breaking news
OPPI
-
దిగుమతులపై ఆధారపడటం తగ్గించుకోవాలి
న్యూఢిల్లీ: కీలకమైన ముడి వస్తువుల తయారీలో స్వయం సమృద్ధి సాధించాలని దేశీ ఫార్మా పరిశ్రమకు కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డా పిలుపునిచ్చారు. వచ్చే దశాబ్దకాలంలో కీలకమైన ఏపీఐల దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని సూచించారు. ఫార్మా తయారీ సంస్థల సమాఖ్య ఓపీపీఐ 60వ వార్షిక సదస్సుకు ఈ మేరకు ఆయన వీడియో సందేశాన్ని పంపించారు. బయోసిమిలర్లు, వినూత్న మాలిక్యూల్స్, జీన్..సెల్ థెరపీల్లో కొత్త ఆవిష్కరణలను మరింత వేగవంతం చేయాలని పరిశ్రమ దిగ్గజాలను ఆయన కోరారు. అదే సమయంలో ఆరోగ్య సంరక్షణ సేవలు అందరికీ సమానంగా, అందుబాటు ధరల్లో లభ్యమయ్యే లా చూడటంపైనా దృష్టి పెట్టాలని సూచించారు. భారత ఫార్మా గత దశాబ్దకాలంలో గణనీయంగా పురోగమించిందని, 200 పైచిలుకు దేశాలకు ఔషధాలను సరఫరా చేస్తోందని, అమెరికా..బ్రిటన్లో జనరిక్ ఔషధాల మార్కెట్లో భారీ వాటాను దక్కించుకోవడంతో పాటు అంతర్జాతీయంగా 60 శాతం పైగా టీకాలను సరఫరా అందిస్తోందని మంత్రి చెప్పారు. అంతర్జాతీయంగా పరిశోధనలు, డిజిటల్ ఆవిష్కరణలకు హబ్గా ఎదుగుతోందని, ఫార్మా..లైఫ్సైన్సెస్ తదితర రంగాలకు చెందిన 1,600 పైగా గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లకు కేంద్రంగా నిలుస్తోందని వివరించారు. ఓపీపీఐతో కలిసి ఈవై పార్థినాన్ ఈ సందర్భంగా విడుదల చేసిన నివేదిక ప్రకారం నవకల్పనలపై ప్రధానంగా దృష్టి పెడుతూ ఫార్మా పరిశ్రమ 2047 నాటికి 450 బిలియన్ డాలర్లకు చేరనుంది. ప్రస్తుతం 7 బిలియన్ డాలర్లుగా ఉన్న కాంట్రాక్ట్ రీసెర్చ్, డెవలప్మెంట్, తయారీ (సీఆర్డీఎంవో) రంగం 2028 నాటికి రెట్టింపై 14 బిలియన్ డాలర్లకు చేరనుంది. -
ఫార్మా పవర్హౌస్గా భారత్: 2030 నాటికి అదే టార్గెట్..
ఆర్గనైజేషన్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ ఇండియా (ఓపీపీఐ) బీసీజీ భాగస్వామ్యంతో 'విన్నింగ్ ఇన్ ఇండియన్ హెల్త్కేర్' పేరుతో కొత్త నివేదికను విడుదల చేసింది. ఈ నివేదికను ఓపీపీఐ యాన్యువల్ సమ్మిట్ 2024: వికసిత్ భారత్ 2047థీమ్తో ప్రారంభించారు. భారతదేశాన్ని ఫార్మసీ ఆఫ్ ది వరల్డ్ నుంచి ఫార్మా పవర్హౌస్గా ప్రపంచానికి పరిచయం చేయాలి.. అనేది దీని ప్రధాన ఉద్దేశ్యం. ఈ కార్యక్రమానికి పరిశ్రమలకు సంబంధించిన ప్రముఖులు, ఆవిష్కర్తలు, శాస్త్రవేత్తలు, ఇతర ప్రభుత్వ అధికారులు హాజరయ్యారు.ప్రస్తుతం భారతదేశ ఔషధ మార్కెట్.. విలువ సుమారు 60 బిలియన్లు. ఈ విలువ 2030 నాటికి రెట్టింపు అవుతుందని అంచనా. భారత ఆరోగ్య సంరక్షణ రంగం ఒక బలమైన ఔషధ పర్యావరణ వ్యవస్థ ద్వారా త్వరిత విస్తరణకు సిద్ధంగా ఉంది. దేశ ఆరోగ్య సంరక్షణ రంగాన్ని మార్చడంలో.. గ్లోబల్ ఫార్మాస్యూటికల్ కంపెనీలు కీలక పాత్ర పోషించాయి. దీనికోసం వినూత్న సాంకేతికతలను ప్రవేశపెట్టారు. రోగుల సహాయ కార్యక్రమాలను అమలు చేశారు. కమ్యూనిటీ అవసరాలను తీర్చడానికి స్థానిక సామర్థ్యాలలో గణనీయమైన పెట్టుబడులు పెట్టారు.సుమారు 70 శాతం గ్లోబల్ ఫార్మాస్యూటికల్ కంపెనీలు.. వచ్చే ఐదేళ్లలో భారతదేశంలో 10 శాతం కంటే ఎక్కువ వార్షిక వృద్ధిని సాధించగలవని అంచనా. ఇది వికసిత భారత్ లక్ష్యానికి కూడా ఉపయోగపడుతుంది.ఈ కార్యక్రమంలో ఓపీపీఐ డైరెక్టర్ జనరల్ అనిల్ మాతాయ్ మాట్లాడుతూ.. భారతదేశ బలమైన ఫార్మా పర్యావరణ వ్యవస్థ, దూరదృష్టితో కూడిన ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా దేశాన్ని ప్రపంచ ఫార్మా పవర్హౌస్గా నిలిపింది. 2030 నాటికి భారతీయ ఫార్మా మార్కెట్ 120 బిలియన్లకు చేరుకోవడానికి సిద్ధంగా ఉందని అన్నారు.ఈ కార్యక్రమంలో బీసీజీ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీనియర్ పార్టనర్ ప్రియాంక అగర్వాల్ మాట్లాడుతూ.. 2030 నాటికి భారతీయ ఫార్మా మార్కెట్ రెట్టింపు అవుతుందని చెబుతూ.. ప్రపంచ ఫార్మాస్యూటికల్ కంపెనీలకు గణనీయమైన అవకాశాలను అందజేస్తుందని తెలిపారు. గ్లోబల్ ఫార్మా కంపెనీలు ఇప్పటికే గణనీయమైన వ్యాపారాలను నిర్మించాయి. దేశీయ మార్కెట్కు సేవ చేయడానికి మాత్రమే కాకుండా.. ప్రపంచవ్యాప్తంగా విస్తరించడానికి భారతదేశంలో పెట్టుబడులు పెట్టడానికి బలమైన ఆసక్తిని చూపుతున్నాయని అన్నారు. -
80 శాతం వైద్యులు పట్టణాల్లోనే...
60% ఆస్పత్రులు, 75% మందుల షాపులూ అక్కడే * కేపీఎంజీ, ఓపీపీఐ పరిశోధనలో వెల్లడి న్యూఢిల్లీ: దేశంలో 80 శాతం వైద్యులు జనాభాలో 28 శాతం ఉన్న పట్టణ ప్రజలకు మాత్రమే సేవలందిస్తున్నట్లు తేలింది. 60 శాతం ఆస్పత్రులు, 75 శాతం మందుల దుకాణాలు పట్టణ ప్రాంతాల్లోనే ఉన్నాయని కేపీఎంజీ(ప్రముఖ ఆడిట్ సంస్థ), ఓపీపీఐ(భారత ఔషధాల తయారీదారుల సంస్థ) పరిశోధనలో తేలింది. గ్రామీణ ప్రాంతాల్లో 37 శాతానికే ఇన్ పేషంట్ చికిత్స, 68 % మందికి అవుట్ పేషంట్ సేవలు అందుతున్నాయని పేర్కొంది. నివేదిక ప్రకారం.. భారత్లో ఆరోగ్య పరిరక్షణకు వెచ్చిస్తున్న మొత్తం దేశ జీడీపీలో కేవలం 4.1 శాతమే. అతి తక్కువ ఖర్చుపెడుతున్న దేశాల్లో భారత్ ఒకటి. ఒకరి నుంచి ఒకరికి సోకని జబ్బులతోనే మొత్తం మరణాల్లో 60 శాతం సంభవిస్తుండగా, దీనివల్ల 2030 నాటికి రూ. 3.11 కోట్ల కోట్లు దేశం నష్టపోనుంది. 75 శాతానికి ఆరోగ్య బీమా లేదు సగటు ఆయుర్ధాయం (2015లో 68 ఏళ్లు), ప్రతీ 1000 మందికి ఆసుపత్రి బెడ్లు బ్రిక్స్(బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా) దేశాలన్నింటితో పోలిస్తే భారత్లో చాలా తక్కువని, ప్రతి 10 వేల మందికి సాధారణ వైద్యుల సంఖ్య కూడా తక్కువగా ఉందని వెల్లడించింది. ‘రోగి కేంద్రంగా ఆరోగ్య పరిరక్షణ విధానం కోసం కృషి చేయడం, నిబద్ధత చూపడం కీలకం’ అని కేపీఎంజీ, ఓపీపీఐ నివేదిక పేర్కొంది.‘ఆరోగ్యంపై చేసే ఖర్చువల్ల దేశవ్యాప్తంగా 6.3 కోట్ల మంది అప్పుల్లో ఉన్నారు. అలాగే 75 శాతం ప్రజలకు ఆరోగ్య బీమా సౌకర్యం లేదు. మధ్యస్థాయి ఆదాయ దేశాలతో పోలిస్తే భారత్లో ఆరోగ్య పరిరక్షణకు తక్కువ ఖర్చుపెడుతున్నారు. ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం మంచి పాత్రే పోషిస్తున్నా... అవగాహన లోపం వల్ల మరణాలు సంభవిస్తున్నాయి. తరచుగా వ్యాధి నిర్ధారణ ఆలస్యమవుతోంది’ అని కేపీఎంజీకి చెందిన ఉత్కర్ష్ పల్నిత్కర్ పేర్కొన్నారు. దీర్ఘకాలంలో విద్య, అవగాహన కల్పించడమే లక్ష్యంగా చొరవతో అందరూ కలిసి పనిచేస్తే ఆరోగ్యకర దేశ లక్ష్యాన్ని అందుకోగలమన్నారు. ఐరాస సదస్సు 2000లో నిర్వచించిన ఆరోగ్య లక్ష్యాల్ని భారత్ సాధించలేదనిఆర్గనైజేషన్ ఆఫ్ ఫార్మస్యూటికల్స్ ప్రోడ్యూసర్స్ ఆఫ్ ఇండియా చీఫ్ శైలేష్ అయ్యంగార్ చెప్పారు.


