breaking news
Passingers safe
-
240 ప్రాణాలు..15 వేల అడుగులు
న్యూఢిల్లీ: ఓ విమానం.. 240 మంది ప్రయాణికులు.. 15 వేల అడుగుల ఎత్తు.. ఒక్కసారిగా మారిన వాతావరణం.. ఊడిపడిన విమానం కిటికీ ప్యానెల్.. ఏం జరుగుతోందో అర్థం కాని పరిస్థితి. తీవ్ర గందరగోళం.. ఆందోళన.. 12 నిమిషాలపాటు నరకం. ఎట్టకేలకు సురక్షితంగా గమ్యస్థానానికి చేరిన విమానం. ఈనెల 19న అమృత్సర్ నుంచి ఢిల్లీ వెళ్లిన ఎయిరిండియా విమానంలో నెలకొన్న పరిస్థితి ఇది. విమానం 15 వేల అడుగుల ఎత్తులో ఉండగా తీవ్ర ప్రతికూల వాతావరణం ఏర్పడింది. దీంతో విమానం తీవ్ర ఒడిదుడుకులకు గురైంది. అదే సమయంలో కిటికీ ప్యానెల్ ఊడిపడటంతో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. విమానంలో, తర్వాత ఢిల్లీ విమానాశ్రయంలో వారికి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం వారు వేరే విమానాల్లో వెళ్లిపోయారు. ఈ మొత్తం వ్యవహారంపై ఎయిరిండియాతోపాటు ఏవియేషన్ రెగ్యులేటర్ డైరెక్టొరేట్ అథారిటీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ), ఎయిర్క్రాఫ్ట్ ప్రమాదాల దర్యాప్తు బోర్డు (ఏఏఐబీ) విచారణ జరుపుతున్నట్లు సంస్థ అధికారులు తెలిపారు. ఘటనకు సంబంధించి 50 సెకెన్ల వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తోంది. ఊడిపడిన కిటికీ ప్యానెల్ను తిరిగి బిగించేందుకు ఎయిర్ హోస్టెస్ ప్రయత్నిస్తుండటం అందులో కనిపించింది. -
రోడ్డు ప్రమాదం: ప్రైవేటు బస్సు దగ్ధం
-
రోడ్డు ప్రమాదం: ప్రైవేటు బస్సు దగ్ధం
ఉలవపాడు: ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలం వీరేపల్లి-మోచర్ల మధ్య 16వ నంబరు జాతీయ రహదారిపై బుధవారం ఉదయం ఘోర ప్రమాదం తప్పింది. హైదరాబాద్ నుంచి చెన్నై వెళుతున్న ఆరంజ్ ట్రావెల్స్కు చెందిన స్లీపర్ బస్సు వేగంగా వెళుతూ కంటైనర్ను ఢీకొంది. ఈ సంఘటనలో బస్సులో మంటలు చెలరేగాయి. గమనించిన ప్రయాణికులు వెంటనే బస్సు దిగారు. ఈ ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్లు గాయపడ్డారు. బస్సు పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ట్రాఫిక్ను మరో మార్గం గుండా మళ్లించారు. ప్రయాణికులను మరో బస్సులో తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రమాదం జరిగినపుడు బస్సులో 18 మంది ఉన్నారు. స్లీపర్ బస్సుకావడంతో అందరూ నిద్రలో ఉన్న సమయంలో మంటలు చెలరేగడంతో వారు భయభ్రాంతులకు గురయ్యారు.