breaking news
mahashiva ratri
-
గంగాతీరంలో బోళా శంకరుడి అత్తారిల్లు..!
దక్ష ప్రజాపతికి తన కూతురు సతీదేవి పరమశివుడిని వివాహం చేసుకోవడం ఇష్టం ఉండదు. ఒక మహాయాగాన్ని నిర్వహించినప్పుడు సతీదేవిని, మహాశివుడిని ఆహ్వానించడు. పుట్టింట్లో జరుగుతున్న యజ్ఞాన్ని చూడాలనే కోరికతో శివుడు నిరాకరించినప్పటికీ సతీదేవి అక్కడికి వెళుతుంది. తండ్రి చేసిన అవమానంతో యజ్ఞగుండంలోకి వెళ్లి, ఆత్మాహుతి చేసుకుంటుంది. ఆ స్థలమే దక్షేశ్వర్ మహాదేవ్ ఆలయంగా ప్రసిద్ధి చెందింది. ఉత్తరాఖండ్లోని హరిద్వార్ సమీపంలోని కంఖాల్ ప్రాంతంలో ఉన్న దక్షేశ్వర్ మహాదేవ్ ఆలయాన్ని సందర్శించి నాటి పౌరాణిక విశేషాలు తెలుసుకోవచ్చు. శివరాత్రి రోజులలో అత్యంత ప్రాచీన ఆలయాల సందర్శనకు,ఆధ్యాత్మిక విషయాల అవగాహనకు ఈ పర్యటన ఎంతగానో ఉపయోగపడుతంది..శక్తి పీఠాల కథకు ఆదిప్రధాన ఆలయం లోపల ఉన్న సతీకుండ్ అత్యంత పవిత్రంగా పరిగణించబడుతుంది. పౌరాణిక కథనాల ప్రకారం ఈ యజ్ఞగుండంలోనే సతీదేవి అగ్ని ప్రవేశం చేసి ఆత్మార్పణం చేసుకుందని విశ్వాసం ఉంది. ఈ ఘటన తరువాత మహాశివుడు సతీదేవి శరీరాన్ని మోస్తూ తాండవం చేయగా, విశ్వ సమతుల్యత దెబ్బతింటుందని భావించిన శ్రీమహావిష్ణువు సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని విభజించాడని పురాణాలు చెబుతాయి. అవి మొత్తం 108 భాగాలు కాగా, వాటిలో ముఖ్యమైన 54 భాగాలు, మరీ ముఖ్యమైన 18 భాగాలే ఈ శక్తి పీఠాల కథకు మూలంగా భావించే ప్రదేశంగా ఆ శరీర భాగాలు పడిన ప్రదేశాలే శక్తి పీఠాలుగా ఏర్పడ్డాయని భక్తులు నమ్ముతారు. ఆలయ ్ర΄ాంగణంలో అనేక ఉ΄ాలయాలు, పవిత్ర వృక్షాలు దర్శనమిస్తాయి. మరోవైపు గంగానది నిశ్శబ్దంగా ప్రవహిస్తూ ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింత పవిత్రం చేస్తుంది. ఇక్కడ భక్తులు పితృకార్యాలు, నదీ పూజలు, పిండప్రదానాలు నిర్వహిస్తారు.అహంకారానికి అంతందక్షేశ్వర్ మహాదేవ్ ఆలయ సముదాయంలో దశ మహావిద్య ఆలయం, బ్రహ్మేశ్వర్ మహాదేవ్ ఆలయం, శని ఆలయం, శ్రీరాముడి దర్బార్, శ్రీ లక్ష్మీనారాయణ ఆలయం కూడా ఉన్నాయి. ఇక్కడ భక్తులు రుద్రాక్ష చెట్టును కూడా దర్శించుకోవచ్చు. ఈ ఆలయాన్ని పూర్తిగా దర్శించాలంటే కనీసం రెండు నుండి మూడు గంటల సమయం వెచ్చించాలి. స్థానిక విశ్వాసం ప్రకారం శ్రావణ మాసంలో శివుడు తన అత్తారింటికి వస్తాడని నమ్మకం ఉంది. శివరాత్రి రోజులలో విశేష పూజలు నిర్వహిస్తారు. అందువల్ల ఈ కాలంలో ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారు. దక్షేశ్వర్ మహాదేవ్ ఆలయం (Daksha Mahadev Temple) ఒక ఆలయం మాత్రమే కాదు అహంకారానికి ముగింపు ఉంటుందని తెలియజేసే పవిత్ర స్థలం. త్యాగానికి ప్రతీకగా నిలిచే ఆధ్యాత్మిక భూమి. శక్తి పీఠాల కథతో ముడిపడిన పవిత్ర ప్రదేశంగా భక్తుల విశ్వాసంలో నిలిచింది.ఇలా చేరుకోవచ్చు..దక్షేశ్వర మహాదేవ్ ఆలయం సమీప రైల్వే స్టేషన్- హరిద్వార్సమీప విమానాశ్రయం- డెహ్రాడూన్. హరిద్వార్ నుండి 35 కి.మీ. రోడ్ వే ద్వారా కూడా ఈ ప్రాంతానికి చేరుకోవచ్చు. తక్కువ ధర, ఆశ్రమాల వంటి ఉచిత వసతితో సహా అనేక ఎంపికలు అందుబాటులో ఉన్నాయిఇక్కడ కేవలం శాకాహారం మాత్రమే లభిస్తుంది.గంగానది ఒడ్డునహరిద్వార్ (Haridwar) భారతదేశంలోని ఉత్తరాఖండ్ రాష్ట్రంలో గంగా నది ఒడ్డున ఉన్న ఒక మతపరమైన ప్రాచీన నగరం. హిందువులకు పవిత్ర స్థలం. అనేక దేవాలయాల సముదాయాలు ఈ ప్రాంతంలో ఉన్నాయి. ఇది హిందువుల ఏడు అత్యంత పవిత్ర స్థలాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. దక్షేశ్వర మహాదేవ్ హరిద్వార్లోని అత్యంత ముఖ్యమైన దేవాలయాలలో ఒకటి. ఇది హరిద్వార్ నుండి సుమారు 5 కిలోమీటర్ల దూరంలో కంఖల్లో ఉంది. సలేశ్వరం ప్రకృతి రమణీయతశివరాత్రి నుంచి గుర్తు పెట్టుకోవాల్సిన సందర్శన స్థలాల జాబితా తయారుచేసుకుంటే అందులో చేర్చాల్సిన పర్యాటక ప్రాంతం ‘సలేశ్వరం.’ ప్రకృతి ఏర్పాటు చేసిన ఈ ప్రాంత సందర్శన మనలో ఒక ఉత్తేజాన్ని, శక్తిని అందిస్తుంది. ఆంధ్రప్రదేశ్లోని శ్రీశైలం క్షేత్రానికి దగ్గరలో.. తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్నగర్ జిల్లా నల్లమల అడవులలో కొలువై ఉన్న యాత్రా స్థలం ఇది. ఇది ప్రకృతి రమణీయతతో అలరారుతున్న అందమైన ప్రదేశం. శ్రీశైలానికి 40 కిలోమీటర్ల దూరం ఉంటుంది సలేశ్వరం. అడవిలో నుండి 25 కిలోమీటర్ల ప్రయాణం ఉంటుంది. ఇందులో 20 కిలోమీటర్లు వాహన ప్రయాణం సాధ్యపడుతుంది. అక్కడి నుండి 5 కిలోమీటర్లు కాలినడక తప్పదు. ఇక్కడ ఈశ్వరుడు లోయలో ఉన్న గుహలో లింగ రూపంలో దర్శనమిస్తాడు. సంవత్సరంలో 4 రోజులు మాత్రమే ఈ అడవిలోకి అనుమతి ఉంటుంది. ఇక్కడి జలపాతానికి సందర్శకులు ముగ్ధులు అవుతుంటారు. లోయలోకి ట్రెక్కింగ్ చేసేవారికి అనుకూలం. లోయ అడుగు భాగంలో ఉన్న శివయ్యను దర్శించుకోవాలంటే గుట్టల మధ్య నుంచి కిందుగా కాలి నడకన ప్రయాణించాల్సి ఉంటుంది. ఆ దారిలో ఎన్నో గుహల నుండి జాలువారే సన్నని జల ధారలు కనిపిస్తూ వాతావరణం చాలా ఆహ్లాదంగా అనిపిస్తుంది. అడుగు భాగంలో ఉన్న గుండం చేరుకున్నాక పైకి చూస్తే .. చుట్టూ ఎత్తైన కొండలు, దట్టమైన అడవి.. మధ్యలో మనం.. తెలియని అనుభూతికి లోనవుతాం. గుండంలోని నీళ్లు అతి చల్లగా, స్వచ్ఛంగా, రుచిగా ఉంటాయి. స్థానిక చెంచులు ఇక్కడ పూజారులుగా ఉంటారు. చైత్ర పౌర్ణమి రోజుల్లో ఇక్కడ విశేష పూజలు జరుపుతారు. హైదరాబాద్ నుండి శ్రీశైలం వెళ్లే మార్గంలో 150 కి.మీ దూరంలో పరహాబాద్ వస్తుంది. అక్కడి నుంచి మరో 32 కిలో మీటర్ల దూరం దట్టమైన అడవిలోకి వెళ్లాలంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.అమర్నాథ్ నమ్మకమే శాశ్వతంహిమాలయాల మధ్యలో అమర్నాథ్ మంచు గుహలో మహాశివుడు మంచు రూపంలో దర్శనం ఇస్తాడు. సహజంగా ఏర్పడే ఈ లింగం జీవితం శాశ్వతం కాదు అని, నమ్మకం, విశ్వాసమే శాశ్వతం అని గుర్తు చేస్తుంది. ఈ లింగాన్ని దర్శించుకోవడానికి ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు కఠినమైన ఆధ్యాత్మిక యాత్రను చేపడతారు. అమర్నాథ్ యాత్ర అనేది శరీరానికి పెద్ద పరీక్ష లాంటిది. పలుచని గాలి, తీవ్రమైన చలి, చుట్టూ సంపూర్ణ నిశ్శబ్దం – ఇవే యాత్రలో భక్తులకు ఎదురయ్యే సవాళ్లు. అందుకే తొలిసారి అమర్నాథ్ యాత్ర చేపట్టిన వారు మొదట్లో కాస్త తటపటాయించినా, భోళాశంకరుడు తన భక్తుడికి కావాల్సిన మనోధైర్యం, శారీరక శక్తిని అందిస్తాడని భక్తులు విశ్వసిస్తారు. ఈ ప్రయాణంలో మాటలు తగ్గిపోతాయి. ప్రతి శ్వాస లెక్కతోనే సాగుతుంది. అయినా లక్షలాది మంది ఈ మార్గంలో నడుస్తారు. అద్భుతం కోసమో, అడ్వెంచర్ కోసమో కాదుం పూర్తిగా ఆధ్యాత్మిక చైతన్యం కోసం ఇలా శివయ్యను దర్శించుకుంటారు. ఈ యాత్రలో ప్రయాణాన్ని బాధగా కాకుండా తత్త్వబోధనగా చూసుకోవాలి. ఎందుకంటే ప్రతి అడుగు ఒక ధ్యానం. నిశ్శబ్దం మనలో ఉన్న అహంకారాన్ని కరిగిస్తుంది. మంచు మన మనసు కూడా తెల్లగా, స్వచ్ఛంగా ఉండాలి అని బోధిస్తుంది. లింగం కరిగిపోతుంది కానీ అనుభూతి మాత్రం మనసులో మిగిలిపోతుంది. అదే అమర్నాథ్ గుహాలయం చెప్పే సారాంశం. అదే శివతత్వం.కేదార్నాథ్ క్షేత్రం ఓ సందేశంప్రతి సంవత్సరం సుమారు ఆరు నెలల పాటు కేదార్నాథ్ ఆలయాన్ని పూర్తిగా మూసివేస్తారు. ఆ సమయంలో ఆలయం మంచు పొరల కింద నిశ్శబ్దంగా నిద్రపోతుంది. నిత్య పూజలు జరగవు. భక్తుల సందడి, రాకపోకలు ఉండవు. అయినప్పటికీ మహాశివుడు అక్కడే ఉన్నాడని భక్తులు గాఢంగా విశ్వసిస్తారు.ఇక్కడ శివుడిని ఉనికిగా కాకుండా, లేమిగా పూజిస్తారు. అంటే ప్రత్యక్ష దర్శనం లేకపోయినా భక్తి ఆగదనే భావానికి కేదార్నాథ్ ఒక జీవంత ఉదాహరణగా నిలుస్తుంది. వేసవిలో ఆలయం మళ్లీ తెరుచుకున్నప్పుడు భారీ ఉత్సవాల కంటే ఆధ్యాత్మిక సంప్రదాయాలకు ప్రాధాన్యం ఉంటుంది. తొలి దీపోత్సవం నిశ్శబ్దంగా జరిగినా, ఆ దీపం ఆలయ ఆధ్యాత్మిక శక్తికి ప్రతీకగా భావిస్తారు. ఈ ప్రారంభాన్ని ఒక పండగగా కాకుండా ఆధ్యాత్మిక యాత్రకు నాందిగా భావిస్తారు. ఆ తరువాతే తీర్థయాత్రికుల రాక ప్రారంభమవుతుంది. భక్తి అంటే దేవుడిని ప్రతిరోజూ దర్శించుకోవడమే కాదు. ఆలయానికి నిత్యం వెళ్లడమే కాదు. దూరంగా ఉన్నా దేవుడిని స్మరించడమే నిజమైన భక్తి అని ఈ క్షేత్రం సందేశం ఇస్తుంది. అందుకే ఆలయం మూసి ఉన్న కాలం ముగిసిన వెంటనే భక్తులు దేశం నలుమూలల నుంచి కేదార్నాథ్ దర్శనం కోసం తరలివస్తారు.ఈ ఏడాది ఆలయం తెరుచుకునే తేదీ 2026 సంవత్సరంలో కేదార్నాథ్ ఆలయం ఏప్రిల్ 22న ఉదయం సుమారు 7 గంటలకు భక్తుల దర్శనానికి తెరుచుకోనుంది. అలాగే నవంబర్ 11 వరకు దర్శనాలు కొనసాగనున్నట్లు తెలియజేస్తున్నారు. అధికారిక ప్రకటనలు, వాతావరణ పరిస్థితులను బట్టి తేదీలు మారే అవకాశం ఉంటుంది కాబట్టి యాత్రకు ముందు తాజా సమాచారం తెలుసుకోవడం మంచిది.కాశీ దివ్యమైన అనుభూతిగంగానది తీరంలో ఉన్న కాశీ విశ్వనాథుడి ఆలయం (Kashi Vishwanath Temple) హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన శైవ క్షేత్రాల్లో ఒకటి. ఈ క్షేత్రాన్ని భక్తులు కేవలం ఒక ఆలయంగా మాత్రమే కాకుండా, మోక్షపురిగా కూడా భావిస్తారు. ఇక్కడ శివుడిని కాలాన్ని కూడా నియంత్రించగల విశ్వనాథుడిగా పూజిస్తారు. కాశీలో జీవితం, మరణాన్ని ఒకే తత్వంగా చూస్తారు. గంగానది తీరంలో జరిగే పూజలు, హారతులు, సంస్కారాలు జీవితం శాశ్వతం కాదని గుర్తు చేస్తాయి. ఇక్కడికి వచ్చిన భక్తులు దేవుడిని మాత్రమే కాదు జీవిత సారాన్ని కూడా దర్శించుకుంటారు. జననం, మరణం, మోక్షం అనే చక్రం గురించి ఆలోచిస్తారు.ప్రతీ రోజు జరిగే గంగా హారతి ఒక ఆచారం మాత్రమే కాదు. అది భక్తి, ప్రకృతి, ఆధ్యాత్మిక అనుభూతి కలిసే ఒక దివ్యమైన సందర్భం. అగ్ని జ్యోతి గంగాజలాలపై ప్రతిబింబించే సమయంలో భక్తులు తమ భయాలు, బాధలు అన్నింటినీ శివుడికి సమర్పించినట్లు భావిస్తారు. కాశీ గురించి చాలా మంది ఒక విశ్వాసాన్ని కలిగి ఉంటారు. ఇక్కడ మరణించిన వారికి శివయ్యే మోక్ష మార్గాన్ని చూపిస్తాడని భక్తులు నమ్ముతారు. అందుకే జీవితంలో ఒక్కసారి అయినా కాశీ దర్శనం చేయాలని భక్తులు కోరుకుంటారు. కాశీ విశ్వనాథుడి ఆలయం మనిషికి ఒక సందేశాన్ని కూడా అందిస్తుంది. జీవితం అశాశ్వతంం ఆధ్యాత్మికతే శాశ్వతం అని చాటి చెప్పే పవిత్ర ప్రదేశం కాశీ నగరం. భక్తి అంటే దేవుడిని బయట వెతకడం కాదుం మనలోని ఆధ్యాత్మిక మార్గాన్ని కనుగొనడం అని చెప్పే పరమ పవిత్ర క్షేత్రం కాశీ. – ఎం.జి. కిశోర్, ప్రయాణికుడుచదవండి: చేతిలో పదివేలు ఉంటే చాలు.. ఆ దేశాల్లో లక్షాధికారులే..? -
Maha Shivratri: నేడు తినాల్సినవి/తినకూడని ఆహారాలు ఇవే!
మహా శివరాత్రి పర్వదినం కావడంతో అందరూ తమ శక్తి మేరకు ఎంతో కొంత ఉపవాసం ఉంటారు. కొందరూ మధ్యహ్నాం వరకు తినరు మరికొందరూ రోజంతా ఏం తినకుండా రాత్రి జాగరం కూడా చేసి మరసటి రోజు ఉదయం గానీ తినరు. ఇలా అందరికీ సాధ్యం కాకపోవచ్చు. అలాంటి వారు పళ్లు, పాలు వంటివి తీసుకోని ఆ భోళా శంకరుడుని ప్రార్థించొచ్చు. అలాంటి వారు ఈ పర్వదినం రోజు ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకుంటే మంచిదో చూద్దామా!. సగ్గుబియ్యం: ఇది తక్షణ శక్తి ఇస్తుంది. ఉపవాసం చేసే వాళ్లకు చాలా మంచిది. ఈ సగ్గుబియ్యందో చేసిన జావా లేదా పాలతో చేసే సగ్గుబియ్యం జావా తాగితే మంచిది. ఉపవాసం ఉన్న వాళ్లకు మంచి ఎనర్జీ బూస్టప్గా ఉంటుంది. బంగాళ దుంప!: ఇందులో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కాబట్టి చక్కగా ఉడక బెట్టుకుని లేదా దానికి సంబంధించిన రెసిపీలు తీసుకుంటే మంచిది. అయితే ఉప్పు, వెల్లుల్లి, ఉల్లిపాయాలు లేకుండా నచ్చిన రెసిపీ చేసుకుంటే మంచిది పాల సంబంధిత రెసిపీలు.. శివుడికి పాల సంబంధిత పదార్థాలను నైవద్యంగా పెట్టడం జరుగుతంది. అలాంటివి తీసుకుంటే ఉపవాసం ఉన్నవాళ్లు కళ్లు తిరగడం వంటివి తలెత్తవు. పండ్లు, డ్రైఫ్రూట్స్ పండ్లు తినడం మంచిదే కానీ, మరీ సిట్రస్ ఎక్కువగా ఉండే పుల్లటి పండ్లు తినకపోవడమే మంచిది. ఉపవాసం కారణంగా పొట్టలో ఆటోమేటిగ్గా యాసిడ్లు ఫామ్ అవుతాయి. ఇక ఇలాంటి పుల్లటి పళ్లు తీసుకుంటే మరింత గ్యాస్ ఫామ్ అయ్యే ఇబ్బంది తలెత్తే ప్రమాదం ఉంది. తీసుకోకూడని పదార్థాలు.. తృణ ధాన్యాలు.. గోధుమలు, అరికెలు, జొన్నలు, సామలు వంటి తృణ ధాన్యాలకు సంబంధించిన పదార్థాలు వినియోగించకూడదు. అలాగే ఎలాంటి పిండి పదార్ధాలు వినియోగించ కూడదు. ఉల్లి, వెల్లుల్లి.. సాధారణంగా ఇలాంటి పర్వదినాల్లో ఉల్లి, వెల్లుల్లి జోలికిపోరు. ఇవి తమో రజో గుణాలను ప్రేరిపిస్తుందని మునులు వీటిని ఇలాంటి పర్వదినంలో త్యజించమని సూచించారు. ఉప్పు ఉప్పు లేని పదార్థాలే తీసుకోవాలి. అదికూడా సైంధవ లవణమైతే వినియోగించొచ్చు. స్సైసీ ఫుడ్స్ మసాలతో కూడిన పదార్థాలు నిషిద్ధం. నాన్ వెజ్ ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ నాన్వెజ్ జోలికి పోకూడదు. మహా శివుడికి ఇష్టమైన రోజు కాబట్టి ఉపవాసంతో ఆ ముక్కంటి అనుగ్రహం పొందేలా చేసుకునే పవిత్రమైన రోజు. (చదవండి: లావుగా ఉన్నావంటూ భార్యతో సహా బిడ్డను వదిలేశాడు..కానీ ఆమె..!) -
ఈ శివరాత్రి మహా విశేషమైనది..
-
శివరాత్రి ఓ పండుగ మాత్రమే కాదు
-
జాతరకు వెళ్లి వస్తూ అనంతలోకాలకు..
అనంతగిరి (అల్లూరి సీతారామరాజు జిల్లా): మహాశివరాత్రి జాతరకు వెళ్లి వస్తూ ముగ్గురు యువకులు లోయలోపడి మృతిచెందారు. ఈ ఘటన అనంతగిరి మండలంలోని డముకు–నిమ్మలపాడు రోడ్డులోని రాయిపాడు సమీపాన ఆదివారం ఉదయం జరిగింది. హుకుంపేట మండలం బూర్జ పంచాయతీ దిగసల్తాంగి గ్రామానికి చెందిన రాపా బుట్టన్న (35), సీదరి రాంబాబు(21), బొండం గణేష్(18) కలిసి ద్విచక్రవాహనంపై బొర్రాలో మహాశివరాత్రి జాతరకు శనివారం బయలుదేరి వెళ్లారు. అక్కడ నుంచి లంగుపర్తి గ్రామంలోని జాతరకు కూడా వెళ్లారు. రెండు ప్రాంతాల్లోనూ సరదాగా గడిపిన వారు ఆదివారం ఉదయం ఐదు గంటలకు స్వగ్రామానికి బయలుదేరారు. మార్గమధ్యంలో రాయిపాడు సమీపంలోని మలుపు వద్దకు వచ్చేసరికి బైక్ అదుపుతప్పి రక్షణగోడను ఢీకొట్టడంతో ముగ్గురు యువకులు ఎగిరి లోయలో పడిపోయారు. దీంతో తీవ్రంగా గాయపడిన బుట్టన్న, రాంబాబు, గణేష్ ఘటనాస్థలంలోనే మృతిచెందారు. స్థానికుల సమాచారం మేరకు ఎస్ఐ కరక రాము ఘటనాస్థలాన్ని పరిశీలించి, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం అరకు ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతిచెందిన బుట్టన్నకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
హరహర మహాదేవ
సాక్షి, అమరావతి/శ్రీశైలం టెంపుల్/సాక్షి, నరసరావుపేట/శ్రీకాళహస్తి రూరల్: హరహర మహాదేవ..శంభో శంకర అంటూ శైవ క్షేత్రాలు మార్మోగాయి. మహాశివరాత్రిని పురస్కరించుకుని పోటెత్తిన భక్తులతో శైవ క్షేత్రాలు కిటకిటలాడాయి. ప్రముఖ శివాలయాల్లో తెల్లవారు జాము నుంచే భక్తులు నదులు, కాలువల్లో పుణ్యస్నానాలు ఆచరించి క్యూలైన్లలో బారులు తీరారు. పార్వతీ పరమేశ్వరులకు ప్రత్యేక అభిషేకాలు, విశేష పూజలు, వివిధ వాహన సేవలు నిర్వహించారు. శాస్త్రోక్తంగా కళ్యాణం జరిపించుకుని భక్తులకు కనుల విందు చేశారు. శ్రీశైలం భక్తజనసంద్రం ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలం మహాశివరాత్రిని పురస్కరించుకొని భక్తజనసంద్రంగా మారింది. నల్లమల కొండలు శివనామస్మరణతో పరవశించాయి. శనివారం మల్లన్న, భ్రమరాంబదేవిలకు దేవస్థాన ధర్మకర్తల మండలి అ«ధ్యక్షులు రెడ్డివారి చక్రపాణిరెడ్డి, ఆలయ ఈవో ఎస్.లవన్న దంపతులు, ప్రధానార్చకులు వీరయ్యస్వామి ఆధ్వర్యంలో విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అర్ధరాత్రి 12 గంటలకు శివపార్వతులకు పట్టువస్త్రాలు, బంగారు ఆభరణాలు, పరిమళపుష్పాలతో అలంకరించి ఆశీనులు గావించారు. వేదపండితులు వేదమంత్రాలు వల్లిస్తుండగా ఆదిదంపతులు ఒకటయ్యారు. శ్రీశైల ఆలయంపైన ఉన్న నవనందులకు అర్ధరాత్రి పాగాను అలంకరించిన దృశ్యం నీలకంఠుడికి పాగాలంకరణ మహాశివరాత్రి పర్వదినాన శ్రీమల్లికార్జునస్వామికి ఆలయంపై పాగాలంకరణ శివరాత్రి ఉత్సవాల్లో ప్రత్యేకం. ప్రకాశం జిల్లా హస్తినాపురానికి చెందిన చేనేత కార్మికుడు పృధ్వి వెంకటేశ్వర్లు స్వామి వారి గర్భాలయ విమాన గోపురం, ముఖమండపంపై ఉన్న 14 నందులను కలుపుతూ పాగాలంకరణ చేశారు. కోటప్పకొండకు పోటెత్తిన భక్తులు పల్నాడు జిల్లా నరసరావుపేట సమీపంలోని ప్రముఖ శైవక్షేత్రం కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వర స్వామి వారి దేవస్థానం భక్తజనంతో నిండిపోయింది. మహాశివరాత్రిని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు శనివారం శ్రీ త్రికోటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. కోటప్పకొండ ప్రత్యేకతైన ప్రభల ఉత్సవం ఘనంగా జరిగింది. ఏకంగా 22 భారీ విద్యుత్ ప్రభలతో పాటు చిన్న చిన్న ప్రభలు ప్రభల నిధికి చేరాయి. రాత్రి స్థానిక ఎమ్యెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రభుత్వం తరఫున స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించారు. శివనామస్మరణతో మార్మోగిన శ్రీకాళహస్తి దక్షిణ కైలాసంగా పేరొందిన శ్రీకాళహస్తి మహాశివరాత్రిని పురస్కరించుకుని శివనామస్మరణతో మార్మోగింది. స్వామి, అమ్మవారికి ఉదయం నుంచి రాత్రి వరకు శాస్త్రోక్తంగా అభిషేకాలు, పూజలు నిర్వహించారు. ఉదయం స్వామి, అమ్మవార్లు ఇంద్ర విమానం–చప్పరంపై ఊరేగారు. రాత్రి స్వామి వారు నంది వాహనంపై, అమ్మవారు సింహ వాహనంపై విహరిస్తూ భక్తులను కటాక్షించారు. నంది వాహన సేవ సమయంలో ఉత్సవమూర్తులు స్వర్ణాభరణాల అలంకరణతో మెరిసిపోయారు. పంచారామాల యాత్ర రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన పంచారామాలైన ద్రాక్షారామం శ్రీభీమేశ్వరస్వామి దేవస్థానం, సామర్లకోట శ్రీకుమార భీమారామం, అమరావతి శ్రీఅమరేశ్వర స్వామి దేవస్థానం, పాలకొల్లు క్షీర రామలింగేశ్వర స్వామి దేవస్థానం, భీమవరం సోమేశ్వరస్వామి దేవస్థానం యాత్రికులతో కిటకిటలాడాయి. అలాగే మహానంది ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపారు. జాగరణకు ఏర్పాట్లు శివాలయాల్లో జాగరణ నిమిత్తం తరలివచ్చిన భక్తుల కోసం ఆయా ఆలయాల్లో ప్రత్యేక ఏర్పాటు చేశారు. భరతనాట్యం, బుర్రకథ, హరికథ కాలక్షేపాలతో పాటు వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు తెల్లవార్లు జరిగేలా సిద్ధం చేశారు. -
సీఎం వైఎస్ జగన్ మహా శివరాత్రి శుభాకాంక్షలు
Maha Shivaratri 2022: మహా శివరాత్రి సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ‘పరమేశ్వరుడిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించే అతిపెద్ద పండుగ మహాశివరాత్రి. ఈ పరమ పవిత్రమైన రోజున ముక్కంటి కరుణాకటాక్షాలు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు’ అని ట్వీటర్లో సీఎం జగన్ శుభాకాంక్షలు తెలియజేశారు. పరమేశ్వరుడిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించే అతిపెద్ద పండుగ మహాశివరాత్రి. ఈ పరమ పవిత్రమైన రోజున ముక్కంటి కరుణాకటాక్షాలు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. — YS Jagan Mohan Reddy (@ysjagan) March 1, 2022 -
పండుగైనా, సెలవైనా పింఛన్ పంపిణీ
సాక్షి, అమరావతి: ఈ నెల మొదటి తేదీ మహాశివరాత్రి పర్వదినం. అదీగాక మంగళవారం ప్రభుత్వ సెలవు దినం. అయినా అవ్వా తాతలకు పింఛన్ ఇచ్చే కార్యక్రమం మాత్రం యథాతథంగా కొనసాగుతోంది. ఫిబ్రవరి నెలకు సంబంధించిన పింఛన్ను మార్చి ఒకటో తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 61,25,228 మంది లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు రూ.1,557.06 కోట్లు విడుదల చేసింది. సోమవారం సాయంత్రానికే అన్ని గ్రామ, వార్డు సచివాలయాల ఖాతాల్లో పింఛన్ నిధులను జమ చేసే కార్యక్రమం పూర్తయినట్టు సెర్ప్ అధికారులు చెప్పారు. తెల్లవారుజాము నుంచే వలంటీర్లు లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి డబ్బులిస్తారు. ఐదు రోజుల పాటు పంపిణీ కార్యక్రమం కొనసాగనుంది. పంపిణీలో ఎలాంటి అవకతవకలకు తావులేకుండా లబ్ధిదారులకు పింఛన్ అందించే సందర్భంలో గుర్తింపు కోసం బయోమెట్రిక్, ఐరిస్ విధానాలను అమలు చేస్తున్నారు. అలాగే ఆర్బీఐఎస్ విధానాన్ని కూడా అందుబాటులోకి తెచ్చారు. సాంకేతిక కారణాల వల్ల ఏ ఒక్కరికీ పింఛన్ అందలేదనే ఫిర్యాదు రాకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకున్నారు. పింఛన్ల పంపిణీ పర్యవేక్షణ కోసం రాష్ట్రంలోని 13 జిల్లాల డీఆర్డీఏ కార్యాలయాల్లోని కాల్ సెంటర్లు ఏర్పాటు చేశారు. -
శైవక్షేత్రాలకు 3,325 బస్సులు
నరసరావుపేట: మహాశివరాత్రి సందర్భంగా రాష్ట్రంలోని శైవక్షేత్రాలకు వెళ్లే భక్తుల వద్ద నుంచి ఆర్టీసీ పాత టికెట్ ధరలే వసూలు చేస్తుందని, ధరల్లో ఎలాంటి మార్పులూ చేయడం లేదని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ద్వారకా తిరుమలరావు చెప్పారు. రెండేళ్లుగా డీజిల్ రేట్లు విపరీతంగా పెరిగినా.. భక్తుల సౌకర్యార్థం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. మహాశివరాత్రి సందర్భంగా కోటప్పకొండ వద్ద జరిగే తిరునాళ్లకు ఆర్టీసీ సంస్థ చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించేందుకు బుధవారం ఆయన నరసరావుపేటకు వచ్చారు. ఈ సందర్భంగా గ్యారేజ్ ఆవరణలో సిబ్బందికి గేట్ మీటింగ్ నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ మార్చి ఒకటో తేదీన మహాశివరాత్రికి సంస్థ సంసిద్ధమైందన్నారు. కోటప్పకొండ, కర్నూలు జిల్లాలోని శ్రీశైలంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 96 చిన్నా, పెద్ద శైవక్షేత్రాల్లో మహాశివరాత్రి ఉత్సవాలు జరుగుతాయన్నారు. భక్తులకు ఇబ్బంది లేకుండా శివరాత్రి ముందురోజు, శివరాత్రి రోజున 21 లక్షల మంది కోసం 3,325 బస్సులను సిద్ధం చేసినట్టు తెలిపారు. వాటిలో 410 బస్సులు కోటప్పకొండకు ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నామన్నారు. నరసరావుపేట నుంచి 285, మిగతా ప్రాంతాల నుంచి 55, ఘాట్రోడ్డులో 70 బస్సులు నడుస్తాయని చెప్పారు. -
మహా శివరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న సీఎం జగన్
-
మహా శివరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న సీఎం జగన్
-
మహా శివరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న సీఎం జగన్
సాక్షి, గుడివాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం కృష్ణా జిల్లా గుడివాడలో పర్యటించారు. పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని ఆధ్వర్యంలో ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహిస్తున్న మహా శివరాత్రి ఉత్సవాల్లో సీఎం పాల్గొన్నారు. ఉదయం 11.30 గంటల సమయంలో స్టేడియానికి చేరుకున్న సీఎం జగన్.. అభిషేకం, పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్నారు. రేపు గుంటూరు జిల్లా మాచర్లకు సీఎం జగన్.. జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య కుటుంబసభ్యులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం సన్మానించనున్నారు. 75వ స్వాతంత్య్ర దిన వేడుకల ప్రారంభంలో భాగంగా జాతీయ పతాకాన్ని రూపొందించిన పింగళి వెంకయ్య కుమార్తె సీతామహాలక్ష్మి కుటుంబసభ్యులను సన్మానించేందుకు శుక్రవారం మధ్యాహ్నం గుంటూరు జిల్లా మాచర్లకు సీఎం జగన్ వస్తున్నారని గుంటూరు జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పింగళి వెంకయ్య కుమార్తె ఘంటశాల సీతామహాలక్ష్మి మాచర్ల వాసి. సీఎం పర్యటన ఏర్పాట్లను కలెక్టర్ గురువారం మాచర్ల వెళ్లి పర్యవేక్షించనున్నారు. ప్రభుత్వ విప్, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఏర్పాట్లలో పాలుపంచుకుంటున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: విధుల్లో ఉన్న ఎస్ఐని నెట్టేసిన కొల్లు రవీంద్ర సీఎం జగన్ మహా శివరాత్రి శుభాకాంక్షలు -
సీఎం జగన్ మహా శివరాత్రి శుభాకాంక్షలు
సాక్షి, అమరావతి: మహా శివరాత్రి సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. విశేష పూజలు, జాగరణతో శంకరుని ధ్యానించే పవిత్రమైన రోజు మహాశివరాత్రి అని, పరమేశ్వరుని ఆశీస్సులు అందరిపై ఉండాలని సీఎం జగన్ ఆకాంక్షించారు. నేడు గుడివాడకు సీఎం జగన్ సీఎం వైఎస్ జగన్ గురువారం కృష్ణా జిల్లా గుడివాడలో పర్యటిస్తారు. గుడివాడ మున్సిపల్ స్టేడియంలో నిర్వహిస్తున్న మహాశివరాత్రి ఉత్సవాల్లో ఆయన పాల్గొననున్నారు. గురువారం ఉదయం 10.45 గంటలకు తాడేపల్లి నుంచి సీఎం బయల్దేరి 11.30–11.50 గంటల మధ్య గుడివాడ మున్సిపల్ స్టేడియానికి చేరుకుంటారు. అక్కడ జరిగే మహాశివరాత్రి ఉత్సవాల్లో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 12.45 గంటలకు తిరిగి తాడేపల్లి నివాసానికి సీఎం చేరుకుంటారు. చదవండి: శివనామస్మరణతో మార్మోగుతున్న శైవక్షేత్రాలు ఆంధ్రజ్యోతిపై రూ.100 కోట్లకు పరువు నష్టం దావా -
శంభో శివశంభో
-
శివనామస్మరణతో మార్మోగుతున్న ఆలయాలు
-
సీఎం జగన్ మహా శివరాత్రి శుభాకాంక్షలు
సాక్షి, అమరావతి : మహా శివరాత్రి సందర్భంగా తెలుగు ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలోని పంచారామాలు, శక్తి పీఠాలు, శివాలయాలు, ఇంటింటా... శివరాత్రి పండుగను భక్తి శ్రద్ధలతో ప్రజలు ఘనంగా జరుపుకోవాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. పవిత్ర పర్వదినం సందర్భంగా ప్రజలందరికీ శుభం జరగాలని దేవుణ్ని ప్రార్థిస్తున్నట్లు సీఎం జగన్ తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. కాగా, శుక్రవారం జరుగనున్న మహా శివరాత్రి ఉత్సవాలకు తెలుగు రాష్ట్రాలలోని ప్రధాన ఆలయాలన్నీ ముస్తాబవుతున్నాయి. ప్రముఖ శైవక్షేత్రాల్లో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. Greetings to all on the auspicious occasion of #MahaShivaratri. May the blessings of Lord Shiva bring good health, happiness, and immense prosperity to you and your family. — YS Jagan Mohan Reddy (@ysjagan) February 21, 2020 శివరాత్రిని ఆనందంగా జరుపుకోవాలి : గవర్నర్ మహా శివరాత్రి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ శుభాకాంక్షలు తెలిపారు. శివభక్తులు అత్యంత పవిత్రమైన దినమైన శివరాత్రిని ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. మహాశివరాత్రి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. శివభక్తులు అత్యంత పవిత్రమైన పర్వదినంగా మహాశివరాత్రిని జరుపుకుంటారు. మహోన్నతమైన మహాశివరాత్రి రోజు లక్షలాదిమంది శైవభక్తులు భక్తి శ్రద్ధలతో సదాశివుడిని పూజిస్తారు. శివనామస్మరణ ప్రేమ, ఆప్యాయత, అనురాగం, స్నేహం, సోదరభావం లాంటి ఆలోచనలను ప్రేరేపిస్తుంది. పరమేశ్వరుడికి అత్యంతప్రీతిపాత్రమైన శివరాత్రిని ఆనందంగా జరుపుకోవాలి’ అని గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ఆకాంక్షించారు. -
అనుకున్నది జరుగుతుంది!
‘‘దోమకొండ శివాలయానికి 800 ఏళ్ల చరిత్ర ఉంది. 400 ఏళ్ల క్రితం మా పూర్వీకులు ఆ ఆలయం చుట్టూ దోమకొండ కోటను నిర్మించారు. 2003లో మా తాతగారు కామినేని ఉమాపతి (దోమకొండ ఫ్యామిలీ 20వ తరం) పురావస్తు శాఖ వారితో కలిసి ఆలయాన్ని పునరుద్ధరించడం మొదలుపెట్టారు. ఇక్కడి శివలింగం విచిత్రమైన నీలం రంగులో ఉంటుంది. నాకు, మిస్టర్ సి (రామ్చరణ్)కి ఆలయాన్ని, దాని పరిసర ప్రాంతాలను శుభ్రం చేస్తే అనుకున్నది జరుగుతుందని నమ్మకం’’ అన్నారు ఉపాసన కొణిదెల. భర్త రామ్చరణ్తో కలసి శివరాత్రి పర్వదినాన దోమకొండ కోట శివాలయాన్ని సందర్శించి, భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. ఈ ఫొటోను ఉపాసన తన ట్వీటర్ ద్వారా షేర్ చేశారు. కాగా శివరాత్రికి ముందు కొన్ని రోజులు ఉపాసన ఆధ్యాత్మిక యాత్ర వెళ్లారు. ఇందులో భాగంగా ప్రయాగలో జరిగిన కుంభమేళాని సందర్శించారు. ‘‘ఆరు పవిత్ర స్థలాలను సందర్శించాను. కుంభ్ ఓ మంచి అనుభూతి. తేలికగా, సంతోషంగా, నూతనోత్సాహాన్నిచ్చింది. జై శివ శంభో’’ అంటూ ఆ హోలీ ట్రిప్ గురించి పేర్కొన్నారు ఉపాసన. Shraddha, Bhakti & complete LOVE & devotion to Lord Shiva. 🙏🏼 OM NAMAH SHIVAYA #ramcharan at the #Domakonda Shivalayam 🙏🏼 restore ancient temples pic.twitter.com/sme3oPMo7P — Upasana Konidela (@upasanakonidela) 4 March 2019 -
మహాశివరాత్రితో ముగిసిన కుంభమేళా
-
కుంభమేళాలో 24 కోట్ల మంది పుణ్యస్నానం
అలహాబాద్: ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్(అలహాబాద్)లో జరుగుతున్న ఆధ్యాత్మిక వేడుక కుంభమేళా ముగిసింది. మహాశివరాత్రితో పాటు కుంభమేళా చివరిరోజు కావడంతో సోమవారం పుణ్యస్నానాలు ఆచరించేందుకు భక్తులు పవిత్ర సంగమానికి పోటెత్తారు. జనవరి 15 న ప్రారంభమైన కుంభమేళాలో భాగంగా సోమవారం సాయంత్రం నాటికి మొత్తం 24.05 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. మహాశివరాత్రి నేపథ్యంలో ఒక్కరోజే 1.10 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు చేశారు. సన్నటి వర్షపు జల్లులు కురుస్తున్నప్పటికీ భక్తులందరూ ‘హరహర మహాదేవ్’అంటూ శివనామస్మరణ చేస్తూ ముందుకుసాగారు. కుంభమేళా సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకపోవడంతో అధికారులు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. కుంభమేళా చివరిరోజున యూపీ మంత్రి సురేశ్ రాణా పుణ్యస్నానం ఆచరించారు. అనంతరం బోటులో విహరించారు. కుంభమేళా సందర్భంగా మూడు గిన్నిస్ రికార్డులు నెలకొల్పామని మంత్రి సురేశ్ రాణా తెలిపారు. ‘పెయింట్ మై సిటీ’పేరుతో మార్చి 1న 7,664 మంది వాలంటీర్లు 8 గంటల వ్యవధిలో చేతితో పెయింటింగ్ రూపొందించి గిన్నిస్రికార్డు సాధించినట్లు వెల్లడించారు. ఈ నెల 2న భక్తులు భారీ సంఖ్యలో ప్రయాగ్రాజ్కు చేరుకుని చీపుర్లతో రోడ్డును శుభ్రంచేసి గిన్నిస్ రికార్డును సాధించారని పేర్కొన్నారు. అలాగే 19వ జాతీయ రహదారిపై 500 బస్సులతో 3.2 కి.మీ పరేడ్ నిర్వహించి మరో గిన్నిస్ రికార్డును సొంతం చేసుకున్నామన్నారు. -
విజయనగరంలో భక్తులతో కిటకిటలాడుతున్న శివాలయాలు
సాక్షి, విజయనగరం: మహాశివరాత్రి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో శివరాత్రి పర్వదినం వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. జిల్లాలోని నెల్లిమర్ల మండలం రామతీర్ధాలు పుణ్యక్షేత్రంలో నేటి నుంచి రెండు రోజుల పాటు శివరాత్రి మహాజాతర ఉండటంతో ఈరోజు తెల్లవారుజాము నుంచే శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. పుణ్యక్షేత్రానికి ఇరుత జిల్లాల నుంచి వేలాదిగా తరలిస్తున్న భక్తులు. ఎస్. కోట: మహాశివరాత్రి సందర్భంగా ఎస్. కోట మండలం పుణ్యగిరి ఉమాకోటిలింగేశ్వరస్వామి దేవస్థానంలో శివరాత్రి పర్వదినం సందర్భంగా వేలాదిగా తరలి వస్తున్న భక్తులు. జిల్లా కేంద్రంలో శివాలయం వీధిలో భక్తులుతో నిండిన శివాలయాలు. ఎస్ కోట నుంచి పుణ్యగిరి కొండవరకు ఇరవై నాలుగు గంటలు పాటు నిరంతరాయంగా పది బస్సులు ఏర్పాటు చేసిన ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఉత్సవాల సందర్భంగా నాలుగు వందల మంది పోలీసులుతో బందోబస్తు నిర్వహించారు. -
శివాయ... పరమేశ్వరాయ
శివుడు.. భోళా శంకరుడు.శివుడు.. భక్త వశంకరుడు.పత్రం పుష్పం ఫలం తోయం...వీటిలో ఏది సమర్పించినా స్వీకరిస్తాడు.భక్తి శ్రద్ధలతో తనను కొలిచే భక్తులనుఆనందంగా అనుగ్రహిస్తాడు...జన్మానికో శివరాత్రి అంటారు గానీ,మహాశివరాత్రి పర్వదినంఏటేటా వస్తూనే ఉంటుంది.మనలో నిద్రాణమైన భక్తిని జాగృతం చేస్తూనే ఉంటుంది. త్రిమూర్తులలోనే కాదు, సమస్త దేవతలలోనూ శివుడు భక్తసులభుడు. అందుకే అతడిని భోళాశంకరుడని అంటారు. శంకరుడు భక్తవశంకరుడు. అమృతం కోసం దేవదానవులు క్షీరసాగర మథనం చేశారు. అప్పుడు అమృతం కంటే ముందు హాలాహలం పుట్టింది. హాలాహలాన్ని అలాగే విడిచిపెట్టేస్తే అది ముల్లోకాలనూ దహించేసే ప్రమాదం ఉండటంతో దేవదానవులందరూ భీతావహులయ్యారు. హాలాహలం బారి నుంచి లోకాలను రక్షించాలంటూ మహాదేవుడైన శంకరుడిని శరణు వేడారు. లోక రక్షణ కోసం ఆ గరళాన్ని తానే మింగి, గొంతులో బంధించి గరళకంఠుడయ్యాడు. హాలాహల ప్రభావానికి అతడి కంఠం కమిలి, నీలంగా మారడంతో నీలకంఠుడిగా పేరుపొందాడు. గరళాన్ని గొంతులో బంధించడం వల్ల అది శివునిలో విపరీతమైన తాపాన్ని పుట్టించసాగింది. ఆ తాపాన్ని తగ్గించుకోవడానికి క్షీరసాగర మథనంలో పుట్టిన చంద్రుడిని తలపై ఉంచుకున్నాడు. నిరంతర తాపోపశమనం కోసం గంగను కూడా నెత్తిన పెట్టుకున్నాడు. అయినా, శివుడిని హాలాహల తాపం ఇబ్బంది పెడుతూనే ఉంటుందట. అందుకే భక్తులు నిత్యం శివలింగానికి అభిషేకం చేస్తూ ఉంటారు. హాలాహలం మింగినప్పుడు దాని ప్రభావానికి శివుడు మూర్ఛిల్లాడట. ఆందోళన చెందిన దేవతలు శివుడికి మెలకువ వచ్చేంత వరకు జాగారం చేశారట. అందుకే ఏటా మాఘ బహుళ చతుర్దశి నాడు వచ్చే మహాశివరాత్రి రోజున భక్తులు ఉపవాసం చేసి, జాగారం ఉంటారు. జాగారం ఉన్న సమయంలో శివనామ సంకీర్తనతోనూ, జప ధ్యానాలతోనూ కాలక్షేపం చేస్తారు. ఇదంతా మహాశివరాత్రి పర్వదినానికి గల పౌరాణిక నేపథ్యం. నిజానికి శివారాధన పురాణాలకు ముందు నుంచే ఉనికిలో ఉంది. శివారాధన చరిత్ర క్షీరసాగర మథనానికి సంబంధించిన గాథ ప్రస్తావన చాలా పురాణాలలో ఉంది. మన పురాణ సాహిత్యం క్రీస్తుశకం మూడో శతాబ్ది నుంచి క్రీస్తుశకం పదో శతాబ్దికి చెందినదిగా ఆధారాలు ఉన్నాయి. మన దేశంలో శివారాధన మాత్రం పురాణాలకు శతాబ్దాల మునుపటి నుంచే వాడుకలో ఉంది. క్రీస్తుపూర్వం మూడువేల ఏళ్ల నాడే సింధులోయ నాగరికత విలసిల్లిన కాలంలో శివుడిని పశుపతిగా ఆరాధించేవారు. క్రీస్తుపూర్వం 1500–1200 నాటికి చెందిన రుగ్వేద శ్లోకాలలో రుద్రుడి పేరిట శివుని ప్రస్తావన కనిపిస్తుంది. క్రీస్తుపూర్వం నాలుగో శతాబ్దికి చెందిన శ్వేతాశ్వతర ఉపనిషత్తులో శైవమత సిద్ధాంతాల ప్రస్తావన కనిపిస్తుంది. ఈ ఉపనిషత్తు భగవద్గీత కంటే మునుపటిది. అయితే, ప్రస్తుతం వ్యాప్తిలో ఉన్న శైవారాధన పద్ధతులు, సంప్రదాయాలు మాత్రం క్రీస్తుపూర్వం 200 నుంచి క్రీస్తుశకం 100 సంవత్సరాల మధ్య ప్రారంభమై ఉంటాయని గావిన్ ఫ్లడ్ వంటి చరిత్రకారుల అంచనా. పురాణాల రచన మొదలైన తర్వాత శివపురాణం, లింగపురాణం వంటి వాటి ద్వారా శైవానికి ప్రాచుర్యం పెరిగింది. అతి ప్రాచీన శివాలయాలు అప్పటికే కొన్ని ఉనికిలో ఉండేవి. క్రీస్తుశకం ఏడో శతాబ్దికి చెందిన హ్యుయాన్ సాంగ్ భారత ఉపఖండంలో పర్యటించాడు. హిందూకుష్ పర్వతశ్రేణుల వద్దనున్న నూరిస్తాన్ తదితర ప్రాంతాల్లో శైవాలయాలను తిలకించినట్లు తన రచనల్లో వివరించాడు. క్రీస్తుశకం 5–11 శతాబ్దాల కాలం నాటికి దేశంలోని తూర్పు, పశ్చిమ, దక్షిణ ప్రాంతాల్లో సైతం ప్రధాన శైవక్షేత్రాల్లోని ఆలయాల నిర్మాణం జరిగింది. బాదామి, ఎలిఫెంటా, ఎల్లోరా గుహాలయాలు, ఖజురహో, భువనేశ్వర్, చిదంబరం, మధురై, కంచి వంటి ప్రాంతాల్లోని శివాలయాలు ఆ కాలానికి చెందినవే. అప్పటికే శైవమతం బాగా వ్యాప్తిలో ఉండేది. క్రీస్తుశకం ఎనిమిదో శతాబ్దికి చెందిన శంకరాచార్యుల కాలానికి శైవమతంలో పాశుపత, లకులీశ, కాపాలిక, తాంత్రిక శైవ అనే నాలుగు ప్రధాన శాఖలు కూడా ఏర్పడ్డాయి. వైష్ణవ ఆళ్వార్లు, భక్తి ఉద్యమం వ్యాప్తికి ముందు దక్షిణ భారతదేశంలో బౌద్ధ, జైన మతాలతో పాటు శైవమతానికి చాలా ప్రాచుర్యం ఉండేది. మహాభారతం వంటి ఇతిహాసాలలో శైవ, వైష్ణవాల రెండింటి ప్రస్తావనా ఉన్నప్పటికీ, దక్షిణాదిలో వైష్ణవం కంటే శైవమే పురాతనమైనదని చరిత్రకారుల అంచనా. వైష్ణవానికి చెందిన వైఖానస వంటి ఆగమ సంప్రదాయాలను శైవమతం ప్రభావితం చేసింది. ఆగమ సంప్రదాయాలపై శైవ ప్రభావానికి ‘ఈశ్వర సంహిత’, ‘పద్మ సంహిత’, ‘పరమేశ్వర సంహిత’ వంటి ప్రాచీన గ్రంథాలే నిదర్శనంగా నిలుస్తాయి. దక్షిణ భారతదేశంలో చాలా చోట్ల పురాతన స్వయంభూ శివలింగాలు, ఆలయాలు కనిపిస్తాయి. చోళుల కాలంలో ఈ ప్రాంతంలో శైవాలయాలు లెక్కకు మిక్కిలిగా నిర్మితమయ్యాయి. హిమాలయ ప్రాంతం నుంచి చైనా, టిబెట్ ప్రాంతాలకు శైవం కొంత వ్యాపించినా, దక్షిణ భారత ప్రాంతం నుంచి ఆగ్నేయాసియాకు మరింతగా విస్తరించింది. ఇండోనేసియా, మలేసియా, కంబోడియా, వియత్నాం, థాయ్లాండ్లలోని పురాతన ఆలయాల్లో శైవ ఆరాధనకు చెందిన చిహ్నాలు కనిపిస్తాయి. ఇవన్నీ క్రీస్తుశకం నాలుగో శతాబ్ది నుంచి ఏడో శతాబ్ది కాలానికి చెందినవి. ఇండోనేసియాలో శివుడిని ‘భట్టరగురు’ పేరిట ఆరాధించేవారు. క్రీస్తుశకం పదిహేనో శతాబ్దిలో ఇండోనేసియా, మలేసియాలలో ఇస్లాం వ్యాప్తి మొదలవడంతో శైవ, బౌద్ధ సంప్రదాయాలు మరుగున పడ్డాయి. యోగ సంప్రదాయంలో శివుడు యోగ సంప్రదాయంలో శివుడిని ఆదియోగిగా పరిగణిస్తారు. చాలా శివాలయాల్లో శివుడిని లింగరూపంలో ఆరాధిస్తారు. శివుడిని మూర్తిరూపంలో ఆరాధించే ఆలయాల్లో ఎక్కువగా శివుడు యోగముద్రలోనే కనిపిస్తాడు. నాథయోగ సంప్రదాయంలో శివుడిని మత్సే్యంద్రనాథునిగా, గోరఖ్నాథునిగా ఆరాధిస్తారు. శివుడిని నాట్యాభినయ కళలకు అధిదేవునిగా భావిస్తారు. నృత్య నాటక ప్రదర్శనలలో శివుని నటరాజ మూర్తిని ఆరాధించడం శతాబ్దాలుగా కొనసాగుతున్న సంప్రదాయం. బాదామి గుహలు, ఎల్లోరా గుహలు, ఖజురహో, చిదంబరం వంటి చోట్ల నటరాజ భంగిమలో శివుని పురాతన విగ్రహాలు కనిపిస్తాయి. యోగ సంప్రదాయంలో మాత్రమే కాదు, జైన బౌద్ధ మతాల్లోనూ శైవ ప్రభావం కనిపిస్తుంది. నాథయోగులు ఆరాధించే మత్సే్యంద్రనాథుని బౌద్ధులు కూడా ఆరాధిస్తారు. నేపాల్ రాజధాని కఠ్మాండూలోని ‘సెతో మచీంద్రనాథ్’ ఆలయంలో హిందువులతో పాటు బౌద్ధులు కూడా పూజలు, ప్రార్థనలు జరుపుతారు. బౌద్ధులకు చెందిన బోధిసత్వునిలో శివుని లక్షణాలు చాలా వరకు కనిపిస్తాయి. శైవంలోని తాంత్రిక ఆరాధన రీతిలోనే జైనులు తమదైన తాంత్రిక ఆరాధన పద్ధతిని ఏర్పరచుకున్నారు. పదకొండో శతాబ్దికి చెందిన జైన గ్రంథం ‘భైరవ పద్మావతికల్ప’లో ప్రస్తావించిన ‘పద్మావతి’కీ శైవ శాక్తేయాలలోని ‘త్రిపుర భైరవి’కీ మధ్య చాలా పోలికలు కనిపిస్తాయి. ద్వాదశ జ్యోతిర్లింగాలు శివుడిని లింగ రూపంలో ఆరాధించడమే ఎక్కువగా ప్రాచుర్యం పొందింది. శివుడిని మూర్తి రూపంలో పూజించే ఆలయాలు చాలా తక్కువగా మాత్రమే కనిపిస్తాయి. లింగ రూపంలో శివుడిని ఆరాధించే ఆలయాల్లో ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలు అత్యంత ప్రధానమైనవి. నిరంతరం భక్తుల సందడి కనిపించే ఈ క్షేత్రాలలో ఏటా కార్తీక మాసంలోను, మహాశివరాత్రి పర్వదినంలోను మరింతగా భక్తజన సందోహం కనిపిస్తుంది. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలు ఇవే: సోమనాథ్: గుజరాత్లోని సౌరాష్ట్ర ప్రాంతానికి చెందిన ప్రభాస్ పట్టణంలో వెలసిన క్షేత్రం ఇది. చంద్రుడు ఇక్కడ జ్యోతిర్లింగాన్ని ప్రతిష్ఠించడంతో ఇది సోమనాథ క్షేత్రంగా ప్రసిద్ధి పొందింది. సోమనాథ క్షేత్రంలో తొలి ఆలయాన్ని ఎప్పుడు ఎవరు నిర్మించారనే దానిపై ఎలాంటి ఆధారాలూ లేవు. తొలినాటి ఆలయం జీర్ణ స్థితికి చేరుకోవడంతో క్రీస్తుశకం ఏడో శతాబ్దికి చెందిన యాదవ రాజులు పాత ఆలయం ఉన్న చోటే కొత్తగా ఆలయ నిర్మాణం చేశారు. సిం«ద్ ప్రాంతాన్ని పాలించిన అరబ్ రాజప్రతినిధి దండయాత్రలో యాదవ రాజులు నిర్మించిన సోమనాథ ఆలయం నాశనమైంది. ఇదేచోట గుర్జర–ప్రతీహార రాజు రెండో నాగభట్ట క్రీస్తుశకం 815లో కొత్త ఆలయాన్ని నిర్మించాడు. ఎర్రరాతితో నిర్మించిన ఈ ఆలయం ఇప్పటికీ నిలిచి ఉంది. శ్రీశైలం: ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో దట్టమైన నల్లమల అడవులలో కొండగుట్టల నడుమ వెలసిన క్షేత్రం ఇది. ఇక్కడ శివుడు మల్లికార్జునుడిగా, పార్వతీదేవి భ్రమరాంబికగా వెలిశారు. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమే కాదు, అష్టాదశ శక్తిపీఠాల్లో కూడా ఒకటిగా శ్రీశైలం ప్రసిద్ధి పొందింది. శ్రీశైల క్షేత్రం ప్రస్తావన పురాణాలలో కనిపిస్తుంది. ఇది కచ్చితంగా ఏనాటిదో చెప్పేందుకు చారిత్రక ఆధారాలు లేవు. క్రీస్తుశకం ఆరో శతాబ్దికి చెందిన మైసూరు కదంబ రాజుల తాల్గుండి శాసనంలో శ్రీశైలం పేరు కనిపిస్తుంది. శ్రీశైల శిఖరాన్ని దర్శించుకుంటే చాలు మోక్షం లభిస్తుందని భక్తుల విశ్వాసం. ఉజ్జయిని: మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని నగరంలో మహాకాళేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రం ఉంది. దేశంలోని అతి పురాతన నగరాల్లో ఒకటైన ఉజ్జయిని శక్తిపీఠం కూడా. అమ్మవారు ఇక్కడ మహాకాళిగా వెలసింది. ఇక్కడి కాలభైరవ ఆలయం కూడా అత్యంత ప్రసిద్ధమైనది. మహాకాలేశ్వర క్షేత్రంలో శివుడు దక్షిణామూర్తి రూపంలో దక్షిణాభిముఖంగా దర్శనమిస్తాడు. ఇక్కడి పురాతన ఆలయాలు ఏనాటివో తెలియదు. క్రీస్తుశకం ఆరో శతాబ్దికి చెందిన మహాకవి కాళిదాసు ఈ క్షేత్రంలోనే కాళికాదేవిని ప్రసన్నం చేసుకున్నట్లు ప్రతీతి. క్రీస్తుశకం పదమూడో శతాబ్దిలో ఇల్టట్మిష్ దాడిలో మహాకాళేశ్వర ఆలయం కొంత దెబ్బతిన్నది. పద్దెనిమిదో శతాబ్దికి చెందిన మరాఠా సేనాని రాణోజీ సింధియా ఆలయ పునర్నిర్మాణం చేశాడు. ఓంకారేశ్వర్: ఇది కూడా మధ్యప్రదేశ్లోనే ఉంది. నర్మదా నదిలో ఏర్పడిన దీవిలో ఓంకారేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రం వెలసింది. ఈ దీవిని అమలేశ్వరంగా, అమరేశ్వరంగా పిలుచుకుంటారు. ప్రస్తుతం ఖాండ్వా జిల్లా శివపురి పట్టణం పరిధిలో ఈ క్షేత్రం ఉంది. ఇక్ష్వాకు వంశానికి చెందిన మాంధాత తపస్సుకు మెచ్చి శివుడు ఇక్కడ జ్యోతిర్లింగ రూపంలో వెలసినట్లు పురాణాల్లో ఒక కథనం ఉంది. వింధ్య పర్వతం తపస్సుకు మెచ్చి శివుడు ఇక్కడ వెలసినట్లు మరో కథనం. ఆదిశంకరాచార్యులు ఈ క్షేత్రంలోనే ఒక గుహలో తపోధ్యానంలో ఉన్న తన గురువు గోవిందపాదులను కలుసుకున్నారు. బైద్యనాథ్: జార్ఖండ్లోని దేవగఢ్ జిల్లాలో వెలసిన క్షేత్రం ఇది. రావణాసురుడు ఇక్కడ జ్యోతిర్లింగాన్ని ప్రతిష్ఠించినట్లు పురాణాల కథనం. రావణుడు ఒకసారి గాయపడినప్పుడు సాక్షాత్తు శివుడే అతడికి వైద్యం చేసి స్వస్థత చేకూర్చాడని, అందుకే వైద్యనాథుడిగా ప్రసిద్ధి పొందాడని ప్రతీతి. కార్తీకమాసంలోను, మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా మాత్రమే కాదు, ఏటా శ్రావణమాసంలో జరిగే ‘శివమేళా’కు లక్షలాదిగా భక్తులు ఇక్కడకు చేరుకుంటారు. వైద్యనాథ క్షేత్రాన్ని దర్శించుకుంటే ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం దొరుకుతుందని భక్తుల విశ్వాసం. భీమశంకర్: మహారాష్ట్రలోని పుణే సమీపంలో సహ్యాద్రి పర్వత శ్రేణుల వద్ద భీమా నది ఒడ్డున వెలసిన జ్యోతిర్లింగ క్షేత్రం ఇది. త్రిపురాసుర సంహారం తర్వాత మహాశివుడు ఇక్కడ విశ్రాంతి తీసుకున్నట్లు పురాణాల కథనం. పురాతనమైన ఈ ఆలయాన్ని గురించిన ప్రస్తావన క్రీస్తుశకం పదమూడో శతాబ్దికి చెందిన సాహిత్యంలో కనిపిస్తుంది. నాథ సంప్రదాయానికి చెందిన యోగి, కవి జ్ఞానేశ్వర్ పదమూడో శతాబ్దిలో ఈ క్షేత్రాన్ని దర్శించుకున్నాడు. నాగర శైలిలో నిర్మితమైన ఈ ఆలయం ఏనాటిదో కచ్చితమైన ఆధారాల్లేవు. బాజీరావు పీష్వా సోదరుడు చిమాజీ పీష్వా పద్దెనిమిదో శతాబ్దిలో బహూకరించిన రోమన్ శైలి గంటలు ఈ ఆలయంలో ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తాయి. వీటిలోని భారీ గంటపై జీసస్, మేరీమాతల బొమ్మ ఉండటం విశేషం. రామేశ్వరం: తమిళనాడులోని రామేశ్వర జ్యోతిర్లింగాన్ని సాక్షాత్తు శ్రీరాముడు అర్చించినట్లు పురాణాలు చెబుతున్నాయి. కాశీలోని గంగాజలాన్ని తెచ్చి రామేశ్వరలింగాన్ని అభిషేకించి, ఆ తర్వాత రామేశ్వర తీరంలోని ఇసుకను తీసుకుపోయి కాశీలో కలపడం అనాది సంప్రదాయం. రామేశ్వర తీరం నుంచి రాముడు వానరుల సాయంతో సేతువును నిర్మించి లంకా యుద్ధానికి బయలుదేరాడట. రావణ సంహారం తర్వాత బ్రహ్మహత్యా పాతకాన్ని నిర్మూలించుకోవడానికి రాముడు ఇక్కడ లింగాన్ని ప్రతిష్ఠించినట్లు పురాణాల కథనం. పదో శతాబ్దికి చెందిన శ్రీలంక చక్రవర్తి పరాక్రమబాహు ఈ ఆలయాన్ని నిర్మించాడు. ఆ తర్వాత పన్నెండో శతాబ్ది నుంచి పలువురు రాజులు ఈ ఆలయ నిర్మాణాన్ని మరింత విస్తరించారు. నాగేశ్వర్: గుజరాత్లోని ద్వారక వద్ద దారుకావనంలో నాగేశ్వర జ్యోతిర్లింగం వెలసింది. పలు పురాణాలలో దారుకావన ప్రస్తావన కామ్యకవనంగా, ద్వైతవనంగా, దండకవనంగా కనిపిస్తుంది. దారుకావనాన్ని దారుకుడనే రాక్షసుడు పాలించేవాడు. అతడు ప్రజలను నానా హింసలు పెట్టేవాడు. అమాయకులను నిర్బంధించేవాడు. ఒకసారి సుప్రియుడనే శివభక్తుడిని ఖైదులో బంధించాడు. సుప్రియుడు ఖైదులోనే శివలింగాన్ని ప్రతిష్ఠించి, తోటి బందీలతో కలసి పంచాక్షరి గానాన్ని ప్రారంభించాడు. దారుకుడి భటులు అతడిని సంహరించేందుకు సిద్ధపడగా, శివుడే ప్రత్యక్షమై సుప్రియుడికి ఒక దివ్యాయుధాన్ని అనుగ్రహించాడు. ఆ ఆయుధంతో సుప్రియుడు రాక్షసులపై విజయం సాధించినట్లు పురాణాలు చెబుతున్నాయి. సుప్రియుడు ప్రతిష్ఠించిన శివలింగమే నాగేశ్వర జ్యోతిర్లింగంగా పూజలందుకుంటోంది. వారణాసి: ఉత్తరప్రదేశ్లోని కాశీగా ప్రసిద్ధి పొందిన వారణాసిలో గంగా తీరాన శివుడు విశ్వనాథుడిగా వెలిశాడు. ప్రపంచంలోనే అత్యంత పురాతన నగరాలలో ఒకటైన కాశీ నగర ప్రస్తావన చాలా పురాణాలలో కనిపిస్తుంది. విశ్వనాథ ఆలయంతో పాటు విశాలాక్షి, అన్నపూర్ణ ఆలయాలు అత్యంత ప్రాచీనమైనవి. కాశీ మోక్షక్షేత్రంగా ప్రసిద్ధి పొందింది. ఇక్కడ మరణిస్తే మోక్షం లభిస్తుందని భక్తుల విశ్వాసం. కాశీ నగరాన్ని సాక్షాత్తు పరమశివుడే స్థాపించాడని పురాణాల కథనం. క్రీస్తుశకం ఏడో శతాబ్దికి చెందిన హ్యుయాన్సాంగ్ కాశీ నగరాన్ని సందర్శించాడు. కాశీ నగరం కళలకు, సంప్రదాయాలకు కేంద్రంగా ఉందని అతడు తన యాత్రానుభవాల్లో రాసుకున్నాడు. నాసిక్: మహారాష్ట్రలోని నాసిక్ వద్ద వెలసిన జ్యోతిర్లింగ క్షేత్రం త్రయంబకేశ్వర క్షేత్రం. అగ్ని, సూర్య చంద్రుల తేజస్సు కలిగిన త్రినేత్రాలుగా శివుడు ఇక్కడ వెలసినందున త్రయంబకేశ్వరంగా ఈ క్షేత్రం ప్రసిద్ధి పొందింది. పవిత్ర గోదావరి నది పుట్టిన చోటు ఇదే. బ్రహ్మగిరి, నీలగిరి, కాలగిరి అనే మూడు కొండల నడుమ వెలసిన ఈ క్షేత్రంలో ప్రస్తుతం ఉన్న ఆలయాన్ని పద్దెనిమిదో శతాబ్దికి చెందిన మరాఠా రాజు బాలాజీ బాజీరావు పీష్వా నిర్మించాడు. కేదార్నాథ్: ఉత్తరాఖండ్లోని హిమాలయ పర్వతాల దిగువన మందాకినీ తీరంలో కేదారేశ్వర జ్యోతిర్లింగం వెలసింది. చలి తీవ్రత ఇక్కడ ఎక్కువగా ఉండటం వల్ల కేదారేశ్వర ఆలయాన్ని ఏటా వైశాఖమాసంలో వచ్చే అక్షయ తృతీయ పర్వదినం నుంచి కార్తీక పూర్ణిమ వరకు మాత్రమే తెరిచి ఉంచుతారు. సముద్ర మట్టానికి దాదాపు పదకొండువేల అడుగులకు పైగా ఎత్తున కేదారేశ్వర క్షేత్రాన్ని దర్శించుకోవడమంటే సాహస యాత్రకు తలపెట్టడమే. అత్యంత పురాతనమైన ఈ ఆలయం ఏనాటిదో ఎవరికీ తెలియదు. చాలా పురాణాలలో కేదారేశ్వర ప్రస్తావన కనిపిస్తుంది. ఈ ఆలయానికి సొంత పూజారి కూడా ఎవరూ లేరు. బదరీనాథ్ క్షేత్రానికి చెందిన పూజారులే ఇక్కడ పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ఘృష్ణేశ్వర్: మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాలో ఘృషేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రం ఉంది. ఇక్కడ వెలసిన ఘృష్ణేశ్వరుడినే ధుష్మేశ్వరుడని, కుసుమేశ్వరుడని కూడా అంటారు. ఎల్లోరా గుహలకు అతి చేరువలో ఉన్న ఘృష్ణేశ్వర ఆలయం క్రీస్తుశకం పదమూడు–పద్నాలుగు శతాబ్దాల కాలంలో జరిగిన ముస్లింల దండయాత్రల్లో బాగా దెబ్బతిన్నది. శివాజీ తాత మాలోజీ భోస్లే పదహారో శతాబ్దిలో ఆలయాన్ని పునర్నిర్మించినా, మళ్లీ జరిగిన దాడుల్లో నాశనమైంది. ఆ తర్వాత పద్దెనిమిదో శతాబ్దికి చెందిన ఇండోర్ రాణి అహల్యాబాయి ఆధ్వర్యంలో ఘృష్ణేశ్వర ఆలయ పునర్నిర్మాణం జరిగింది. ఇప్పటికీ ఇదే నిలిచి ఉంది. సౌర వైష్ణవ శాక్తేయాల్లోనూ శివారాధన సనాతన మార్గంలోని సౌర వైష్ణవ శాక్తేయ మతాలకు చెందిన వారు కూడా తమ తమ ప్రధాన దేవతలతో పాటుగా శివారాధన చేసేవారు. విగ్రహారాధనే ప్రధానంగా వివిధ స్మృతుల ఆధారంగా ఏర్పడిన స్మార్త సంప్రదాయంలో నిర్వహించే పంచాయతన పూజల్లో శివుడిని ఇతర దేవతలతో కలిపి ఆరాధించే పద్ధతి ఇప్పటికీ ఉంది. శివ కేశవులకు భేదం లేదని స్కంద పురాణం చెబుతోంది. ‘శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణుః విష్ణోశ్చ హృదయం శివః’ అని శ్రుతి. శివకేశవులు ఇద్దరూ కలసి ఉన్న పురాతన ఆలయాలు భారత్లోనే కాకుండా, ఇతర దేశాల్లోనూ ఉన్నాయి. సౌర మతం వాయవ్య, తూర్పు భారత ప్రాంతాల్లో వ్యాప్తిలో ఉండేది. శైవానికీ, సౌరానికీ కూడా సాన్నిహిత్యం ఉండేది. శైవ గ్రంథమైన ‘శ్రీకంఠీయ సంహిత’లో సౌర మతానికి చెందిన ఎనభై ఐదు గ్రంథాల ప్రస్తావన ఉంది. అయితే, ఆ గ్రంథాలేవీ ఇప్పుడు అందుబాటులో లేవు. ముస్లింల దండయాత్రలో అవన్నీ నాశనమై ఉంటాయని చరిత్రకారులు భావిస్తున్నారు. అలాగే సౌరానికి చెందిన ‘సౌర సంహిత’లో శైవ గ్రంథమైన ‘వాథూల కాలోత్తర’ ప్రస్తావన ఉంది. ఆంధ్రప్రదేశ్లో అరుదైన శివలింగాలు ఆంధ్రప్రదేశ్లో అత్యంత అరుదైన రెండు శివలింగాలు ఉన్నాయి. వాటిలో ఒకటి అత్యంత ప్రాచీనమైన శివలింగమైతే, మరొకటి పరిమాణంలో అత్యంత పెద్ద స్వయంభూ శివలింగం. అత్యంత ప్రాచీన స్వయంభూ శివలింగం చిత్తూరు జిల్లా గుడిమళ్లం గ్రామంలో కనిపిస్తుంది. ఇది క్రీస్తుపూర్వం మూడో శతాబ్ది నుంచి క్రీస్తుపూర్వం ఒకటో శతాబ్ది మధ్య కాలానికి చెందినది కావచ్చని పురాతత్వ శాస్త్రవేత్తల అంచనా. ఇక అత్యంత పెద్దదైన స్వయంభూ శివలింగం శ్రీకాకుళం జిల్లా రావివలస గ్రామంలో ఉంది. దీని ఎత్తు ఏకంగా యాభై ఐదు అడుగులు. వానర వైద్యుడు సుషేణుడు ఇక్కడ తపస్సు చేసి శివసాయుజ్యం పొందాడని, హనుమంతుడు అతడి కళేబరాన్ని ఖననం చేసిన చోట స్వయంభూ శివలింగం వెలసిందని పురాణాల కథనం. -
ఆది దంపతుల కల్యాణోత్సవం
ద్వాదశజ్యోతిర్లింగ క్షేత్రంగా... అష్టాదశ శక్తి పీఠంగా ప్రశస్తి పొందిన శ్రీశైలమహాక్షేత్రం భూమండలానికి నాభి స్థానం అని, ముక్కోటి దేవతలు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో లింగోద్భవ కాల మహన్యాసపూర్వక రుద్రాభిషేకాన్ని తిలకించి బ్రహ్మోత్సవ కల్యాణాన్ని వీక్షించడానికి శ్రీశైలానికి చేరుకుంటారని పురాణ వచనం. భౌతిక ఇంద్రియాలతో మనం చూడలేని దివ్యత్వం శ్రీశైలంలో అణువణువునా వ్యాపించి ఉందని పురాణ వాఙ్మయం చెబుతోంది. యోగపరంగా అంతఃక్షేత్ర సమన్వయాన్ని చెప్పేటప్పుడు సహస్రార స్థానంగా శ్రీశైలాన్ని చెప్తారు. అంత గొప్పదైన శ్రీశైల శిఖరాన్ని దర్శిస్తే పునర్జన్మ ఉండదని పద్మపురాణం చెబుతోంది. ఇలాంటి సిద్ధక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఈ నెల 25 నుంచి ప్రారంభమై, మార్చి 7 వరకు విశేషవాహన సేవలతో అశేషజనవాహిని మధ్య ఉత్సవ మూర్తుల గ్రామోత్సవం భక్తులను ఆధ్యాత్మిక పరవశులను చేయనుంది. శ్రీశైలమహాక్షేత్రానికి ఉన్న మరొక ప్రాముఖ్యత ఏంటంటే ప్రతి ఏటా రెండుసార్లు బ్రహ్మోత్సవాలు శ్రీగిరిలో మాత్రమే జరుగుతాయి. మకర సంక్రమణ పుణ్యకాలాన్ని పురస్కరించుకుని సంక్రాంతి బ్రహ్మోత్సవాలు మాఘమాసంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నవాహ్నిక దీక్షతో 11 రోజుల పాటూ నిర్వహించడం సాంప్రదాయం. చండీశ్వరుని ఆ«ధ్వర్యంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. 1960లలో రోడ్డు రవాణా వ్యవస్థ లేనప్పుడు కాలినడకన భక్తులు వివిధమార్గాల ద్వారా శ్రీశైలం చేరుకుని మహాశివరాత్రి ఉత్సవాలలో పాల్గొనేవారు అప్పట్లో పంచాహ్నిక దీక్ష అంటే 5 రోజుల పాటు జరిగేవి. 1990 వ దశకంలో శివరాత్రి ఉత్సవాలు బ్రహ్మోత్సవాలుగా నిర్వహించాలనే నిర్ణయం తీసుకుని నవాహ్నిక దీక్షతో(9రోజులు) 11 రోజుల పాటూ నిర్వహించడం ఆనవాయితీ అయ్యింది. లింగోద్భవ కాల మహారుద్రాభిషేకం ముల్లోకాలు, సకల చరాచర జగత్తు మహాశివరాత్రి పర్వదినం నాడు జరిగే లింగోద్భవ కాలం కోసం ఎదురు చూస్తూ ఉంటుందని అంటారు. మహాశివరాత్రి రోజు రాత్రి 10 గంటల తరువాత శ్రీమల్లికార్జునస్వామికి లింగోద్భావ మహారుద్రాభిషేకం జరుగుతుంది. 11 మంది నిష్ణాతులైన వేదపండితులు, అర్చకులు ఏకకాలంలో మహన్యాసపూర్వకంగా రుద్రమంత్రాలను పఠిస్తుండగా దాదాపు 5 గంటలకు పైగా స్వామివారికి పవిత్రజలాలు, పంచామృతాలు, ఫలోదకాలు, సుగంధద్రవ్యాలతో ఈ రుద్రాభిషేకం జరుగుతుంది పాగాలంకరణతో వరుడయ్యే... శ్రీశైలేశుడు వివాహాలలో పెళ్లికుమారునికి తలపాగా చుట్టడం ఒక సాంప్రదాయం. ఈ ఆచారమే శ్రీశైలాలయంలో పాగాలంకరణ పేరుతో మహాశివరాత్రిన వరుడయ్యే శ్రీ మల్లికార్జునస్వామికి పాగాలంకరణ ఉత్సవమైంది. స్వామివారికి గర్భాలయ విమాన శిఖరం నుంచి ముఖ్యమండపంపై ఉండే నందులను అనుసంధానం చేస్తూ పాగాను అలంకరింప జేస్తారు. పాగాలను సమర్పించే భక్తులు అత్యంత నియమ నిష్ఠలతో రోజుకొక్క మూర చొప్పున 365 మూరల పొడవుతో ఈ పాగాను నేస్తారు. ఆగమం ఆచారం ప్రకారం పాగాను అలంకరించే వ్యక్తి దిగంబరుడై పాగాను అలంకరింపజేస్తారు. ఆ సమయంలో ఆలయ ప్రాంగణంలో విద్యుత్ సరఫరాను నిలిపివేస్తారు. చిమ్మచీకట్లో పాగాను అలంకరించడం అత్యంత నేర్పుతో కూడుకున్న పని. బ్రహ్మోత్సవ కల్యాణం మహాశివరాత్రి నాడు పాగాలకరణ పూర్తి అయిన వెంటనే శ్రీస్వామి, అమ్మవార్లకు బ్రహ్మోత్సవ కల్యాణాన్ని అత్యంత శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. వేదమంత్రోచ్చరణ మధ్య, మంగళవాయిద్యాల నడుమ బాసిక ధారణ, మాంగళధారణ, తలంబ్రాలు, తదితర కార్యక్రమాలతో కల్యాణోత్సవం కమనీయంగా సాగుతుంది. మల్లన్న రథోత్సవ వేడుక మహాశివరాత్రి పర్వదినం నాడు వధూవరులైన శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామివార్లను మరుసటి రోజు సాయంత్రం రథంపై అధిష్టింపజేసి ప్రధాన పురవీధిలో అశేష జనవాహిని మధ్య కనులపండువగా రథోత్సవ వేడుక జరుగుతుంది. దీనికి ముందురోజు ప్రభోత్సవం కూడా ఉంటుంది. ఉత్సవ నిర్వాహకుడైన చండీశ్వరుడు ప్రభోత్సవంలో తిరిగి రథవీధిని పరిశీలించడానికే ప్రభోత్సవం జరుగుతుందని అంటారు. సదస్యం –నాగవల్లి బ్రహ్మోత్సవాలలో 9 వ రోజు సాయంత్రం సదస్యంలో నూతన వధూవరులైన భ్రమరాంబా మల్లికార్జునస్వామివార్లను వేదమంత్రాలతో స్తుతిస్తారు. ఆ తరువాత జరిగే నాగవల్లిలో అమ్మవారికి మట్టెలు అలంకరిస్తారు. త్రిశూల స్నానం ఉత్సవం (ఉత్+సవం) అంటే గొప్పయజ్ఞం. యజ్ఞనిర్వహణ సందర్భంగా చివరగా యజ్ఞం పరిపూర్తి అయినందుకు సూచనగా యజమాని అవభృధ స్నానం చేసి, బ్రహ్మోత్సవాలకు 10వ రోజున పూర్ణాహుతి నిర్వహిస్తారు. ఆ తరువాత వసంతోత్సవం, కలశోద్వాసన చేసి, త్రిశూల స్నానం జరిపిస్తారు. ఈ కార్యక్రమంలో త్రిశూలానికి, చండీశ్వరునికి మల్లికాగుండంలో స్నపనం (పుణ్యస్నానం) చేయిస్తారు. ధ్వజావరోహణ బ్రహ్మోత్సవాల ముగింపు సందర్భంగా ఉత్సవాల ఆరంభం రోజున ధ్వజస్తంభం మీద ఆరోహణ చేసిన నంది పతాకాన్ని అవరోహణ చేస్తారు. ఈ అవరోహణతో బ్రహ్మోత్సవాలకు విచ్చేసిన సకల దేవతలకు వీడ్కోలు పలికినట్లు గుర్తు. సకలదేవతాహ్వానపూర్వక ధ్వజారోహణ బ్రహ్మోత్సవాలలో మొదటి రోజు సాయంత్రం జరిగే ధ్వజారోహణకు ఎంతో ప్రాముఖ్యం ఉంది. ఆలయప్రాంగణంలోని ప్రధాన ధ్వజస్తంభం మీద పతాకావిష్కరణచేయడమే ధ్వజారోహణ. ఒక కొత్తవస్త్రం మీద శివుని వాహనం అయిన నందీశ్వరుని అష్టమంగళ చిత్రాన్ని చిత్రీకరిస్తారు. దీన్నే నంది ధ్వజపటం అంటారు. చండీశ్వరుని సమక్షంలో భేరీ (డోలు వాయి«ధ్యం) çపూజ, నాదస్వరంపై ఆయా రాగాలాపనలతో సమస్త దేవతలను ఆహ్వానిస్తూ ధ్వజపటాన్ని ధ్వజస్తంభం పై ఎగురవేస్తారు. ధ్వజస్థంపై ఎగిరే ఈ నందిపతాకమే సకల దేవతలు, యక్ష, గంధర్వ గణాలకు, ముక్కోటి దేవతలకు ఆహ్వానసూచిక. బ్రహ్మోత్సవాలకు వచ్చే దేవతల కోసం ఆయా ప్రదేశాలలో బలిహరణ పేరుతో నివేదన సమర్పిస్తారు. వాహన దర్శన ఫలం శ్రీభ్రమరాంబా మల్లికార్జునస్వామివార్లు భక్తులందరికి దర్శనం ఇవ్వడానికి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో రోజుకో వాహనంపై గ్రామోత్సవంలో దర్శనం ఇస్తారు. ఆయా వాహనాలపై స్వామి, అమ్మవార్లను దర్శించుకోవడం వలన ఎన్నో విశేషఫలితాలు లభిస్తాయని ఆగమాలు చెప్తున్నాయి. ఇందులో భాగంగా: భృంగివాహనసేవ: చేసే పనులలో ఏకాగ్రత. పాప హరణం. హంసవాహనసేవ: మానసిక ప్రశాంతత. విద్యాప్రాప్తి. మయూరవాహన సేవ: శత్రుబాధలు తొలగుతాయి, సంపదలు కలుగుతాయి. రావణవాహనసేవ: భక్తిభావాలు పెంపొందుతాయి. శివకటాక్షం లభిస్తుంది. పుష్పపల్లకీసేవ: కోరికలు నెరవేరుతాయి. ఆరోగ్యం చేకూరుతుంది. గజ వాహనసేవ: కష్టాలు తీరిపోతాయి. ఐశ్వర్యం లభిస్తుంది. నందివాహనసేవ: చేపట్టిన పనులలో విజయం. భోగభాగ్యాలు కలుగుతాయి. రథోత్సవం: అరిష్ట నివారణ, ఐశ్వర్య ప్రాప్తి. తెప్పోత్సవం: లోకక్షేమం, సకాలవర్షాలు కురుస్తాయి. పంటలు బాగా పండుతాయి. అశ్వవాహనసేవ: సమస్యలు తీరిపోతాయి, సంతానం కలుగుతుంది. పుష్పోత్సవం శయనోత్సవం బ్రహ్మోత్సవాలు ముగిశాక చివరి రోజు రాత్రి 11 వ రోజున శ్రీస్వామి, అమ్మవార్లకు పుష్పోత్సవం, ఏకాంత సేవ, శయనోత్సవ వేడుకలు నిర్వహిస్తారు. 18 రకాల పుష్పాలతో స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను అర్చించి ఏకాంత సేవ జరిపిస్తారు. తరువాత స్వామి, అమ్మవార్లను శయనింపజేయడంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. – నేలవల్లి నాగ మల్లేశ్వరరావు, సాక్షి, శ్రీశైలం -
పుణ్యస్నానాలకు వెళ్లి బాలుడి మృతి
నేరడిగొండ(ఆదిలాబాద్): శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని పుణ్య స్నానాలకు వెళ్లిన ఓ బాలుడు ప్రమాదవశాత్తు మృతి చెందాడు. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం దన్యానాయక్ తండాలో చోటుచేసుకుంది. తండాకు చెందిన జాదవ్ మహేశ్(10) పుణ్యస్నానం కోసం స్నేహితులతో కుంటల జలపాతానికి వెళ్లాడు. ఆ బాలుడు ప్రమాదవ శాత్తు జలపాతంలో పడి మృతి చెందాడు. -
మహాశివరాత్రికి కీసర గుట్టలో ప్రత్యేక ఏర్పాట్లు
రంగారెడ్డి(కీసర): కీసర గుట్టలో శివరాత్రి ఉత్సవాలు కనుల పండువగా కొనసాగుతున్నాయి. బ్రహోత్సవాల్లో భాగంగా సోమవారం దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మహా శివరాత్రి రోజూ (మంగళవారం) స్వామివారిని ద ర్శించుకునేందుకు నగరం నలుమూలల నుండి యాత్రికులుపెద్ద ఎత్తున కీసరగుట్టకు రానున్నారు. ఇందుకోసం ఆలయ నిర్వాహకులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. రంగురంగుల విద్యుత్దీపాలతో కీసరగుట్టప్రాంగణాన్ని అందంగా అలంకరించారు. ఈ ఉత్సవాలకు హాజరయ్యే యాత్రికలు సౌకర్యార్థం ఆర్టిసీ 320 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. హైదరాబాద్ నగరంలోని యాప్రాల్, సికింద్రాబాద్, ఉప్పల్, ఈసిఐఎల్ ,అమ్ముగూడ, హాకింపేట్,శామీర్పేట, తుర్కపల్లి, ఘట్కేసర్, తదితర ప్రాంతాల నుండి పత్రి 15 నిమిషాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతారు. అవసరమైతే 7382819339,9959226145 ఫోన్ నంబర్లుకు ఫోన్ చేస్తే ప్రత్యేక బస్సులను కూడా ఏర్పాటు చేశారు. మహాశివరాత్రి సందర్బంగా మంగళవారం దేవాలయంలో ఉదయం 4 గం, మహాన్యాసపూర్వకరుద్రాభిషేకం, ఉదయం 6 గం. లనుండి సాముహిక అభిషేకాలు, 9 గం. రుద్రస్వాహాకార హోమం, రాత్రి 8 గంలకు నందివాహన సేవ, రాత్రి 10 గ. భజనలు, రాత్రి 12 గం, రామలింగేశ్వర స్వామివారికి సంతత ధారాభిషేకం నిర్వహిస్తారు.


