breaking news
Rashtriya swayam sevak sangh
-
రాహుల్ గాంధీపై మరో పరువు నష్టం కేసు
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ ఇంటిపేరుపై అనుచిత వ్యాఖ్యలతో ఎంపీగా అనర్హత వేటు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి మరో తలనొప్పి మొదలైంది. మహాభారతంలోని కౌరవులను రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్)తో పోలుస్తూ రాహుల్ వ్యాఖ్యలు చేశారంటూ ఆర్ఎస్ఎస్ కార్యకర్త ఒకరు కేసు వేశారు. గతంలో భారత్ జోడో యాత్ర సందర్భంగా రాహుల్ చేసిన ఈ వ్యాఖ్యలపై ఉత్తరాఖండ్లోని హరిద్వార్ కోర్టులో కమల్ భదౌరియా అనే వ్యక్తి పరువు నష్టం కేసు వేశారు. ఈ కేసు ఈనెల 12వ తేదీన విచారణకు రానుంది. కమల్ న్యాయవాది చెప్పిన ప్రకారం.. ఈ జనవరి తొమ్మిదో తేదీన భారత్ జోడో యాత్రలో భాగంగా హరియాణాలోని అంబాలా పట్టణంలోని ఒక కూడలిలో రాహుల్ ప్రసంగించారు. ‘ కౌరవులు ఎవరో మీకు తెలుసా ? మొదట మీకు 21 శతాబ్దపు కౌరవుల గురించి వివరిస్తా. వాళ్లంతా ఖాకీ రంగు నిక్కర్లు వేసుకుంటారు. చేతిలో లాఠీ పట్టుకుని ‘శాఖ’లు నిర్వహిస్తారు. భారత్లోని ఇద్దరు, ముగ్గురు అపర కుబేరులు వీరికి మద్దతుగా నిలుస్తున్నారు’ అని రాహుల్ ప్రసంగించారని తన పిటిషన్లో కమల్ పేర్కొన్నారు. ‘21వ శతాబ్దంలో కౌరవులు ఇంకా ఉన్నారు అంటే అది ఆర్ఎస్ఎస్ సభ్యులే’ అని ప్రసంగించి ఆర్ఎస్ఎస్ పరువుకు రాహుల్ తీవ్ర భంగం కల్గించారని ఆరోపించారు. ‘మోదీ అని ఇంటిపేరు ఉన్నవాళ్లంతా దొంగలే’ అని వ్యాఖ్యానించారన్న కేసులో దోషిగా తేలడంతో సూరత్ కోర్టు రాహుల్కు ఇప్పటికే రెండేళ్ల జైలుశిక్ష విధించిన విషయం తెల్సిందే. ఎగువ కోర్టులో అప్పీల్కు అవకాశం కల్పిస్తూ శిక్ష అమలును తాత్కాలిక నిలుపుదల చేసిన విషయం తెల్సిందే. -
ఆ సంస్థ.. 39 దేశాలకు విస్తరించింది!
ఖాకీ నిక్కర్, తెల్లటి షర్టు, తలపై టోపీ, చేతిలో లాఠీ.. చిన్న పిల్లల దగ్గర్నుంచి వృద్ధుల వరకు అందరికీ ఒకటే యూనిఫాం. ఇవన్నీ వింటే.. వెంటనే అది ఆర్ఎస్ఎస్ అని అర్థమవుతుంది. ఒకప్పుడు కేవలం భారతదేశానికి మాత్రమే పరిమితమైన ఈ సంస్థ.. తర్వాత క్రమంగా పలు దేశాలకు విస్తరించింది. ప్రస్తుతం అగ్రరాజ్యం అమెరికా సహా 39 దేశాల్లో ఆర్ఎస్ఎస్ శాఖలున్నాయి. తాను చిన్నతనంలో ఎప్పుడూ ఆర్ఎస్ఎస్ శాఖలకు వెళ్లలేదని, కానీ ఇప్పుడు మాత్రం తన పిల్లలలను పంపుతున్నానని ఎన్నారై గిరీష్ బగ్మర్ తెలిపారు. భారతీయ సంస్కృతి గురించి తెలుసుకోడానికి తనతో పాటు చాలామంది ఎన్నారైలు తమ పిల్లలను ఆర్ఎస్ఎస్కు పంపుతున్నారని ఆయన చెప్పారు. తాను చిన్నతనంలో భారతదేశంలోనే పెరగడంతో తాతల నుంచి సంస్కృతి తెలుసుకున్నామని, కానీ తమ పిల్లలకు మాత్రం అలాంటి అవకాశం లేకపోవడంతో ఆర్ఎస్ఎస్కు పంపిస్తున్నామని వివరించారు. అయితే, ఇతర దేశాల్లో ఇది ఆర్ఎస్ఎస్ అనే పేరుతో కాకుండా హిందూ స్వయంసేవక్ సంఘ్ (హెచ్ఎస్ఎస్) అనే పేరుతో నడుస్తోంది. చిన్మయ మిషన్, రామకృష్ణ మిషన్ లాంటి సంస్థలతో పాటు హెచ్ఎస్ఎస్ కూడా పలు దేశాల్లో క్రమంగా పాతుకుంటోంది. మధ్యప్రాచ్యంలోని ఐదు దేశాలలో కూడా ప్రస్తుతం హెచ్ఎస్ఎస్ శాఖలున్నాయి. ఫిన్లాండ్లో మాత్రం ఈ-శాఖ పనిచేస్తోంది. అక్కడి కార్యకలాపాలను స్కైప్ లాంటి వీడియో చాటింగ్ ద్వారా నిర్వహిస్తున్నారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, చరిత్ర లాంటి వాటిని తెలుసుకోడానికి విదేశాల్లో స్థిరపడిన భారతీయులు బాగా ఆసక్తి చూపిస్తున్నారని, ఇక్కడ తాము మైనారిటీలం కావడంతో తమకు ఇది సామాజికంగా కూడా ఒక వేదిక అవుతోందని లండన్కు చెందిన సుబీర్ సిన్హా చెప్పారు. ఇలా పలు దేశాల్లో ఎప్పటి నుంచో స్థిరపడిన భారతీయ కుటుంబాల వాళ్లు ఇలాంటి సంస్థల ద్వారా తమ మూలాలను పిల్లలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.