breaking news
Prathap C Reddy
-
మాతా శిశు మరణాల రేటు తగ్గించాలి
సాక్షి, హైదరాబాద్: దేశంలో నమోదవుతున్న మాతా శిశు మరణాలపై అపోలో క్రెడిల్స్ జాతీయ సదస్సు–2018 ఆందోళన వ్యక్తం చేసింది. అభివృద్ధి చెందిన దేశాలకు ధీటుగా వైద్య సేవలు అందుబాటులోకి వచ్చినప్పటికీ..ఇప్పటికీ మాతా శిశు మరణాలు వెలుగు చూస్తుండటంపై విస్మయం వ్యక్తం చేసింది. ఈ మరణాల రేటును మరింత తగ్గించాల్సిన ఆవశ్యకత నేటితరం వైద్యులపై ఉందని పేర్కొంది. అపోలో గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు పార్క్ హయత్ హోటల్లో జరిగే ఈ సదస్సును అపోలో గ్రూప్ సంస్థల చైర్మన్ డాక్టర్ ప్రతాప్.సి.రెడ్డి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మాతా శిశు సంరక్షణ కోసం మరింత కృషి చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. జాతీయ కుటుంబ సంక్షేమ శాఖ నివేదిక ప్రకారం దేశంలో మెటర్నల్ మోర్టాలిటీ రేట్ (ఎంఎంఆర్) పెద్ద సమస్యగా ఉందన్నారు. 2005–06లో ప్రతీ వెయ్యిమంది తల్లుల్లో 335 మంది ప్రసవ సమయంలో మరణించారని, ఈ మరణాల రేటు 2014–15 నాటికి 135కు తగ్గిందని ఆయన వెల్లడించారు. ఆస్పత్రి ప్రసవాల సంఖ్య పెరగడం వల్లే ఇది సాధ్యమైందన్నారు. గతంలో 26%గా ఉన్న ఆస్పత్రి ప్రసవాలు ప్రస్తుతం 81 శాతానికి పెరిగినా మరణాల రేటు ఇంకా కొనసాగుతుండటంపై ఆందోళన వ్యక్తం చేశారు. మరణాల రేటు 70కు తగ్గించాలి 2030 నాటికి ప్రసవ సమయంలో తల్లుల మరణాల సంఖ్యను 70కు తగ్గించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ప్రతాప్.సి.రెడ్డి తెలిపారు. ప్రపంచ సగటు ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేటు (ఐఎంఆర్)12 ఉండగా, దేశంలో 2017 నాటికి పుట్టిన ప్రతీ వెయ్యి మంది శిశువులకు 32 శిశువులు చనిపోతున్నారని తెలిపారు. ఇందులో నెలలోపు శిశువుల్లో 24 మంది మృతి చెందుతుండటంపై ఆందోళన వ్యక్తం చేశారు. 2030 నాటికి 70% మాతా శిశు మరణాలకు దీర్ఘకాలిక రోగాలు కారణమవుతాయని, రాబోయే రోజుల్లో వీటి నుంచి భారీ ప్రమాదాన్ని పొంచి ఉందని హెచ్చరించారు. ఈ సదస్సుకు అపోలో గ్రూప్ వైస్చైర్ పర్సన్ శోభన కామినేని, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సంగీతారెడ్డి, మెడికల్ డైరెక్టర్ అనుపమ్ సిబల్, ఓబీఎస్హెచ్ వైస్ చైర్మన్ డాక్టర్ మహితారెడ్డి, పీఏటీఎస్ అధ్యక్షురాలు డాక్టర్ హిమబిందు, ఎన్ఎన్ఎఫ్ అధ్యక్షుడు డాక్టర్ బల్దేవ్ భాటియా, డాక్టర్ సియంగ్ లిన్టాన్, డాక్టర్ వైఎస్ యంగ్, డాక్టర్ శైలేశ్ కుమార్, సహా వివిధ రాష్ట్రాలకు చెందిన 600 మంది గైనకాలజీ, పీడియాట్రిక్ వైద్యనిపుణులు హాజరయ్యారు. -
తన తాత కల ఇదేనంటూ ఉపాసన వీడియో పోస్ట్!
-
విచారణకు ప్రతాప్ సీ రెడ్డి
సాక్షి, చెన్నై : అమ్మ జయలలిత మరణం కేసు విచారణకు హాజరు కావాలని అపోలో గ్రూప్ చైర్మన్ ప్రతాప్ సీ రెడ్డికి సమన్లు జారీ చేయడానికి కమిషన్ కసరత్తులు చేపట్టింది. వారం రోజుల్లో ఆయన విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. జయలలిత మరణం మిస్టరీని నిగ్గుతేల్చేందుకు రిటైర్డ్ న్యాయమూర్తి ఆర్ముగ స్వామి కమిషన్ విచారణను వేగవంతం చేసిన విషయం తెలిసిందే. పలు కోణాల్లో విచారణ సాగిస్తోంది. జయలలితకు సన్నిహితంగా ఉన్న అందరి వద్ద వాంగ్మూలం సేకరించింది. జయలలిత ఆస్పత్రిలో మరణించిన దృష్ట్యా, ఆమెకు అందించిన వైద్య పరీక్షలు, ఇతర విషయాలను రాబట్టేందుకు ఇప్పటికే అపోలోకు సమన్లు జారీచేసింది. ఆ మేరకు అపోలో చైర్మన్ ప్రతాప్ సీ రెడ్డి, ఆయన కుమార్తె ప్రీతా రెడ్డి తరఫున నివేదిక కమిషన్కు చేరింది. ఈ నివేదికలోని వైద్య సంబంధిత అంశాలను ఆ కమిషన్ ప్రత్యేక కమిటీని ఏర్పాటుచేసి పరిశీలిస్తోంది. ఈ ప్రక్రియ ఒకటి రెండు రోజుల్లో ముగిసే అవకాశాలున్నాయి. ఇప్పటివరకు తమ విచారణలో సేకరించిన, అంశాలతో పాటు, ఆ నివేదికలోని మరికొన్ని అంశాల గురించి సమగ్రంగా నివృతి చేసుకోవాల్సి ఉండడంతో ప్రతాప్సీ రెడ్డిని విచారణకు పిలిచేందుకు కమిషన్ చర్యలు చేపట్టింది. ఆయనకు ఒకటి రెండు రోజుల్లో సమన్లు జారీచేసి, వారంలోపు విచారణకు హాజరు కావాలని కమిషన్ ఆదేశాలిచ్చే అవకాశాలున్నాయి. -
జయ వార్డులో సీసీ కెమెరాలు ఆపేశాం
టీ.నగర్ (చెన్నై): దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అనారోగ్యంతో చికిత్స పొందిన సమయంలో.. ఒక ఐసీయూ యూని ట్ మొత్తాన్ని ఆమెకే కేటాయించామని, ముందు జాగ్రత్తగా ఆమె వార్డులోని సీసీ కెమెరాలను ఆపేశామని అపోలో హాస్పిటల్స్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ప్రతాప్ సి. రెడ్డి వెల్లడించారు. సంబంధం లేని వ్యక్తులు చూడకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. అపోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ కొలొరెక్టల్ సర్జరీ, యూఎస్ఏ క్లీవ్ల్యాండ్ క్లినిక్, యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 24, 25న నిర్వహించనున్న సదస్సు గురించి మీడియాతో మాట్లాడుతూ.. జయకు అందించిన చికిత్స వివరాల్ని వెల్లడించారు. ‘24 గదుల ఐసీయూ యూనిట్ మొత్తాన్ని జయకే కేటాయించినా.. ఒక గదిని మాత్రమే ఉపయోగించాం. చికిత్స పొందిన 75 రోజులు అన్ని సీసీటీవీల్ని ఆపుచేశాం. మిగతా రోగుల్ని వేరే ఐసీయూలోకి మార్చాం’ అని చెప్పారు. కొద్దికాలం సన్నిహిత బంధువులు తప్ప ఎవరినీ ఐసీయూలోకి అనుమతించలేదని, ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నప్పుడు డ్యూటీలో ఉన్న వైద్యుడి సమ్మతి మేరకే అనుమతించేవారిమని తెలిపారు. జయలలితకు ఆస్పత్రిలో అత్యుత్తమ వైద్య చికిత్స అందించామని, విదేశీ వైద్యులు కూడా సాయపడ్డారని, ఆమె పూర్తిగా కోలుకున్నారని భావించిన తరుణంలో తీవ్ర గుండెపోటు రావడంతో ఎంత ప్రయత్నించినా కాపాడలేకపోయామన్నారు. -
జయలలిత మృతి కేసు.. విచారణలో కీలక ఘట్టం..
అన్నాడీఎంకే అధినేత్రి, దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణంపై తమిళనాడు ప్రభుత్వం ఏర్పాటు చేసిన విచారణ కమిషన్ విచారణ జోరును పెంచింది. అన్నాడీఎంకే బహిష్కృతనేత శశికళ, అపోలో చైర్మన్ డాక్టర్ ప్రతాప్ సీ రెడ్డి, ఆయన కుమార్తె ప్రీతారెడ్డిలకు శుక్రవారం సమన్లు జారీచేయడం ద్వారా విచారణ కీలకదశకు చేరుకుంది. సాక్షి, చెన్నై: అమ్మ అనారోగ్యం, 75 రోజుల తరువాత ఆకస్మిక మరణం ఏడాది కాలంలో దేశవ్యాప్తంగా చర్చనీయాంశం. చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జయలలిత కోసం తమిళనాడు ప్రభుత్వం తరపున వివిధ విభాగాలకు చెందిన వైద్యుల బృందం, ఢిల్లీ నుంచి ఎయిమ్స్ వైద్యులు విదేశాల నుంచి ప్రత్యేక వైద్య నిపుణులు...ఇలా అమ్మకు అంతర్జాతీయ స్థాయిలో వైద్యం అందింది. జయకు కేవలం జ్వరం, డీ హైడ్రేషన్లతో స్వల్ప అనారోగ్యమేనని చేరిన వెంటనే అపోలో ఆసుపత్రి బులెటిన్ విడుదల చేసింది. నిజాన్ని దాచాల్సి వచ్చింది.. అయితే అదంతా అబద్దమని, వాస్తవానికి జయ విషమ పరిస్థితిలో చేరారని అపోలో ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ ప్రతాప్ సీ రెడ్డి ఇటీవల ప్రకటించారు. జయకు తీవ్ర అనారోగ్యం అని ప్రకటిస్తే రాష్ట్రంలో శాంతి భద్రతలు తలెత్తుతాయనే ఆలోచనతో నిజాన్ని దాచాల్సి వచ్చిందని ఆయన వివరణ ఇచ్చారు. అంతకు కొన్నినెలల ముందే మంత్రి దిండుగల్లు శ్రీనివాసన్ సైతం అమ్మ ఆరోగ్యం విషయంలో అనేక అబద్ధాలు ఆడాం, మన్నించండి అని బహిరంగసభలో ప్రజలను వేడుకున్నాడు. ఇలాంటి అనుమానాలు.. పెనుభూతాల నడుమ తమిళనాడు ప్రభుత్వం సెప్టెంబరు 25వ తేదీన జయ మరణంపై విచారణ కమిషన్ వేసింది. రిటైర్డు న్యాయమూర్తి ఆర్ముగస్వామి విచారణ ప్రారంభించారు. డీఎంకే వైద్యవిభాగ కార్యదర్శి డాక్టర్ శరవణన్ కమిషన్ ముందు హాజరై...అమ్మ చనిపోయిన స్థితిలో వేలిముద్రలు సేకరించి ఉప ఎన్నికలకు బీ ఫారం విడుదల చేశారని వాంగ్మూలం ఇచ్చి సంచలనం రేపారు. ఆ తరువాత జయ మేనకోడలు దీప, మేనల్లుడు దీపక్, దీప భర్త మాధవన్, తమిళనాడు ప్రభుత్వ మాజీ సీఎస్లు షీలా బాలకృష్ణన్, రామమోహన్రావు తదితర ముఖ్యులు తమ వాంగ్మూలం ఇచ్చారు. విచారణలో కీలక ఘట్టం.. ఇదిలా ఉండగా, విచారణలో భాగంగా శశికళ, ప్రతాప్ సీ రెడ్డి, ప్రీతారెడ్డిలకు కమిషన్ శుక్రవారం సమన్లు పంపడంతో జయ మరణంపై జరుగుతున్న విచారణ కీలక ఘట్టానికి చేరుకుంది. జయ ఆసుపత్రికి వచ్చినపుడే విషమపరిస్థిలో ఉన్నారని ప్రతాప్ సీ రెడ్డి చెప్పగా అంతకు కొన్ని నిమిషాల ముందు ఇంట్లో జయకు ఏమి జరిగిందనే ప్రశ్న తలెత్తింది. జయకు సీరియస్ అయిన సమయంలో శశికళ మాత్రమే ఉంది. జయ ఆసుపత్రిలో ఉండగా ఆమెకు అందుతున్న వైద్యసేవలను అపోలో ఆసుపత్రి చైర్మన్ ప్రతాప్ సీ రెడ్డి, అపోలో గ్రూప్ ఎగ్జిక్యుటివ్ వైస్ చైర్పర్సన్ ప్రీతారెడ్డి పర్యవేక్షించారు. దీంతో విచారణ కమిషన్ ఈ ముగ్గురికీ సమన్లు జారీచేసింది. బెంగళూరు జైలు అధికారుల ద్వారా శశికళకు ఈ సమన్లు అందాయి. 15 రోజుల్లోగా బదులివ్వాలని శశికళను కమిషన్ ఆదేశించింది. శశికళ తరఫున ముందుగా ఆమె న్యాయవాది హాజరై వాంగ్మూలం ఇస్తారు. అందుకు కమిషన్ సంతృప్తి చెందని పక్షంలో శశికళను నేరుగా పిలిపించుకుని లేదా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారిస్తారని సమాచారం. అలాగే ప్రతాప్ సీ రెడ్డికి పదిరోజుల గడువు ఇచ్చారు. ఈ లెక్కన వచ్చే ఏడాది జనవరి 2వ తేదీన కమిషన్ ముందు ఆయన హాజరుకావాల్సి ఉంటుంది. అలాగే జయకు సంబంధించి ఆసుపత్రి విడుదల చేసిన అన్ని బులెటిన్లు పదిరోజుల్లోగా కమిషన్ కు అందజేయాలని ఆదేశాలు జారీఅయ్యాయి. ప్రీతారెడ్డి సమన్ల వివరాలు తెలియరాలేదు. ఇదిలా ఉండగా, జయవిచారణ కమిషన్ నివేదిక సమర్పించేందుకు ప్రభుత్వం ఇచ్చిన మూడునెలల గడువు వచ్చే ఏడాది జనవరి 25వ తేదీతో ముగుస్తుంది. ఇంకా అనేక అంశాలు విచారణ రావాల్సిన కారణంగా గడువును మరో ఆరునెలలు పొడిగిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. -
మెరుగుపడిన జయలలిత ఆరోగ్యం
-
జయలలిత ఎప్పుడు కోరితే అప్పుడు డిశ్చార్జి
-
జయలలిత ఎప్పుడు కోరితే అప్పుడు డిశ్చార్జి
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యంగా ఉన్నారని అపోలో చైర్మన్ ప్రతాప్ సి రెడ్డి చెప్పారు. ఐసీయూ నుంచి ఆమెను త్వరలో స్పెషల్ రూమ్కు మారుస్తామని తెలిపారు. జయలలిత ఎప్పుడు కోరితే అప్పుడు డిశ్చార్జి చేస్తామని ప్రతాప్ సి రెడ్డి చెప్పారు. సెప్టెంబర్ 22 నుంచి జయలలిత అపోలోలో చికిత్స పొందుతున్నారు. మొదట్లో ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్టు వార్తలు వచ్చినా, క్రమేణా కోలుకున్నారు. పలువురు వీఐపీలు ఆపోలో ఆస్పత్రికి వెళ్లి ఆమె ఆరోగ్య పరిస్థితిని వాకబు చేశారు. -
కార్లు కాదు...వేర్లూ పట్టించుకో...అన్నారు నాన్న
భారత ఆరోగ్యరంగానికి ఆయన ఒక చుక్కాని. ఆ చుక్కాని చూపిన దిక్కుకే దేశ ఆరోగ్య సంస్థలన్నీ పురోగమించాయి. ఆయన వేసిన మార్గాన్ని ఇవ్వాళ్ల అనేక హాస్పిటళ్లు అనుసరిస్తున్నాయి. చికిత్స రంగానికి ప్రభుత్వపరంగా ఉన్న అవరోధాలను తొలగించి,స్వదేశంలోనూ విదేశాలకు సరిసమానమైన నైపుణ్యాన్ని, ఉపకరణాలనూ సమకూర్చిపెట్టిన తొలి వ్యక్తి. ఒకనాడు ఇక్కడి నుంచి విదేశాలకు వలస వెళ్తున్న మేధాశక్తిని స్వదేశ ‘భూమార్గం పట్టించి హెల్త్కేర్ రంగంలో భూకంపం పుట్టించి’ బ్రెయిన్ డ్రెయిన్ను రివర్స్ చేశారంటూ ప్రధానులే ప్రస్తుతించిన చరిత్ర ఆయనది. అలా ఆ క్రాంతదర్శి చేసిన మార్గనిర్దేశనం వల్ల ఆరోగ్యరంగం ఆసుపత్రి స్థాయిని దాటి ఒక పరిశ్రమ (హెల్త్ కేర్ ఇండస్ట్రీ) స్థాయికి చేరింది. ఆయనే అపోలో ఆసుపత్రుల వ్యవస్థాపకుడు, ఛైర్మన్ ప్రతాప్ సి. రెడ్డి. తన బాల్యం, అనేక అనుభవాలతో పాటు వ్యక్తిగతమైన అంశాలనూ ‘సాక్షి’తో మనసు విప్పి పంచుకున్నారు. నేను పుట్టింది ఎంత పల్లెటూర్లోనో తెలుసా...? చిత్తూరు జిల్లాలోని ఒక చిన్న పల్లె అరగొండలో. ఆ మానికి నీటివసతి లేదు. తాగడానికి కూడా నీరు దొరకనంత కరవులో పుట్టాను. బహుశా... నేను డాక్టర్ అయ్యాక దేశానికి వైద్యం అందుబాటు కూడా నేను పుట్టిననాటి కరువంత దారుణంగా ఉందని తెలియజెప్పడానికేనేమో, దాని కోసం ఏదైనా చేయాలనే సంకల్పం నాలో కల్పించడానికేనేమో అంతటి కరవు పరిస్థితుల్లో నేను పుట్టాను! మా ఊళ్లో స్కూల్ కూడా లేదు. మా నాన్నగారు పెద్ద రైతు కావడంతో ఒక టీచర్ను ప్రత్యేకంగా నాకోసం పిలిపించారు. అలా ప్రాథమిక విద్య వరకు మా ఊళ్లోనే చదివాక ఆరో తరగతి కోసం చిత్తూరు వెళ్లా. ఇక ఉన్నత పాఠశాల చదువంతా చిత్తూర్లో. ఆ తర్వాత మద్రాస్ క్రిస్టియన్ కాలేజీలో ఇంటర్. పోలీస్ అవ్వాలనుకొని డాక్టర్నయ్యా! జీవితంలో ప్రతివారూ ఎదుర్కొనే ప్రశ్న... పెద్దయ్యాక ఏమవుతావని! నేనూ ఈ ప్రశ్నను ఎదుర్కొన్నా. అడిగింది మా నాన్నే. ఇంటర్ చదివే సమయంలోనే ఆయన నన్ను వ్యాపార, వాణిజ్యరంగాల్లోకి పొమ్మన్నారు. పోలీస్ ఆఫీసర్ కావాలన్నది నా కోరిక. కానీ, మా నాన్న ససేమిరా అన్నారు. అప్పటికి డాక్టర్ కోర్సుకు ఎంపిక ప్రాంతాల వారీగా ఉండేది. రాయలసీమ ప్రాంతీయ సెలక్షన్ పరీక్షలో నేనే నెంబర్ వన్! దాంతో మద్రాస్ స్టాన్లీ మెడికల్ కాలేజీలో సీటొచ్చింది. మెడిసిన్ పూర్తయ్యాక బ్రిటన్, యూఎస్... ఈ రెండు దేశాల్లోనూ పై కోర్సులకు దరఖాస్తు చేశా. ఊస్చెస్టర్లో చీఫ్ రెసిడెంట్గా ఎంపికయ్యా. ఆ తర్వాత ప్రపంచంలోనే చాలా ప్రతిష్టాత్మకమైన మసాచుసెట్స్ జనరల్ హాస్పిటల్ లాంటి అత్యుత్తమ సంస్థలో, అత్యుత్తమమని అందరూ భావించే స్ప్రింగ్ఫీల్డ్ మిస్సోరీలలో పనిచేశా. అలా ప్రపంచంలోనే అగ్రశ్రేణి ఇన్స్టిట్యూషన్స్లో కార్డియాలజిస్ట్గా పనిచేసే అవకాశాలు వచ్చాయి. కార్లు సరే... వేర్ల మూలాల మాటేమిటి? మా నాన్నగారికి కార్లు అంటే చాలా ఇష్టం. అందుకే నేను కారు మార్చినప్పుడల్లా, కొత్తది కొన్నప్పుడల్లా దాని ఫొటో జతచేస్తూ ఇంటికి ఉత్తరాలు రాసేవాణ్ణి. మా నాన్న చాలా సంతోషించేవారు. 1969లో సరికొత్త షెవర్లే కారు కొని దాని ముందు మేమంతా ఫొటో తీయించుకుని నాన్నకు పంపా. అప్పుడు మా నాన్న నన్ను అడిగిన ఒక చిన్న ప్రశ్నతో నా జీవితమే మలుపు తిరిగింది. ‘‘నువ్వు కొత్త కొత్త కార్లు కొంటున్నావు. నన్నూ, మీ అమ్మనూ సంతోషపెడుతున్నావు. ఈ సంతోషం మా ఇద్దరికే ఉంటే చాలా? కార్లను కాదు... కాస్త నీ వేర్లనూ పట్టించుకో. ఇక్కడ నీ మూలాల్లోకి వచ్చి... ఎంతమందిని సంతోషపెట్టగలవో... అంతమందికీ ఆనందాన్ని పంచు. అదే నువ్వు మాకిచ్చే అసలు సిసలైన బహుమానం’’ అన్నారాయన. అంతే! నా భార్య సుచరిత వైపు చూశా. ఆమె నుంచి ఎలాంటి అభ్యంతరమూ లేదు. పైగా సంతోషం! ఇక నా పిల్లలా? వాళ్లంతా 9 - 12 ఏళ్ల మధ్యవాళ్లే. కాబట్టి వాళ్ల నుంచి ఎలాంటి వ్యతిరేకతా లేదు. కాబట్టి విదేశాల్లో అత్యద్భుతమైన కెరియర్ను వదిలివేయడం చాలామందికి ఒక పిచ్చిదనంలా అనిపించింది. కానీ మేమంతా సంతోషంగా చెట్టు కొనకొమ్మల నుంచి మా వేర్ల మూలాల్లోకి వచ్చాం. ఆ వేర్ల నుంచి అనేక మొక్కలనూ ఆవిర్భవించేలా చేసి, నా జీవితాన్ని ఒక నందనవనంలా రూపొందించడానికి మొదటి బీజం వేశాం. అందరూ ఆక్షేపించేవారే... వంద కూడా దక్కదన్నవారే! కార్డియాలజీ రంగంలో అత్యంత ఉన్నత స్థాయి చదువులు చదివి ఇండియాకు రావడాన్ని ప్రతి ఒక్కరూ ఫూలిష్ పనిగా అభివర్ణించిన వారే. అందరూ ఒక దారిలో వెళ్తుంటే నువ్వు పూర్తి భిన్నంగా వెళ్తున్నావు. నువ్వు చదివిన చదువేమిటీ? ఆ నైపుణ్యాన్ని ఎలాంటి ఉపకరణాలూ, సౌకర్యాలూ లేని చోటికి తీసుకెళ్లి నువ్వు సాధించేదేమిటి? మేం చెబుతున్నాం విను. రేప్పొద్దున్న నువ్వు అక్కడ ప్రాక్టీస్ పెడితే వందరూపాయలు కూడా దక్కవు అంటూ మందలించారు. పనికిరాకుండా పోతావంటూ హెచ్చరించారు. నోటు కోసం కాదు... నాన్నకిచ్చిన మాట కోసం... నూరు రూపాయలు కూడా సంపాదించలేవన్న వారికి నేను చెప్పిన మాట ఒక్కటే- ‘నేను ఒక్క నూటికోసమో, నోటుకోసమో వెళ్లడం లేదు. మా నాన్న చెప్పిన మాట కోసం వెళ్తున్నాను’ అని. అలా వెళ్లి మద్రాస్ హెచ్.ఎమ్. హాస్పిటల్లో కార్డియాలజిస్ట్గా చేరాను. అక్కడా నా ప్రాక్టీస్ చాలా బాగా సాగింది. శ్రీలంక మాజీ అధ్యక్షురాలైన చంద్రికా కుమారతుంగ వాళ్ల అమ్మగారు... అంటే ప్రపంచంలో అప్పటికి ఒకదేశానికి మొట్టమొదటి మహిళా ప్రధాని అయిన సిరిమావో బండారునాయకే నా పేషెంట్. ఆమె శ్రీలంక నుంచి తన చికిత్స కోసం నా దగ్గరికి వచ్చేవారు. ఇలా ప్రపంచవ్యాప్తంగా కొందరు పేషెంట్స్ నా దగ్గరికే వచ్చేవాళ్లు. కానీ అంతటి కంఫర్ట్జోన్లోనూ నాలో ఏదో తపన! ‘మళ్లీ ఏదో చేయాలి... నాన్న చెప్పినట్లు ఇంకా ఇంకా ఎక్కువ మందికి వైద్యచికిత్స అందేలా మరేదో చేయాలి’ అని! ఈ తపన మొదలవ్వడానికి నా జీవితంలోని మరో సంఘటన కారణం. 1979 డిసెంబరు 9న ఒక వ్యక్తి మరణాన్ని నేను చాలా దగ్గర్నుంచి చూశా. మృత్యువు అతడిని తన ఒడిలోకి తీసుకుంటున్న సమయంలో అతడి వయసు 38. అతడి భార్య వయసు కేవలం 31. నాలుగేళ్ల కూతురు, రెండేళ్ల అబ్బాయి. ఆ వ్యక్తి మరణానికి కారణం ఏమిటో తెలుసా? అప్పటికి గుండె శస్త్రచికిత్సకు కావాల్సిన 50,000 డాలర్లు అతడి వద్ద లేకపోవడమే. ఇలా చిన్నవయసులోనే ఎంతోమంది చనిపోతూ ఉంటే... వాళ్ల కుటుంబం సరే... ఈ వయసులో దేశానికి కీలకమైన మానవ వనరుల మాటేమిటీ? ఇలాంటి అకాల మృత్యుబాధల వల్ల దేశం కోల్పోయే మానవ వనరుల శక్తి వల్ల కలిగే నష్టం ఏమిటీ?... లాంటి ప్రశ్నలు ఎన్నో నాలో ఆవిర్భవించాయి. దాంతో బోల్డెంత ప్రాక్టీస్నూ, ఎంతో మంది పేషెంట్స్నూ మళ్లీ వదిలేయాలని నిర్ణయించుకున్నా! తొలిదశలో ఎదురైన అభ్యంతరాలే మళ్లీ మళ్లీ ఎదురయ్యాయి. ప్రతివారూ ఈసారి మరింత విమర్శించారు. ఇలాంటి ప్రాక్టీస్ను వదిలేయడం పిచ్చితనం అంటూ వ్యాఖ్యలు చేశారు. అదే దశలో మా నాన్న రాఘవరెడ్డి బ్రెయిన్ హేమరేజ్తో చనిపోయారు. దాంతో డిప్రెషన్లోకి వెళ్లా. కొద్దిరోజుల్లోనే మా అమ్మ కూడా సర్వైకల్ క్యాన్సర్తో పోయారు. అంతే... నేనెందుకోసం ఈ దేశానికి వచ్చాను? వాళ్ల సంతోషం కోసమే కదా. మరి అలాంటి వాళ్లిద్దరే లేని ఈ దేశంలో నేను చేసేదేమిటి? అన్న ప్రశ్నలు నాలో ఆవిర్భవించసాగాయి. నేనో డాక్టర్ను అయ్యుండీ, అమ్మానాన్నలను కాపాడుకోలేకపోయానని కుమిలిపోయాను. కారణాలు వెతకసాగాను. కేవలం విదేశాల్లో లాంటి అత్యున్నత స్థాయి సదుపాయాలు మన దేశంలో లేకపోబట్టే కదా వారిద్దరూ చనిపోయారనిపించింది. ‘నా పరిస్థితే ఇలా ఉంటే ఎందరెందరో సామాన్యుల మాటేమిటి’ అని! అంతే... అప్పుడు నాన్న గుర్తొచ్చారు.... నేను ఆయనకిచ్చిన మాట గుర్తొచ్చింది. ఒకరిద్దరిని సంతోషపెట్టడం కాదు... నా వల్ల ఒక సమూహమే సంతోషపడాలి! ఒక దేశమే ఆనందపడాలి!! అదీ జీవితానికి సార్ధకత! అందుకే ఒక అద్భుతమైన హెల్త్కేర్ సిస్టమ్ను క్రియేట్ చేయాలి. అయితే నా ఈ సంకల్పానికి అప్పట్లో ఎలాంటి మద్దతూ రాలేదు. ఉదాహరణకు మా మెడిసిన్ ప్రొఫెసర్ ఒకరు నన్ను తీవ్రంగా ఆక్షేపించారు. నేను చేస్తున్న ప్రయత్నాలన్నీ బెడిసికొట్టేవే అన్నారు. కానీ నేను వెనుదిరిగి చూడదలచుకోలేదు. ప్రైవేటు రంగంలో వైద్యచికిత్స ఒక పరిశ్రమలా విస్తరిస్తే చాలామందికి మేలు జరుగుతుందని వాదించా. ఇదే ప్రతిపాదనతో అప్పటి ప్రధాని చరణ్సింగ్ దగ్గరికి వెళ్తే... ఆయన నా ప్రతిపాదనను చెత్తబుట్టలో పడేశారు. ఇందిరాగాంధీని నేనడిగిన ప్రశ్న వైద్యరంగానికే మేలిమలుపు... చరణ్సింగ్ తర్వాత ఇందిరాగాంధీ ప్రధానిగా పదవీబాధ్యతలు చేపట్టారు. మళ్లీ నేను నా ప్రతిపాదనతో తయారు! ఆమెను సూటిగా ఒక ప్రశ్న అడిగా. ‘చూడండీ... మీ మంత్రివర్గ సహచరులకూ, ఇతర ముఖ్యులకూ ఏదైనా జబ్బు వస్తే వాళ్లు ప్రభుత్వం ఖర్చు మీద విదేశాలకు వెళ్లి వైద్య చికిత్స చేయించుకుంటారు. అలానే భరించగలిగిన ధనవంతులు కూడా! వాళ్లను మినహాయిస్తే దేశంలోని మిగతా పేదల మాటేమిటి? వైద్య చికిత్స వాళ్లకూ అందుబాటులో ఉండొద్దా’ అన్నాను. దానికి ఆవిడ సమాధానం... తొలిసారిగా నేను కోరుకున్నట్లు ప్రైవేటురంగంలో ఒక పెద్ద సూపర్స్పెషాలిటీ ఆసుపత్రికి అనుమతి ఇవ్వడం! అలా... 1983లో మద్రాసులో ‘అపోలో ఆసుపత్రి’ ప్రారంభమైంది. అదే చికిత్సారంగంలో మేలిమలుపు! బ్రెయిన్ డ్రెయిన్ రివర్సయ్యింది...! అపోలో ఆవిర్భావానికి ముందు వరకూ ఉన్న పరిస్థితి వేరు. అప్పటివరకూ దేశం నుంచి అత్యుత్తమమైన శిక్షణ పొందిన మెరికలంతా ఏ అమెరికాకో వెళ్లిపోయేవారు. మన దగ్గర పరిగలే ఉండేవి. కానీ అపోలో ఆవిర్భావం తర్వాత బ్రెయిన్ డ్రెయిన్ తొలిసారిగా రివర్స్ అయ్యింది. దాదాపుగా 50 ఏళ్ల వయసులో ప్రతివారూ రిటైర్మెంట్ ప్లాన్స్ చేస్తుంటారు. కానీ హెల్త్ కేర్ ఇండస్ట్రీలో నా ప్రణాళికలు మొదలైందీ, సాకారం అయ్యిందీ 50 తర్వాతే! అందుకే జీవితంలో సక్సెస్కోసం ప్రయత్నాన్ని ఏ వయసులోనైనా మొదలుపెట్టవచ్చు. ‘నన్ను సర్ అనొద్దు...’ అన్న రాజీవ్ ఇందిరాగాంధీ మరణం తర్వాత రాజీవ్గాంధీ ప్రధాని అయ్యారు. ఆ సమయంలో నేనో విజ్ఞాపనతో ఆయన దగ్గరకు వెళ్లా. ఆయనకు నేను చెప్పిందొక్కటే. ‘ఆసుపత్రులు అంటూ వాటిని వేరుగా చూడవద్దు. ఒక వాణిజ్యవేత్తకు, ఒక వాణిజ్య సంస్థకు ఎలాంటి ఫండింగ్ లభిస్తుందో, అలాంటి భారీ పెట్టుబడులు, దేశ విదేశీ పెట్టుబడులే ఆసుపత్రులకూ అందేలా చట్టం రూపొందితే... దాని వల్ల ఆసుపత్రులు వెలుస్తాయి. నిజానికి దీని వల్ల ఆసుపత్రుల కార్పొరేటీకరణ జరిగి పేదలకు వైద్యం అందకుండాపోవడం అంటూ జరగదు. ఈ రంగంలో పెట్టుబడులు పెరిగి, మరెన్నో అగ్రశ్రేణి ఆసుపత్రులు వెలిస్తే వాటి మధ్య పోటీ ఏర్పడి, వైద్యచికిత్స మరింత చవక అవుతుంది’ అని చెప్పా. ఆ మాటలతో కన్విన్స్ అయ్యారు రాజీవ్. వైద్యరంగానికి ఏదైనా మేలు జరిగిందంటే ఆయన హయాంలోనే. నేను చెప్పిన రీతిలో బిల్లు రూపొందించి చట్టసభలో దాన్ని ఆమోదించే సమయంలో నన్నూ ఢిల్లీకి ఆహ్వానించారాయన! ఆయన మాట మన్నించి వెళ్లాను. ‘మీరు కోరిందే జరిగింది కదా’ అన్నారు రాజీవ్. నా దగ్గర మాటల్లేవు. ‘థ్యాంక్యూ సర్... థ్యాంక్యూ సర్..’ అంటూ ఉండిపోయాను. అప్పుడు ఆయన అన్నమాటేమిటో తెలుసా! ‘నన్ను సర్ అని సంబోధించకండి. మీరు పెద్దవారు. నన్ను మీరు ‘రాజీవ్’ అని పేరు పెట్టి పిలవండి’ అన్నారు. అప్పుడు నేను ఆయనతో ఒక మాట చెప్పా. ‘నేను అంత చనువు తీసుకొని అలా అనలేను. కాకపోతే మీ అభ్యర్థన మేరకు మిమ్మల్ని పిలిచినప్పుడల్లా ‘డియర్ ప్రైమ్ మినిస్టర్’ అని సంబోధిస్తా’ అన్నాను. నా అభ్యర్థనల మేరకు ఆయన వైద్యరంగానికి చాలా సేవలు చేశారు. ఉదాహరణకు ఒక వ్యక్తి చెల్లించే పన్నులో 10,000 రూపాయల వరకు ఇన్సూరెన్స్ చేస్తే దానికి మినహాయింపు ఇవ్వండని కోరాను. సరే అన్నారాయన. ఒక కంపెనీ తన ఉద్యోగి తాలూకు సొమ్మును ప్రభుత్వానికి టాక్స్గా చెల్లించే బదులు దాన్నే ఇన్సూరెన్స్గా చెల్లిస్తే... ఆ ఉద్యోగికి తన ఆరోగ్యం విషయంలో ఎంతటి భత్రత ఉంటుందో ఎవరైనా ఊహించవచ్చు. ఇలాంటి సౌకర్యాలెన్నో కల్పించారాయన. నిత్యశ్రమ నా ఉత్సాహానికి కారణం... ఎనభై ఏళ్లు దాటిన ఈ వయసులోనూ ఈ రోజుకీ నేను నిత్యం శ్రమిస్తూ ఉంటాను. నా శ్రమను చూసే (హెల్త్ కేర్) పరిశ్రమలోని అపోలో ఫ్యామిలీ స్ఫూర్తి పొంది నిరంతర శ్రమ చేస్తుంటారు. మీకు తెలుసా...? నేను ఇంట్లో భోజనం చేసేది కేవలం ఆదివారం మధ్యాహ్నం మాత్రమే. ప్రతిరోజూ దాదాపూ నా భోజనం బయటే. అంటే నా కార్యక్షేత్రంలోనే. అదే నా ఉత్సాహానికి కారణం. నలుగురు కూతుళ్లూ... నాలుగు స్తంభాలు... ఒక భవనం నిలవాలంటే కనీసం నలువైపులా నాలుగు స్తంభాలుండాలి. నా నలుగురు కూతుళ్లూ ఇవ్వాళ్ల నా ఈ వైద్యసేవల రంగానికి నాలుగు స్తంభాలుగా నిలబడ్డారు. మొదటి బిడ్డ ప్రీతా... అపోలో సంస్థల ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్పర్సన్ హోదాలో ప్రతి ఒక్కరికీ నాణ్యతతో కూడిన సేవలందేలా జాగ్రత్త తీసుకుంటుంటారు. ఇక రెండో కూతురు సునీత ఎంత సంక్లిష్టమైన అంశాలను చూస్తుంటుందంటే... ప్రతిక్షణం ఆమె బాధ్యతలు ఆమెపై ముళ్లకిరీటంలాగానే ఉంటాయి. అపోలో సంస్థలలో 51 శాతం పెట్టుబడులు విదేశీయులవే. అందుకే ఆ పెట్టుబడులు పెట్టిన వారు అనుక్షణం ముల్లుగర్రతో పొడిచినట్లుగా ఆమెను ప్రశ్నలను సంధిస్తూ వేధిస్తూ ఉంటారు. అంతటి బాధ్యతాయుతమైన పదవిని సమర్థంగా నిర్వహిస్తోందామె! మూడో బిడ్డ శోభన. వైద్యరంగంలో చాలా నకిలీ మందులు వస్తున్నాయనే విషయాన్ని గ్రహించి కేవలం నాణ్యమైన మందులే అందరికీ అందేలా జాగ్రత్త తీసుకునే బాధ్యతను తీసుకుంది. ఇప్పుడు మా ఫార్మసీల నెట్వర్క్లో 1650 సంస్థలు నాణ్యమైన మందులను అందిస్తున్నాయి. కొద్ది రోజుల్లోనే ఆ సంఖ్యను రెండువేలు చేయాలనే లక్ష్యంతో శ్రమిస్తోందామె. ఇక సంగీత విషయానికి వస్తే అపోలో సంస్థల ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్గా అత్యంత బాధ్యతాయుతమైన స్థానంలో మా వైద్యసేవల్లో ఎలాంటి ఫిర్యాదులూ లేకుండా సజావుగా అందేలా సమన్వయ బాధ్యతలు నిర్వహిస్తోంది. వీళ్లందరినీ బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దడంలో ప్రధాన భూమిక నా భార్య సుచరితది. విస్తరణ ఎంత అవసరమో ఎవరైనా ఆలోచించవచ్చు... అవును... విస్తరణ కావాలి. వైద్యచికిత్సారంగం ఇంకా ఇంకా విస్తరించాలి. ప్రతివారికీ నాణ్యమైన సేవలు అందాలి. అదీ చవగ్గా. అందుకే మా కమ్యూనిటీ సేవా కేంద్రాల సహాయంతో మారుమూల ప్రాంతాలకు కూడా నగరంలో దొరికింత నాణ్యమైన సేవలందించేలా చూస్తున్నాం. ఇక ప్రధానమైన టెరిషియరీ కేర్ ఉన్న హైదరాబాద్, చెన్నై లాంటి నగరాల నుంచి మామూలు ఊళ్లూ... ఒక మోస్తరు పెద్ద పల్లెటూళ్ల వరకూ ఇలాంటి నిపుణుల సేవలే అందడానికి టెలీమెడిసిన్ సహాయంతో అక్కడి పేషెంట్లకు ఇక్కడి నిపుణులు చికిత్సలూ, అవసరమైన వైద్యసహాయాలను, మందులను సూచిస్తుంటారు. ఇంకా ఇంకా వైద్యసంస్థలు విస్తరించడం ఎందుకంటారా... ప్రస్తుతం ప్రపంచాన్ని బాధిస్తున్న, వేధిస్తున్న వైద్యరంగపు పెను సవాళ్లు నాలుగు. అవి... డయాబెటిస్, గుండెజబ్బులు, క్యాన్సర్లు, సాంక్రమిక వ్యాధులు (ఇన్ఫెక్షియస్ డిసీజెస్). ఈ నాలుగూ అదుపు కాకపోతే ఎంతో విలువైన మానవ వనరులు నాశనం అవుతాయి. ఈ నాలుగు ప్రధానమైన రుగ్మతల కారణంగానే ప్రపంచవ్యాప్తంగా ఏడాదికి మూడు కోట్ల అరవై లక్షలమంది మరణిస్తున్నారు. అదీ చాలా చిన్న వయసులోనే! దాని వల్ల ఆ కుటుంబం చెల్లించే మూల్యం చాలా భారీగా ఉంటుంది. వాళ్ల చిన్నవయసు పిల్లలు దిక్కులేనివారవుతారు. వాళ్ల కుటుంబం సరే... ఇటు దేశం పరిస్థితి ఏమిటి? ఇలాంటి చిన్నవయసు మరణాల వల్ల దేశంపై పడే భారం ఎంతో తెలుసా? 36 ట్రిలియన్ డాలర్లు! ఈ సంఖ్యను రూపాయల్లోకి మార్చి చూడండి. మీకే తెలుస్తుంది దేశానికి ఎంత నష్టమో! ఇలాంటి అనర్థాలు దేశానికి మంచివి కావు. అందుకే వైద్యరంగం ఇంకా ఇంకా విస్తరించాలి. ఇలా విస్తరించిన కొద్దీ సేవలు చవక అవుతాయి. నేను ముందుగా చెప్పినట్లు ఒకనాడు 50,000 డాలర్లు ఖర్చయ్యే గుండె ఆపరేషన్ ఇవ్వాళ్లెంతో తెలుసా? కేవలం 2000 డాలర్లు. అంటే ఇలా వైద్యసంస్థలు విస్తరిస్తున్నకొద్దీ సేవలు మరింత చవక అవుతాయి. వైద్యం కార్పొరేటీకరణ అవుతుందన్న అపప్రథ ఎలా ఉన్నా... అందరికీ అందుబాటులోకి వస్తుంది. అది గుర్తిస్తే చాలు... నిందలు తొలగిపోతాయి. నిజాలు మిగులుతాయి. - యాసీన్ అపోలో పేరు వెనక... అపోలో ఆసుపత్రుల పేరును ప్రతాప్ సి రెడ్డి రెండో కూతురు సునీత సూచించారు. మొదట ఆమె సంస్కృతంలోగాని, తెలుగులో గాని తమ సంస్థ పేరు ఉండాలని కొంత కరసత్తు చేశారు. కానీ... భవిష్యత్ దర్శనం చేసినట్లుగా క్షణక్షణప్రవర్థమానంతో తమ సంస్థ ప్రపంచంలోనే ఒక అగ్రగామి సంస్థగా రూపొందుతుందని భావించారో ఏమోగానీ... ఆమె గ్రీకు పురాణాల్లో వైద్యానికి అధినేత అయిన ‘అపోలో’ను తమ సంస్థ పేరుగా నిర్ణయించారు. మన దేశం నుంచి విదేశాలకు వెళ్లే డాక్టర్ల మేధోవలసను ఆపిన ఆయన... విదేశీయ నిపుణులు సైతం ఆయన ఆసుపత్రుల్లో సేవలందిస్తే చాలని అనిపించే స్థాయికి భారత్లోని ఆసుపత్రులను చేర్చారు. ఆయన సక్సెస్ను హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో ఒక మోడల్గా చూపుతారు. ప్రపంచ హెల్త్ కేర్ ఇండస్ట్రీకి ప్రతాప్ సి. రెడ్డి చిరపరిచితులు. ఎందుకంటే... భారత్లోని వైద్య ఉపకరణాల కొనుగోలులో అపోలో సంస్థలదే అగ్రస్థానం. ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా భగవంతుణ్ణి ప్రార్థించేవేళ ప్రతాప్రెడ్డి ఎప్పుడూ ‘నాకిది కావాలి’ అని కోరరట. ఆయా దశల్లో తాను సాధించినదానికి దేవుడికి ‘థ్యాంక్స్’ మాత్రమే చెబుతారట. -
బిజినెస్ ఎక్స్లెన్స్ అవార్డుల...
కొరుక్కుపేట(చెన్నై): చెన్నైలో ఆంధ్రా చాంబర్ ఆఫ్ కామర్స్ 87వ వార్షికోత్సవం సందర్భంగా వివిధ రంగాల్లో సేవలందిస్తున్న ప్రముఖులకు బిజినెస్ ఎక్స్లెన్స్ అవార్డులను అందజేశారు. కేంద్ర పట్టణాభివృద్ధివృద్ధిశాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు ఈ అవార్డులను ప్రదానం చేశారు. అపోలో గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి రెడ్డిని, కేఆర్ఎస్ఎంఏ ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ (హైదరాబాద్) డెరైక్టర్ ఉమా చిగురుపాటిలను బిజినెస్ ఎక్స్లెన్స్ అవార్డులతో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఘనంగా సత్కరించారు. తమతమ రంగాల్లో సేవలందిస్తున్న డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి, ఉమా చిగురుపాటి యువతకు ఆదర్శనీయులని అన్నారు. వీరితో పాటు పలువురు పారిశ్రామికవేత్తలు, ఆంధ్రా చాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ అధ్యక్షులు ఎస్.సీతారామయ్య, శైలేష్ ఆర్.మెహతా, డాక్టర్ జేఏఎస్.గిరిలను సత్కరించారు. అనంతరం వెంకయ్యనాయుడు మాట్లాడుతూ 1928 లో ఏర్పడిన ఆంధ్రా చాంబర్ ఆఫ్ కామర్స్ 86 ఏళ్లు పూర్తి చేసుకుని 87వ వసంతంలోకి అడుగిడటం సం తోషకరమన్నారు. త్వరలో ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ నగరం మెడికల్ హబ్గా అవతరించబోతోందని చెప్పారు. ఆంధ్రా కామర్స్ అధ్యక్షురాలు వీఎల్ ఇందిరాదత్తు కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. -
రోచిస్టర్ మెడికల్ సెంటర్తో అపోలో ఎంవోయూ
హైదరాబాద్, న్యూస్లైన్: అపోలో 150 పడకల ఆసుపత్రి నుంచి అద్భుతమైన హెల్త్సిటీగా ఎదిగిందని అపోలో గ్రూపు హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ ప్రతాప్ సీ. రెడ్డి అన్నారు. మంగళవారం ఇక్కడ అపోలో ఆసుపత్రిలో రోచిస్టర్ మెడికల్ సెంటర్ (అమెరికా)తో అపోలో ఆసుపత్రి ఒప్పందం కుదుర్చుకున్న సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. హెల్తీ స్కూల్స్ కార్యక్రమం... క్షతగాత్రులకు అత్యవసర సేవలు అందించే హెల్తీ స్కూల్స్ కార్యక్రమాన్ని ప్రారంభించామని, ఆసుపత్రి సేవలలో ఇది ముఖ్యమైన ఘట్టమని చెప్పారు. ప్రమాదాలలో గాయపడిన విద్యార్థులకూ, వారి కుటుంబ సభ్యులకూ ఈ హెల్తీ స్కూల్ ప్రోగ్రామ్ మంచి సేవలు అందిస్తుందని చెప్పారు. దీనిలో భాగంగా స్కూల్ విద్యార్థులకు ఆరోగ్య చెక్అప్, రోడ్డు ప్రమాదాలలో గాయపడితే రూ.50వేలదాకా ఉచిత చికిత్స అందించడం హెల్తీ స్కూల్ ముఖ్య ఉద్దేశమన్నారు.కార్యక్రమంలో అపోలో ఆసుపత్రి ఈడీ సంగీతారెడ్డి, యూనివర్సిటీ ఆఫ్ రోచెస్టర్ సీవోవో పీటర్ రాబిన్సన్ తదితరులు పాల్గొన్నారు.