Masai peta
-
కన్నుమూసిన మరో విద్యార్థిని
ఇద్దరు డిశ్చార్జ్...విషమంగా మరో ఇద్దరి పరిస్థితి మాసాయిపేట ఘటనలో 18కి చేరిన మృతుల సంఖ్య హైదరాబాద్: మెదక్ జిల్లా మాసాయిపేటలో రైలు స్కూలు బస్సును ఢీకొన్న ఘటనలో యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మరో విద్యార్థిని మంగళవారం కన్నుమూసింది. దీంతో ఇప్పటి వరకు ఈ ఘటనలో 16 మంది విద్యార్థులతో పాటు ఒక డ్రైవర్, క్లీనర్ మృతి చెందారు. యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తరుణ్ (7) మృతి చెందగా మంగళవారం ఉదయం 5.28 గంటలకు వైష్ణవి (11) మరణించింది. పూర్తిగా కోలుకున్న అభినందు(9), శివకుమార్(7)లను వైద్యులు డిశ్చార్జ్ చేశారు. అయితే తల్లిదండ్రుల కోరిక మేరకు వారు ఆస్పత్రిలోనే ఉన్నారు. సాధారణ వార్డులో ఆరుగురు: మరో ఆరుగురు సాధారణ వార్డులో చికిత్స పొందుతున్నారు. వీరిని కూడా ఒకటి, రెండు రోజుల పాటు పర్యవేక్షణలో ఉంచి డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు చెప్పారు. నబీరాఫాతిమా (9), దర్శన్గౌడ్ (6), హరీష్ (7), త్రిష (8), శ్రవణ్ (6), నితూష (7) వార్డులో చికిత్స పొందుతున్నారు. మరో విద్యార్థి శరత్ పరిస్థితి ఆందోళనకరంగా ఉండగా వైద్యులు పరిశీ లనలో ఉంచారు. ఇతను కోలుకునే అవకాశాలు ఉన్నాయి. ప్రశాంత్(6), వరుణ్గౌడ్ (7) పరిస్థితి మాత్రం మరింత ఆందోళనకరంగా ఉంది. ఒక్కగానొక్క కుమార్తె: ఇస్లాంపూర్కు చెందిన సంజీవ్గౌడ్, రమ్య దంపతుల ఏకైక కుమార్తె వైష్ణవి(11). రమ్య బీడీ కార్మికురాలు కాగా, సంజీవగౌడ్ దుబాయ్లో కార్మికుడిగా పనిచేస్తున్నారు. ఆమె ప్రమాద వార్త తెలిసి మూడు రోజుల క్రితం ఆయన హైదరాబాద్కు చేరుకున్నారు. ఆమెకు కాలేయం, కడుపు, తలకు తీవ్ర గాయాలు కావటంతో డాక్టర్లు ఎంతగా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. వైష్ణవి మరణంతో వారి తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. సోమ, మంగళవారాల్లో మృతి చెందిన తరుణ్, వైష్ణవి మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించారు. తలకు బలమైన గాయాలు కావడం, రక్తం గడ్డ కట్టడంతోనే చిన్నారులు మృతి చెందినట్లు పేర్కొన్నారు. ఆస్పత్రిలోనే రంజాన్ వేడుకలు.. మాసాయిపేట రైల్వే దుర్ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న నబీరా ఫాతిమా మంగళవారం ఆస్పత్రిలోనే రంజాన్ వేడుకలు జరుపుకుంది. ఈ నెల 24వ తేదీన ఆమె గాయపడగా ఆమె కోలుకుని సాధారణ వార్డులో చికిత్స పొందుతోంది. మంగళవారం రంజాన్ పండుగ కావడంతో అక్కడే తోటి విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో పాటు ఆస్పత్రి సిబ్బంది, వైద్యులు కూడా నబీరా ఫాతిమాకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. నబీరా ఫాతిమా కోలుకోవడమే తమకు నిజమైన రంజాన్ పండుగ అని ఆమె తల్లిదండ్రులు అయూబ్, రబియా సుల్తానా అన్నారు. -
వారి కడుపుకోత తీర్చలేనిది
బాలల కుటుంబాలకు పరిహారం అందజేసిన మంత్రి హరీశ్రావు తూప్రాన్: బాధిత కుటుంబాలకు ఎంత డబ్బు ఇచ్చినా ఆ తల్లిదండ్రుల కడుపుకోత తీర్చలేమని, బాలల కుటుంబాలకు సర్కార్ అండగా ఉంటుందని తెలంగాణ రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి హారీశ్రావు హామీ ఇచ్చారు. మాసాయిపేట రైలు ప్రమాదంలో మృతిచెందిన 14 మంది చిన్నారుల గ్రామాలు ఇస్లాంపూర్, గుండ్రెడ్డిపల్లి, వెంకటాయిపల్లి, కిష్టాపూర్లలో ఆదివారం డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి, ఇన్చార్జి కలెక్టర్ శరత్లతో కలిసి హరీశ్రావు పర్యటించారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున రూ.70 లక్షల చెక్కులను ఆందజేశారు. 14 మంది చిన్నారులతో పాటు, స్కూల్ బస్సు డ్రైవర్ భిక్షపతిగౌడ్, క్లీనర్ రమేశ్లకు రైల్వేమంత్రి సదానంద గౌడ ప్రకటించిన ఎక్స్గ్రేషియాను రూ.2 లక్షల చొప్పున మొత్తం రూ.32 లక్షలను కూడా ఆయన మృతుల కుటుంబాలకు అందజేశారు. ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ సత్వర చర్యలు చేపట్టినట్టు చెప్పారు. ప్రమాదంలో గాయపడిన చిన్నారులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.లక్ష, రైల్వేశాఖ లక్ష చొప్పున అందిస్తున్నట్టు తెలిపారు. సదానంద రాకపోవడం శోచనీయం ఇదిలా ఉండగా, రైలుప్రమాదం జరిగి నాలుగు రోజులు కావస్తున్నా కేంద్ర రైల్వేమంత్రి సంఘటన స్థలానికి రాకపోవడం శోచనీయమని హరీశ్ ఆరోపించారు. క్షతగాత్రులను కూడా పరామర్శించకపోవడం బాధాకరమన్నారు. డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి మాట్లాడుతూ, మృతి చెందిన కుటుంబాలను చూస్తే గుండే తరుక్కుపోతోందన్నారు. -
కోలుకుంటున్న చిన్నారులు
నలుగురి పరిస్థితి విషమం సాధారణ వార్డుకు 12 మంది తరలింపు హైదరాబాద్: మాసాయిపేట రైలు ప్రమాదంలో గాయపడి యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులు నెమ్మదిగా కోలుకుంటున్నారు. 12 మంది విద్యార్థులను సాధారణ వార్డుకు తరలించారు. శనివారం 9 మందిని సాధారణ వార్డుకు తరలించారు. వీరిలో ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో తిరిగి క్రిటికల్ వార్డుకు తరలించారు. ఆదివారం మరో నలుగురిని సాధారణ వార్డుకు తరలించారు. సాయిరాం, రుచితగౌడ్, సాత్విక, నబిరా ఫాతిమా, మహిపాల్రెడ్డి, సద్భావన్ దాస్, దర్శన్, కరుణాకర్, హరీష్, అభినందు, సందీప్, శిరీషలను సాధారణ వార్డుకు తరలించారు. శివకుమార్, నితూషల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నా వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. శరత్, శ్రవణ్ ఆరోగ్యం ఆందోళనకరంగా ఉండగా ప్రశాంత్, వరుణ్గౌడ్, వైష్ణవి, తరుణ్ల పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. కాగా, మూడు రోజులుగా గాయపడ్డ విద్యార్థులను ఐసీయూ, ఏఎన్సీయూ, ఎస్ఐసీయూ వార్డుల్లో ఉంచడంతో తమ పిల్లలకు ఏం జరుగుతుందోనని కన్నవారు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. -
స్కూల్ బస్సు ప్రమాదంపై వైఎస్ జగన్ తీవ్ర దిగ్బ్రాంతి!
చేగుంట: మెదక్ జిల్లా చేగుంట మండలం మసాయి పేట రైలు ప్రమాదంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనాస్థలంలో పార్టీ నేతలు సహాయచర్యల్లో పాల్గొనాలని వైఎస్ జగన్ ఆదేశించారు. వెల్దుర్తి మండలం మాసాయిపేట వద్ద కాకతీయ స్కూల్ బస్సును నాందేడ్ ప్యాసిజర్ రైలు ఢీకొన్న ఘటనలో 26మంది విద్యార్థులు మృతి చెందారు. స్కూల్ బస్సులో ప్రయాణిస్తున్న వాళ్లందరూ మరణించినట్టు సమాచారం. రైల్వే గేట్ వద్ద కాపలా లేకపోవటం వల్లే ఈ దుర్ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.