breaking news
S Gurumurthy
-
తుది ప్యాకేజీ ప్రకటించవచ్చు : ఆర్బీఐ
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్ సంక్షోభం నుంచి కోలుకునేందుకు కేంద్ర ప్రభుత్వం మరో ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించే అవకాశం ఉందని ఆర్బీఐ డైరెక్టర్ గురుమూర్తి అంచనా వేశారు. సెప్టెంబర్ లేదా అక్టోబరులో తుది ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించే అవకాశం ఉందని పేర్కొన్నారు. నిన్న (మంగళవారం) భారత్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిర్వహించిన వెబ్నార్లో గురుమూర్తి ఈ వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన 20 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీ మధ్యంతర చర్యగా మాత్రమే భావించ వచ్చని గురుమూర్తి తెలిపారు. ఈ నేపథ్యంలో కోవిడ్-19 అనంతర ఎరాలో చివరి ప్యాకేజీ ప్రకటించే అవకాశముందని చెప్పారు. అమెరికా, యూరోపియన్ దేశాలు నగదును ముద్రించుకుంటూ వస్తున్నాయి, కానీ భారతదేశంలో ఈ అవకాశం చాలా తక్కువే అన్నారు. అలాగే దీనికి సంబంధించి రిజర్వ్ బ్యాంకు ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని గురుమూర్తి అన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి మే 15 వరకు ప్రభుత్వం జన్ధన్ ఖాతాల్లో 16 వేల కోట్ల రూపాయలను జమ చేయగా, ఆశ్చర్యకరంగా చాలా స్వల్పంగా కొద్దిమంది మాత్రమే ఈ నగదును ఉపసంహరించు కున్నారని గురుమూర్తి పేర్కొన్నారు. సంక్షోభం తీవ్ర స్థాయిలో లేదనడానికి ఇదే సంకేతమన్నారు. ప్రస్తుతం దేశం భిన్న సమస్యలను ఎదుర్కొంటోందని గురుమూర్తి వెల్లడించారు. కరోనా అనంతరం ప్రపంచం బహుళ ఒప్పందాల నుంచి ద్వైపాక్షిక ఒప్పందాల వైపు మళ్లే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. భారత ఆర్థిక వ్యవస్థ కూడా శరవేగంగా కోలుకుంటుందని ఆయన తెలిపారు. -
సూపర్ స్టార్ రాజకీయాల్లోకి రావాలి
చెన్నై: తమిళ సూపర్స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లో రావాలని కొన్నేళ్లుగా అభిమానులు, పార్టీలకతీతంగా నాయకులు కోరుతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సైతం గత లోక్సభ ఎన్నికల సమయంలో చెన్నైలోని రజనీ ఇంటికి వెళ్లి ఆయన మద్దతు కోరారు. అయినా రాజకీయ రంగ ప్రవేశంపై రజనీకాంత్ తన మనసులోని మాటను ఎప్పుడూ బయటపెట్టలేదు. రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలంటూ తాజాగా ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త, తుగ్లక్ మేగజైన్ ఎడిటర్గా కొత్తగా నియమితులైన ఎస్ గురుమూర్తి కోరారు. తుగ్లక్ మేగజైన్ 47వ వార్షికోత్సవం సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘నేను కోరాను కాబట్టి రజనీకాంత్ రాజకీయాల్లో రాకూడదు. ఆయన సొంత నిర్ణయం తీసుకోవాలి. తమిళనాడుకు మంచి చేయగల వ్యక్తులు రాజకీయాల్లో రావాలి. రజనీ స్నేహితుడు, తుగ్లక్ మాజీ ఎడిటర్ చో రామస్వామి చాలాసార్లు ఆయనకు ఇదే విషయం చెప్పారు. తమిళనాడుకు రజనీ అవసరముందని, రాజకీయాల్లోకి రావాలని చో రామస్వామి కోరారు. తుగ్లక్ పత్రికది, నాది ఇదే అభిప్రాయం’ అని గురుమూర్తి చెప్పారు. తమిళనాడు రాజకీయాలకు, సిని రంగానికి విడదీయలేని సంబంధం ఉంది. సినీ రంగానికి చెందినవారే తమిళ రాజకీయాలను శాసిస్తున్నారు. రజనీకాంత్కు కోట్లాదిమంది అభిమానులున్నారు. ఆయన మద్దతు కోసం రాజకీయ పార్టీలు పోటీపడుతుంటాయి. 1996 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అప్పటి ముఖ్యమంత్రి జయలలితకు వ్యతిరేకంగా రజనీకాంత్ ఓ వ్యాఖ్య చేయడం తీవ్ర ప్రభావం చూపింది. జయలలితకు ఓటు వేస్తే దేవుడు కూడా తమిళనాడును కాపాడలేడంటూ రజనీ వ్యాఖ్యానించడం డీఎంకే కూటమి అధికారంలోకి రావడానికి ఉపయోగపడిందన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. జయలలిత మరణం తర్వాత తమిళనాడులో రాజకీయ పరిణామాలు మారిపోయాయి. ఈ నేపథ్యంలో రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తారా రారా అన్నది తమిళనాడులో మరోసారి హాట్ టాపిక్గా మారింది.