breaking news
Lung disease
-
ఐరన్ లంగ్ జీవితం ముగిసింది!
ఒక్లహోమా సిటీ: అమెరికాలో పోలియో మహమ్మారి చిట్టచివరి బాధితురాలు మార్థా అన్ లిలార్డ్ (78) ప్రశాంతంగా కళ్లు మూసింది. ఐదేళ్ల వయసులోనే వ్యాధికి గురై ఇరవై ఏళ్ల మించి బతకదని వైద్యులు పెదవి విరిచేసినా... లిలార్డ్ ఉక్కు ఊపిరితిత్తుల తో జీవితం మొత్తాన్ని గడిపేసిన వ్యక్తిగా మిగిలిపోయింది. పోలియో కారణంగా ఊపిరితిత్తుల కండరాలు పని చేయకపోవడంతో చిన్నప్పటి నుంచి భారీ యంత్రం (ఐరన్ లంగ్) సాయంతోనే ఊపిరి తీసుకునేది. కుడి చేయి పక్షవాతం బారిన పడినా, ఎడమ చేయిని నడుము వద్ద కొద్దిగా మాత్రమే కదిలించగలిగిన లిలార్డ్లో ఉత్సాహానికి మాత్రం కొదవ ఉండేది కాదని, సొంతంగా వంట చేసుకోవడమే కాకుండా... నెట్ బ్రౌజింగ్ చేసేదని, కవితలు రాయడమే కాకుండా.. తన మరణం తాలూకూ వార్తను కూడా ముందుగానే రాసి వెబ్సైట్లో పోస్ట్ చేసిందని చెల్లి సిండీ మెక్ వీ తెలిపారు. రెండు సార్లు కోవిడ్–19 బారిన పడటంతో ఊపిరితిత్తుల సామర్థ్యం బాగా తగ్గిపోయి ఐదేళ్లుగా ఇంటికే పరిమితమైంది. రెండేళ్లుగా రోజు మొత్తం ఐరన్ లంగ్లోనే గడిపిన లిలార్డ్ ఆఖరకు అమెరికాలోని ఓక్లహోమా సిటీలో జూన్ 26న తుదిశ్వాస విడిచారు. దీంతో ఐరన్ లంగ్తో జీవించిన చిట్టచివరి వ్యక్తిగా లిలార్డ్ మిగిలిపోయారు. రెండేళ్ల క్రితమే పాల్ అలెగ్జాండర్ అనే మరో పోలియో పీడితుడు కూడా మరణించడంతో చిట్టచివరి బాధితురాలిగా లిలార్డ్ మిగిలిపోయారు.‘‘లిల్లార్డ్ 20 ఏళ్ల వయసు దాటదని డాక్టర్లు చెప్పారు. కానీ... బతకాలన్న తపన, ఆమె జీవితాన్ని పొడిగించడం మాత్రమే కాదు.. ఆస్వాదించేలా చేసింది.’’అని లిలార్డ్ చెల్లి సిండీ మెక్వీ తెలిపారు. ఐరన్ లంగ్ అనేది ఓ భారీ పరికరం. సిలిండర్ ఆకారంలో ఉంటుంది. మనిషి దాంట్లో పడుకుని ఉంటే తల మాత్రం బయటకు వచ్చి ఉంటుంది. ఇలాంటి ఏర్పాటుతోనే లిలార్డ్ తన జీవితం మొత్తం గడిపింది. చిన్నప్పుడు రెండు గంటలపాటు పాఠశాలకు వెళ్లేదని, మిగిలిన సమయంలో ట్యూటర్లు ఇంటికొచ్చి పాఠాలు చెప్పేవారని సోదరి వివరించారు. ఫోన్ల ద్వారానే షానీ హైస్కూల్లో విద్యాభ్యాసం చేసినట్లు తెలిపారు. విహారయాత్రలకు వెళ్లాలంటే ప్రత్యేకమైన వాహనం వాడేవారని ఐరన్ లంగ్ యంత్రం పట్టేంత తలుపులు ఉన్నాయా? లేదా? అని విచారించుకున్న తరువాతే తండ్రి బయటకు తీసుకెళ్లే వారని వివరించింది. లిలార్డ్ కొంతకా>లం డ్రైవింగ్ కూడా చేయడం ఆమెలోని పట్టుదలకు ప్రతీకలుగా చెప్పవచ్చు.ఇంటర్నెట్ ప్రపంచంలో...లిలార్డ్కు ఆరోగ్య సమస్యలు ఎన్ని ఉన్నా... జీవితంలో కుతూహలాన్ని మాత్రం కోల్పోలేదు. అందుకే పోలియో గురించి మాత్రమే కాకుండా.. ప్రపంచ సంగతులను కూడా ఆమె ఇంటరెŠన్ట్ ద్వారా తెలుసుకునే వారు. 2001 సెప్టెంబర్ 11 ఉగ్రదాడుల తర్వాత లిలార్డ్ కాబోయే భర్త బహాసల్హ్ కూడా ఇంటర్నెట్ చాట్రూమ్లోనే పరిచయమయ్యారు. ఇరవై ఏళ్లకు పైగా ఆన్లైన్లో నడిచిన ప్రేమ ఈ సంవత్సరం ఫిబ్రవరిలో పెళ్లితో సంపూర్ణమైంది. ఈజిప్టుకు చెందిన బహాసల్హ్ అమెరికా వీసా కోసం చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో వీరిద్దరి ప్రేమ ఆన్లైన్కే పరిమితమైంది. ఆమె కవితలు రాసింది, పాటలు రాసింది. తన చావు వార్తను కూడా కూడా ముందుగానే రాసి, ఫ్యూనరల్ హోమ్ వెబ్సైట్లో పోస్ట్ చేసింది. పోలియో వ్యాధి ఒక్క అమెరికాను మాత్రమే కాదు... ప్రపంచాన్ని వణికించిన మహా వ్యాధి ఏటా లక్షల మంది పిల్లల్ని పక్షవాతం బారిన పడేసేది. 1955లో టీకా అందుబాటులోకి రావడంతో ఇది క్రమేపీ తగ్గుముఖం పట్టింది. పోలియోతో కొందరి కాళ్లు చచ్చుబడితే మరికొందరికి ఇతర శరీర భాగాలు పని చేయకుండా పోతాయన్నది తెలిసిన విషయమే. -
బడికి పోలేని చిన్నారి కోసం ‘అవతార్’.. వహ్ అద్భుతం
ఇప్పుడు చెప్పుకోబోయేది అవతార్ సినిమా గురించి కాదు. అంతకు మించిన అద్భుతం గురించే!. కళ్ల ఎదురుగా మనిషి లేకున్నా.. ఉన్నట్లుగా భావించడం, పక్కనే ఉన్నట్లు ఫీలవ్వడం, మాట్లాడడం, చర్చించడం.. ఇవన్నీ కుదిరే పనేనా?. టెక్నాలజీ ఎరాలో అందునా అవతార్ లాంటి రోబోలతో అది సాధ్యమవుతోంది. బెర్లిన్(జర్మనీ) మార్జహ్న్-హెలెర్స్డోర్ఫ్లో జోషువా మార్టినన్గెలి అనే చిన్నారి ఉన్నాడు. అతనికి ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధి ఉంది. ఈ కారణంగా అతని మెడ నుంచి ఓ పైప్ సాయంతో చికిత్స అందిస్తున్నారు పేరెంట్స్. అలాంటప్పుడు స్కూల్కి వెళ్లడం వీలుపడదు కదా!. అందుకే జోషువా బదులు.. ఒక అవతార్ రోబోని అతని సీట్లో కూర్చోబెట్టారు. ఏడేళ్ల Joshua Martinangeli బదులు ఈ అవతార్ రోబో పాఠాలు వింటుంది. తోటి విద్యార్థులతో మాట్లాడుతుంది. సరదాగా బదులు ఇస్తుంది. టీచర్ చెప్పే పాఠాలు వింటుంది. అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వడంతో పాటు అనుమానాలను నివృత్తి చేసుకుంటుంది కూడా. ఇదేలా సాధ్యం అంటే.. ఇంట్లో స్పెషల్ మానిటర్ ముందు కూర్చుని జోషిని.. అవతార్ రోబోకి ఉన్న మానిటర్కు కనెక్ట్ చేస్తారు కాబట్టి. అంతే అవతల ఇంట్లో జోషువా ఏం చేప్తే.. అవతార్ అదే బదులు ఇస్తుంది. దీంతో అచ్చం జోషువా పక్కనే ఉన్నట్లు ఫీలైపోతున్నారు కొందరు స్టూడెంట్స్. జోషువా కుటుంబ ఆర్థిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని.. డిస్ట్రిక్ట్ కౌన్సిల్ వాళ్లు ఈ ఆవిష్కరణను ఆ కుటుంబానికి ఉచితంగా అందించారు. కరోనా టైంలో మొత్తం నాలుగు అవతార్ రోబోలను తయారు చేయగా.. ఇప్పుడు స్కూల్కి వెళ్లలేని ఆ చిన్నారి కోసం ఒక రోబోను వాడడం రాజకీయంగా కూడా చర్చనీయాంశంగా మారింది. -
బౌలింగ్ చేసిన ప్రతీసారి రక్తపు వాంతులు
సిడ్నీ: ఆస్ట్రేలియా ఆల్రౌండర్ జాన్ హేస్టింగ్స్ అంతుచిక్కని జబ్బుతో బాధపడుతున్నాడు. ఊపిరితిత్తుల్లో సమస్య వల్ల బౌలింగ్ చేసిన ప్రతిసారీ రక్తపు వాంతులు అవుతుండడంతో భవిష్యత్తుపై అతడు ఆందోళన చెందుతున్నాడు. ‘ఇప్పుడు బౌలింగ్ చేసిన ప్రతిసారీ రక్తం వాంతి చేసుకుంటున్నా. కేవలం బౌలింగ్ చేస్తేనే.. పరిగెత్తితే కాదు. నేను బాక్సింగ్, రోయింగ్ చేయగలను. బరువులూ ఎత్తగలను. కానీ కేవలం బౌలింగ్ చేసినప్పుడే అలా జరుగుతోంది. మ్యాచ్ సందర్భంగా బౌలింగ్ చేసినపుడు ఊపిరితిత్తుల నుంచి రక్తం ఎగజిమ్మి.. దగ్గినపుడు అది నోటి ద్వారా బయటకు వస్తోంది. దీని వల్ల దీర్ఘకాలంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకపోవచ్చు అని వైద్యులు కచ్చితంగా చెప్పట్లేదు. ఇకపై నేను బౌలింగ్ చేస్తానో లేదో’అని హేస్టింగ్స్ అన్నాడు. ఆస్ట్రేలియా తరపున ఓ టెస్టు, 9 టీ20లు, 29 వన్డేలు ఆడిన 32 ఏళ్ల హేస్టింగ్స్ గత కొన్నేళ్లుగా ఈ సమస్యతో బాధపడుతున్నాడు. దాంతో అతని కెరీర్ ప్రమాదంలో పడింది. -
టూత్పేస్ట్తో ఊపిరితిత్తుల వ్యాధులు దూరం!
మిచిగాన్ : మనిషి ప్రతినిత్యం ఉపయోగించే వాటిలో టూత్పేస్ట్ది ఓ ప్రత్యేక స్థానం. నిజం చెప్పాలంటే టూత్పేస్ట్తో పళ్లు తోముకున్న తర్వాతే రోజు మొదలవుతుంది అందరికీ. ఇది కేవలం పళ్లని శుభ్రం చేయడానికే కాదు.. ప్రాణాంతక జబ్బులను తరిమికొట్టడానికి ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. టూత్పేస్ట్లో ఊపిరితిత్తుల సంబంధమైన రోగాలతో పోరాడే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలున్నాయని మిచిగాన్ స్టేట్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. టూత్పేస్ట్లో ఉండే ట్రైక్లోసన్ బ్యాక్టీరియాను చంపుతుందని, దాన్ని టుబ్రామిసిన్ అనే యాంటీ బ్యాక్టీరియా జౌషదంతో కలిపినపుడు అది రోగ సంబంధ క్రిములను 99 శాతం చంపగలిగిందని వారు తెలిపారు. ముఖ్యంగా వంశపారపర్యంగా వచ్చే సిస్టిక్ ఫైబ్రోసిస్(ఊపిరితిత్తుల సంబంధమైన వ్యాధి)ను నివారించగల్గిందని పేర్కొన్నారు. అయితే టుబ్రామిసిన్ ఉపయోగించటం వల్ల దుష్ప్రభావాలు ఉండటంతో దీని వాడకాన్ని తగ్గించడం జరిగిందన్నారు. పూర్తిగా కాకుండా కొద్ది మొత్తంలో వాడటం ద్వారా వ్యాధి నివారణకు తోడ్పడుతుందన్నారు. దీనిపై మరిన్ని పరిశోధనలు జరిగి పూర్తి స్థాయిలో నివారణ కనుక్కునే దిశగా అడుగులు వేస్తున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. సిస్టిక్ ఫైబ్రోసిస్ అంటే..? ప్రాణాంతకమైన వ్యాధులలో ఇది ఒకటి. వంశపారపర్యంగా వచ్చే ఈ ఊపిరితిత్తుల వ్యాధి ప్రతి 3000 మందిలో కనిపిస్తుంటుంది. సిస్టిక్ ఫైబ్రోసిస్ కారణంగా ఊపిరితిత్తులలో శ్లేష్మం పేరుకుపోతుంది. ఈ వ్యాధికి కారణమైన బ్యాక్టీరియాను చంపడం చాలా కష్టం. సూడోమోనాస్ ఎరుగినోస అనబడే ఈ బ్యాక్టీరియా బయోఫిల్మ్ రక్షణలో ఉండి మామూలు మందులతో నియంత్రణ కష్టంగా మారుతుంది. -
స్మోక్ చేయకున్నా మహిళలకే అధిక ముప్పు!
వాషింగ్టన్: సాధారణంగా పొగతాగేవారు(స్మోకర్స్) ఊపిరితిత్తుల కేన్సర్ భారిన పడతారని వింటూనే ఉంటాం. తాజాగా స్మోకింగ్ సంబంధిత అంశాలపై జరిపిన ఓ సర్వేలో ఆశ్చర్యకర విషయాలు వెల్లడయ్యాయి. ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ క్రానిక్ డిసీజెస్ పై యూనివర్సిటీ ఆఫ్ టొరంటో చేపట్టిన సర్వేలో మహిళలకే అధికంగా ముప్పు పొంచి ఉంటుందని వెల్లడైంది. స్మోకింగ్ చేయని 50-60 ఏళ్లు పైబడిన మహిళలు, పురుషుల 129535 శాంపిల్స్ పై రీసెర్చ్ చేశారు. ఇందులో 8674 ఆఫ్రికన్ మహిళలు, 2708 ఆఫ్రికన్ పురుషుల శాంపిల్స్, 80 వేల మంది అమెరికా మహిళలు, 37 వేల మంది పరుషుల శాంపిల్స్ పై టొరంటో వర్సిటీకి చెందిన రేచల్ చిషోల్మ్ అనే వ్యక్తి పరిశోధన చేశాడు. స్మోకింగ్ చేయని ఆఫ్రికన్, అమెరికన్ మహిళల్లో 5.2 శాతం మందికి క్రానిక్ అబ్ స్ట్రక్టివ్ పల్మనరీ డిసీస్(సీఓపీడీ) వస్తుండగా, స్మోక్ చేయని మగవారిలో మాత్రం 2.9 శాతం మందికి ఈ వ్యాధి వస్తుందని రీసెర్చ్ లో తేలింది. ఇంకా చెప్పాలంటే స్మోకింగ్ చేయని పురుషులు తమ పక్కన ఉన్న స్మోకర్స్ వల్ల సెకండ్ హ్యాండ్ స్మోకర్లుగా ఉన్నా.. వారిలో మాత్రం ఊపిరితిత్తుల వ్యాధులు వచ్చే అవకాశం మహిళల కంటే చాలా తక్కువగా ఉందని రీసెర్చర్ చిషోల్మర్ వివరించారు. -
జస్టిస్ వెంకట్రామిరెడ్డి కన్నుమూత
సాక్షి, హైదరాబాద్: హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అడపా వెంకట్రామిరెడ్డి (84) కన్నుమూశారు. ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతూ కిమ్స్ లో చికిత్స పొందుతున్న ఆయన బుధవారం తుదిశ్వాస విడిచారు. ఎర్రగడ్డలోని హిందూ శ్మశాన వాటికలో గురువారం ఉదయం 10 గంటలకు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ఆయన కుమారుడు భాస్కర్రెడ్డి తెలిపారు. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం, మెల్లంపూడిలో ఆయన జన్మించారు. 1987 నుంచి 1993 వరకు హైకోర్టు న్యాయమూర్తిగా, ఆ తర్వాత రాష్ట్ర వినియోగదారుల ఫోరం అధ్యక్షుడిగా పనిచేశారు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.


