breaking news
Medieval History
-
కొలకలూరులో వెయ్యేళ్లనాటి శివలింగాలు
తెనాలి: మధ్యయుగ చరిత్ర, సంస్కృతికి ప్రతీకలైన వెయ్యేళ్ల నాటి అపురూప శిల్పాలను పురావస్తు పరిశోధకులు గుర్తించారు. తెనాలి రూరల్ మండల గ్రామం కొలకలూరు గ్రామంలోని పురాతన అగస్త్యేశ్వరస్వామి దేవాలయం ఆవరణలో అస్తవ్యస్తంగా ఈ విగ్రహాలు దర్శనమిస్తున్నాయి. పురావస్తు పరిశోధకుడు పాములపాటి శ్రీనాథ్రెడ్డి సమాచారంతో ప్రముఖ పురావస్తు పరిశోధకుడు, కల్చరల్ సెంటర్ ఆఫ్ విజయవాడ సీఈవో డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి శుక్రవారం దేవాలయాన్ని సందర్శించారు. అక్కడి శిల్పాలు వెయ్యేళ్ల నాటివిగా ప్రకటించారు. ♦దేవాలయం ఆవరణలో గుర్తించిన శిల్పాల్లో మహిషాసుర మర్దిని (క్రీ.శ 10వ శతాబ్దం), వెయ్యేళ్లనాటి శివలింగాలు, ఒకే శరీరంతో మూడు నాట్యభంగిమలను ప్రదర్శిస్తున్న నృత్యకారుడు (క్రీ.శ 13వ శతాబ్దం), దేవి విగ్రహం (క్రీ.శ 16వ శతాబ్దం)తోపాటు శివద్వార పాలకులు చెక్కిన ద్వారశాఖలు (క్రీ.శ 14వ శతాబ్ది తలుపు చెక్కలు) ఉన్నాయి. ♦వేంగి చాళుక్య, కాకతీయ, విజయనగర శిల్పకళలకు అద్దంపడుతున్న శిల్పాలను అదే ఆలయ ప్రాంగణంలో ఎత్తైన పీఠాలపై నిలిపి, వాటి వివరాలతో కూడిన పేరు పలకలను బిగించి, భద్రపరచాలని దేవదాయ, పురావస్తుశాఖ అధికారులకు విజ్ఞప్తి చేశారు. ♦వీటితోపాటు అక్కడ క్రీ.శ 1241, 1242, 1318కి చెందిన నాలుగు శాసనాలను గుర్తించారు. వాటిలో అగస్తేశ్యరస్వామి ఆలయ సేవలకు నియమితులైన మహిళల కోసం అమిరినాయుడు రెండు పుట్ల భూమిని దానం చేశారు. ♦కులోత్తుంగ చోళుడి సామంతుడైన కొండపడుమాటి బేతరాజు సేవకుడైన రెంటూరి ఎక్కిటి, అదే దేవాలయ అఖండ దీపానికి 50 ఆవులను దానం చేసినట్టు ఉంది. ♦క్రీ.శ 1318 శాసనాల్లో కాకతీయ ప్రతాపరుద్రుని సకల సేనాధిపతి సోమయ లెంక కుమారుడు పోచులెంక అగస్తేశ్వరుడి సోమవార నిబంధనకు, వీరభ్రదునికి 8 పుట్ల భూమిని, పోచు లెంక కేశవ పెరుమాళ్లుకు శనివార నిబంధనకు 5 తూముల భూమిని దానం చేసినట్టు లిఖించారు. ♦శాసనాల్నింటిలోనూ కొలకలూరు గ్రామం పేరును కొలంకలూరుగా లిఖించడం విశేషం. చదవండి: పత్రికల్లో వార్తలు సేకరించి.. ఇంటెలిజెన్స్ డీఎస్పీనంటూ.. ఆర్ఆర్ఐలో అక్రమాలు: వారికి ధనార్జనే ధ్యేయం -
పూడ్చిపెట్టాక.. బిడ్డకు జన్మ ఇచ్చింది
రోమ్ : ఇటలీకి చెందిన పురావస్తు శాస్త్రవేత్తలు ఓ అధ్భుత విషయాన్ని వెలికితీశారు. చనిపోయిన తర్వాత ఓ తల్లి బిడ్డకు జన్మనిచ్చినట్లుగా ఉన్న ఆనవాళ్లను గుర్తించారు. మధ్య యుగ కాలానికి చెందిన 25 ఏళ్ల యువతి గర్భంతో ఉండగానే చనిపోయింది. దీంతో ఆమెను సమాధి చేశారు. ఈ ఘటన అనంతరం తల్లి దేహం నుంచి బిడ్డ జన్మించినట్లుగా ఉన్న అవశేషాలను పురా నిపుణులు కనుగొన్నారు. మరణించిన యువతి పుర్రెకు పెద్ద రంధ్రం ఉన్నట్లు గుర్తించారు. దాన్ని బట్టి ఆమెకు మెదడు సంబంధిత వైద్యం జరిగినట్లు భావిస్తున్నారు. ఫెరారా, బోలోగ్నా విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు వరల్డ్ న్యూరో సర్జరీ అనే మ్యాగజైన్లో ఈ విషయాలను ప్రచురించారు. క్రీస్తు పూర్వం 7 లేదా 8 శతాబ్దానికి చెందిన మహిళ అత్యంత అరుదైన మెదడు సంబంధిత వ్యాధికి గురైనట్లు పేర్కొన్నారు. దాంతో 38 వారాల నిండు గర్భిణీ అయిన ఆమెకు వైద్యం చేశారని చెప్పారు. గర్భధారణ జరిగి 20 వారాల తర్వాత సంభవించే ఆ వ్యాధి కారణంగా శరీరంలో రక్తపోటు అధికం అవుతుందని వివరించారు. వ్యాధి నివారణకు మరో మార్గం లేకపోవడంతో బలవంతపు ప్రసవానికి అప్పటి వైద్యులు యత్నించగా.. సదరు మహిళ మరణించిందని వివరించారు. -
వీరగల్లు
వీరగల్లు మధ్యయుగ చరిత్ర గ్రహించడానికి అతి ముఖ్యమైన శాసనాధారాలు. యుద్ధాల్లో మరణించిన వీరుల జ్ఞాపకార్థం గ్రామాల పొలిమేరల్లో ప్రతిష్టించిన ఈ రాళ్ళు రాష్ట్రమంతటా గ్రామ గ్రామంలో దొరికాయి. చచ్చిన తరువాత కూడా ఆ వీరులు భైరవ, వీరభద్ర రూపాల్లో గ్రామాలని రక్షిస్తారని నమ్మి వాళ్లకు ఊరిబయట గుళ్లు కట్టి పూజలూ బలులూ ఇచ్చే ఆచారం దక్షిణాంధ్రలో ఈనాటికీ ఉంది. ఆ రాళ్ళపై వాళ్ల వీర కృత్యాలు, యుద్ధంలో ఘట్టాలు బొమ్మలుగా చెక్కి, వాళ్ళు చేసిన సాహసాల గురించి రాసేవారు. గుర్రమెక్కి, కత్తిపట్టి నిలిచిన కావలిదేవుళ్ళ విగ్రహాలు రాయలసీమ, నెల్లూరు జిల్లా గ్రామాల బయట ఎన్నో కనిపిస్తాయి. వీరగల్లు శాసనాలు ఆనాటి పరిస్థితులకి అద్దం పడతాయి. చిన్న చిన్న రాజ్యాలు, నలువైపులా శత్రువులు, అలివిమాలిన పన్నుల భారం, యుద్ధాలు, దోపిడీలు, పశువుల మందలపై దాడులు, సామాన్య ప్రజలకి రక్షణలేని కాలం. మధ్యయుగంలో ఇండియాలోనే గాక ప్రపంచమంతా భుక్తి కోసం యుద్ధం చేసే మెర్సినరీ యోధుల ప్రస్తావనలు కనిపిస్తాయి. వ్యవసాయం నమ్మకంలేని పరిస్థితిలో కత్తి పట్టడం వచ్చిన కాపు యువకులు ఎందరో ఆ దారిపట్టారు. స్వతంత్రంగా ఏ రాజుకూ లోబడక వీరభోజ్యంతో కడుపు నింపుకునే తెలుగు వీరులని ఒంటర్లు, ఎక్కట్లు అని పిలిచారు. ఈ పదాలే సాహిత్యంలో సంస్కృతీకరించబడి ఏకాంగ వీరులుగా మారాయి. వీరిలో కుటుంబాన్ని పరిత్యదించి వీరసన్యాసులుగా మారి ఆస్తులన్నీ దానం చేసినవారు ఉన్నారు. యుద్ధంలో సంపాదించిన ధనాన్ని విచ్చలవిడిగా మద్యశాలల్లో, వేశ్యాగృహాల్లో ఖర్చు చేస్తూ చిన్న చిన్న వివాదాలకి ప్రజలతో కలబడుతూ ద్వంద్వయుద్ధాలకి దిగే ఏకాంగవీరుల ప్రసక్తి క్రీడాభిరామం, భీమేశ్వరపురాణం, పల్నాటి వీర చరిత్రలలో చూస్తాం. యుద్ధంలో ఓడి ఆత్మహత్యకి పాల్పడిన వీరులు చాలా మంది ఉన్నారు. వీరగల్లులపై గండకత్తెర వేసుకొని, కొండచరియ దూకి ప్రాణాలు విడిచిన వీరుల కథలు జపాన్ సమురాయ్ సంస్కృతిలోని సెప్పుక్కు, హరాకిరీ వంటి ఆచారాలు తలపిస్తాయి. అలాగే ‘పెండ్లాల తలచుక బిట్టేడ్చువారు’ అని యుద్ధంలో ఆయుధం పారవేసి గడ్డికరిచి మొత్తుకునే పిరికిపందల గురించి పల్నాటి వీర చరిత్రలో శ్రీనాథుడు చెప్పాడు. అంతే కాదు ఓడిన శత్రువుల తలలతో బంతులాటలు ఆడటం (శిరఃకందుక క్రీడావినోదం), వారి రక్తమాంసాలతో ఉడికించిన అన్నం కావలి దేవతలకి ఊరి చుట్టూ పొలిజల్లడం (రణంకుడుపు) వంటి రాక్షస సంస్కృతి వీరగల్లుల్లో సాహిత్యంలో కనిపిస్తుంది. నలువైపులా యుద్ధాలతో దేశంలో అరాచకం నెలకొంది. కానీ గ్రామాల్లో స్వయంప్రతిపత్తి కలిగిన స్థానిక స్వపరిపాలనా విధానానికి పునాదులు ఈ కాలంలోనే గట్టిపడ్డాయి. పంచాయతీ వ్యవస్థ రాజుకి, రైతుకి మధ్య వారధిగా పని చేసింది. కామందు (గ్రామ రక్షక వ్యవస్థ అధికారి), కరణం, గుడిపూజారి, శెట్టి, భోగంసాని మొదలైన పెద్దలతో, వ్యావసాయక ఉత్పత్తిని గణించటం, పన్నులు వసూలు చేయటం, వృత్తి పనివాళ్లకి తగిన ఉపాధి కల్పించడం వంటివి పంచాయతీ నిర్వర్తించేది. రైతులపై పన్నుల భారం అధికంగానే ఉండేది. పంటలో మూడోవంతు కూడా గిట్టుబాటయ్యేది కాదు. రాజులకు ఇచ్చేదీ గుడికీ అధికారులకీ ఇచ్చేదీ కాక యుద్ధం వస్తే సైన్యంలో భర్తీ కావలసి వచ్చేది. యుద్ధాల్లో గ్రామాలని తగులబెట్టడం, గోదాములు కొల్లగొట్టడం, పశువుల మందలని తోలుకుపోవటం సర్వసామాన్యమై రైతులని మరింత దెబ్బతీసేవి. పంచాయతీలు గ్రామ సంపద రక్షణకి ప్రైవేట్ సైన్యాలు సమీకరించి పోషించవలసి వచ్చింది. ఈ కాలంలోనే మొట్ట మొదటిగా బ్రాహ్మణేతరులకి, యుద్ధాలలో రాజుకి సహాయపడిన వీరులకి రాజ్యాల ఎల్లల్లో భూదానాలు చేయడం శాసనాలలో కనిపిస్తుంది. యుద్ధంలో సైన్యంలో చేరడం, లేని సమయంలో వ్యవసాయం పశుపోషణలు నిర్వహించే కాపుల భూస్వామ్య వ్యవస్థ ఆవిర్భవించింది. ఇటువంటి కాపులే స్వతంత్రులై తరువాతి యుగంలో కాయస్థ, రెడ్డి, వెలమ రాజులుగా రాజ్యాలు స్థాపించారు. - సాయి పాపినేని