breaking news
Metropolis Healthcare Ltd.
-
కూతురొచ్చింది! చిన్న ల్యాబ్ను రూ.వేల కోట్ల సంస్థగా మార్చింది..
ఆయనొక పాథాలజిస్ట్.. ముంబైలో చిన్న ల్యాబ్ను నడిపేవాడు.. విదేశాల నుంచి అతని కూతురొచ్చింది. ఆ చిన్న ల్యాబ్ను రూ.వేల కోట్ల మల్టీ చెయిన్ సంస్థగా తీర్చిదిద్దింది. ఆమె ఎవరు.. తండ్రి కలను ఎలా సాకారం చేసింది.. తెలుసుకోండి.. అమీరా షా.. మెట్రోపాలిస్ హెల్త్కేర్ లిమిటెడ్ ప్రమోటర్, మేనేజింగ్ డైరెక్టర్. ఈ సంస్థకు దేశవ్యాప్తంగా అనేక డయాగ్నస్టిక్ సెంటర్లు ఉన్నాయి. విదేశాల్లో చదివిన అమీరా షా ఫైనాన్స్ ప్రొఫెషనల్. గోల్డ్మ్యాన్ సాచ్స్లో పని చేసేది. అందులో సంతృప్తి లేక వ్యాపారవేత్తగా మారాలని నిర్ణయించుకుంది. తన వ్యాపార పరిజ్ఞానాన్ని తండ్రి వైద్య ప్రావీణ్యంతో మిళితం చేసి, రూ. 6478 కోట్ల మార్కెట్ క్యాప్ ఉన్న అతిపెద్ద డయాగ్నస్టిక్ సంస్థను సృష్టించింది. వైద్య కుటుంబం అమీరా షా ముంబైలోని హెచ్ఆర్ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఎకనామిక్స్ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆ తర్వాత ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లిన ఆమె యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్, ఆస్టిన్ నుంచి ఫైనాన్స్ డిగ్రీ అందుకున్నారు. ఆమె వైద్యుల కుటుంబానికి చెందిన వారు. తండ్రి పాథాలజిస్ట్ డాక్టర్ సుశీల్ షా. తల్లి గైనకాలజిస్ట్ డాక్టర్ దురు షా. సోదరి జన్యు శాస్త్రవేత్త. కంపెనీని విజయవంతంగా ప్రారంభించిన అనంతరం కూడా ఆమె హార్వర్డ్ బిజినెస్ స్కూల్ నుంచి ఓనర్-ప్రెసిడెంట్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ చేశారు. 21 ఏళ్లకే స్టార్టప్ అమీరా షా ఒక పాత ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను గోల్డ్మన్ సాక్స్లో పనిచేస్తున్నప్పటికీ ఆ ఉద్యోగం తనకు సంతృప్తిని ఇవ్వలేదని, అంత పెద్ద ఆర్థిక సేవల సంస్థలో పనిచేస్తున్నా ఆ ఉద్యోగాన్ని ఎప్పుడూ ఆస్వాదించలేదని చెప్పారు. దీంతో ఆ ఉద్యోగాన్ని విడిచిపెట్టి కేవలం ఐదుగురు వ్యక్తులతో స్టార్టప్ ఏర్పాటు చేశారు. అప్పుడు ఆమె వయసు కేవలం 21 ఏళ్లు. ఇలా లాభం లేదు ఇంకా మరింత ప్రభావం చూపాలన్న తండ్రి సలహా మేరకు ఆమె భారత్కు తిరిగివచ్చారు. అలా దేశానికి తిరిగిన వచ్చిన ఆమె తన తండ్రి నడుపుతున్న ల్యాబ్లో సమస్యలను గుర్తించింది. ఆ లాబ్ చాలా సాదాసీదాగా ఉంది. కంప్యూటర్లు కూడా లేవు. కానీ తన ల్యాబ్ను అతిపెద్ద డయాగ్నోస్టిక్స్ చైన్ను రూపొందించాలన్నది ఆయన కల. కానీ ఎలాగో తనకు తెలియదు. తండ్రి కలను సాకారం చేసే భారీ ఆపరేషన్ను మొదలు పెట్టింది అమీషా. మొదటగా ల్యాబ్ను ఆధునికీకరించి అన్ని వసతులు, హంగులతో తీర్చిదిద్దింది. ల్యాబ్లో పేషంట్లకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రతిభావంతులైన ఉద్యోగులను నియమించింది. వివిధ విభాగాలను సృష్టించి ల్యాబ్ నిర్వహణను మెరుగ్గా మార్చేసింది. తండ్రి సహకారంతో ఆ కంపెనీకి సీఈఓ అయింది. ఇదీ చదవండి: Aunkita Nandi: రెండు అద్దె కంప్యూటర్లతో రూ.100 కోట్ల వ్యాపారం! ఈ బెంగాలీ అమ్మాయి సంకల్పం మామూలుది కాదు.. కిందిస్థాయి నుంచి.. ఆమె ఈ సంస్థను కింది స్థాయి నుంచి ఉన్నతంగా తీర్చిదిద్దింది. ఆమే స్వయంగా కస్టమర్ కేర్ కౌంటర్లో రోగులకు సేవలందించింది. రోజువారీ సమస్యలను తెలుసుకుని పరిష్కరించడం ప్రారంభించింది. ల్యాబ్ పేరును డాక్టర్ సుశీల్ షా లాబొరేటరీ నుంచి మెట్రోపాలిస్గా మార్చారు. తర్వాత ఇతర డయాగ్నోస్టిక్ సెంటర్లతో భాగస్వామ్యం చేయడం ప్రారంభించారు. వారి మొదటి టై అప్ చెన్నైలో డాక్టర్ శ్రీనివాసన్ అనే పాథాలజిస్ట్తో జరిగింది. అనతి కాలంలోనే వారి డయాగ్నోస్టిక్ సంస్థ అభివృద్ధి బాట పట్టింది. 2006 సంవత్సరంలో వారికి బయటి నుంచి నిధులు వచ్చాయి. వ్యాపారంలో సంపాదించిన డబ్బును అలాగే పెట్టుబడి పెట్టారు. 2002లో వారికి ఒకే ఒక ల్యాబ్ ఉండేది. దీని ఆదాయం అప్పట్లో రూ.7 కోట్లు. 2023లో వారి ఆదాయం రూ.1148 కోట్లు. మార్చి త్రైమాసికంలోనే వారి నికర లాభం రూ.33 కోట్లు. నేడు వారి మెట్రోపాలిస్ సంస్థకు 1500 పైగా సేకరణ కేంద్రాలు, 125 పైగా ల్యాబ్లు ఉన్నాయి. ఇవి ఏడు దేశాల్లో పనిచేస్తున్నాయి. ఇలాంటి స్పూర్తివంతమైన పారిశ్రామిక వేత్తల విజయగాథలు, ఆసక్తికరమైన కథనాల కోసం సాక్షి బిజినెస్ పేజీని చూడిండి -
9% లాభంతో లిస్టైన మెట్రోపొలిస్ హెల్త్కేర్
న్యూఢిల్లీ: డయాగ్నస్టిక్ చెయిన్ మెట్రోపొలిస్ హెల్త్కేర్ లిమిటెడ్ షేర్ లిస్టింగ్లో ఓ మోస్తరు లాభాలను సాధించింది. బీఎస్ఈలో ఈ షేర్ ఇష్యూ ధర రూ.880తో పోల్చితే 9 శాతం లాభంతో రూ.960 వల్ల లిస్టయింది. ఇంట్రాడేలో 12 శాతం లాభంతో రూ.981 వద్ద గరిష్ట స్థాయిని తాకింది.చివరకు 9 శాతం లాభంతో రూ.960 వద్ద ముగిసింది. బీఎస్ఈలో 6.13 లక్షల షేర్లు, ఎన్ఎస్ఈలో 72 లక్షల షేర్లు ట్రేడయ్యాయి. సోమవారం మార్కెట్ ముగిసే సమయానికి కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.4,815 కోట్లుగా ఉంది. ఇటీవలే రూ.887–880 ప్రైస్బాండ్తో ఐపీఓకు వచ్చిన ఈ కంపెనీ రూ.1,200 కోట్లు సమీకరించింది. ఈ ఐపీఓ 6 రెట్లు ఓవర్ సబ్స్క్రైబయింది. మెట్రోపొలిస్ హెల్త్కేర్ లిమిటెడ్ భారత్లో మూడవ అతిపెద్ద లిస్టెడ్ డయాగ్నస్టిక్ చెయిన్ కావడం గమనార్హం. -
మెట్రో యువత పై డయాబెటిస్ పంజా!
ముంబై: డయాబెటిస్.. స్థూలకాయం.. మెట్రో నగరాల్లో ఇప్పుడు యువతపై పంజా విసురుతున్న వ్యాధులివీ! ముంబై, ఢిల్లీ, చెన్నై, అహ్మదాబాద్లో మెట్రోపొలిస్ హెల్త్కేర్ లిమిటెడ్ అనే సంస్థ తాజాగా చేపట్టిన సర్వే ఈ విషయాన్ని తేల్చింది. నవ ఉత్తేజంతో ఉరకలెత్తాల్సిన యువత జీవనశైలి వ్యాధుల బారిన పడుతున్నట్లు ఇందులో తేలింది. జూన్ 9-15 మధ్య నిర్వహించిన ఈ సర్వేలో 38,966 మంది ఆరోగ్య పరిస్థితిని గమనించగా.. అందులో ఏకంగా సగానికిపైగా (56.81 శాతం) మధుమేహంతో బాధపడుతున్నారు. ఈ 38,966 మందిలో 20-40 ఏళ్ల వయసున్నవారు 41.48 శాతం ఉండ డం గమనార్హం. ఇక మరో శాంపిల్లో 35,886 మందిని పరిశీలించగా.. వారిలో దాదాపు 9 శాతం మంది అధిక కొవ్వు సమస్యతో బాధపడుతున్నారు. వారంతా 20-40 ఏళ్ల వయసున్నవారే! శారీరక శ్రమ లేకపోవడం, పని ఒత్తిడి వల్లే యువతను ఈ వ్యాధులు చుట్టుముడుతున్నాయి. మరికొందరు వంశపారంపర్యంగా వీటి బారిన పడుతున్నారు. ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం ద్వారా ఈ వ్యాధులకు దూరంగా ఉండొచ్చని నిపుణులు సూచిస్తున్నారు.