breaking news
Sarad yadav
-
గుర్తు కోసం మళ్లీ ఈసీ చెంతకు శరద్
సాక్షి,న్యూఢిల్లీః పార్టీ గుర్తు కోసం జేడీ(యూ) శరద్ యాదవ్ వర్గం ఎన్నికల కమిషన్కు మరోసారి విజ్ఞప్తి చేసింది. సంబంధిత పత్రాలను సమర్పించేందుకు నాలుగు వారాల గడువు కోరింది. గతంలో తమ క్లెయిమ్ను బలపరిచే పత్రాలు లేకపోవడంతో ఈసీ ఆయన వినతిని తోసిపుచ్చింది. శరద్ యాదవ్ సన్నిహితుడు అరుణ్ కుమార్ శ్రీవాత్సవ్ ఈ వివరాలు వెల్లడించారు. పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశం ఆదివారం ఢిల్లీలో నిర్వహిస్తామన్నారు. పార్టీలో శరద్ యాదవ్ పట్టును ఈ వేదిక నిరూపిస్తుందని, వచ్చే నెల 8న పార్టీ జాతీయ కౌన్సిల్ సమావేశం జరుగుతుందన్నారు. పలు పార్టీ రాష్ర్ట శాఖలు శరద్ యాదవ్ నేతృత్వంపై విశ్వాసం వ్యక్తం చేశాయని చెప్పారు. -
విభజనకు ఓకే!
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన, ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు తనకు సమ్మతమేనని కాంగ్రెస్ అగ్రనేతలకు టీడీపీ అధ్యక్షుడు చంద్ర బాబు స్పష్టం చేశారు. తెలంగాణకు అనకూలంగా తాను గతంలో రాసిన లేఖకు కట్టుబడి ఉంటానని కూడా వారికి చెప్పారు! విభజన ప్రక్రియలో కాంగ్రెస్కు పూర్తిగా సహకరిస్తానంటూ ఆదివారం ఢిల్లీ పెద్దలకు హామీ ఇచ్చారు. కాకపోతే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను మరికొంత కాలం పాటు ఆలస్యం చేయాలని వారిని కోరారు. ‘విభజనకు వ్యతిరేకంగా సీమాంధ్రలో వెల్లువెత్తుతున్న ఆందోళనలు, భావోద్వేగాలు చల్లారేందుకు మీవంతుగా ఏవో కంటితుడుపు చర్యలు చేపట్టండి. తర్వాత ఏం చేయాలో నాకొదిలేయండి’ అని చెప్పుకొచ్చారు! మరోవైపు బాబు తన హస్తిన యాత్రకు అసలు లక్ష్యమైన ‘ఆపరేషన్ జగన్’ను వరుసగా రెండో రోజూ కొనసాగించారు. కాంగ్రెస్ను నోటితో మాత్రం తిడుతూ, చీకట్లో ఆ పార్టీతో అన్ని విషయాల్లోనూ చేతులు కలిపే తంత్రాన్ని కూడా యథావిధిగా పూర్తిస్థాయిలో ప్రదర్శించి అందరికీ వినోదం పంచారు! రాష్ట్రం అగ్నిగుండం కావడానికి కాంగ్రెసే కారణమంటూ పైకి విలేకరుల సమావేశంలో దునుమాడిన బాబు, లోలోపల మాత్రం కాంగ్రెస్ పెద్దలతో జోరుగా బేరసారాలు సాగించారు. ‘వైఎస్సార్సీపీ అధినేత బయటికొస్తే మీకూ (కాంగ్రెస్కు), మాకూ ఇబ్బందే. మన రెండు పార్టీలకూ ఆంధ్రప్రదేశ్లో పుట్టగతులుండవు. కాబట్టి ఏదో ఒకటి చేసి ఆయనకు బెయిల్ రాకుండా మరికొంతకాలం అడ్డుకోండి. బదులుగా మీకు నేను కొన్నేళ్లుగా ఇస్తూ వస్తున్న మద్దతును ఇకపై కూడా యథాతథంగా కొనసాగిస్తాను’ అంటూ వారికి ప్రతిపాదించారు. ఒకవైపు ఇదంతా చేస్తూనే, మరోవైపు ఎందుకైనా మంచిదనే ‘ముందుచూపు’తో బీజేపీని దువ్వే ప్రయత్నాలకు కూడా బాబు పదును పెంచారు. ఆదివారం ఒక ప్రముఖ ఆంగ్ల చానల్తో మాట్లాడిన ఆయన, బీజేపీతో టీడీపీ చేతులు కలపనుందా అని ప్రశ్నించగా ఆ అవకాశాలను ఎంతమాత్రమూ తోసిపుచ్చలేదు! మరోవైపు జేడీ(యూ), సీపీఎం, సీపీఐ అగ్ర నేతలతోనూ ఆదివారం భేటీలు జరిపారు. తద్వారా మూడో ఫ్రంట్ ‘సావకాశాలను’ కూడా బేరీజు వేసుకుంటూ గడిపారు. అయితే బీజేపీతో దోస్తీ యత్నాలపై సదరు నేతలు బాబును కాస్త గట్టిగానే కడిగేసినట్టు సమాచారం! రాహుల్ దూతలతో బాబు భేటీలు: రాహుల్గాంధీకి అత్యంత సన్నిహితుడైన ఒక కాంగ్రెస్ నేతతో ఆదివారం ఉదయం బాబు అల్పాహారపు భేటీ జరిపినట్టు విశ్వసనీయంగా తెలిసింది. రాహుల్ కోర్ బృందం సభ్యునిగా ఇటీవలే పదోన్నతి పొందిన సదరు నేతతో గంటకు పైగా బాబు మంతనాలు సాగించారు. జగన్ను వీలైనంత కాలం జైల్లోనే ఉంచాల్సిందిగా ఆయన ద్వారా రాహుల్కు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చగలిగిన సంఖ్యాబలం ఉండి కూడా అలా చేయకపోగా, కొన్నేళ్లుగా దానికి అన్ని విషయాల్లోనూ తానెలా అండాదండగా ఉంటున్నదీ గుర్తు చేశారు. దాంతోపాటు ఇటీవలే ఆంధ్రప్రదేశ్లో పర్యటించి వెళ్లిన రాహుల్ రాజకీయ సలహాదారుతో కూడా బాబు చర్చలు జరిపారు. సీమాంధ్రకు చెందిన ఇద్దరు కాంగ్రెస్ ఎంపీలే ఈ భేటీని కుదిర్చినట్టు తెలిసింది. ఆయనతో కూడా జగన్, తెలంగాణ అంశాలపైనే బాబు సుదీర్ఘంగా చర్చించారు. వీరితో పాటు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్సింగ్తో శనివారం రాత్రి పొద్దుపోయాక, కేంద్ర ఆర్థిక మంత్రి పి.చిదంబరంతో ఆదివారం ఉదయం బాబు ఫోన్ మంతనాలు సాగించారు. బీజేపీ అధ్యక్షుడు రాజ్నాథ్సింగ్తో తన భేటీకి ఎలాంటి ప్రాధాన్యతా లేదని వారికి ఆయన వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేసినట్టు తెలిసింది. బీజేపీతో చేతులు కలపాలని టీడీపీ నేతల్లో పలువురి నుంచి తీవ్రంగా తనపై ఒత్తిళ్లు వస్తున్నాయని బాబు అంగీకరించినట్టు సమాచారం. కానీ తాను మాత్రం ఆ పార్టీతో ఎలాంటి ముందస్తు పొత్తులూ పెట్టుకోబోనని నమ్మబలికారంటున్నారు. ‘జగన్’పై జోక్యముండబోదన్న శరద్ యాదవ్ జేడీ(యూ) అధినేత శరద్ యాదవ్, సీపీఎం ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్, సీపీఐ అగ్రనేత ఏబీ బర్ధన్లతో ఆదివారం బాబు భేటీ అయ్యారు. అయితే వైఎస్ జగన్మోహన్రెడ్డి బెయిల్ను అడ్డుకునే ప్రయత్నాలకు మద్దతివ్వాలని శరద్ యాదవ్ను కోరిన బాబుకు ఆయన చేతిలో చేదు అనుభవం ఎదురైంది. జగన్ అంశంలో తమ పార్టీ ఎలాంటి జోక్యమూ చేసుకోబోదని బాబు ముఖమ్మీదే శరద్ యాదవ్ కుండబద్దలు కొట్టారు. దానిపై నిర్ణయం తీసుకోవాల్సింది కోర్టులేనని స్పష్టం చేశారు. అంతేగాక ‘రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న సంక్షోభానికి కాంగ్రెస్ పార్టీ, విభజనకు అనుకూలంగా వైఖరి ప్రకటించిన పార్టీలదే బాధ్యత’ అని ఈ విషయంలో టీడీపీ వైఖరిని కూడా ఆయన పరోక్షంగా తప్పుబట్టారని తెలిసింది. సమస్యను చక్కదిద్దే బాధ్యత కూడా వాటిపైనే ఉందని చెప్పారంటున్నారు. మరోవైపు ఎన్డీఏకు, బీజేపీకి దగ్గరయ్యేందుకు బాబు చేస్తున్న ప్రయత్నాలను శరద్తో పాటు కారత్, బర్ధన్ తదితరులు ఆయనతోనే అన్యాపదేశంగా ప్రస్తావించారు. ‘ముందుగా మీ ప్రాథమ్యాలను సరిచూసుకోండి’ అంటూ వారు స్పష్టం చేసినట్టు కూడా తెలిసింది. -
రాష్ట్రంలో ఉద్రిక్తతలపై శరద్యాదవ్ ఆవేదన
న్యూఢిల్లీ: రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై జెడియు నేత శరద్యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ రోజు శరద్యాదవ్తో సమావేశమయ్యారు. కాంగ్రెస్ పార్టీ తన రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని ముక్కలు చేసిందని చంద్రబాబు శరద్యాదవ్కు వివరించారు. విభజన అనంతరం దిగ్విజయ్ సింగ్ టీఆర్ఎస్ విలీనం గురించి మాట్లాడడాన్ని గుర్తు చేశారు. ఒకప్పుడు మిగతా రాష్ట్రాలతో పోల్చితే అగ్రగామిగా ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఉద్రిక్తతలు చోటుచేసుకోవడం బాధాకరం అని శరద్యాదవ్ అన్నారు. -
రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు తీర్పును తప్పుబట్టిన ఎంపీలు
న్యూఢిల్లీ: రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు ధర్మాసనం ఇటీవల ఇచ్చిన తీర్పుపై లోక్సభలో సోమవారం సుదీర్ఘ చర్చ జరిగింది. ఈ తీర్పు వల్ల దేశ జనాభాలో దాదాపు 80 శాతం మేర ఉన్న ఎస్సీ, ఎస్టీ, వెనుకబడిన వర్గాల ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందని సభ్యులు అభ్యంతరం తెలిపారు. అఖిలభారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్)లో బోధనా సిబ్బంది పదోన్నతుల్లో రిజర్వేషన్లను తోసిపుచ్చుతూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పార్లమెంటు సార్వభౌమత్వానికి గండి పడుతున్న కోణంలో చూడాలని పలువురు అభిప్రాయపడ్డారు. ఈ తీర్పు అమలుగాకుండా అత్యవసరంగా రాజ్యాంగ సవరణ చేయాలని డిమాండ్ చేశారు. ఈ అంశాన్ని తొలుత జేడీ(యూ) పార్టీ అధినేత శరద్ యాదవ్ జీరో అవర్లో చర్చకు లేవనెత్తారు. బలహీన వర్గాల ప్రయోజనాల నిమిత్తం రూపొందించిన చట్టాలను కొట్టివేయడం తరచుగా చోటుచేసుకుంటోందని ఆరోపించారు. అవినీతిని నిరోధించడంలో న్యాయవ్యవస్థ కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ రిజర్వేషన్లు వంటి సామాజిక అంశాల్లో అన్ని పార్టీలు ఏకగ్రీవంగా ఆమోదించిన చట్టాలనూ కొట్టివేస్తున్నాయని ప్రస్తావించారు. కాంగ్రెస్ ఎంపీ పీఎల్ పునియా మాట్లాడుతూ, రిజర్వేషన్ల ద్వారా బలహీనవర్గాలకు న్యాయం చేసేందుకు పార్లమెంటు తీసుకున్న పలు ముఖ్యమైన నిర్ణయాలను సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకోకపోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. దేశ భవిష్యత్తును నిర్ణయించేది కేవలం ఐదుగురు వ్యక్తులా (సుప్రీంకోర్టు ధర్మాసనం) లేదా పార్లమెంటులో కూర్చున్న ప్రజాప్రతినిధులా అని ఆయన ప్రశ్నించారు. తరువాత సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత ములాయం సింగ్ యాదవ్ మాట్లాడుతూ దేశంలో 54 శాతం జనాభా ఉన్న వెనుకబడిన వర్గాల్లో కేవలం 2 శాతం మంది మాత్రమే ఉన్నత పోస్టుల్లో ఉన్నారని చెప్పారు. సుప్రీంకోర్టు ఆదేశాల రద్దుకు ప్రభుత్వం తగిన విధంగా స్పందించకపోతే దేశవ్యాప్తంగా ఉద్యమం లేవదీస్తామని హెచ్చరించారు. పదోన్నతుల్లో రిజర్వేషన్ల బిల్లును ప్రవేశపెడితే బీఎస్పీ అధినేత్రి మాయావతి మద్దతు ఇస్తారని ఆ పార్టీ ఎంపీ దారాసింగ్ చౌహాన్ స్పష్టం చేశారు. లోక్సభ చైర్పర్సన్ కమిటీలో జగదాంబిక కాంగ్రెస్ సీనియర్ నేత జగదాంబిక పాల్ లోక్సభ చైర్పర్సన్ కమిటీలో సభ్యురాలుగా నియమితులయ్యారు. సోమవారం ఈ విషయాన్ని లోక్సభ స్పీకర్ మీరాకుమార్ ప్రకటించారు. గిరిజావ్యాస్ స్థానంలో ఆమెను నియమిస్తున్నట్లు చెప్పారు. జనతాదళ్(ఎస్) సభ్యులు హెచ్డీ కుమారస్వామి, ఎన్. చెలువరయ్య రాజీనామాలను కూడా ఆమోదిస్తున్నట్లు స్పీకర్ వెల్లడించారు. ఎంపీలంతా సభకు వచ్చేలా చూడండి: సోనియా ఆహార భద్రత సహా పలు కీలక బిల్లులు ఆమోదం పొందాల్సిన నేపథ్యంలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు గరిష్ట సంఖ్యలో కాంగ్రెస్ ఎంపీలు హాజరయ్యేలా చూడాలని ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ లోక్సభలో పార్టీ విప్లను ఆదేశించారు. లోక్సభలో చీఫ్ విప్గా నియమితులైన సందీప్ దీక్షిత్.. సోమవారం సహచరులతో వెళ్లి సోనియాను కలిసినప్పుడు ఆమె ఈ మేరకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. సభకు పార్టీ ఎంపీలంతా హాజరయ్యే చూడాలని పేర్కొన్నారు.