breaking news
Neat Exemption
-
నీట్ సమరం
► కదం తొక్కిన ప్రతిపక్షాలు ► డీఎంకే నేతృత్వంలో భారీ నిరసన ► ప్రభుత్వాన్ని సాగనంపుదామని ప్రతిజ్ఞ ► వైద్య కౌన్సెలింగ్ ప్రారంభం ► నేటినుంచి జనరల్ కోటా సీట్ల భర్తీ నీట్ మినహాయింపులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్రోహన్ని ఖండిస్తూ డీఎంకే నేతృత్వంలో గురువారం చెన్నైలో భారీ నిరసన కార్యక్రమం జరిగింది. డీఎంకే, కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, వీసీకే, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్, ఎంఎంకేల నేతలు ఈ వేదిక మీద నుంచి అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని సాగనంపుదామని ప్రతిజ్ఞ చేశారు. ఇక, నీట్ అమల్లోకి రావడంతో కౌన్సెలింగ్ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. సాక్షి,చెన్నై : రాష్ట్రంలో నీట్ మినహాయింపు అంటూ కేంద్రంతో కలిసి పళని ప్రభుత్వం ఆడిన నాటకం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నీట్ అమల్లోకి రావడంతో స్టేట్ సిలబస్ విద్యార్థులకు వైద్య కోర్సులు అందని ద్రాక్షగా మారిందనే ఆరోపణలు బయలుదేరాయి. తమిళ విద్యార్థులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన ద్రోహం, మోసాన్ని ఖండిస్తూ డీఎంకే నేతృత్వంలో చెన్నై చేపాక్కం అతిథి గృహాల వద్ద నిరసన కార్యక్రమం జరిగింది. డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ నేతృత్వంలో జరిగిన ఈ నిరసనకు కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత కేఆర్ రామస్వామి, సీపీఎం నేత జి.రామకృష్ణన్, సీపీఐ నేత నల్లకన్ను, వీసీకే నేత తిరుమావళవన్, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ నేత ఖాదర్ మొహిద్దీన్, మనిద నేయ మక్కల్ కట్చి(ఎంఎంకే)నేత జవహరుల్లాలతో పాటుగా ప్రజా, కార్మిక, వర్తక సంఘాల నేతలు, డీఎంకే ఎంపీ కనిమొళి తదితరులు తరలివచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును ఖండిస్తూ, దుమ్మెత్తిపోస్తూ నినాదాల్ని హోరెత్తించారు. కౌన్సెలింగ్కు శ్రీకారం నీట్ అమలుతో గురువారం నుంచి కౌన్సెలింగ్ ప్రారంభం అయింది. తొలిరోజు రిజర్వుడ్ కోటా సీట్లను భర్తీచేశారు. శుక్రవారం నుంచి జనరల్ కోటా సీట్ల భర్తీ సాగనుంది. నీట్ అమల్లోకి రావడంతో ఈసారి సీబీఎస్సీ విద్యార్థులకు 1,310 సీట్లను కేటాయించారు. ఇదివరకు కేవలం 30 సీట్లు కేటాయించే వాళ్లు. ప్రస్తుతం నీట్ పుణ్యమా అదనంగా 1,280 సీట్లు అప్పగించాల్సిన పరిస్థితి. ఈ సీట్లు గతంలో స్టేట్ సిలబస్ విద్యార్థులకు దక్కేవి. అయితే, ఇప్పుడు ఆ సీట్లు దూరం అయ్యాయి. ఈ ఏడాది స్టేట్ సిలబస్ విద్యార్థులకు 2,224 సీట్లను కేటాయించారు. ఒకటో ర్యాంక్ నుంచి 402 ర్యాంక్ వరకు జనరల్ కోటా సీట్ల భర్తీ శుక్రవారం ఉదయం తొమ్మిది నుంచి ఒంటి గంట వరకు జరగనుంది. ఇందు కోసం ఓమందూరు ఎస్టేట్లోని మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఆవరణలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సెలవు రోజుల్లోనూ కౌన్సెలింగ్ జరగనుంది. ఇక, బ్యాంకులకు వరుస సెలవులు కావడంతో విద్యార్థులు నగదు రూపంలో ఫీజుల్ని చెల్లించేందుకు అధికారులు ప్రత్యేక చర్యలను తీసుకున్నారు. సాగనంపుదాం ఈ నిరసనలో ప్రతిపక్ష పార్టీల నేతలు ప్రసంగిస్తూ, తమిళనాడుకు పెను ముప్పు ఎదురు కాబోతున్నదని ఆందోళన వ్యక్తంచేశారు. ఈ ముప్పు నుంచి తమిళ ప్రజల్ని, రాష్ట్రాన్ని రక్షించుకునేందుకు భారీఎత్తున పోరాటాల్ని సాగించాల్సిన అవసరం ఉందన్నారు. డీఎంకే కార్యనిర్వాహక అ«ధ్యక్షుడు స్టాలిన్ ప్రసంగిస్తూ, ఈ పాలకుల అవివేకం విద్యార్థులకు శాపంగా మారిందని ఆవేదన వ్యక్తంచేశారు. తమ హయాంలో విద్యార్థులకు దోహదకారిగా ఉండే విధంగా విద్యావిధానాల్లో ప్రత్యేక కార్యాచరణ రూపొందించి ముందుకు సాగామని వివరించారు. అయితే, ఇప్పుడున్న వాళ్లు రాష్ట్రాన్నే కేంద్రానికి తాకట్టు పెట్టారని, విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని ధ్వజమెత్తారు. తప్పులు చేసింది కాకుండా, నిందల్ని తమమీదకు నెట్టే ప్రయత్నం చేయడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. వ్యక్తిగత, రాజకీయ స్వలాభం కోసం పాకులాడుతున్న ఈ ప్రభుత్వాన్ని సాగనంపేందుకు ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేయాలని పిలుపునిచ్చారు. దొడ్డి దారిలో గద్దెనెక్కాలన్న ఆశ తమకు లేదని, ప్రజా స్వామ్య పద్ధతిలోనే ప్రజలు, అన్ని వర్గాలతో కలిసి ఈ ప్రభుత్వాన్ని కూల్చేస్తామన్నారు. యువతరం మేల్కొనాలని , ఈ ప్రభుత్వాన్ని సాగనంపే విధంగా ముందుకు అడుగులు వేయాలని పిలుపు నిచ్చారు. -
నీట్ ఉద్యమం
♦ రాష్ట్రంలో ‘నీట్’ మినహాయింపునకు పట్టు ♦ మానవహారానికి డీఎంకే పిలుపు ♦ పోలీసుల అనుమతి నిరాకరణ ♦ ప్రతిపక్షాలన్నీ మళ్లీ ఏకమై నిరసన ♦ సేలంలో స్టాలిన్ అరెస్టు ♦ రాష్ట్రవ్యాప్తంగా ఉద్రిక్తత ‘నీట్’ మినహాయింపునకు పట్టుబడుతూ ఉద్యమించేందుకు ప్రతిపక్షాలు మళ్లీ ఏకమయ్యాయి. నిషేధాజ్ఞల్ని ఉల్లంఘించి గురువారం సాయంత్రం మానవహారంతో కదంతొక్కాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినదించాయి. మానవ హారంలో పాల్గొనేందుకు వెళ్తున్న డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్ను పోలీసులు ఉదయాన్నే అరెస్టు చేయడంతో ఆ పార్టీ వర్గాల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. సాక్షి, చెన్నై : వైద్య కోర్సులకు ఉమ్మడి ప్రవేశ పరీక్ష తమిళ విద్యార్థుల్ని సంకట పరిస్థితుల్లోకి నెట్టిన విషయం తెలిసిందే. నీట్ నుంచి తమిళనాడుకు మినహాయింపు ఇవ్వాలని పట్టుబడుతూ అసెంబ్లీలో తీసుకొచ్చిన తీర్మానం ఢిల్లీలో తుంగలో తొక్కారు. ఈ తీర్మానం ఆమోదించాలని, నీట్ మినహాయింపు ఇవ్వాలని నినదిస్తూ డీఎంకే నేతృత్వంలో మానవహారానికి పిలుపునిచ్చారు. దీన్ని వ్యతిరేకిస్తూ, కోర్టుల్లో పిటిషన్లు సైతం దాఖలయ్యాయి. ఈ మానవహారానికి పోలీసులు అనుమతి నిరాకరించడంతో ఉత్కంఠ తప్పలేదు. నిషేధం ఉల్లంఘించైనా మానవహారం నిర్వహించేందుకు డీఎంకే వర్గాలు నిర్ణయించాయి. ఇందుకు కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ మద్దతు ఇవ్వడంతో ఉత్కంఠ తప్పలేదు. స్టాలిన్ అరెస్టుతో ఉత్కంఠ సేలం కచ్చరాయన్ చెరువు పూడికతీత వివాదాస్పదం కావడంతో గురువారం ఉదయాన్నే అక్కడ పర్యటించి, సాయంత్రం మానవహారంలో పాల్గొనేందుకు స్టాలిన్ నిర్ణయించారు. అయితే, కచ్చరాయన్ చెరువు వైపుగా అనుమతించబోమని స్టాలిన్కు సేలం జిల్లా పోలీసు యంత్రాంగం హెచ్చరికలు చేసింది. అయినా, ఆయన కోయంబత్తూరు మీదుగా సేలంకు బయలుదేరారు. మార్గం మధ్యలో పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత తప్పలేదు. అరగంట పాటుగా స్టాలిన్ వాహనం రోడ్డు మీదే ఆగడం, డీఎంకే వర్గాలు వేలాదిగా తరలిరావడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. స్టాలిన్ను పోలీసులు అడ్డుకున్న సమాచారంతో రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠకు దారితీసింది. సేలం జిల్లాలో అయితే, కొన్నిచోట్ల డీఎంకే వర్గాలు బస్సుల మీద తమ ప్రతాపం చూపించడంతో ఆందోళనకారుల్ని అడ్డుకోవడం పోలీసులకు శ్రమగా మారింది. ఎక్కడికక్కడ డీఎంకే వర్గాలు ఆందోళనకు దిగాయి. అయితే, తాను అరెస్టు అవుతున్నట్టు, ఎవరూ ఎలాంటి ఆందోళనలు చేయవద్దు అని, సాయంత్రం జరగాల్సిన మానవహారం విజయవంతం చేయాలని స్టాలిన్ పిలుపునివ్వడంతో డీఎంకే వర్గాలు శాంతించాయి. మానవ హారం స్టాలిన్తోపాటుగా సేలం జిల్లా డీఎంకే వర్గాలందర్నీ పోలీసులు అరెస్టు చేయడంతో అక్కడ మాత్రం మానవహారం జరగలేదు. ఇక, రాష్ట్ర వ్యాప్తంగా డీఎంకే వర్గాలతో కలిసి, కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ కేడర్ మానవహారంలో నీట్ మినహాయింపు పట్టుబడుతూ నినదించింది. చెన్నైలో పలుచోట్ల డీఎంకే ఎమ్మెల్యేల నేతృత్వంలో మానవహారాలు జరగ్గా, పోలీసులు అడ్డుకున్నారు. మానవహారాన్ని అడ్డుకునే రీతిలో మరికొన్నిచోట్ల పోలీసులు దూకుడు ప్రదర్శించారు. సాయంత్రం పోలీసులు స్టాలిన్ను విడుదల చేశారు. ఈసందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, నీట్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం రెండు నాల్కల ధోరణి అనుసరిస్తోందని ధ్వజమెత్తారు. కేంద్రం కాళ్ల మీద పడి శరణు కోరిన ఈ పాలకులు, తమ మీద ఉన్న కేసుల నుంచి బయటపడే ప్రయత్నాలు చేస్తున్నారేగానీ, ప్రజాహితాన్ని కాంక్షించడం లేదని మండిపడ్డారు. నీట్ మినహాయింపునకు పట్టుబడుతూ పోరాటం మరింత ఉధృతం కాబోతుందని ప్రకటించారు.