breaking news
PCPNDT Act
-
లింగ నిర్ధారణ పరీక్షలు చేసిన స్కానింగ్ సెంటర్ సీజ్
పీలేరు (చిత్తూరు): చిత్తూరు జిల్లా పీలేరులో లింగ నిర్ధారణ పరీక్షలు చేసిన ఆస్పత్రిని పీసీపీఎన్డీటీ (గర్భస్థ శిశు లింగ నిర్ధారణ చట్టం) కమిటీ మంగళవారం సీజ్ చేసింది. కమిటీ సభ్యురాలు డాక్టర్ రమాదేవి మీడియాకు వివరాలు వెల్లడించారు. తిరుపతికి చెందిన హైరిస్క్ మానిటరింగ్ టీమ్ నుంచి తమకు అందిన సమాచారం మేరకు అగ్రహారానికి చెందిన కవిత (వివాహిత) గర్భస్రావంతో తిరుపతి రుయాలో చేరిందన్నారు. ఈ మహిళ కుటుంబసభ్యులను విచారించగా పీలేరు నోబుల్ నర్సింగ్ హోమ్లో చికిత్స నిమిత్తం అడ్మిట్ అయ్యామని, అక్కడ డాక్టర్ గాలేటి బాషా తమకు గర్భవిచ్ఛిత్తి నిమిత్తం చేసిన చికిత్స ఫలితంగా ఆరోగ్యం విషమించడంతో ఇక్కడికి పంపారని తెలిపారన్నారు. పీసీపీఎన్డీటీ కమిటీ సభ్యురాలు డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ పూజారి లోకవర్ధన్ ఆధ్వర్యంలో సాధారణ విచారణ నిమిత్తం పీలేరులోని నోబుల్ నర్శింగ్ హోమ్కు వచ్చారు. అక్కడ తమ ఎదుటే పీలేరుకు చెందిన మస్తాన్ భార్య సునీర్ (27)అనే మహిళకు స్కానింగ్ చేసి లింగనిర్ధారణ పరీక్షలు పూర్తి చేసుకుందని, గర్భంలో ఆడ శిశువు ఉన్నట్లు వారికి తెలియజేయడం తమ కళ్లెదుటే జరిగిందన్నారు. దీంతో తాము వచ్చిన విచారణకు తోడు ఇక్కడ ప్రత్యక్షంగా జరిగిన సంఘటనలపై జిల్లా కలెక్టర్కు నివేదిక మర్పిస్తున్నట్లు తెలిపారు. కలెక్టర్ ఆదేశాల మేరకు పీలేరు తహసీల్దారు నేతృత్వంలో నర్శింగ్ హోమ్లో నిర్వహిస్తున్న స్కానింగ్ సెంటరును సీజ్ చేశామన్నారు. పూర్తి విచారణ అనంతరం అక్కడి డాక్టర్ గాలేటి బాషాపై చర్యలుంటాయని వివరించారు. నర్శింగ్ హోమ్ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తోందని తేలిందన్నారు. -
కడుపుకోత!
పీసీపీఎన్డీటీ యాక్ట్ ఉల్లంఘిస్తే మూడేళ్ల పాటు జైలు శిక్షతో పాటు రూ 50 వేల జరిమానా. ఇదీ.. అన్ని ప్రైవేటు ఆస్పత్రుల్లో కనిపించే బోర్డు. అయితే ఆచరణలో చట్టం అభాసుపాలవుతోంది. చట్టం అమలుపై రెండు నెలలకోసారి సలహా సంఘం సమావేశం నిర్వహిస్తున్నా ఫలితం కనిపించడం లేదు. కొన్ని ఆస్పత్రులు యథేచ్ఛగా అబార్షన్లు, లింగనిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నాయి. ఈ విషయంలో వైద్యఆరోగ్య శాఖ అధికారుల వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఏఎన్ఎం, ఆశా కార్యకర్తలు అబార్షన్లను ప్రోత్సహిస్తుండడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సాక్షి, అనంతపురం : ఆడపిల్ల అనగానే కడుపులోనే ప్రాణం తీసేసే పరిస్థితి నెలకొంది. సాంకేతికంగా అభివృద్ధి చెందుతున్నా..అమాయకత్వం, పేదరికం, అవగాహన లోపంతో గ్రామీణులు అబార్షన్లు చేయించుకుంటున్నారు. అన్నీ తెలిసిన కొందరు వైద్యులే ధనార్జనే ధ్యేయంగా అబార్షన్లు చేస్తుండడంతో ఆడపిల్లలు ప్రపంచాన్ని చూడకుండానే కన్ను మూస్తున్నారు. కాదు..కాదు చంపేస్తున్నారు. ఈ భ్రూణ హత్యలకు ఆరోగ్యశాఖ సిబ్బందే పరోక్షంగా సహకరిస్తున్నారన్న విమర్శలున్నాయి. గడిచిన నెలన్నరలో రెండు అబార్షన్లు సాక్షాత్తు ఆరోగ్యశాఖ సిబ్బంది ప్రమేయంతోనే జరిగినట్లు తెలుస్తోంది. ఇక తెలియక జిల్లాలో మరెందరు ఆడపిల్లలు ఈ లోకాన్ని చూడక కన్నుమూస్తున్నారో తెలియని పరిస్థితి. శ్రేయ ఆస్పత్రిపై చర్యలేవీ? ఈ నెల 10న నగరంలోని శ్రేయ ఆస్పత్రిలో పెద్దపప్పూరు మండలం సోమనేపల్లికి చెందిన శివలక్ష్మి(5 నెలల గర్భిణి)కి డాక్టర్ రాజ్యలక్ష్మి అబార్షన్ చేసినట్లు ఆరోగ్యశాఖ అధికారులు ధ్రువీకరించారు. ఆడపిల్ల అనే కారణంగానే తాము అబార్షన్ చేయించుకున్నామని, అందుకు సదరు వైద్యురాలికి రూ.3800 ఇచ్చామంటూ బాధితురాలి భర్త శీన లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాడు. అబార్షన్ చేశారన్న ఆరోపణలతో డీఎంహెచ్ఓ శ్రేయ ఆస్పత్రి స్కానింగ్ మిషన్ను సీజ్ చేశారు. ఆ తర్వాత ఎటువంటి చర్యలు తీసుకోలేదు. గత నెల 4న రాకెట్లతండాకు చెందిన జ్యోతిబాయి(5 నెలల గర్భిణి)కి పాల్తూరు పీహెచ్సీలో విధులు నిర్వర్తించే ఓ ఏఎన్ఎం అబార్షన్ చేయించింది. జ్యోతిబాయి తీవ్ర రక్తస్రావంతో సర్వజనాస్పత్రిలో ప్రాణాపాయ స్థితిలో అడ్మిట్ అయ్యింది. అప్పట్లో ఏఎన్ఎంను సస్పెన్షన్ చేస్తున్నట్లు ఆరోగ్యశాఖ ప్రకటించింది. ప్రస్తుతం ఏఎన్ఎం సస్పెన్షన్ను రీవోక్ చేసి, శ్రీధర్ఘట్టలోని డీ హొన్నూరులో పోస్టింగ్ ఇచ్చారు. అమాయక ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ప్రైవేట్ ఆస్పత్రులు, ఏఎన్ఎంలపై ఆరోగ్యశాఖ ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పీసీపీఎన్డీటీ యాక్ట్ను ఉల్లంఘిస్తున్నా వారిపై కేసులు నమోదు చేయకపోవడం అందరినీ విస్మయానికి గురి చేస్తోంది. పేరుకు మాత్రమే యాక్ట్పై అధికారులు ప్రచారం నిర్వహిస్తున్నారని, చర్యలు తీసుకోవడంలో ఎటువంటి ముందడుగు వేయడం లేదని స్పష్టంగా తెలుస్తోంది. ఆస్పత్రులతో లోపాయికారీ ఒప్పందం అబార్షన్లు ప్రోత్సహించడంలో కొందరు ఏఎన్ఎం, ఆశాలకు కీలకంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లాలోని ఉరవకొండ, నార్పల, గుంతకల్లు, హిందూపురం, తదితర ప్రాంతాల్లోని కొందరు సిబ్బంది ప్రైవేట్ ఆస్పత్రులతో లోపాయికారీ ఒప్పందాలు చేసుకుంటున్నారన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి. అబార్షన్, లింగ నిర్ధారణ కేసులను జిల్లా కేంద్రంలోని కొన్ని ఆస్పత్రులతో తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. ఆరోగ్యశాఖ అధికారులు నిఘా ఉంచితే మరిన్ని అడ్డగోలు బాగోతాలు వెలుగు చూస్తాయంటూ ఆరోగ్యశాఖ సిబ్బంది చెబుతున్నారు. -
నేటి నుంచి రేడియాలజిస్టుల దేశవ్యాప్త సమ్మె
న్యూఢిల్లీ: తమ సమస్యలపై కేంద్ర ప్రభుత్వం నుంచి సరైన హామీ రాకపోవడంతో రేడియాలజిస్టులు నేటి నుంచి నిరవధిక సమ్మె చేయనున్నారు. దీంతో రేడియాలజీ , అల్ట్రాసోనోగ్రఫీ, ఇతర స్కానింగ్ సేవలు తీవ్రంగా ప్రభావితం కానున్నాయి. సెప్టెంబర్ 1 నుంచే సమ్మె చేయాలని నిర్ణయించినా... కేంద్ర ప్రభుత్వంతో చర్చల అనంతరం ఇండియన్ రేడియోలాజిక్ అండ్ ఇమేజింగ్ అసోసియేషన్ తన నిర్ణయంపై పునరాలోచన చేసింది. రెండు నెలల వ్యవధిలో డిమాండ్లు పరిష్కరిస్తామని కేంద్రం చెప్పినా... సరైన హామీనివ్వకపోవడంతో నేటి నుంచి సమ్మె చేయాలని నిర్ణయించారు.