తున్న సంగతి తెలుసుకున్న దేవతలు రాక్షసుల మీదకు దండయాత్రకు బయలుదేరారు. దిక్కుతోచని రాక్షసులంతా శుక్రాచార్యుడి తల్లిని శరణు కోరారు.‘భయపడకండి. మీరు నా వద్దనే ఉండండి. మీకు ఏ భయం ఉండదు’ అని ఆమె అభయమిచ్చింది.అయినా, దేవతలు రాక్షసులను తరుముతూ వారిని పీడించసాగారు.దేవతల దుశ్చర్యకు కుపితురాలైన శుక్రమాత ‘మూర్ఖులారా! ఇంద్రుడితో సహా మిమ్మల్నందరినీ మట్టుపెట్టగలను’ అని హెచ్చరించి, తన యోగశక్తితో ఇంద్రుడి కాళ్లు చేతులు పనిచేయకుండా స్తంభింపజేసింది. ఇంద్రుడి పరిస్థితి చూసి, దేవతలు పరుగులు తీశారు. విష్ణువు తనలో ప్రవేశించమని ఇంద్రుడికి చెప్పాడు. శుక్రమాత ‘నిన్ను కూడా దహించివేస్తాను’ అని విష్ణువును హెచ్చరించింది. ఆమె శక్తిని తట్టుకోవడం దుస్సాధ్యమని తలచిన విష్ణువు, స్త్రీవధ కూడదని తెలిసినా, కత్తి దూసి ఆమె శిరస్సును ఖండించాడు.ఇదంతా తెలిసిన భృగు మహర్షి, నువ్వు ఏడు జన్మలు మనిషిగా జన్మిస్తావు’ అని విష్ణువును శపించాడు. తన భార్య శిరస్సును మొండేనికి తగిలించి, తన తపశ్శక్తితో ఆమెను తిరిగి బతికించాడు. ఇంద్రుడు, విష్ణువు సహా దేవతలంతా అక్కడి నుంచి వెనుదిరిగారు.శుక్రుడిని ఏం చేయాలో పాలుపోని ఇంద్రుడు తన కుమార్తె జయంతిని పిలిచి, ‘కుమారీ! శుక్రుడు ఘోర తపస్సు చేస్తున్నాడు. నాతో సహా దేవతలంతా అతడికి భయపడుతున్నారు. నువ్వు వెళ్లి, నీ సపర్యలతో అతడిని వశం చేసుకుంటే, నాకు అంతకంటే కావలసినది లేదు. నేను నిన్ను అతడికి ఇచ్చివేస్తున్నాను’ అని చెప్పాడు.తండ్రి ఆజ్ఞ మేరకు జయంతి శుక్రుడు తపస్సు సాగిస్తున్న చోటుకు చేరుకుంది. అతడికి సపర్యలు చేస్తూ, ఏళ్ల తరబడి ఓర్పుగా ఉంది. కొన్నాళ్లకు శుక్రుడి తపస్సు ఫలించి, శంకరుడు అతడికి ప్రత్యక్షమై మంత్ర శక్తులన్నీ అనుగ్రహించాడు.అన్ని రోజూలూ తనకు సపర్యలు చేస్తూ వచ్చిన జయంతిని చూసి, శుక్రుడు ఆమె వివరాలు కనుక్కున్నాడు. ఆమె కోరిక మేరకు పాణిగ్రహణం చేసి, ఆమెను ఏకాంత ప్రదేశానికి తీసుకుపోయి, అదృశ్యరూపంలో ఆమెతో గడపసాగాడు. శుక్రుడు జయంతితో ఉన్న సంగతి తెలుసుకున్న దేవగురువు బృహస్పతి ఇంద్రుడి ప్రోద్బలంతో తానే శుక్రుడి రూపం దాల్చి, రాక్షసుల వద్దకు వెళ్లాడు. ఆచార్యుడు తిరిగి వచ్చినట్లు భావించిన రాక్షసులు అతడిని పూజించసాగారు.జయంతితో అప్పటికే పదేళ్లు గడిపిన శుక్రాచారుడు తన శిష్యులైన రాక్షసులతో యజ్ఞం జరిపించాలని తలచి, తన ఆశ్రమానికి వచ్చాడు. అక్కడ తన స్థానంలో తనలా ఉన్న బృహస్పతిని రాక్షసులు సేవిస్తుండటం చూసి, పట్టరాని ఆగ్రహంతో ‘మీరు మతిభ్రష్టులై సంచరించెదరుగాక’ అని శపించాడు.అసలు సంగతి గ్రహించిన రాక్షసులు శుక్రాచార్యుని పాదాలపై పడి పరిపరి విధాలుగా ప్రార్థించడంతో అతడు కొంత శాంతించాడు. ‘ఇప్పుడు దేవతలకు అనుకూలమైన కాలం. భవిష్యత్తులో ముల్లోకాలూ తిరిగి మీ వశం కాగలవు’ అని పలికాడు.పురావిశేషం..అసుర గురుడైన శుక్రాచార్యుడికి అరుదైన ఆలయం మహారాష్ట్రలో ఉంది. పురాతనమైన ఈ ఆలయం బేట్ కోపర్గాంవ్ గ్రామంలో గోదావరి తీరానికి చేరువలో ఉంది. ఇక్కడ పూజలు జరిపితే శుక్రాచార్యుడి అనుగ్రహం వల్ల పెళ్లికాని వారికి పెళ్లిళ్లు జరుగుతాయని భక్తుల నమ్మకం. ఇదేచోట శుక్రాచార్యుడు శివుడి గురించి తపస్సు చేసి, మృత సంజీవని విద్య పొందాడని ప్రతీతి. ఈ ఆలయంలో శుక్రాచార్యుడికి పాయసం, కోవా మిఠాయిలు, పటికబెల్లం నైవేద్యంగా సమర్పిస్తారు. - సాంఖ్యాయన