గృహాలు, ఆలయాల్లో10 ట్రిలియన్ డాలర్ల పసిడి
దీన్ని ఆర్థిక సాధనాల్లోకి మళ్లించాలి
దిగుమతులను తగ్గించుకోవచ్చు
మాజీ కేంద్ర మంత్రి పీపీ చౌధరి
న్యూఢిల్లీ: దేశంలో గృహాలు, ఆలయాల్లో ఉన్న 10 ట్రిలియన్ డాలర్ల విలువైన బంగారాన్ని ఆర్థిక వ్యవస్థలోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని మాజీ కేంద్ర మంత్రి పీపీ చౌధరి అన్నారు. భౌతిక బంగారాన్ని నిల్వ (స్టోర్) రూపంలో ఉంచడం వల్ల అది ఆర్థిక వృద్ధికి పెద్దగా ఉపయోగపడటం లేదని అభిప్రాయపడ్డారు. పార్లమెంటరీ స్థాయి సంఘం (ఆర్థిక) సభ్యుడైన చౌధరి, బంగారానికి బదులు ఆర్థిక సాధనాల వైపు వినియోగదారులను మళ్లించాలని సూచించారు.
దీనివల్ల బంగారం దిగుమతులపై ఆధారపడడం తగ్గుతుందని, కరెంటు ఖాతా లోటుపై ఒత్తిడి దిగొస్తుందని అన్నారు. అసోచామ్ నిర్వహించిన ఒకకార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ అభిప్రాయలను వ్యక్తం చేశారు. ఇదే కార్యక్రమంలో పాల్గొన్న నేషనల్ స్టాక్ ఎక్సే్చంజ్ చీఫ్ బిజినెస్ డెవలప్మెంట్ ఆఫీసర్ శ్రీరామ్ కృష్ణన్.. దేశంలోని గృహాలు, దేవాలయాల వద్ద సుమారు 50,000 టన్నుల బంగారం ఉందని, దీని విలువ 10 ట్రిలియన్ డాలర్లుగా ఉంటుందని తెలిపారు.
ఈ బంగారం అంతా అధికారిక ఆర్థిక వ్యవస్థకు బయటే ఉందని చెప్పారు. ఎల్రక్టానిక్ గోల్డ్ రిసీట్స్ (ఈజీఆర్) ద్వారా బంగారాన్ని డీమ్యాట్ చేసి షేర్ల మాదిరి ట్రేడ్ చేయడానికి దేశంలో అవసరమైన సాంకేతికత, వేదికలు ఉన్నాయని కృష్ణన్ తెలిపారు. అయితే, ఈజీఆర్ సమయంలో బంగారం డిపాజిట్పై విధించే 3 శాతం జీఎస్టీ ప్రధాన అడ్డంకిగా ఉన్నట్టు చెప్పారు. దీనిపై తాము పరిష్కారాన్ని సూచించినట్టు తెలిపారు. ఈజీఆర్ అన్నది సెబీ ఆమోదిత పథకం. వినియోగదారులు తమవద్దనున్న భౌతిక బంగారాన్ని డిపాజిట్ చేసి, స్టాక్ ఎక్సే్ఛంజ్ల్లో షేర్ల మాదిరి ట్రేడ్ చేసుకోవచ్చు.


