breaking news
mukthapuram
-
ఫలితం పొంది విమర్శించడం న్యాయమా?
పట్టిసీమను నిర్మించడంతోనే రాయలసీమకు సాగునీరు – పండ్ల కొనుగోలులో ‘సూట్’ తీసేసే వారిపై పీడీ కేసులు.. రాష్ట్ర బహిష్కరణ – 2, 3 నెలల్లో మడకశిర బ్రాంచ్ కెనాల్కు హంద్రీనీవా నీరు – ఈ ఏడాది 6.50లక్షల మంది కౌలు రైతులకు పంటరుణాలు - అనంతపురం జిల్లా రాప్తాడు పర్యటనలో సీఎం చంద్రబాబు సాక్షిప్రతినిధి, అనంతపురం : ‘ఒక్కొక్కసారి బాధ కలుగుతుంది. రుణమాఫీలో రూ.1.50లక్షలు తీసుకున్నారు. ఇప్పుడు ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ తీసుకుని నన్ను విమర్శిస్తున్నారంటే చాలా బాధ కలుగుతుంది. ఇది న్యాయమా? అని అడుగుతున్నా. ఇలా విమర్శించే వారిని వ్యతిరేకిస్తున్నామని అంతా సంఘీభావం తెలియజేయాలి.’’ ఏ ప్రభుత్వమైనా పనిచేసినప్పుడు ప్రజలు కృతజ్ఞతగా ఉండాలి.’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. ఇన్పుట్ సబ్సిడీ పంపిణీ నేపథ్యంలో రైతు కృతజ్ఞతయాత్ర పేరుతో చంద్రబాబు అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో పర్యటించారు. మొదట కనగానపల్లి మండలం ముక్తాపురంలో ఎన్టీఆర్ గృహకల్ప పేరుతో నిర్మించిన 32 ఇళ్లను ప్రారంభించారు. తర్వాత లబ్ధిదారులతో ముఖాముఖి నిర్వహించారు. ఆపై బహిరంగసభలో ప్రసంగించారు. సీఎం ప్రసంగం ఆయన మాటల్లోనే.. ‘పాదయాత్రను హిందూపురం నుంచే ప్రారంభించా. రైతుల కష్టాలు చూసి రుణమాఫీ చేయాలని నిర్ణయించా. దానికి కట్టుబడి మాఫీ చేశా. రాష్ట్రంలో రూ.24,500కోట్లను మాఫీ చేశా. అందులో రూ.2,728కోట్లు అనంతపురానికి వచ్చింది. నేను ఒక ఉద్యానవన తోటగా రాయలసీమను చేస్తా. దేశమే కాదు.. ప్రపంచం మొత్తం అనంతపురం పండ్లు, కూరగాయలు తినేరోజు వస్తుంది. రాయదుర్గంలో ఇప్పటికే ఎడారి ఛాయలు కన్పిస్తున్నాయి. అందుకే హంద్రీనీవా పూర్తి చేసే బాధ్యత తీసుకున్నా. మరో 2, 3 నెలల్లో హిందూపురం నుంచి మడకశిరకు నీళ్లు తీసుకెళతాం. రేయిన్గన్లతో పంటలను కాపాడేందుకు యత్నించా! రాష్ట్రానికి ఇన్పుట్, ఇన్సూరెన్స్ కలిపి రూ.2,214కోట్లు ఇస్తే రూ.1451కోట్లు అనంతపురానికి ఇచ్చాను. ఈ ఏడాది హంద్రీనీవా ద్వారా జిల్లాలోని చెరువులను నింపుతాం. మల్యాల, ముచ్చుమర్రి నుంచి నీటిని ఎత్తిపోస్తాం. ఈ ఏడాది రాష్ట్రంలో 6.50లక్షల మంది కౌలు రైతులకు రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. పండ్ల ఉత్పత్తులు రైతులు విక్రయించే సమయంలో వ్యాపారులు సూట్ వసూలు చేస్తున్నారు. ఇకపై ఎవరైనా సూట్ వసూలు చేస్తే వారిపై పీడీ యాక్టు నమోదు చేస్తాం. రాష్ట్ర బహిష్కరణ చేస్తా. అలాగే ఇన్పుట్ సబ్సిడీని అనర్హులు తీసుకునేందుకు వీళ్లేదు. అర్హులైన వారే తీసుకోవాలి. తాడిపత్రి ఉదంతంలో అనాథగా మారిన ప్రసన్నకు సీఎం అండ: తాడిపత్రిలో మంగళవారం తెల్లవారుజామున రామసుబ్బారెడ్డి అనే వ్యక్తి తన భార్య సులోచనమ్మ, ఇద్దరు పిల్లలు ప్రత్యూష, సాయి ప్రతిభను సుత్తితో కొట్టి చంపిన విషయం విదితమే. ఈ ఘటన తర్వాత బుధవారం రామసుబ్బారెడ్డి పురుగుమందు సేవించి ఆత్మహత్య చేసుకున్నారు. తల్లిదండ్రులతో పాటు ఇద్దరు పిల్లలు చనిపోయారు. అయితే పెద్దకుమారై ప్రసన్న తిరుపతిలో ఉండటంతో బతికిపోయింది. ఈ క్రమంలో ప్రసన్నను మహిళా కమిషన్ చైర్మన్ నన్నపనేని రాజకుమారి ముఖ్యమంత్రి సభకు తీసుకొచ్చారు. ఈ ఉదంతాన్ని సీఎం వివరించారు. ఆపై ప్రసన్న మాట్లాడుతూ ‘మా నాన్న మా అమ్మను, చెల్లెళ్లను దారుణంగా చంపేశారు. మా నాన్న అని చెప్పుకునేందుకే సిగ్గుగా ఉంది. కుటుంబంలో అందరూ చనిపోయి అనాథగా మారడంతో నేను కూడా ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా. ఐఐఎంలో మేనేజ్మెంట్ కోర్సు చేయాలని మా అమ్మ చెప్పేది. ఇప్పుడు ఆ లక్ష్యం కోసమే నేను బతుకుతా. అది సాధిస్తా.’ అన్నారు. ప్రసన్న పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు రూ.20లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రసన్న బాగోగులను తానే చూసుకుంటానని హామీ ఇచ్చారు. ప్రసన్నను చదివించే బాధ్యతను తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్రెడ్డి తీసుకున్నారు. కార్యక్రమంలో మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, పరిటాల సునీత, కాలవ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. -
నేడు జిల్లాలో సీఎం పర్యటన
అనంతపురం అర్బన్ : రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బుధవారం జిల్లాలో పర్యటించనున్నారు. ఇన్పుట్ సబ్సిడీ పంపిణీని పురస్కరించుకుని నిర్వహిస్తున్న రైతు కృతజ్ఞతా యాత్రలో ఆయన పాల్గొంటారు. ఉదయం 10.40 గంటలకు కనగానపల్లి మండలం ముక్తాపురం గ్రామం చేరుకుని అక్కడ హౌసింగ్ కాలనీని ప్రారంభిస్తారు. అనంతరం మొక్కలు నాటి కాలనీలో కల్పించిన వసతులను పరిశీలిస్తారు. లబ్ధిదారులతో మాట్లాడతారు. ఉదయం 11.15 గంటలకు బహిరంగ సభ వేదిక వద్దకు చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శిస్తారు. అనంతరం ప్రజలనుద్దేశించి మాట్లాడతారు. మధ్యాహ్నం 1.15 నుంచి 1.45 వరకు విశ్రాంతి తీసుకుంటారు. మధ్యాహ్నం 1.50 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి పుట్టపర్తి విమానాశ్రయానికి.. ప్రత్యేక విమానంలో విజయవాడకు వెళ్లారు. -
ముక్తాపురంలో హోం మంత్రి పర్యటన
కనగానపల్లి (రాప్తాడు) : రాష్ట్ర హోం మంత్రి చిన్నరాజప్ప గురువారం కనగానపల్లి మండలంలోని ముక్తాపురంలో పర్యటించారు. అనంతపురం నుంచి బెంగళూరు వెళ్తున్న ఆయన ముక్తాపురం వద్ద 44వ నెంబర్ జాతీయ రహదారి పక్కన కొత్తగా ఏర్పాటు చేస్తున్న హౌసింగ్ కాలనీని సందర్శించారు. కొత్తగా నిర్మిస్తున్న ఎన్టీఆర్ గృహ నిర్మాణాలను మంత్రి పరిటాల సునీతతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన ఇంటి నిర్మాణాల నాణ్యత, లబ్ధిదారులకు బిల్లుల చెల్లింపులపై అధికారులతో మాట్లాడారు. మోడల్ కాలనీలో 36 గృహాలనూ ఒకే విధంగా నిర్మించడంతోపాటు, ప్రజలకు అవసరమైన అన్ని మౌలిక వసతులనూ కల్పిస్తున్నామని మంత్రి సునీత హోంమంత్రికి తెలిపారు. ఈ వారం లోపల కాలనీలో సిమెంట్ రోడ్లు, వీధి కొళాయిలు ఏర్పాటు చేయించి ఈ నెల 5వ తేదీ సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభించేందుకు సిద్ధం చేస్తున్నామన్నారు. అనంతరం సీఎం పర్యటన ఏర్పాట్లపై హోం మంత్రి అధికారులతో ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో పలువురు జిల్లా, మండల స్థాయి అధికారులు, స్థానిక టీడీపీ నాయకులు పాల్గొన్నారు. శిల్పారామం సందర్శన అనంతపురం రూరల్ : నగర పరిధిలోని శిల్పారామాన్ని చిన్నరాజప్ప సందర్శించారు. నగర ప్రజలకు ఆహ్లాదాన్ని పంచే శిల్పారామాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానన్నారు. అనంతరం మొక్కలు నాటారు. ఆయన వెంట స్థానిక ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి, స్థానిక సర్పంచ్ పెదయ్యతోపాటు టీడీపీ నాయకులు పాల్గొన్నారు.