breaking news
pillai
-
అత్తమ్మ ఉండగా రత్నం వస్తుందా బాబుగోరూ..!?
దేవుడ్ని మొక్కేటోళ్లు రోజూ చెప్పుకునే మంత్రాలు కొన్నుంటాయి. వోటిని నిత్యపారాయణం అంటారు. ఆ పెకారం జూసినప్పుడు.. ఏడాదికి రెండుమార్లు చెప్పుకునే మంత్రాలను ఏటనుకోవాల? అట్టాంటివి మామూలు పెజానీకానికి అలవాటు లేదు గాబట్టి.. ఆ పనిజేసే చంద్రబాబుగోరే ఆటికి పేరు గూడా పెట్టాల! ఎందుకంటే ఆయన తనకి పిల్లనిచ్చి పెళ్లిజేసిన మావగార్ని తలుసుకుంటా.. ఒకే మంత్రాన్ని ఏడాదికి రెండుసార్లు జపిస్తావుంటాడు గాబట్టి. అదేనండీ.. పాపం అల్లుడే తనకు గొయ్యి తవ్వగలడనే మర్మం తెలీకుండా చేరదీసిన పెద్దాయన ఎన్టీవోడి పుట్టిన్రోజు, కండ్లుమూసిన్రోజూ వచ్చినప్పుడెల్లా బాబుగారు పాట పాడతావుంటారు.అబ్బెబ్బే.. బాబు గారు పాట పాడతారనగానే.. చీటీపాటో.. టెండరు పాటో.. పీపీపీ పాటో.. అమరావతి పాటో అనుకోబాకండి సార్లూ. యిది యింకో పాటూ. ఎన్టీవోడికి బారతరత్న యిప్పించేస్తా అని కల్లమాటలు అల్లిన పాట!. బాబుగారంతటి పెద్దాయన, భీష్ముడి మాదిర్తో అంతలావు పెతిగ్న జేసింతర్వాత.. వోటిని కల్లమాటలంటావా? అని కోపగించుకోకండి సార్లూ. శానా మంది సెవులు గొరుక్కుంటా వుండే మాటలు యిన్నాక అట్టా అనిపించింది. సెప్పినానంతే. యింతకీ సెవులు గొరుక్కునే మాటేటంటారా? సెంద్రబాబు గోరి అత్తమ్మ.. అదేనండీ.. పిల్లనిచ్చిన మాంగోరు తాళిగట్టిన యిల్లాలు.. జీవించి ఉండగా, భారతరత్నాన్ని సెంట్రల్ గవుర్మెంటోళ్లు, ఎన్టీవోడి మీద పేమతో బతిమాలి యిచ్చినా గూడా.. సెంద్రబోబుగారు ‘ఠాట్’ అని అడ్డం పడతారేమో అనేది గుసగుసగా యినిపిస్తాందాండీ.సెంద్రబోబు గారు.. యెప్పుడు జూసినా నేను ఢిల్లీలో సెక్రం తిప్పినా, సెక్రం తిప్పతా.. అని సెప్తా వుంటారు గదండీ. సెక్రం గుర్తుండే పార్టీలోళ్లు గూడా అన్ని సార్లు సెక్రం తిప్పడం గురించి మాటాడరండీ బాబో! మరట్టాంటి సెక్రధారి సెంద్రబాబు గోరు.. సిటికేస్తే సాలు.. భారతరత్న ఏంది.. యింకేదైనా రత్నముండినా గూడా సటుక్కున వొచ్చేయాలి గదా!. మరి ఆపాటి పరపతి ఆయనకు వుండాలి గదా అనేది వొక డవుటు. అయినా, వొక్క సెంద్రబాబు గారిదేవుండాది లెండి. ఎన్టీవోడు కన్న పిలకాయిలేవైనా తక్కవోల్లా. ఎవురికి వారు రాజకీయాల్లో కొమ్ములు వంకర్లు దిరిగినోళ్లే గదా. సిన్నమ్మ అని అందురూ పిలుసుకుని ఆయన కూతురు పురందరేశ్వరమ్మ ఏవైనా తక్కవా? సెంటర్లో రాజ్యంజేసే పార్టీలో ఆమె శానాశానా పెద్ద పోస్టుల్లో వుండాది గదా? ఆమె గట్టిగా అడిగుంటే యీపాటికి యెప్పుడో యిచ్చేసేటోళ్లుగదా..!అయినా సార్లూ.. నాకో సంగతి తెలవక అడగతా. ఎన్టీవోడికి భారతరత్న అనిపించుకునే లెవిలు వుండాదో లేదో సెంటర్లో రాజ్జెంజేసేటోల్లకి తెలవదా అంట! ఆయనకి ఆ అవార్డు యిస్తే తమ పరపతే పెరిగిపోతాదని వోల్లకి తెలవదా అంట? యీనోటా ఆనోటా యినబడతా వుండేదేంటంటే.. గవుర్మెంటోల్లు యియ్యాలనుకున్నా గూడా.. బాబుగోరు అండ్ కో, అనగా ఎన్టీవోడి కన్నపిల్లలూ సైందవుల మాదిర్తో అడ్డం పడతా వుండారని గదా!. యీ యవ్వారం యెనకాల వుండేదేనండీ అసలు మతలబు! అవార్డే గనక వొస్తే.. ఢిల్లీకి బొయ్యి రాష్ట్రపతి చేతుల్లోంచి తీస్కోవాల్సింది యెవురు? కట్టుకున్న భార్య వుండగా.. ఎవురైనా సరే.. ఆమెనే గదా తొలీత పిలిసేది. ఆమెకే గదా ఆ మరేద దక్కేది. కడుపున బుట్టినోళ్లెవ్వరూ ఎన్టీవోడిని గెమనించుకోకుండా వొదిలేసినప్పుడు.. విలవిల్లాడిపోయిన పెద్దాయన యిష్టపడి కట్టుకున్నాడు గదబ్బా.. లక్ష్మిం పార్వతిని! సెంద్రబాబుకి ఆమె వరసకి అత్తమ్మే గదా కాబోతాది!!అక్కడే వుండాది అసలు పితలాటకం. సెంద్రబాబు సహా.. ఎన్టీవోడి పిలకాయిలంతా ఆమె మాటొస్తే సాలు అగ్గి మీద గుగ్గిలాల్లాగా ఎగిరెగిరి పడతా వుంటారు గదా. మరట్టంటాటిది.. ఆమె ఢిల్లీకి బొయ్యి భారతరత్న ఆమె చేతుల్తో అందుకుంటే యీల్లు తట్టుకుంటారా? అనేదే అసలు పెశ్న. అయినా సెక్రం దిప్పి.. ఎన్టీవోడికి భారతరత్న వొచ్చేలా చెయ్యడానికి సెంద్రబాబు పరపతి ఉపయోపడతాదో లేదో గానీ.. సెంట్రలు గవుర్మెంటోళ్లు పెద్దాయన మీద భక్తితో, ప్రేమతో యియ్యాలనుకున్నా గూడా.. సెంద్రబాబు సెక్రం అడ్డమేసి ఆపేయడం మాత్రం గ్యారంటీ అని అంతా అంటాండారు. కాబట్టి పైనలుగా అందరిలోనూ కొడతావుండే డౌటేందంటే.. అత్తమ్మ ఉండగా రత్నం వస్తుందా బాబుగోరూ..!?-రాజేశ్వరి. -
వైట్హౌజ్కు బ్రైట్ స్టార్స్
అత్యుత్తమ ప్రతిభావంతుల గురించి పద్మిని పిళ్లై, నళినీ టాటాలు కాలేజి నుంచి యూనివర్శిటీ రోజుల వరకు ఎన్నోసార్లు విని ఉన్నారు. అలాంటి ప్రతిభావంతుల జాబితాలో ఇప్పుడు ఈ ఇద్దరు కూడా చేరారు. ఇది అదృష్టం కాదు. జ్ఞానదాహం, లోతైన విశ్లేషణ సామర్థ్యం తాలూకు అత్యుత్తమ ఫలితం. భారతీయ అమెరికన్లు పద్మిని పిళ్లై, నళిని టాటా ప్రతిష్ఠాత్మకమైన వైట్హౌజ్ ఫెలోస్ ప్రోంగ్రామ్ (2024–2025)కు ఎంపిక అయ్యారు....‘వైట్హౌజ్ ఫెలోస్ప్రోంగ్రాం’ కోసం ఈ ఏడాది అమెరికా నలుమూలల నుంచి 15 మందిని ఎంపిక చేశారు. వీరిలో భారతీయ మూలాలు ఉన్న పద్మిని పిళ్లై, నళిని టాటాలు ఉన్నారు.బోస్టన్కు చెందిన ఇమ్యూనో ఇంజనీర్ పద్మిని పిళ్లై సోషల్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్లో పనిచేస్తుండగా, న్యూయార్క్కు చెందిన నళిని టాటా వైట్హౌజ్ ఆఫీస్ ఆఫ్ క్యాబినెట్ అఫైర్స్లో పనిచేస్తుంది. ‘వైట్హౌజ్ ఫెలోస్ ప్రోగ్రాం’ను 1964లో మొదలుపెట్టారు. అమెరికాలోని ప్రతిష్ఠాత్మకమైన ప్రోంగ్రాములలో ఇదొకటి. తమ రంగంలో సాధించి విజయాలు, నాయకత్వ లక్షణాలు, ప్రజాసేవ... మొదలైనవి ఎంపిక ప్రక్రియలోని ప్రధాన అంశాలు.ఎంపికైన వ్యక్తులు క్యాబినెట్ కార్యదర్శులు, ఇతర ఉన్నత స్థాయి పరిపాలన అధికారులతో సహా వైట్హౌజ్ సీనియర్ సభ్యుల మార్గదర్శకత్వంలో ఏడాది లేదా అంతకంటే ఎక్కువ కాలం పనిచేస్తారు. ప్రైవేట్, ప్రభుత్వ రంగాలకు చెందిన నాయకులతో రౌండ్ టేబుల్ చర్చలలో వీరు కూడా పాల్గొంటారు. తగిన ప్రతిభ చూపితే ఉన్నతస్థాయికి చేరుకునే అవకాశం ఉంటుంది.గత సంవత్సరాలతో పోల్చితే ఈ సంవత్సరం ‘వైట్హౌజ్ ఫెలోస్ప్రోంగ్రాం’కు సంబంధించిన ఎంపిక ప్రక్రియ కఠినంగా ఉంది. అయినప్పటికీ తమ అద్భుత ప్రతిభతో వైట్హౌజ్ ఫెలోస్ప్రోంగ్రాంకు ఎంపికయ్యారు. అందుకే వీరిని ‘స్కిల్డ్ బంచ్’గా పిలుస్తున్నారు. అత్యుత్తమ నైపుణ్యం కలిగిన ఇమ్యునో ఇంజినీర్ గా పద్మిని పిళ్లైని వైట్హౌజ్ వెబ్సైట్ ప్రశంసించింది. పద్మిని గతంలో ఎంఐటీలో ట్యూమర్–సెలెక్టివ్ నానోథెరపీపై పనిచేసిన టీమ్కు నాయకత్వం వహించింది.2013లో అనారోగ్యానికి గురైన పద్మిని దాదాపు మరణపు అంచుల వరకు వెళ్లింది. ఆసుపత్రులలో రోజుల తరబడి గడిపింది. ‘ఆసుపత్రి నుంచి బయటపడిన తరువాత చిన్న పని చేసినా అలిసి పోయేదాన్ని. ఇలా అవుతోందేమిటా అని ఎన్నోసార్లు నిరాశకు గురయ్యాను. ఫుల్ ఎనర్జీ రావడానికి నెలల సమయం పట్టింది. నిరాశలో ఉన్నప్పుడు మనకు ధైర్యం చెప్పేవాళ్లు కుటుంబం, స్నేహితులలో ఉండడం అవసరం’ అంటుంది పద్మిని.రెగిస్ కాలేజీ నుంచి బయోకెమిస్ట్రీలో డిగ్రీ, యేల్ యూనివర్శిటీలో ఇమ్యునో బయాలజీలో పీహెచ్డీ చేసిన పద్మిని పిళ్లై కోవిడ్ మహమ్మారి విధ్వంసంపై లోతైన విశ్లేషణ చేసింది. వ్యాక్సినేషన్, ఇమ్యూనిటీ, వైరస్ ప్రభావంపై ఆమె ఆలోచనలను సీఎన్బీసీ, ది అట్లాంటిక్, న్యూయార్క్ టైమ్స్లాంటి ప్రముఖ మీడియా సంస్థలు కవర్ చేశాయి.ఇక నళిని టాటా విషయానికి వస్తే.. బ్రౌన్ యూనివర్శిటీలో న్యూరోబయోలాజీలో బీఎస్సీ, యూనివర్శిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్లో ఎంఫిల్, నార్త్ వెస్ట్రన్ ఫీన్బర్గ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ నుంచి ఎండీ చేసింది. ‘హార్వర్డ్ కెన్నడీ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్’లో డెమోక్రసీ, పాలిటిక్స్ అండ్ ఇనిస్టిట్యూషన్లో పట్టా పోందింది. ఎన్నో సైంటిఫిక్ జర్నల్స్లో పరిశోధనాత్మక రచనలు చేసింది. వైద్య విషయాలనైనే కాదు రాజకీయ, ఆర్థిక విషయాలపై కూడా నళినీ టాటాకు ఆసక్తి ఉంది. -
అసామాన్య వనిత 'అంబికా పిళ్లై'!..ఓ పక్క కేన్సర్తో పోరాటం మరోవైపు..!
ప్రతి వ్యక్తి జీవితంలో ఏదో ఒక సమయంలో ఊహించని మలుపులు ఎదురవుతుంటాయి. అవి ఎటువైపుకి తీసుకువెళ్తాయో కూడా చెప్పలేం. అలాంటి సమయాల్లో సరైన నిర్ణయాలతో అడుగులు వేసినవాళ్లే అసామాన్య వ్యక్తులుగా నిలిచిపోతారు. అందరికి స్ఫూర్తిగా నిలుస్తారు. అలాంటి అసామాన్యురాలే ఈ అంబికా పిళ్లై. ఒకదాని వెంట ఒకటిలా కష్టాలు తరుముతున్న ఎక్కడ తన గమనం ఆపలేదు. తన అసామాన్య ప్రతిభతో దూసుకుపోయింది. చివరికి ప్రపంచమే మెచ్చే మేకప్ ఆర్టిస్ట్గా పేరు తెచ్చుకుని ప్రశంసలందుకుంది.భారతదేశంలోని ప్రసిద్ధ మేకప్ ఆర్టిస్ట్లలో ఒకరు అంబికా పిళ్లై. జీవితంలో కష్టాలనేవి సహజమే. కానీ ఎలాంటి కష్టానికైనా.. తలవంచకుండా ధైర్యంగా సాగిపోయేవాడికే ఈ ధూనియా సలాం కొడుతుంది. అదే మేకప్ ఆర్టిస్ట్ అంబికా పిళ్లై విషయంలో జరిగింది. కేరళకు చెందిన పిళ్లై నలుగురు సోదరిమణులలో రెండోవది. ఆమె 17 ఏళ్ల వయసులోనే వివాహం చేసుకుంది. 22 ఏళ్లకు కవిత అనే అమ్మాయికి జన్మనిచ్చింది. ఆ తర్వాత 24 ఏళ్లకే వైవాహి జీవితంలో మనస్పర్థలు తలెత్తి విడాకులకు దారితీసింది. ఆ బాధను పట్టిదిగువున బిగపెట్టి కూతురే జీవితంగా కెరీర్పై దృష్టి పెట్టింది. అలా ఆమె తనకెంతో ఇష్టమైన ఫ్యాషన్ రంగం వైపు అడుగులు వేసింది. బ్రెష్ పట్టుకుని ముఖానికి మెరుగులు దిగ్గే మేకప్ ఆర్టిస్ట్గా పనిచేయడం ప్రారంభించింది. అదే ఆమె జీవితాన్ని ఉన్నతమైన స్థితికి వెళ్లేలా చేసింది. చిన్న మేకప్ ఆర్టిస్ట్ కాస్త 1999-2000లో FDCI ఇండియన్ ఫ్యాషన్ వీక్కి పనిచేసే స్థాయికి చేరుకుంది. ఆ తర్వాత రోహిత్ బాల్, సుస్మితా సేన్, సోనమ్ కపూర్ వంటి బాలీవుడ్ దిగ్గజ నటులకు పనిచేసే మేకప్ ఆర్టిస్ట్గా పేరుతెచ్చుకుంది. అంతా సవ్యంగా సాగుతున్న తరుణంలో భయంకరమైన కేన్సర్ వ్యాధి బారినపడింది. సరిగ్గా అదే సమయంలో బిజినెస్ పరంగా స్నేహితురాలి చేతిలో దారుణంగా మోసపోయింది. రెండు కోలుకోలేని దెబ్బలతో తిరిగి కోలుకోలేనంతగా చతికిలపడింది అంబికా జీవితం. అంతా అంబికా అయిపోయింది అనుకున్నారు. కానీ ఆమె కష్టాలను చాలా ధైర్యంగా ఎదుర్కొంది. ఎవ్వరూ ఊహించని రీతిలో కేన్సర్ని జయించి మళ్లీ నెమ్మదిగా యథావిధిగా తన గమనం సాగించింది. ఇక స్నేహితురాలి మోసంతో తన సొంత పేరుతోనే స్వయంగా వ్యాపారం చేయడం ప్రారంభించింది. అలా ఆమె త్తమ మేకప్ ఆర్టిస్ట్గా IIFA అవార్డును కూడా అందుకుంది. ఆ తర్వాత 2019లో తన సొంత హెర్బల్ బ్యూటీ బ్రాండ్ స్కిన్ అండ్ హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ను ప్రారంభించింది. ప్రస్తుతం ఆమెకు 70 ఏళ్లు. ఈ వయసులోనూ అదే ఉత్సాహంతో పనిచేస్తుంది. ప్రస్తుతం ఇంటి నుంచే బిజినెస్ పనులన్ని నిర్వహిస్తోంది. ఆమెకు చిన్న చిన కథలు రాసే అలవాటు ఉందంట. అందుకని ఖాళీ సమయంలో ఎలాగైనా ఒక పుస్తకం రాయాలను భావిస్తోందట అంబికా పిళ్లై. ఇంత భయానక కష్టాలను అవలీలగా జయించుకుని రావమే గాక ప్రతిష్టాత్మక అవార్డులను అందుకుని ప్రపంచం తనవైపు చూసేలా చేసింది. జీవించడమంటే ఇది కథా.! అనేలా జీవించి చూపించి స్ఫూర్తిగా నిలిచింది అంబికా పిళ్లై.(చదవండి: సాల్మన్ చేపలతో సౌందర్యం..!) -
Pawan Kalyan: ప్చ్.. ఈసారి పూర్తిగా క్షవరం!
పవన్ కల్యాణ్ సెంటిమెంట్లకు, ఇంకా సూటిగా చెప్పాలంటే మూఢ నమ్మకాలకు చాలా చాలా విలువ ఇచ్చే వ్యక్తి అని ప్రతి ఒక్కరికీ తెలుసు. ఆయన తన అత్యంత విశ్వసనీయుడైన సహచరుడితో కలిసి క్షుద్రపూజలు కూడా చేయిస్తూ ఉంటారని, ఆ క్షుద్రపూజలే ఎన్నికల్లో గెలిపిస్తాయనే విశ్వాసంతో కూడా ఉంటారని కూడా గతంలో విస్తృతంగా ప్రచారం అయింది. అలాంటి పవన్ కల్యాణ్ ఒక్కో సమయంలో ఒక్కో రకం సెంటిమెంటును ఆశ్రయిస్తుంటారు. ఈసారి 2024 ఎన్నికలను ఎదుర్కోవడానికి ఆయన ‘క్లీన్ షేవ్’ సెంటిమెంటును నమ్ముకున్నట్టుగా కనిపిస్తోంది. పవన్ కల్యాణ్ తరచుగా బవిరిగడ్డంతో కనిపిస్తూ ఉంటారు. నిజానికి సినిమా హీరోలు చాలా వరకు షూటింగులు లేని సమయాల్లో గడ్డం మెయింటైన్ చేస్తూ షూటింగు ఉన్నప్పుడు మాత్రం ఆ పాత్ర అవసరాన్ని బట్టి క్లీన్ షేవ్ చేసుకుంటూ ఉంటారు. పవన్ కల్యాణ్, రాజకీయ నేతగా నిత్యం గడ్డంతో కనిపించడాన్నే ప్రజలకు అలవాటు చేశారు. గడ్డంతో మాత్రమే తన మొహానికి కాస్త పెద్దరికం వస్తుందని ఆయన అనుకున్నారో ఏమో తెలియదు. లేదా గడ్డంతో వెళితే గొప్ప రాజకీయ నాయకుడు అయిపోతావని ఎవరైనా స్వాములు ఆయనకు ఉపదేశించారో తెలియదు. మొత్తానికి గడ్డంతోనే రాజకీయం చేస్తూ వచ్చారు. కానీ ఇప్పటిదాకా ఆయన సాధించిన ఫలితం సున్నా. ఈ ఎన్నికల సీజను వచ్చిన తర్వాత.. ముందుగా గడ్డాన్ని పూర్తిగా త్యజించారు. ఎప్పుడు చూసినా ‘క్లీన్ షేవ్డ్’ గా కనిపిస్తున్నారు. ఈ సారి ఎన్నికల్లో ‘క్లీన్ షేవ్’ లుక్ గెలిపిస్తుందనే సెంటిమెంటు ఆయనను ముందుకు నడిపిస్తున్నట్టుగా ఉంది. పాపం ఎన్నికల సీజన్లో పవన్ ఇంకా అనేక సెంటిమెంట్లను కూడా పక్కన పెట్టారు. గత ఎన్నికల సమయానికి ఆయన మెడలో అందరికీ కనిపించేలా కట్టుకున్న ఒక తావీదు సాయంతో రాజకీయం చేశారు. ఎర్రటి దారానికి కట్టిన తావీదు ఉండేది. తావీదు మహిమ తనను గెలిపిస్తుందనే ఆయన బలంగా నమ్మారు. కానీ అది పనిచేయలేదు. తావీదు ఎంత దారుణంగా ప్రతికూల ఫలితాన్నిచ్చింది. పార్టీ తరఫున ఒక్కడు గెలిస్తే, గెలిచిన వెంటనే ఫిరాయించేశాడు. స్వయంగా పవన్ రెండుచోట్ల ఓడిపోయారు.తావీదు మీద ఆయనకు నమ్మకం పోయింది గానీ.. చాలాకాలం దానిని కొనసాగించాడు. ఈలోగా ఉంగరాల పిచ్చి పట్టుకుంది. రాళ్ల ఉంగరాలు ధరిస్తే రాజయోగం పడుతుందని బాబాలో, స్వాములో మళ్లీ పవన్ చెవిలో ఊదినట్టున్నారు. వెంటనే ఆయన బాగా స్ఫుటంగా కనిపించేలా ఎర్రటి పెద్ద రాయి, పగడం లాంటిది, పొదిగిన ఉంగరాన్ని ధరిస్తూ దూసుకెళ్లిపోయారు. ఆ ఉంగరాల ప్రభావం కూడా రాజకీయ వైభవాన్ని అందించలేదు. ఇప్పుడు పవన్ కల్యాణ్ మొత్తంగా స్టైల్ మార్చారు. చేతులకు ఉన్న పదివేళ్లకూ ఒక్క ఉంగరం కూడా లేదు. రాళ్ల ఉంగరాలు గానీ, ఇతరత్ర మంత్ర శక్తులు ఆవాహన చేసిన బంగారు ఉంగరాలు గానీ పెట్టుకోవడం లేదు. తాయెత్తులు ధరించడం లేదు. ఎట్ లీస్ట్ మెడలో అందరికీ కనిపించేలా ధరించడం లేదు. గడ్డాన్ని కూడా పరిత్యజించారు. క్లీన్ షేవ్డ్ వ్యక్తిగా, ఏ ఎగస్ట్రా సెంటిమెంటు ఆభరణాలు, తొడుగులు లేని మనిషిగా ప్రస్తుతం రాజకీయం చేస్తున్నారు. మరి ఈ క్లీన్ షేవ్ సెంటిమెంట్ కనీసం ఆయననైనా గెలిపిస్తుందా? లేదా, ఫలితాలు కూడ క్లీన్ షేవ్ అయిపోతాయా అనే చర్చ ఇప్పుడు ప్రజల్లో జరుగుతోంది. పవన్ కల్యాణ్ తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుని.. తమ పార్టీ స్థాయికి తగినన్ని సీట్లు పొందడంలోనే విఫలం అయ్యారు. ఆ రకంగా చూస్తే ఇప్పటికే పాక్షికంగా ‘షేవ్’ అయినట్టే. ఎన్నికల ఫలితాల తర్వాత ‘క్లీన్ షేవ్’ అయినట్టా కానట్టా అని తేలుతుంది!.-వంశీకృష్ణ


