breaking news
nandinisidhareddy
-
సాహిత్య వేదికలపై ఫత్వాలు సరికాదు
తెలంగాణలో ఇక తెరవే (తెలంగాణ రచయితల వేదిక) అవసరం లేదనీ, వారు ఇక్కడితో ఆగితేనే గౌరవమనీ తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షుడు నందిని సిధారెడ్డి రెండురోజుల క్రితం చేసిన వ్యాఖ్యలు కేవలం తెలంగాణ రచయితల వేదికని ఉద్దేశించి మాత్రమే అన్నట్లుగా భావించలేము. ‘ప్రశ్నించడమే కవిత్వం ప్రధాన తత్త్వం. నిలదీయలేనిది అసలు కవిత్వమే కాదు’ అని అదే సభలో ఉన్న సీనియర్ పాత్రికేయులు కూడా అన్నారు. అదిగో – అలాంటి ప్రశ్ననే ఇప్పుడు పూర్తిగా చంపేయాలనుకుంటున్నారు నందిని సిధారెడ్డి. ఆయనకు తెలియనిదీ, ఇంక తననుంచి ఏమాత్రమూ తెలుసుకోగోరనిదీ ఏమంటే – తెలంగాణ సమాజం ఊరుకోదు. ప్రశ్నించి తీరుతది. నిలదీసి నిలుస్తది. బరిగీసి కొట్లాడుతది. అక్షరం ఎల్లప్పుడూ ప్రజల పక్షమే నిలుస్తది అని మాత్రమే. అక్షరం, సాహిత్యం పోషించే ఇలాంటి పాత్రపై సరిగ్గా ఇదే భయం నందిని సిధారెడ్డిని ఇవాళ ఆవరించింది. ప్రశ్నలెక్కువైతే ఏలికకు ఇబ్బంది అని. ప్రభువులను ప్రజలు ప్రశ్నించే పరి స్థితి పట్ల ఆందోళన ఆయనది. ఆనాడు సిధారెడ్డి ఒక నదీప్రవాహం అయితే– నేడాయన పాలకుల రీడిజైన్లో గతి తప్పిన శుష్క ప్రేలాపం, పాలక స్తుతిలో తెలంగాణలో కవులను, రచయితలను సాహితీ నిర్వాసితులను చేసే ముంపు ఉపద్రవం! అందుకే అంటున్నాం – ప్రవహించు మంజీరా! కలాల్ని భయపెట్టొద్దు మంజీరా!! ఏలికల కాళ్ళ మణి మంజీరం కావొద్దు మంజీరా!!! తెలంగాణలోని కొంతమంది మేధావులు, కవులు, రచయితలు, జర్నలిస్టులు ప్రభువుల సింహాసనపు సాలభంజికలుగా మారిపోవడంతో అందరూ అదే తొవ్వ తొక్కాలని అంటున్నడు సిధారెడ్డి. ఆ సాలభంజికలకంటే రెండాకులు ఎక్కువ చదివిన భజనభంజిక నందిని గారికి, ఆయన పోషకులకూ కొత్తగా చెప్పాలని మేమయితే అనుకోవడం లేదు. కానీ, నిత్య చైతన్య దీప్తి అయిన తెలం గాణ ఏమాత్రం మసకబారినా భవిష్యత్తు నాశనమైతదని చెప్పడమే ఈ ప్రయత్నం. ప్రత్యేకించి తెలం గాణ ప్రగతిశీల శక్తులకు ఈ సవినయ విన్నపం. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు పూర్తిగా నెరవేరని ప్రస్తుత సందర్భంలో, ముఖ్యంగా రెండవసారి ఎన్నిక అయిన ప్రభుత్వాలు (అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో) ప్రజలు తమకు గంపగుత్త మెజారిటీ యిచ్చిన్రు కాబట్టి (ఇందులోని వాస్తవావాస్తవాలు, న్యాయాన్యాయాలూ వేరే చర్చ) తాము ఏం చేసినా చెల్లుతుంది అని అనుకుంటున్నారు. ఉద్యమ ఆకాంక్షలను సులువుగా తొక్కేస్తామని, తెలంగాణ ఆత్మకు ఉనికి అన్నదే లేకుండా చేస్తామని భావిస్తున్న పాలకులనూ, వారి ఈ భావనను నిస్సిగ్గుగా ప్రచారం చేస్తున్న బానిస కలాలనూ తెలంగాణ మేధోవర్గం నిరసించాలి. ఖండించాలి. అందుకే ఈ విన్నపం. మరొక విషయం. భారత్ను మతరాజ్యంగా మార్చే సంకల్పంతో జాతీయ స్థాయిలో కమ్ముకొస్తున్న ప్రస్తుత తరుణంలో, ఆ ఫాసిజం రేపు నందిని సిధారెడ్డి వంటి పోషకులనూ కమ్మేస్తుంది. కానీ, రచయితలుగా ఒక మాట ఇస్తున్నాం. రేపు మేము వాటినీ ఖండిస్తాం. ఆ ప్రజాస్వామ్య స్పృహ, హక్కుల స్పూర్తి మాకున్నది. ఫ్యూడల్, క్యాపిటల్, ఫాసిస్ట్ శక్తులను ఎదిరిస్తూనే, ఎవరు ఎక్కువ ప్రమాదకారి అన్న చర్చ వచ్చినపుడు తప్పకుండా బలమైన శత్రువుపై దాడి చేయాల్సిందే. ప్రశ్నలు రావాల్సిందే. వాటికి సాహిత్యకారులు తమ గళమూ కలమూ మద్దతు ఇవ్వాల్సిందే. తెలం గాణ ఉద్యమవీణకు తంత్రియై మూర్చనలు పోయిన కవులూ రచయితలూ కళాకారులూ మేధావులూ... రేపు కూడా ఉండేది తెలంగాణ ప్రజల పక్షమే. నేడూ రేపూ వారిది ఉద్యమ ఆకాంక్షల సాధనామార్గమే. సాహిత్య సంస్థలను రద్దుచేయాలనే ఫత్వాలు జారీ చేసి దేశంలో తెలంగాణ రాష్ట్ర గౌరవం మంటకలపొద్దు. ప్రతిపక్షాలను ఏరేసే తీరుగా కవులను, కళాకారులను కొనివేయలేరు. సన్మానాలు, శాలువాల కోసం కిమ్మనకుండే రచయితలారా మీరు గళం విప్పకపోతే రేపు ప్రజలు మిమ్మల్ని క్షమించరు.రచయితల కర్తవ్యాలను, లక్ష్యాలను చెప్పుకుంటూనే, సిధారెడ్డి లాంటి కలుపుమొక్కల కారణంగా, మరోసారి మనమెరిగిన ఓ పాతప్రశ్న వేయాల్సి వస్తున్నది... కవీ, ఓ కళాకారుడా/కవయిత్రీ, ఓ కళాకారిణీ నీవెటువైపు?!/రాజ్యంవైపా?/ జనం ఆకాంక్షల దిక్కా? (జూలై 14, 2019 ఉదయం 10 గంటలకు హైదరాబాద్ లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో కలాల స్వేచ్ఛ కోసం, 27 ప్రజాసంఘాలతో జరగనున్న సభ సందర్భంగా) వ్యాసకర్త రాష్ట్రకమిటీ సభ్యుడు, తెలంగాణ జన సమితి ‘ మొబైల్ : 90309 97371 శ్రీశైల్ రెడ్డి పంజుగుల -
విద్యార్థి శక్తి జాతీయ శక్తి
కామారెడ్డి, న్యూస్లైన్: విద్యార్థి శక్తి అంటే జాతీయ శక్తి అని, తెలంగాణ విద్యార్థుల శక్తి ముందు ఏ శక్తీ నిలువజాలదని తెలంగాణ రచయితల వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు నందిని సిధారెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలోని సత్యగార్డెన్స్లో టీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో ‘తెలంగాణ పునర్నిర్మాణంలో విద్యార్థుల పాత్ర’ అనే అంశంపై నిర్వహించిన సదస్సుకు టీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చందు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా నంది ని సిధారెడ్డి మాట్లాడుతూ..తెలంగాణ విద్యార్థి శక్తి సముద్రం కన్నా గొప్పదన్నారు. రాజకీయ నాయకత్వానికి వెన్నుదన్నుగా నిలిచిన విద్యార్థి శక్తి తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలకభూమిక పోషించిందన్నారు. తెలంగాణ తల్లి సంకెళ్లను తెంపడానికి విరోచిత పోరాటాలు జరిపిన విద్యార్థులే హీరోలన్నారు. ఫిబ్రవరిలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తీరుతుందని, విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు. ఇన్నేళ్లు ఎన్నో అవకాశాలు కోల్పోయిన విద్యార్థులకు ప్రత్యేక రాష్ర్టంలో న్యాయం జరుగుతుందన్నారు. సీమాంధ్ర నాయకుల కుట్రలను తిప్పికొట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఇన్నేళ్లుగా మన సంస్కృతి, చరిత్ర, సంప్రదాయాలు ఏ పుస్తకంలో లేవని, తెలంగాణ రాష్ట్రంలో వీటినన్నింటిని సాధించుకోవాల్సి ఉందన్నారు. ఆందోళన వద్దు -కవిత, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు పదమూడేళ్ల పోరాట ఫలితంగా తెలంగాణ రాష్ర్టం ఏర్పడుతోందని, ఆందోళన వద్దని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. వచ్చే రాష్ట్రంలో ఇప్పటిదాకా జరిగిన అన్యాయాలను సరిచేసుకోవాల్సి ఉందన్నారు. సీమాంధ్ర పాలకులు కొల్లగొట్టిన రెండు లక్షల ఉద్యోగాలను పొందాలన్నారు. విద్యార్థులంతా కష్టపడి చదివి ఉన్నత ఉద్యోగాలు సంపాదించాలని, తద్వారా తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు కావాలన్నారు. పుస్తకాలనే కాక ప్రపంచాన్ని చదవాలని, సమాజాన్ని అర్థం చేసుకుని ముందుకు సాగాలని ఆమె సూచించారు. సమైక్యవాదులది పైసల ఉద్యమమని, తెలంగాణది ప్రజల ఉద్యమమన్నారు. అనంతరం టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి, డీసీఎం ఎస్ చైర్మన్ ఎంకే ముజీబొద్దిన్ తదితరులు మాట్లాడారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నేతలు తిర్మల్రెడ్డి, భూంరెడ్డి, సుమిత్రానంద్, బాబూరావ్, మల్లేశ్యాదవ్, నవీనాచారి, విఠల్రావ్, సుమంత్, చంద్రశేఖర్రెడ్డి, పార్శి కాంశెట్టి, ముస్తాక్, బూక్య నర్సింలు, యాదవరెడ్డి, రాజిరెడ్డి, రమేశ్ తదితరులు పాల్గొన్నారు. సభకు ముందు విద్యార్థులు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు.