breaking news
malakpet railway station
-
వడివడిగా మలక్పేట్ రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి
సాక్షి, హైదరాబాద్: మలక్పేట్ రైల్వేస్టేషన్ పునరాభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయి. వచ్చే జూన్ నాటికి సరికొత్త లుక్తో మలక్పేట్ స్టేషన్ అందుబాటులోకి రానుంది. అమృత్ భారత్ పథకం కింద స్టేషన్ అభివృద్ధి కోసం రూ.26.50 కోట్లతో దక్షిణమధ్య రైల్వే పనులు చేపట్టింది. ఇప్పటి వరకు గ్రౌండ్ఫ్లోర్, టెర్రస్ స్లాబ్ నిర్మాణం పూర్తి చేశారు. మొదటి అంతస్తులో బుకింగ్ కార్యాలయం ఆధునికీకరణ పనులు కూడా పూర్తయ్యాయి. ప్లాట్ఫామ్ సరిహద్దు గోడ, వయా డక్ట్ పనులను కూడా పూర్తి చేశారు. ప్లంబింగ్, ప్లాస్టరింగ్ పనులు కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. పార్కింగ్ షెడ్ల కోసం నిర్మాణ పనులను ప్రారంభించారు.మలక్పేట్ స్టేషన్ (Malakpet Railway Station) పునరాభివృద్ధిలో భాగంగా 12 మీటర్ల వెడల్పయిన ఫుట్ఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టారు. దివ్యాంగుల కోసం ప్రత్యేక టాయిలెట్ల నిర్మాణ పనులు చివరిదశలో ఉన్నాయి. త్వరలో ప్లాట్ఫామ్ల పై కప్పు, లిఫ్ట్లు, ఎస్కలేటర్లను ఏర్పాటు చేయనున్నారు. ప్రయాణికులకు ప్రపంచ స్థాయి సౌకర్యాలను అందించాలనే లక్ష్యంతో రైల్వేశాఖ భారీఎత్తున రైల్వేస్టేషన్ల పునరాభివృద్ధి కొనసాగుతోంది. తెలంగాణలో సుమారు రూ.2,750 కోట్లతో 40 రైల్వే స్టేషన్లనను పునరుద్ధరిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) 2023 ఆగస్టులో పునరభివృద్ధి పనులకు లాంఛనంగా శ్రీకారం చుట్టారు. ఈ మేరకు సికింద్రాబాద్ రీడెవలప్మెంట్ పనులు కొనసాగుతుండగా, బేగంపేట, వరంగల్, కరీంనగర్ స్టేషన్ల పునరాభివృద్ధి పూర్తయింది. ఈ మూడు స్టేషన్లను ప్రధాని ఇటీవల ప్రారంభించారు.మలక్పేట్ పునరాభివృద్ధిలో భాగంగా... ⇒ మలక్పేట్ స్టేషన్లో ఎంఎంటీఎస్ రైళ్లతో పాటు కాచిగూడ – కర్నూలు, తుంగభద్ర ఎక్స్ప్రెస్, కాచిగూడ – గుంటూరు ఎక్స్ప్రెస్ తదితర రైళ్లకు హాల్టింగ్ సదుపాయం ఉంది. ⇒ అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద స్టేషన్ ఆవరణ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారు. ⇒ ప్రవేశ ద్వారాన్ని కళాత్మకంగా పునర్నర్మించనున్నారు. ⇒ ప్రత్యేకంగా సెల్ఫీ పాయింట్లు,సూచిక బోర్డులను ఏర్పాటు చేస్తారు. రైళ్ల సమాచార బోర్డులను కూడా ఏర్పాటు చేయనున్నారు. ⇒ ప్రవేశ ద్వారాలను పునరుద్ధరిస్తారు. కొత్తగా 2 లిఫ్టులు, మరో 2 ఎస్కలేటర్లు అందుబాటులోకి రానున్నాయి. ల్యాండ్ స్కేపింగ్. స్టేషన్ ప్రవేశద్వారం వద్ద ప్రత్యేక లైటింగ్ ఏర్పాటు చేయనున్నారు. ప్రయాణికులు మెట్రో స్టేషన్ నుంచి మలక్పేట్కు రాకపోకలు సాగించేలా అనుసంధానం చేయనున్నారు.చదవండి: పార్కింగ్ పెంచండి.. చలాన్లు పంపిస్తున్నారు! -
‘కొత్త’ మోజు... ‘పాత’కు బూజు!
సాక్షి, సిటీబ్యూరో: నగర ట్రాఫిక్ కమిషనరేట్లో గురువారం భేటీ అయిన రహదారి భద్రత కమిటీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ సమావేశంలో కూలంకషంగా చర్చించిన వాటిలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి కొన్ని కొత్త ప్రతిపాదనలు రూపొందించే అంశాలు ఉన్నాయి. అయితే ఏళ్లుగా పెండింగ్లో ఉన్న వాటిపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఉంది. కీలక ప్రాంతాల్లో అవసరమైన ప్రత్యామ్నాయాల అన్వేషణ, ఉన్న రోడ్లలోనే స్వల్ప మార్పులు చేయడం, వాడుకలో లేని వాటిని అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ట్రాఫిక్ ఇబ్బందులకు చెక్ చెప్పడానికి ప్రయత్నాలు చేయాల్సి ఉంది. ముం దుకు సాగని ప్రతిపాదనల్లో కీలకమైనవి ఇవీ... మలక్పేటలో ‘మూడో మార్గం’... నగరంలోని అత్యంత కీలకమైన, క్లిష్టమైన మార్గాల్లో దిల్సుఖ్నగర్–చాదర్ఘాట్ ఒకటి. ఈ రూట్లో మలక్పేట రైల్వే స్టేషన్ వద్ద ఉన్న (ఆర్యూబీ) అనునిత్యం ట్రాఫిక్ జామ్స్కు కారణంగా మారుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం అక్కడ ఉన్న రెండు మార్గాలకు తోడుగా కనీసం మరోటి నిర్మించాలని దాదాపు నాలుగేళ్ల క్రితం నుంచి ప్రతిపాదనలు రూపొందిస్తున్నారు. అనేకసార్లు భేటీ అయిన రైల్వే, ట్రాఫిక్, మెట్రో రైల్ అధికారులు ఎప్పటికప్పుడు త్వరలో పని మొదలంటూ ప్రకటిస్తూ వచ్చారు. అయితే ఇన్నే ళ్లు గడిచినా ఇప్పటి వరకు అక్కడ కనీసం శంకుస్థాపన కూడా జరగలేదు. ఫలితంగా రద్దీ వేళల్లో ఈ మార్గంలో ప్రయాణించాలంటూ వాహనచోదకులు నరకం చవిచూస్తున్నారు. మహాత్మాగాంధీ బస్ స్టేషన్ సైతం దీనికి సమీపంలోనే ఉండటంతో పండుగల సీజన్లో బాధలు వర్ణనాతీతం. విమానాశ్రయం ‘మీదుగా’ రహదారి... బేగంపేట నుంచి బోయిన్పల్లికి వెళ్లాలంటే ప్రస్తుతం సికింద్రాబాద్ మీదుగా వెళ్లాల్సిందే. దాదాపు 18 ఏళ్ల క్రితం బేగంపేట నుంచి బోయిన్పల్లికి ఓ షార్ట్కట్ రూట్ ఉండేది. బేగంపేట పోలీసుస్టేషన్ దాటిన ఎడమవైపు తిరిగి ఎయిర్ ఇండియా ఆఫీస్ మీదుగా వెళ్లే ఈ దారి దాదాపు 80 అడుగుల వెడల్పు ఉండేది. ఆపై ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఈ మార్గాన్ని స్వాధీనం చేసుకుంది. బేగంపేట–సికింద్రాబాద్ మార్గం నిత్యం రద్దీతో నరకాన్ని చూపిస్తుంటుంది. విమానాశ్రయం శంషాబాద్కు తరలిపోవడంతో పాత మార్గాన్ని పునరుద్ధరించేందుకు ప్రయత్నించాలని దాదాపు ఐదేళ్ల క్రితం ట్రాఫిక్ అధికారులు భావించారు. అప్పట్లోనే రెండు దఫాలుగా స్థానిక అధికారులతో కలిసి సర్వే నిర్వహించారు. ప్రాథమిక దశలోనే ఈ ప్రక్రియకు బ్రేక్ పడింది. ఇది సాకారమైతే బేగంపేట నుంచి బోయిన్పల్లి వైపు వెళ్లే వారి ప్రయాణ దూరం దాదాపు 6 కిమీ మేర తగ్గడంతో పాటు ట్రాఫిక్ జామ్స్ అధిగమించవచ్చు. సికింద్రాబాద్ స్టేషన్ వద్ద స్కైవాక్... కిరణ్కుమార్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2011లో ‘ప్రాజెక్ట్ 100 డేస్’ ప్రకటించారు. అందులో భాగంగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ సమీపంలో సమస్యల పరిష్కారానికి రైల్వేస్టేషన్ వద్ద స్కైవాక్ నిర్మించాలని అధికారులు నిర్ణయించారు. కీలకమైన కో–ఆర్డినేషన్ కమిటీ ఆయా ప్రాంతాల్లో పర్యటించింది. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ కేంద్రంగా రెండు వైపులా ఉన్న బస్టాండ్ల వరకు స్కైవాక్ నిర్మించాలని క్షేత్రస్థాయి పర్యటన తర్వాత నిర్ణయించింది. వీటి నిర్మాణం వల్ల రోడ్డుకు అడ్డంగా పాదచారులు నడవటం, ఎక్కడపడితే అక్కడ రోడ్డు దాటడం, చిరు వ్యాపారుల ఆక్రమణలు తదితర సమస్యలు శాశ్వతంగా తొలగుతాయని యోచించారు. కనీసం సమీపంలోని ఈ మూడు ప్రాంతాల మధ్య తొలివిడతగా స్కైవాక్లు ఏర్పాటు చేయాలని భావించారు. ఇప్పటికీ ఈ ప్రతిపాదనలు ఫైళ్లల్లోనే మగ్గుతున్నాయి. -
లైటింగ్ స్తంభానికి షార్ట్ సర్క్యూట్
హైదరాబాద్ సిటీ: మలక్పేట రైల్వేస్టేషన్ ఎదురుగా ఉన్న లైటింగ్ స్తంభానికి షార్ట్ సర్క్యూట్ వస్తోందని ఆదివారం తెల్లవారు జామున 2 గంటలకు స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో హుటాహుటిన అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది విద్యుత్ ను ఆపి మంటలను అదుపులోకి తెచ్చారు.


