breaking news
PP Chowdhury
-
జేపీసీకి జమిలి బిల్లులు
సాక్షి, న్యూఢిల్లీ: ‘ఒకే దేశం, ఒకే ఎన్నిక’ దిశగా మరో ముందడుగు పడింది. జమిలి ఎన్నికలకు సంబంధించి రాజ్యాంగ(129వ సవరణ) బిల్లు–2024, కేంద్ర పాలిత ప్రాంతాల చట్టాల(సవరణ) బిల్లు–2024ను సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) పరిశీలనకు సిఫార్సు చేయడానికి పార్లమెంట్ శుక్రవారం ఆమోద ముద్ర వేసింది. ఈ మేరకు కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్రామ్ మేఘవాల్ రెండు వేర్వేరు తీర్మానాలను లోక్సభ, రాజ్యసభలో ప్రవేశపెట్టారు.ఉభయ సభలు ఈ తీర్మానాలను ఆమోదించాయి. జమిలి ఎన్నికల బిల్లులు భారత రాజ్యాంగ మూల స్వరూపానికి భంగం కలిగించేలా ఉన్నందున తదుపరి పరిశీలన నిమిత్తం జేపీసీకి పంపాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేసిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అందుకు సంసిద్ధత వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. లోక్సభతోపాటు రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడానికి వీలుగా రెండు బిల్లులను సమగ్రంగా పరిశీలించడానికి, భాగస్వామ్య పక్షాలతో సంప్రదింపులు జరపడానికి జేపీసీని ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. అనుకున్నట్లుగానే జమిలి బిల్లులపై తదుపరి అధ్యయనానికి 39 మంది ఎంపీలతో సంయుక్త పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేసింది.ఈ కమిటీలో లోక్సభ నుంచి 27 మంది, రాజ్యసభ నుంచి 12 మంది ఎంపీలకు ప్రాతినిధ్యం లభించింది. వాస్తవానికి జేపీసీలో 31 మందిని నియమించనున్నట్లు కేంద్రం తొలుత వెల్లడించింది. కానీ, కీలకమైన ఈ బిల్లులపై విస్తృత స్థాయిలో సంప్రదింపులు జరపాల్సి ఉన్న దృష్ట్యా 39 మందిని నియమించాలని నిర్ణయించింది. వివిధ పార్టీ ల ఎంపీలు సైతం జేపీసీలో చేరడానికి ఆసక్తి చూపారు. ఈ కమిటీ చైర్మన్గా బీజేపీ ఎంపీ పి.పి.చౌదరిని నియమించారు. కేంద్ర మాజీ మంత్రులు అనురాగ్ ఠాకూర్, పురుషోత్తం రూపాలా, పి.పి.చౌదరి, మనీశ్ తివారీతోపాటు ప్రియాంకగాంధీ వాద్రా, బన్సూరీ స్వరాజ్, సంబిత్ పాత్రా, హరీశ్ బాలయోగి తదితరులను జేపీసీ సభ్యులుగా నియమించారు.వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు, పార్టీ ఫ్లోర్ లీడర్ వి.విజయసాయిరెడ్డిని జేపీసీ సభ్యుడిగా నియమిస్తూ రాజ్యసభ సెక్రటేరియేట్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాజ్యసభ నుంచి జేపీసీలో చోటు దక్కిన వారి పేర్లను చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ వెల్లడించారు. విజయసాయిరెడ్డితో పాటు ఘన్శ్యామ్ తివారీ, భువనేశ్వర్ కలిత, కవిత పాటిదార్, సంజయ్ కుమార్ ఝా, రణ్దీప్సింగ్ సూర్జేవాలా, ముకుల్ బాలకృష్ణ వాస్నిక్, సాకేత్ గోఖలే, పి.విల్సన్, సంజయ్సింగ్, మానస్ రంజన్ మంగరాజ్, డాక్టర్ కె.లక్ష్మణ్ జేసీపీలో సభ్యులుగా ఎంపికయ్యారు.తెలంగాణకు సంబంధించి బీఆర్ఎస్ నుంచి కేఆర్ సురే‹Ùరెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, బండి పార్థసార«థి, దీవకొండ దామోదర్రావు రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జేపీసీలో ఒక్కరికైనా చోటు దక్కుతుందని ఆశించిన బీఆర్ఎస్కు భంగపాటు ఎదురయ్యింది. ఆంధ్రప్రదేశ్ నుంచి విజయసాయిరెడ్డి, హరీశ్ బాలయోగి, తెలంగాణ నుంచి కె.లక్ష్మణ్ జేపీసీకి నామినేట్ అయ్యారు. ఎన్డీయే నుంచి 22, ఇండియా నుంచి 10 మంది జేపీసీలో బీజేపీ నుంచి 16 మంది, కాంగ్రెస్ నుంచి ఐదుగురుకి అవకాశం కల్పించారు. అలాగే సమాజ్వాదీ పార్టీ (2), తృణమూల్ కాంగ్రెస్ పార్టీ(2), డీఎంకే(2), వైఎస్సార్సీపీ(1) శివసేన(1), టీడీపీ(1), జేడీ–యూ(1), ఆర్ఎల్డీ(1), ఎల్జేఎస్పీ–ఆర్వీ(1), జేఎస్పీ(1), శివసేన–ఉద్ధవ్(1), ఎన్సీపీ–శరద్ పవార్(1), సీపీఎం(1), ఆమ్ ఆద్మీ పార్టీ(1)కి సైతం స్థానం కల్పించారు. అధికార ఎన్డీయే నుంచి 22 మంది, విపక్ష ఇండియా కూటమి నుంచి 10 మంది జేపీసీని నామినేట్ అయ్యారు. పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రవేశపెట్టిన తీర్మానం ప్రకారం జాయింట్ పార్లమెంటరీ కమిటీ తన నివేదికను వచ్చే ఏడాది జరిగే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో చివరి వారానికి సంబంధించిన మొదటి రోజు నాటికి లోక్సభకు సమరి్పంచాల్సి ఉంటుంది.గొప్ప గౌరవంగా భావిస్తున్నా: విజయసాయిరెడ్డి ‘‘జమిలి ఎన్నికల బిల్లుకు సంబంధించి జాయింట్ పార్లమెంటరీ కమిటీకి నామినేట్ కావడం గొప్ప గౌరవంగా భావిస్తున్నా. మన ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి, పాలనా సామర్థ్యాన్ని పెంచడానికి, మన రాజకీయ నాయకుల జవాబుదారీతనాన్ని నిలబెట్టడానికి, జాతీయ ప్రయోజనాలకు తోడ్పడతానని నేను ప్రతిజ్ఞ చేస్తున్నా’’ అంటూ విజయసాయిరెడ్డి గురువారం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. జమిలిని కచి్చతంగా వ్యతిరేకిస్తాం: జైరామ్ రమేశ్ జమిలి ఎన్నికలను కచ్చితంగా వ్యతిరేకిస్తామని కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేశ్ శుక్రవారం పేర్కొన్నారు. ఇలాంటి ఎన్నికలు దేశ రాజ్యాంగ మౌలిక స్వరూపానికే విరుద్ధమని తేల్చిచెప్పారు. ప్రజాస్వామ్య వ్యతిరేక, సమాఖ్య వ్యతిరేక ఎన్నికలు మనకు అవసరం లేదని అన్నారు. జమిలి బిల్లులు నెగ్గాలంటే లోక్సభలో 272 మంది సభ్యుల మద్దతు అవసరమని చెప్పారు. అంతబలం మోదీ ప్రభుత్వానికి లేదని, బిల్లులు ఆమోదం పొందడం ఎలా సాధ్యమని ప్రశ్నించారు. -
కుష్టు ఉందని విడాకులు కుదరదు
న్యూఢిల్లీ: విడాకులు తీసుకోవాలనుకునే భార్య/భర్త తమ జీవిత భాగస్వామికి కుష్టు వ్యాధి ఉందనే కారణం చూపడం కుదరదు. ఈ మేరకు చట్టాన్ని సవరించేందుకు ఉద్దేశించిన బిల్లును సోమవారం లోక్సభ ఆమోదించింది. ‘జీవిత భాగస్వామికి కుష్టు వ్యాధి ఉందనే కారణం చూపి ఇకపై విడాకులు పొందేందుకు వీలుండదు. కుష్టు నయం కాదని ఇదివరకు అందరూ భావించేవారు. కానీ, ఈ వ్యాధికి చికిత్స ఉంది’ అని వ్యక్తిగత చట్టాల సవరణ బిల్లును ప్రవేశపెట్టిన సందర్భంగా జరిగిన చర్చలో న్యాయశాఖ సహాయ మంత్రి పీపీ చౌధరి అన్నారు. కుష్టు వ్యాధిగ్రస్తులపై వివక్షను చూపుతున్న హిందూ, ముస్లిం, క్రిస్టియన్ వివాహ చట్టాల్లో ఈ మేరకు ప్రభుత్వం మార్పులు ప్రతిపాదించినట్లు తెలిపారు. ఈ చర్చలో పాల్గొన్న ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ.. దేశంలో కుష్టు వ్యాధిని పూర్తిగా నిర్మూలించలేదు. ప్రభుత్వం ముస్లిం వ్యక్తిగత చట్టాల్లో జోక్యం చేసుకోవద్దు. పొరుగు దేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్లలో కుష్టు వ్యాధిని కారణంగా చూపి విడాకులు తీసుకునేందుకు చట్టం అనుమతిస్తోంది’ అని చెప్పారు. -
కార్పొరేట్ మోసాలపై ఉక్కు పాదం
న్యూఢిల్లీ: కార్పొరేట్ మోసాలను అరికట్టడంపై కేంద్రం మరింతగా దృష్టి సారిస్తోంది. ఇందులో భాగంగా కార్పొరేట్ సంస్థల్లో సందేహాస్పద కార్యకలాపాలేమైనా కనిపించిన పక్షంలో ప్రభుత్వం దృష్టికి తెచ్చేలా ప్రజావేగులను మరింతగా ప్రోత్సహించనుంది. అలాగే, కంపెనీల చట్టం కింద ఆయా సంస్థలు దాఖలు చేసే ఫైలింగ్స్లో.. కంపెనీ అధికారుల ఆధార్ సంఖ్య వివరాలను కూడా పొందుపర్చడం తప్పనిసరి చేసేలా చర్యలు తీసుకుంటోంది. కార్పొరేట్ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి పి.పి. చౌదరి ఈ విషయాలు తెలిపారు. కంపెనీ ఫైలింగ్స్తో పాటు ఆధార్ను అనుసంధానం చేయడం వల్ల సదరు అధికారులు/వ్యక్తుల ప్రామాణికతను అంచనా వేయడానికి ఉపయోగపడగలదని మంత్రి చెప్పారు. అక్రమంగా నిధులు మళ్లించేందుకు కొందరు ఏర్పాటు చేసే డొల్ల కంపెనీలకు చెక్ చెప్పేందుకు కూడా ఇది తోడ్పడగలదన్నారు. మనీ ల్యాండరింగ్పై బహుముఖ వ్యూహాన్ని అమలు చేస్తున్న ప్రభుత్వం.. ఎలాంటి లావాదేవీలు జరపని 2.26 లక్షల కంపెనీల పేర్లను ఇప్పటికే రికార్డుల నుంచి తొలగించింది. -
ఇక ‘లిటిగేషన్’ లేని చట్టాలు!
న్యూఢిల్లీ: భవిష్యత్తులో కొత్త చట్టాలు చేసే ముందు అవి కోర్టు కేసులకు దారితీస్తాయా లేదా అన్నదానిపై కేంద్రం వివరణ ఇవ్వాల్సి ఉండొచ్చు. అలాగే కొత్త చట్టాలు, ప్రస్తుత చట్టాలకు సవరణల వల్ల కేసుల సంఖ్య పెరగకుండా సంబంధిత మంత్రిత్వ శాఖలు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. న్యాయశాఖ సహాయ మంత్రి పీపీ చౌదరి రూపొందించిన కొత్త నోట్లో ఈ ప్రతిపాదనలను చేర్చినట్లు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. చట్టాలకు సంబంధించి పెరిగిపోతున్న వివాదాలను కోర్టుల ఆవల పరిష్కరించేలా ప్రతిపాదిత బిల్లుల్లో ప్రత్యామ్నాయ మార్గాలు సూచించాలని పేర్కొన్నారు. ఈ ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదముద్ర వేస్తే భవిష్యత్తులో ప్రవేశపెట్టే ప్రతి బిల్లులో ‘లిటిగేషన్ అసెస్మెంట్’ నిబంధన చేర్చాలి. బిల్లు చట్టరూపం దాల్చితే అది వివాదాస్పదమవుతుందా అనే విషయాన్ని కూడా సంబంధిత మంత్రిత్వ శాఖ వివరించాలి. -
ఆధార్ సురక్షితమే: కేంద్రం
న్యూఢిల్లీ: ఆధార్ డేటా లీక్ అయ్యే అవకాశం లేదని కేంద్ర ప్రభుత్వం బుధవారం లోక్సభలో వెల్లడించింది. భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ వ్యక్తిగత వివరాల లీకేజీపై వివాదం నెలకొన్న నేపథ్యంలో.. స్పందించిన కేంద్రం యూఐడీఏఐ (భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ) వ్యవస్థ కట్టుదిట్టమైనదని స్పష్టం చేసింది. ‘ఆధార్ డేటా, ఆధార్ వ్యవస్థలో లీకేజీ అనే ప్రశ్నే లేదు. ఓ ఫోటో సోషల్ మీడియాలో కనబడితే అది యూఐడీఏఐ నుంచే లీకేజీ అయినట్లు కాదు. సభ్యులందరికీ ఈ విషయంలో పూర్తి భరోసా ఇస్తున్నాం. ఇప్పటి వరకు డేటా, బయోమెట్రిక్, ఇతర వివరాలపై లీకేజీ జరగలేదు. ఇకపై జరగదు కూడా’ అని కేంద్ర ఐటీ మంత్రి పీపీ చౌధురీ లోక్సభలో వెల్లడించారు.