padmaja rani
-
డీఆర్డీఏ నూతన పీడీ బాధ్యతలు స్వీకరించేనా..?
ఖమ్మం హవేలి, న్యూస్లైన్: డీఆర్డీఏ పీడీగా వైవీ సత్యభాస్కర్ను నియమిస్తూ సెర్ప్ సీఈఓ రాజశేఖర్ ఆదేశాలు జారీ చేసి ఐదు రోజులు గడుస్తున్నా అతను బాధ్యతలు స్వీకరించే విషయంలో సందిగ్ధం నెలకొంది. ఇప్పటికీ ఈ విషయంపై స్పష్టత రాలేదు. సంవత్సర కాల పరిమితితో డీఆర్డీఏ పీడీగా వరంగల్లో డీపీఓగా పని చేస్తున్న పద్మజారాణి గత ఏడాది ఫిబ్రవరి 15న డిప్యుటేషన్పై వచ్చారు. జిల్లా ఇన్చార్జ్ డీపీఓగా కూడా వ్యవహరిస్తున్నారు. ఆమె డిప్యుటేషన్ పరిమితి ముగియడంతో ఆమెను తిరిగి మాతృశాఖకు పంపిస్తూ సెర్ప్లో భూవిభాగంలో స్టేట్ ప్రాజెక్టు మేనేజర్గా పని చేస్తున్న సత్యభాస్కర్ను ఇక్కడికి బదిలీ చేస్తూ గత నెల 28వ తేదీన సెర్ప్ సీఈఓ ఉత్తర్వులు జారీ చేశారు. తక్షణమే విధుల్లో చేరాలని సత్యభాస్కర్ను ఆదేశించారు. కాగా సోమవారం సత్యభాస్కర్ డీఆర్డీఏ కార్యాలయానికి వచ్చారు. అయితే బాధ్యతలు మాత్రం స్వీకరించలేదు. వచ్చే సాధారణ ఎన్నికలకు సంబంధించి జిల్లాలో పలువురు అధికారులకు నోడల్ అధికారులుగా విధులు కేటాయించారు. అందులో భాగంగా ప్రస్తుతం పని చేస్తున్న పద్మజారాణికి ఎన్నికలకు సంబంధించి ట్రైనింగ్ మేనేజ్మెంట్ బాధ్యతలు అప్పగించారు. ఈ బాధ్యతల పేరుతో ఆమె ఇక్కడి నుంచి రిలీవ్ అయ్యేందుకు అయిష్టంగా ఉన్నట్లు తెలిసింది. దీంతో ఇక్కడ కొత్తగా విధుల్లో చేరేందుకు వచ్చిన సత్యభాస్కర్ తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఎన్నికలకు సంబంధించి మెటీరియల్ మేనేజ్మెంట్ నోడల్ అధికారిగా విధులు కేటాయించిన డ్వామా పీడీ శ్రీనివాసులు మాత్రం ఇటీవల బదిలీ కావడంతో రిలీవ్ అయి వెళ్లారు. అదేవిధంగా సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీగా వచ్చిన రాములు సోమవారం జిల్లాలో బాధ్యతలు చేపట్టారు. కొత్తగా బదిలీపై వచ్చిన అధికారులు కూడా ఎన్నికల బాధ్యతలను నిర్వహించే బాధ్యత ఉంటుంది. పైగా రెవెన్యూ విభాగంలో అనుభవం ఉండి ఇక్కడకు డీఆర్డీఏ పీడీగా బదిలీపై వచ్చిన సత్యభాస్కర్ సైతం ఎన్నికల నోడల్ అధికారిగా బాధ్యతలు నిర్వహించే అవకాశం ఉంది. కానీ పద్మజారాణి ఇక్కడి నుంచి వెళ్లకుండా ఉండేందుకు జిల్లా ఉన్నతాధికారులపై హైదరాబాద్ స్థాయిలో ఒత్తిడి తీసుకువస్తున్నట్లు సమాచారం. -
ఐకేపీ ఉద్యోగుల సమ్మె విరమణ
ఖమ్మం ఖిల్లా, న్యూస్లైన్: డీఆర్డీఏ పీడీ పద్మజారాణి వైఖరికి నిరసనగా ఐకేపీ ఉద్యోగులు వారం రోజులుగా సామూహిక సెలవు పెట్టి చేస్తున్న సమ్మెను మంగళవారం విరమించారు. పీడీ వెంటనే రాజీనామా చేయాలని, ఉద్యోగుల పట్ల తన వైఖరి మార్చుకోవాలని వారు డిమాండ్ చేసినప్పటికీ ఆమె ఏమాత్రం వెనక్కు తగ్గలేదు. ఎవరేం చేసుకున్నా తనకు నష్టం లేదన్నట్టుగా వ్యవహరించారు. దీంతో ఆమె ఇక మెట్టు దిగదని గ్రహించిన ఉద్యోగులు.. సెర్ప్ సీఈవో హామీతో పట్టువీడక తప్పలేదు. ఎట్టకేలకు బుధవారం నుంచి విధుల్లోకి చేరుతున్నట్లు ప్రకటించారు. సెర్ప్ సీఈఓ రాజశేఖర్ ఆహ్వానం మేరకు ఐకేపీ ఉద్యోగ సంఘాల నాయకులు సంపత్ తదితరులు సోమవారం హైదరాబాదుకు వెళ్లి చర్చలు జరిపారు. తాను ఉద్యోగులకు పూర్తిగా సహకరిస్తానని, వీలైనంత త్వరగా సమస్య పరిష్కరించేలా చూస్తానని ఆయన ఇచ్చిన హామీ మేరకు సమ్మె విరమిస్తున్నామని ఉద్యోగులు తెలిపారు. రఘునాథపాలెంలోని స్త్రీశక్తి భవనంలో మంగళవారం జరిగిన డీఆర్డీఏ-ఐకేపీ ఉద్యోగుల సమావేశంలో ఈ విషయం వెల్లడించారు. సమస్య పరిష్కరించకుంటే మరో ఉద్యమం... ఐకేపీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకుంటే మరో ఉద్యమానికి సిద్ధం అవుతామని టీజీవో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏలూరి శ్రీనివాసరావు, టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు కూరపాటి రంగరాజు, టీజీవో జిల్లా అధ్యక్షుడు ఖాజామియా, కార్యదర్శి రత్నాకర్ హెచ్చరించారు. ఐకేపీ ఉద్యోగుల సమావేశానికి హాజరైన వారు తొలుత సీపీవోతో జరిగిన చర్చల గురించి సంపత్ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. ఉద్యోగులకు సీఈవో ఇచ్చిన హామీ అమలయ్యేలా చూడాలని కోరారు. లేకుంటే మళ్లీ ఉద్యమించక తప్పదన్నారు. ఐకేపీ ఉద్యోగులకు తాము ఎప్పుడూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు. సమావేశంలో ఐకేపి, వివిధ సంఘాల నాయకులు దాసు, వెంకటేశ్వర్లు, అనూరాధ, జ్యోతి, సీతారాములు, లక్ష్మణ్రావు తదితరులు పాల్గొన్నారు. -
పట్టు వీడని ఉద్యోగులు..
ఖమ్మం ఖిల్లా, న్యూస్లైన్ : డీఆర్డీఏ పీడీ వైఖరిని నిరసిస్తూ వారం రోజులుగా 250 మంది ఐకేపీ ఉద్యోగులు సామూహికంగా సెలవు పెట్టి పట్టు విడవకుండా ఆందోళన చేస్తూనే ఉన్నారు. అయితే తాను కూడా మెట్టు దిగేది లేదనే రీతిలో పీడీ పద్మజారాణి వ్యవహరిస్తున్నారు. దీంతో జిల్లాలోని ఐకేపీ కార్యకలాపాలు స్తంభించిపోయాయి. ఇటీవల సెర్ప్ సంస్థ నుంచి ఓ అధికారి వచ్చి ఉద్యోగులు, పీడీ మధ్య సయోధ్య కుదిర్చేం దుకు ప్రయత్నించినా.. అది సఫలం కాలేదు. దీంతో రుణాలందక డ్వాక్రా గ్రూపు మహిళలు ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్యపై దృష్టి సారించాల్సిన జిల్లా ఉన్నతాధికారులు కూడా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. మరో రెండు నెలల్లో ఆర్థిక సంవత్సరం ముగియనుంది. ఈ సమయంలో ఉద్యోగులు విధులకు హాజరు కాకుండా ఆందోళన చేస్తుండడంతో ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం చేరుకునే అవకాశం లేదు. దీంతో ఇబ్బందులు తప్పేలా లేదు. ఏజెన్సీలోనూ సమ్మె ఉధృతం... ఐకేపీ సిబ్బంది సామూహిక సెలవులతో ఇప్పటికే సదరం, అభయహస్తం, ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక వంటి పథకాలతో లబ్ధి పొందలేక పలువురు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటివరకు మైదాన ప్రాంతానికే పరిమితమైన ఈ నిరసనకు మద్దతుగా ఏజెన్సీ మండలాల్లో పనిచేస్తున్న మిగిలిన ఐకేపి ఉద్యోగులు 150 మంది సైతం సోమవారం నుంచి సామూహిక సెలవులు పెట్టడంతో అక్కడ కూడా పాలన స్తంభించిపోయింది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు ఈ అంశంపై దృష్టిసారించి ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని పలువురు కోరుతున్నారు. -
రాజధానికి పంచాయితీ
ఖమ్మం ఖిల్లా, న్యూస్లైన్: జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్డీఏ)లోని ఐకేపీ ఉద్యోగులకు, ఆ శాఖ ప్రాజెక్టు డెరైక్టర్ పద్మజారాణికి మధ్య ఏర్పడిన వివాదం హైదరాబాద్కు చేరింది. పీడీ వైఖరితో విసిగి సిబ్బంది సామూహిక సెలువులు పెట్టిన విషయం తెలిసిందే. పీడీ తమను వేధిస్తున్నారని, కించపరిచేలా మాట్లాడుతున్నారని ఉద్యోగుల ఆరోపణల నేపథ్యంలో ఈ సమస్యను పరిష్కరించాలని సెర్ప్ సీఈవో రాజశేఖర్ సామాజిక భద్రత డెరైక్టర్ చిన్న తాతయ్యను ఆదేశించారు. దీంతో శుక్రవారం ఆయన జిల్లాకు వచ్చారు. డీఆర్డీఏ పీడీకి, సిబ్బందికి మధ్య సయోధ్య కుదిర్చేందుకు వారితో వేర్వేరుగా సమావేశమయ్యారు. ముందుగా స్థానిక టీటీడీసీలో మహిళా సమాఖ్య సభ్యులు, ఐకేపీ ఉద్యోగులు టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు కూరపాటి రంగరాజు సమక్షంలో డెరైక్టర్ను కలిసి పద్మజారాణి వల్ల తమకు ఎదురవుతున్న ఇబ్బందులను వివరించారు. జిల్లాస్థాయి సమీక్ష సమావేశంలో ఐకేపీపై దుర్భాషలాడారని, జిల్లా సమాఖ్య ఏమైనా పార్లమెంటా అని వ్యాఖ్యానించారని, దళిత, గిరిజన మహిళలను అవమానపరిచేలా మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఇటీవల ఓ అధికారిణి రాజీనామాకు కూడా పీడీనే కారణమని అన్నారు. కింది స్థాయి ఉద్యోగులు మొదలు డీపీఎం స్థాయి అధికారుల వరకు ఆమె అసభ్య పదజాలంతో దూషిస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కారణాలతోనే తాము సామూహిక సెలవులు పెట్టినట్లు ఆయనకు విన్నవించారు. అనంతరం ఆయన డీఆర్డీఏ పీడీతో సమావేశం అయ్యారు. అనంతరం ‘న్యూస్లైన్’తో మాట్లాడుతూ.. ఇరుపక్షాల వారి వాదనలు విన్నామని, సిబ్బందితో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారని, అయితే ఉద్యోగులే ఆమె వైఖరితో విసిగిపోయామంటున్నారని తెలిపారు. ఆమెను బదిలీ చేయాలని, లేదా విధుల నుంచి తొలగించాలని, అప్పటివరకు సామూహిక సెలవులు విరమించేది లేదంటున్నారని వివరించారు. చిన్నచిన్న లోపాలే వీరి మధ్య ఎడబాటుకు కారణమన్నారు. ఈ వివరాలన్నింటినీ సెర్ప్ సీఈవో దృష్టికి తీసుకె ళ్లి ఇరు వర్గాల మధ్య సయోధ్య కుదిర్చేందుకు కృషి చేస్తానని చెప్పారు. డెరైక్టర్ను కలిసిన వారిలో ఐకేపీ ఉద్యోగుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు కలకోటి సంపత్, ఆంజనేయులు, దాసు, దుర్గారావు, అనూరాధ, జ్యోతి, వెంకటమ్మ ఉన్నారు. రాజీపడే ప్రసక్తే లేదు... డీఆర్డీఏ పీడీకి వ్యతిరేకంగా ఆశాఖ ఉద్యోగులు సామూహిక సెలవులు పెట్టి కార్యాలయం ఎదుట చేస్తున్న ధర్నా శుక్రవారం మూడో రోజుకు చేరుకుంది. ఈ సందర్బంగా ఐకేపీ ఉద్యోగుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు కలకోటి సంపత్ మాట్లాడుతూ తాము చేస్తున్న ఆందోళనను విరమించాలని సెర్ప్ డెరైక్టర్ సూచించారని, అయితే పీడీని మార్చేంత వరకు ఆందోళన కొనసాగిస్తామని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో రాజీపడే ప్రసక్తే లేదని డెరైక్టర్కు తేల్చిచెప్పామన్నారు. బాధ్యతలు నుంచి తప్పుకునే యోచనలో పీడీ..? డీఆర్డీఏ పీడీ పద్మజారాణి తన బాధ్యతల నుంచి తప్పుకునే యోచనలో ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇక్కడ పీడీగా భాద్యతలు చేపట్టిన నాటి నుంచి ఉద్యోగులకు, తనకు ఎదో ఒక విషయంలో తరుచూ వివాదాలు జరుగుతున్నాయని, ఇక వారితో కలిసి పనిచేయలేననే ఆలోచనకు ఆమె వచ్చారని తెలిసింది. అంతేకాక ఇటీవల సిబ్బంది ఆందోళనలు కూడా ఉధృతం కావడంతో ఉన్నతాధికారుల నుంచి విమర్శలు వస్తాయని భావించి ముందుగానే తప్పుకునేందుకు సిద్ధమయ్యారని, తనకు డీపీవోగా పనిచేసిన అనుభవం ఉండటంతో అదే శాఖలో పూర్తిస్థాయి భాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని ఉన్నతాధికారులను కోరనున్నట్లు సమాచారం. -
డీఆర్డీఏ పీడీ వైఖరిపై నిరసన
ఖమ్మం ఖిల్లా, న్యూస్లైన్: జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థలో పని చేస్తున్న ఐకేపీ ఉద్యోగులు, మహిళా సంఘాలపై డీఆర్డీఏ పీడీ పద్మజారాణి అకారణంగా వేధింపులకు పాల్పడుతున్నారని, ఆమెను విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ ఐకేపీ జిల్లా సంఘం ఆధ్వర్యంలో కిన్నెర జిల్లా సమాఖ్య సభ్యు లు, ఇతర ఉద్యోగులు మంగళవారం ఖమ్మంలో భారీ ప్రదర్శన నిర్వహించి కలెక్టరేట్ను ముట్టడిం చారు. తొలుత ఎనిమిది వందల మంది మహిళలు, వికలాంగులు డీఆర్డీఏ కార్యాలయం నుం చి ర్యాలీగా బయలుదేరి బస్డిపో రోడ్, పెవిలి యన్ గ్రౌండ్, మయూరీసెంటర్, బస్టాండ్, జడ్పీ సెంటర్ మీదుగా కలెక్టరేట్కు చేరుకున్నారు. ఈ ర్యాలీనికి టీఎన్జీఓస్ జిల్లా అధ్యక్షులు కూరపాటి రంగరాజు ప్రారంభించారు. కలెక్టరేట్ వద్ద జరిగిన ధర్నాలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న కూరపాటి రంగరాజు మాట్లాడుతూ కొంతకాలంగా పీడీ ఉద్యోగులను దుర్బాషలాడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, తీరు మార్చుకుంటుందిలే అని ఊరుకుంటే రోజురోజుకు ఆమె వైఖరి మితిమీరిపోతోందని అన్నారు. ఇంకా టీఎన్జీఓస్ నగర అధ్యక్షుడు వల్లోజు శ్రీనివాస్, కోశాధికారి చంద్రకాని రమణయాదవ్, సీఐటీయు జిల్లా నాయకులు నరసింహారావు, లింగయ్యలు సంఘీభావం తెలిపి మాట్లాడారు. ఐకేపీ జిల్లా అధ్యక్షుడు కలకోట సంపత్ మాట్లాడుతూ పదినెలలుగా డీఆర్డీఏ పీడీ తమని మానసికంగా, నైతికంగా వేధిస్తున్నారని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలకు మనస్తాపం చెంది డిసెంబర్ 31 నుంచి సామూహిక సెలవులు పెట్టాలని నిర్ణయించుకున్నామని అన్నారు. జిల్లాస్థాయి సమావేశాల్లో ఐకేపీ ఉద్యోగులపై అకారణంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ భయపెడుతోందని ఆరోపించారు. ఇటీవల ఎటువంటి కారణం లేకుండా ఉద్యోగులపై ఎస్సీ, ఎస్టీ కేసులను బనాయిస్తోందని పేర్కొన్నారు. పీఓపీ రవికుమార్ను, హెచ్ఆర్ ఏపీఎం సుభాష్ను ఎటువంటి కారణాలు లేకుండా కావాలనే సస్పెండ్ చేయించారని ఆరోపించారు. పీడీ వేధింపులు తాళలేకనే వికలాంగుల విభాగం ప్రాజెక్టు మేనేజర్ వసంతసేన రాజీనామా చేశారని అన్నారు. గతంలోనే ఆమె పనితీరుపై అప్పటి జిల్లాకలెక్టర్ సిదార్ధజైన్కు ఫిర్యాదు చేయగా పద్ధతి మార్చుకుంటానని సభాముఖంగా చెప్పిందని, కానీ మార్చుకోలేదని అన్నారు. అటెండర్లు , డ్రైవర్లును కూడా వ్యక్తిగతంగా అసభ్యపదజాలంతో దూషిస్తున్నారన్నారు. వెంటనే ఆమెని విధులనుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. మహిళలు అని కూడా చూడడంలేదు. మహిళలు అని కూడా చూడకుండా కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారని కిన్నెర మహిళ సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు వెంకటమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. మహిళ అధికారియే మహిళలను కించపరిస్తే ఇక సమాజంలో మహిళలకు న్యాయం ఎక్కడ జరుగుతుందని అధికారులను ప్రశ్నించారు. అనంతరం డీఆర్ఓ శివశ్రీనివాస్కు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఐకేపీ జిల్లా ఉపాధ్యక్షుడు సీతారాము లు, నాయకులు వెంకటేశ్వర్లు, దాసు, ఆంజనేయులు, దుర్గారావు, వంశీ, మహిళానాయకులు జ్యోతి, అనురాధ, నాగమణి పాల్గొన్నారు.