Mohammed Feroz Khan
-
గవర్నర్తో భేటీ... ఫిరోజ్ఖాన్కు నివాళి
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం బిజీ బిజీగా గడిపారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని తీర్మానం చేసేందుకు శాసనసభను వెంటనే సమావేశపరిచేలా చూడాలని కోరుతూ మరోసారి రాష్ట్ర గవర్నర్ను కలిశారు. జమ్మూకాశ్మీర్లో పాకిస్థాన్ సైన్యం జరిపిన కాల్పుల్లో వీర మరణం పొందిన మహ్మద్ ఫిరోజ్ఖాన్ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. అనంతరం ఫిరోజ్ఖాన్ కుటుంబీకులను పరామర్శించారు. -
ఫిరోజ్ఖాన్కు అశ్రునివాళి
అధికార లాంఛనాల నడుమ ముగిసిన అంత్యక్రియలు హైదరాబాద్, న్యూస్లైన్: జమ్మూకాశ్మీర్లో పాకిస్థాన్ సైన్యం జరిపిన కాల్పుల్లో వీర మరణం పొందిన మహ్మద్ ఫిరోజ్ఖాన్ అంత్యక్రియలు ముగిశాయి. గురువారం మధ్యాహ్నం పాతబస్తీ ఫలక్నుమాలోని సంజయ్గాంధీ నగర్లో మధ్యాహ్నం పోలీసు లాంఛనాల నడుమ అంత్యక్రియలు నిర్వహించారు. మొదట ఫిరోజ్ భౌతికకాయాన్ని స్థానిక మసీదుకు తరలించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ముస్లిం శ్మశాన వాటికకు తరలించారు. అక్కడ ఆర్మీ సిబ్బంది ఫిరోజ్ఖాన్ మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం లెఫ్టినెంట్ జనరల్ సీఏ పితాలా ఆధ్వర్యంలో ఆర్మీ జవాన్లు గౌరవసూచకంగా గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ లాంఛనాలు ముగిసిన వెంటనే మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ముస్లిం సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు పూర్తి చేశారు. అంతిమయాత్రలో రాజకీయ నేతలు, వివిధ సంఘాల ప్రతినిధులు, స్థానికులు పెద్దఎత్తున పాల్గొని, పాకిస్థాన్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జగన్ నివాళి.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం ఫిరోజ్ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఫిరోజ్ఖాన్ సహోద్యోగి అయిన ఎన్.వి.రావుతో సరిహద్దుల వద్ద జరిగిన సంఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఫిరోజ్ఖాన్ కుటుంబీకులను పరామర్శించారు. జవాను తల్లి, భార్య, పిల్లలను అప్యాయంగా పలకరించారు. ధైర్యంగా ఉండాలని, తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసానిచ్చారు. తరలివచ్చిన ప్రముఖులు ఫిరోజ్ఖాన్కు నివాళులర్పించేందుకు ప్రజాప్రతినిధులు, నాయకులు పెద్దఎత్తున తరలివచ్చారు. నివాళులు అర్పించిన ప్రముఖుల్లో వైఎస్సార్సీపీ నేతలు మేకపాటి రాజమోహన్రెడ్డి, రెహ్మాన్, మజ్లిస్ నేతలు అసదుద్దీన్ ఒవైసీ, అక్బరుద్దీన్ ఒవైసీ, సయ్యద్ అహ్మద్ పాషా ఖాద్రీ, మోజంఖాన్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి, పార్టీ నేత బండారు దత్తాత్రేయ, మంత్రి దానం నాగేందర్, వైఎస్సార్సీపీ హైదరాబాద్ జిల్లా కన్వీనర్ ఆదం విజయ్కుమార్, యువజన విభాగం గ్రేటర్ అధ్యక్షులు లింగాల హరిగౌడ్, హైదరాబాద్ కలెక్టర్ ముఖేష్ కుమార్ మీనా తదితరులున్నారు. -
జమ్మూలో రాష్ట్ర జవాను మృతి
హైదరాబాద్/నారాయణపేట/న్యూస్లైన్: జమ్మూకాశ్మీర్ సరిహద్దుల్లో పాకిస్తాన్ ముష్కర మూకలు జరిపిన కాల్పుల్లో రాష్ట్రానికి చెందిన జవాను మహ్మద్ ఫిరోజ్ఖాన్ మృతి చెందారు. మంగళవారం పూంచ్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. హైదరాబాద్ పాతబస్తీలోని ఫలక్నుమా నవాబ్సాహెబ్ కుంటకు చెందిన ఫిరోజ్ఖాన్ (36)... గత 18 ఏళ్లుగా ఆర్మీలో పనిచేస్తున్నారు. ఆయన మృతి వార్త తెలియగానే కుటుంబ సభ్యులు దుఃఖ సాగరంలో మునిగిపోయారు. నవాబ్ సాహెబ్ కుంటలో ఫిరోజ్ఖాన్ తల్లి అక్తర్ బేగం, భార్య నస్రీన్ బేగం, ముగ్గురు పిల్లలు నివాసం ఉంటున్నారు. ఫిరోజ్ఖాన్ తండ్రి జాఫర్ఖాన్ కూడా ఆర్మీలో జవానుగా పనిచేసి రిటైరయ్యారు. మహబూబ్నగర్ జిల్లా నారాయణపేటకు చెందిన వీరి కుటుంబం.. జాఫర్ఖాన్ రిటైర్ అయిన తర్వాత వరంగల్కు వెళ్లింది. అనంతరం హైదరాబాద్ వచ్చి స్థిరపడ్డారు. హైదరాబాద్ చేరుకున్న భౌతికకాయం.. ఫిరోజ్ఖాన్ భౌతికకాయం బుధవారం రాత్రి హైదరాబాద్ చేరుకుంది. గురువారం అధికార లాంఛనాలతో నవాబ్సాబ్కుంట ముస్లిం శ్మశాన వాటికలో ఫిరోజ్ అంత్యక్రియలు జరగనున్నాయి. ఫిరోజ్ఖాన్ మృతిపట్ల ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి సంతాపం తెలిపారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. బక్రీద్కు రాలేకపోతున్నా.. పిల్లలు జాగ్రత్త ‘‘పిల్లలు జాగ్రత్త. బక్రీద్కు ఇంటికి రాలేకపోతున్నాను. బోర్డర్లో డ్యూటీ వేశారు. ఇంకొద్దిసేపట్లో వెళ్లాలి. ఇప్పుడు నీ అకౌంట్లో డబ్బులు వేశాను. పండక్కి కావాల్సినవి కొనుక్కోండి. అమ్మ, నువ్వు, పిల్లలు సంతోషంగా బక్రీద్ జరుపుకోండి. ఎక్కువ సేపు మాట్లాడేందుకు టైం లేదు. వెళ్తున్నాను. బై..’’ తన భార్య నస్రీన్తో ఫిరోజ్ఖాన్ చివరి మాటలివి. నాలుగురోజుల క్రితం సరిహద్దు ప్రాంతానికి బయలుదేరే ముందు ఆయన తన భార్యతో ఫోన్లో మాట్లాడారు. ఆ తర్వాత రెండ్రోజులకే అసువులు బాశారు. రంజాన్కు ఇంటికి వచ్చాడని, బక్రీద్కు రావడం వీలుకావడం లేదని, తర్వాత వస్తానని చెప్పాడని, ఇంతలోనే దారుణం జరిగిపోయిందని ఫిరోజ్ ఖాన్ తల్లి, భార్య పెద్దపెట్టున రోదించారు. మరికొద్ది నెలల్లో రిటైర్మెంట్ పూర్తి చేసుకొని రావాల్సిన భర్త ఇలా శవమై వస్తాడనుకోలేదంటూ నస్రీన్ విలపించడం చూసి అందరూ కన్నీళ్లు పెట్టుకున్నా రు. 15వ బీహార్ రెజిమెంట్లో హవల్దార్గా పనిచేస్తున్న ఫిరోజ్ చెల్లెలు 8 నెలల క్రితమే అనారోగ్యంతో చనిపోయింది. ఆ విషాదం నుంచి తేరుకోకముందే ఫిరోజ్ చనిపోయారు.