breaking news
nadipalli divakarrao
-
కాంగ్రెస్లో కలకలం
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : మంచిర్యాల రాజకీయం రసకందాయంలో పడింది. మంచిర్యాల టీఆర్ఎస్ ఎమ్మెల్యే అరవిందరెడ్డి బుధవారం కాంగ్రెస్ కండువా కప్పుకున్నా రు. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్సింగ్ సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయాలని గట్టివాదనను వినిపించిన అరవిందరెడ్డి తాను కాంగ్రెస్లో చేరుతానని నెల రోజుల క్రితమే ప్రకటించారు. ఇటీవల తెలంగాణ బిల్లు పార్లమెంట్ లో ఉన్న సమయంలో కూడా అరవిందరెడ్డి తాను కాంగ్రెస్లో చేరుతానని ప్రకటన చేశారు. అనుకున్నట్లుగానే బుధవారం కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. టిక్కెట్టు కోసం పెరిగిన పోటీ అరవిందరెడ్డి కాంగ్రెస్లో చేరడంతో నియోజకవర్గంలో టిక్కెట్టు కోసం మధ్య పోటీ పెరిగింది. తూర్పు జిల్లాలో ప్రధాన వాణిజ్య కేంద్రమైన మంచిర్యాల స్థానం జనరల్గా ఉంది. దీంతో కాంగ్రెస్ పార్టీలో ముఖ్యనేతల కన్ను ఈ నియోజకవర్గంపైనే ఉంది. ఈ టిక్కెట్టు కోసం మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు, మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్రావు పోటీ పడుతున్నారు. ఎవరికి వారే తమ అనుచరులను, ప్రాబల్యాన్ని పెంచుకున్నారు. ఈ నియోజకవర్గంలోని పలు మార్కెట్ కమిటీ చైర్మన్ల పదవుల విషయంలో ఈ ఇద్దరి నేతల మధ్య తీవ్ర విభేదాలు చోటు చేసుకున్నాయి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపిక విషయంలో రాహుల్గాంధీ దూత మంచిర్యాలకు వచ్చిన సందర్భంగా ఇరువురు నేతలు ఆయన ముందు బలప్రదర్శనకు దిగారు. ఇప్పుడు తాజాగా అరవిందరెడ్డి కూడా కాంగ్రెస్లో చేరడంతో ఇక్కడ టిక్కెట్టు ఆశించే ముఖ్య నేతల మధ్య పోటీ పెరిగింది. టీఆర్ఎస్లో ఉన్నప్పటికీ అరవిందరెడ్డికి కాంగ్రెస్ అధిష్టానంతో మంచి సంబంధాలు ఉన్నాయి. టిక్కెట్టు విషయంలో అరవిందరెడ్డికి స్పష్టమైన హామీ లభించిందని ఆయన అనుచరులు పేర్కొంటున్నారు. దివాకర్రావుకు స్థానికంగా పట్టుంది. గతంలో సీఎం కిరణ్తో ఉన్న సంబంధాలతో ప్రేంసాగర్రావు పలు మార్కెట్ కమిటీ చైర్మన్లను తన అనుచరులకు ఇప్పించుకో గలిగారు. దీంతో ఈ ఇద్దరి మధ్య విభేదాలు తారా స్థాయి చేరాయి. టీఆర్ఎస్ విలీనం, పొత్తులతో.. మరోవైపు టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్లో విలీనం లేదా పొత్తు ఖాయంగా కనిపిస్తోంది. ఒకవేళ విలీనం అయిన పక్షంలో ఈ సీటు కోసం పోటీ పడే నేతల సంఖ్య పెరుగుతుంది. టీఆర్ఎస్లో కొనసాగుతున్న మున్సిపల్ మాజీ చైర్మన్ కృష్ణారావు మంచిర్యాల నుంచి పోటీ చేయాలని ఆశలు పెట్టుకున్నారు. దీనికి తోడు పెద్దపల్లి ఎంపీ వివేక్ తన సతీమణిని ఇక్కడి నుంచి పోటీ చేయించే యోచనలో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. ఇప్పుడు టీఆర్ఎస్ కాంగ్రెస్లో విలీనమైతే ఈ టిక్కెట్టు కోసం పోటీ పడే ముఖ్యనేతల సంఖ్య ఏకంగా ఐదుకు చేరనుంది. దీంతో కార్యకర్తల్లో అయోమయం నెలకొంది. ఎవరికి టిక్కెట్టు దక్కుతుందో తెలియక తికమక పడుతున్నారు. -
బలప్రదర్శన
మంచిర్యాల అర్బన్, న్యూస్లైన్ : మంచిర్యాల ఆర్అండ్బీ కాంగ్రెస్ నేతల బలప్రదర్శనకు వేదికైంది. సాక్షాత్తు రాహుల్ దూత ఎదుట మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు, మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్రావు వర్గీయులు బాహాబాహీకి దిగారు. ఇరువ ర్గాలు తోపులాటకు దిగడంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రాబోయో ఎన్నికల్లో గెలుపు గుర్రాలను ఎంపిక చేయడానికి శుక్రవారం రాహుల్ దూత, మహారాష్ట్రలోని చిమ్మూర్ శాసనసభ్యుడు విజయ్వడెట్టివార్, పీసీసీ పరిశీలకుడు బండి నర్సాగౌడ్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు రామచంద్రారెడ్డి మంచిర్యాలకు వచ్చారు. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలైన మంచిర్యాల, చెన్నూర్, బెల్లంపల్లి నియోజకవర్గాల కార్యకర్తలతో సమావేశమయ్యారు. నాయకుల రంగప్రవేశం మొదట దివాకర్రావు వర్గీయులు ఐబీకి చేరుకున్నారు. ప్లకార్డులు ప్రదర్శించారు. పరిశీలకుడిని కలిసి దివాకర్రావు టికెట్ ఇవ్వాలని కోరారు. కొద్ది సేపటి తర్వాత ప్రేంసాగర్రావు రంగప్రవేశం చేశారు. దీంతో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. ఇరు వర్గాల కార్యకర్తలు జిందాబాద్ అంటూ పరస్పర నినాదాలు చేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. నినాదాలతో ఒకరిపై ఒకరు దూసుకు వచ్చేందుకు ప్రయత్నించడంతో పోలీసులు జోక్యం చేసుకున్నారు. కార్యకర్తలను రెండు వర్గాలుగా వేర్వేరుగా చేశారు. పోలీసులు మధ్యలో నిల్చుని కార్యకర్తలను అదుపు చేయడానికి తంటాలు పడ్డారు. పరిశీలకున్ని మండలం, పట్టణాలవారీగా కలవడానికి అనుమతిచ్చారు. రెండు వర్గాల కార్యకర్తలు లోపలికి దూసుకు వెళ్లడంతో అదుపు చేయలేక పోలీసులు చేతులెత్తేశారు. అభిప్రాయాల సేకరణ రెండు గంటలపాటు కార్యకర్తల నినాదాలతో ఐబీ ప్రాంగణం ప్రతిధ్వనించింది. కార్యకర్తల నుంచి అభిప్రాయాలు సేకరించారు. కులాలవారీగా అభిప్రాయాలను పరిశీలకుడు కోరారు. మూడు నియోజకవర్గాలకు పది దరఖాస్తులు వచ్చాయి. తన వర్గీయులను దూరంగా నెట్టి వేస్తూ ప్రేంసాగర్రావు వర్గీయులను ఏమి అనడం లేదని ఆరోపిస్తు పోలీసులతో దివాకర్రావు, ఆయన తనయుడు విజిత్రావు పోలీసులతో వాదనకు దిగారు. కాగా ముందు జాగ్రత్త చర్యలో భాగంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బందోబస్తులో మంచిర్యాల సీఐలు రవీంద్రారెడ్డి, కరుణాకర్, ఎస్సైలు వెంకటేశ్వర్లు, శ్రీలత, పోలీసులు ఉన్నారు. తెలంగాణను ఎవరూ అడ్డుకోలేరు.. : పరిశీలకుడు విజయ్ వాడెట్టివార్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటును ఏ శక్తులు అడ్డుకోలేని రాష్ట్ర పరిశీలకుడు విజయ్ వడెట్టివార్ అన్నారు. ఐబీలో కార్యకర్తలను ఉద్ధేశించి మాట్లాడుతూ, ఎవరెన్ని కుట్రలు, కుతంత్రాలు చేసిన తెలంగాణను ఆపలేరని స్పష్టం చేశారు. సోనియాగాంధీ ఇచ్చిన మాట ప్రకారం సీడబ్ల్యుసీలో తీర్మానం చేసి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తోందని చెప్పారు. పార్లమెంట్లో బిల్లు ప్రవేశం అనంతరం రాష్ట్రం విభజన జరుగుతోందని ఆయన నొక్కి చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగుర వేయాలని ఆయన ప్రజలకు పిలుపు నిచ్చారు. సందెట్లో సడేమియా సందెట్లో సడెమియాలా జేబుదొంగలు తమ హస్తలాఘవానికి పని చెప్పారు. కాంగ్రెస్లో రెండు వర్గాల నేతలు కయ్యానికి కాలు దూస్తున్న సమయంలో ఆదమరిచి ఉండడాన్ని జేబుదొంగలు అనుకూలంగా మలచుకున్నారు. ఓ వ్యక్తి నుంచి రూ.14 వేలు, మరోవ్యక్తి జేబు నుంచి సెల్ ఫోన్, రూ.20వేలు నగదు తస్కరించారు.