-
‘మెడ్టెక్’లో భూముల పందేరం
సాక్షి, అమరావతి: విశాఖపట్నంలో వైద్య పరికరాల తయారీ పేరిట ఏర్పాటు చేసిన ‘మెడ్టెక్ జోన్’ అక్రమాలకు ఆలవాలమైంది. దీనికోసం విశాఖ స్టీల్ప్లాంట్ను ఆనుకుని కేటాయించిన అత్యంత విలువైన 270 ఎకరాల ప్రభుత్వ భూమిని పందేరం చేసే కార్యక్రమం విచ్చలవిడిగా జరుగుతోంది. ఆసియాలోనే అతిపెద్ద మెడికల్ డివైజెస్ టెక్నాలజీ పార్క్(ఏఎంటీజెడ్–మెడ్టెక్ జోన్) పేరుతో జరుగుతున్న ఈ భూపందేరానికి అడ్డూఅదుపూ లేకుండా పోతోంది. ఎవరికి పడితే వారికి పప్పులు, బెల్లానికి ఈ భూమిని కట్టబెడుతున్నారు. దాదాపు రూ.1,350 కోట్ల విలువ చేసే ఈ భూమిపై కన్నేసిన ప్రభుత్వ పెద్దలు.. ఫ్యాక్టరీలు పెడుతున్నారన్న పేరిట తమకు కావాల్సిన వారికి అతి తక్కువ ధరకు లీజుకు అప్పగిస్తున్నారు. ఊరూపేరు లేని కంపెనీలకు, కనీసం టర్నోవర్ కూడా చూపించని వాటికి కట్టబెడుతున్నారు. తద్వారా భారీగా ముడుపులు దండుకుంటున్నారు. అతి తక్కువ ధరకు లీజుకు... విశాఖపట్నం ఉక్కు కర్మాగారం అంటే ఆసియాలోనే పెద్ద పేరున్న పరిశ్రమ. దానికి పక్కనే 270 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇక్కడ ఎకరం కనిష్టంగా రూ.5 కోట్లు విలువ ఉంది. తద్వారా మొత్తం భూమి రూ.1,350 కోట్ల విలువ చేస్తుంది. అలాంటి ఈ భూమిని ప్రభుత్వ పెద్దలు ఫ్యాక్టరీలు పెడుతున్నారన్న పేరుతో తమకు కావాల్సిన వారికి ఎకరం రూ.పాతిక లక్షలకంటే తక్కువకే 33 ఏళ్ల లీజుకు ఇచ్చేస్తున్నారు. ఇప్పటివరకు అక్కడ పరిశ్రమలు పెడతామని వచ్చిన కంపెనీలకు ఊరూపేరూ లేదు. ఎక్కడా టర్నోవర్ చూపించట్లేదు. అలాంటివాటితో సంప్రదింపులు జరిపి ఎంఓయూలు చేసుకోవడం, భూములు ఇచ్చేయడం ద్వారా భారీ ఎత్తున కమీషన్లు కొట్టేస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు ఐఏఎస్ అధికారుల్ని సీఈవోలుగా నియమిస్తే అన్యాయాల్ని ప్రశ్నిస్తారన్న ఉద్దేశంతో ఓ ముఖ్యనేత ఒక కన్సల్టెంట్ను సీఈఓగా నియమించి భారీస్థాయిలో దందా నడిపిస్తున్నారు. ఇది ఐఏఎస్ అధికారుల్లోనూ తీవ్ర చర్చనీయాంశమైంది. రూ.5 వేల కోట్లు పెట్టుబడులు.. 20 వేల ఉద్యోగాలు ఎక్కడ? రాష్ట్రంలో వైద్య ఉపకరణాల రేట్లు భారీగా ఉన్నాయని, అవి ఇక్కడే తయారైతే భారీగా రేట్లు తగ్గుతాయని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. మెడ్టెక్ జోన్ ఏర్పాటు వల్ల రూ.5 వేల కోట్లు పెట్టుబడులు వస్తాయని, 20 వేల ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. అయితే ఇప్పటివరకు అక్కడ ఆరు షెడ్లు మాత్రమే నిర్మించారు. ఏ ఒక్క కంపెనీ ఇప్పటివరకూ నిర్మాణాలు మొదలుపెట్టలేదు. రూ.1,350 కోట్ల విలువైన భూమిని తీసుకుని కనీసం 13 ఉద్యోగాలు కూడా ఇవ్వలేని దుస్థితి. ఏ కంపెనీలు ఎంత పెట్టుబడి పెట్టాయి, వాటికి ఎక్కడ ఎన్ని ఎకరాలు కేటాయించారు అన్నదీ గోప్యంగా ఉంచారు. మెడ్టెక్ జోన్ నిర్మాణాలు చేసే బాధ్యత కూడా ఎలాంటి టెండర్లు పిలవకుండా పవర్మెక్ అనే కంపెనీకి కట్టబెట్టారు. ఇక్కడ మెడికల్ డివైజెస్ కంపెనీలు వస్తున్నాయంటూ రాష్ట్రంలో మూడున్నరేళ్లలో వైద్య పరికరాల కొనుగోళ్లలో భారీగా అవినీతికి పాల్పడ్డారు. ఇక్కడ ఫలానా కంపెనీ పెట్టుబడి పెడుతోంది.. అది చెప్పినచోట కొనాలని షరతు పెట్టారు. ఉదాహరణకు ఒక హిమోగ్లోబిన్ మీటర్ రూ.1,500 వాస్తవ ధర అయితే, దాన్ని రూ.16,500కు ప్రభుత్వంతో కొనిపించారు. ఇలా అధిక ధరలు చెల్లించడంవల్ల రాష్ట్రంలో మూడున్నరేళ్లలో కనీసం రూ.150 కోట్లు అధికంగా చెల్లించినట్టు అంచనా. ఇప్పటికీ ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) కింద నిర్వహణ బాధ్యతలు తీసుకున్న సర్వీస్ ప్రొవైడర్లను బెదిరించి కావాల్సిన వైద్యపరికరాలన్నింటినీ 50 రెట్లు అధిక ధరలకు కొనిపిస్తున్నారు. టెండర్లన్నీ మెడ్టెక్ జోన్ సీఈవో తయారు చేయడం, ఏ కంపెనీకి రావాలో అందులోనే నిర్ణయించడం, పనులు ఇవ్వడం, చెప్పినచోట ఎక్కువ రేటుకైనా కొనిపించడం.. వెరసి ఖజానాకు భారీగా దెబ్బపడింది. తక్కువ ధరకు వచ్చే వైద్య పరికరాల్ని దగ్గరుండి ఎక్కువ ధరకు కొనిపించి కమీషన్లు కొట్టేసిన వైనం కళ్లముందే జరుగుతున్నా ముఖ్యనేత ప్రమేయం ఉండటంతో కిమ్మనకుండా అన్నీ జరిగిపోయాయి. లగడపాటిపై ఎందుకంత ప్రేమ? మెడ్టెక్ జోన్ నిర్మాణం పనులు 2016లో లగడపాటి రాజగోపాల్కు చెందిన ల్యాంకో ఇన్ఫ్రా సంస్థకు అప్పజెప్పారు. అప్పటికే ఈ సంస్థ రిమ్స్ల నిర్మాణం సకాలంలో చెయ్యలేకపోయారని ప్రభుత్వమే ఆ సంస్థకు పెనాల్టీ వేసి, కాంట్రాక్టు రద్దు చేసింది. అలాంటి సంస్థనే తెరమీదకు తెచ్చి పనులు కట్టబెట్టారు. వాస్తవానికి ఈ అభివృద్ధి పనులు డీపీఆర్ ప్రకారం రూ.708 కోట్లు ఉండగా.. అంచనాలు భారీగా పెంచి రూ.2,435 కోట్లు చేశారు. ల్యాంకోకు పనులు అప్పజెప్పడమేగాక రూ.43 కోట్లు మొబిలైజేషన్ అడ్వాన్సు కింద ఇచ్చారు. తర్వాత ఈ సంస్థపై పలు ఆరోపణలు రావడం, దీనిపై వివిధ మీడియాల్లో కథనాలు రావడంతో ల్యాంకోకు పనులు రద్దుచేశారు. కానీ మొబిలైజేషన్ అడ్వాన్సు కింద ఇచ్చిన నిధులను మాత్రం ల్యాంకో తిరిగివ్వలేదు. ఈ నిధులు రాబట్టడానికి ప్రభుత్వమూ కసరత్తు చేయలేదు. మెడ్టెక్ జోన్ పార్కులో మొదట్నుంచే అవినీతి పర్వం కొనసాగుతున్నదనేందుకు ఇది నిదర్శనం. -
ల్యాంకో ప్లాంటులోనికి వెళ్లనివ్వటం లేదు
సాక్షి, హైదరాబాద్: ల్యాంకో ఇన్ఫ్రాకు చెందిన ల్యాంకో బబంద్ పవర్ లిమిటెడ్ (ఎల్బీపీఎల్) దివాలా ప్రక్రియలో భాగంగా ఒడిశాలో ఉన్న ఆ కంపెనీ ఆస్తుల స్వాధీనానికి వెళ్లిన తనను స్థానిక కాంట్రాక్టర్లు అడ్డుకుంటున్నారని, తనకు తగిన రక్షణ కల్పించాలని కోరుతూ దివాలా పరిష్కార నిపుణుడు (ఆర్పీ) యు.బాలకృష్ణభట్ జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) హైదరాబాద్ బెంచ్ను ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన ట్రిబ్యునల్ జుడీషియల్ సభ్యుడు కె.అనంత పద్మనాభ స్వామి... బాలకృష్ణ భట్కు తగిన రక్షణ కల్పించాలంటూ ఒడిస్సా, డెంకనల్ జిల్లా కలెక్టర్, ఎస్పీలను ఆదేశించారు. ఎల్బీపీఎల్ ఆస్తుల స్వాధీనానికి వెళ్లినప్పుడు భట్కు తగిన రక్షణ కల్పించాలని స్వామి తన ఆదేశాల్లో పేర్కొన్నారు. ఎల్బీపీఎల్ తమకు రూ.1428.33 కోట్ల మేర బకాయి చెల్లించాల్సి ఉందని, అయితే ఆ బకాయిలను చెల్లించని నేపథ్యంలో ఆ కంపెనీ దివాలా ప్రక్రియను ప్రారంభించాలని కోరుతూ ఐసీఐసీఐ బ్యాంకు ఎన్సీఎల్టీలో పిటిషన్ దాఖలు చేసింది. విచారణ జరిపిన ట్రైబ్యునల్... ల్యాంకో బబంద్ పవర్ లిమిటెడ్ దివాలా ప్రక్రియకు అనుమతులు మంజూరు చేసింది. పరిష్కార నిపుణుడిగా (ఆర్పీ) ముంబైకి చెందిన బాలకృష్ణ భట్ను నియమించింది. దివాలా ప్రక్రియలో భాగంగా ఆయన ఒడిశా, డెంకనల్ జిల్లా, కర్గప్రసాద్, కురుంటి గ్రామాల్లో ఎల్బీపీఎల్కు ఉన్న ఆస్తుల స్వాధీనానికి వెళ్లారు. అయితే ఆయనను స్థానికులు అడ్డుకున్నారు. చేసిన పనులకుగాను ల్యాంకో బబంద్ పవర్ లిమిటెడ్ స్థానిక కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించలేదు. దీంతో వారు వేరేవారెవ్వరినీ ఆ కంపెనీలోకి అనుమతించడం లేదు. ఈ నేపథ్యంలో బాలకృష్ణ భట్ ఎన్సీఎల్టీలో పిటిషన్ దాఖలు చేశారు. ఆ కంపెనీ ప్లాంట్, యంత్ర సామాగ్రి, ఆస్తులు తదితర సామగ్రి విలువను మదింపు చేస్తే తప్ప దివాలా ప్రక్రియ ముందుకు సాగదని, అందువల్ల తనకు తగిన రక్షణ కల్పించేలా ఆదేశాలు ఇవ్వాలని ఆయన ట్రిబ్యునల్ను కోరారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన ట్రిబ్యునల్, భట్ కోరిన ప్రకారం ఆదేశాలు జారీ చేసింది. -
లాంకో ఇన్ఫ్రా ట్రేడింగ్ నిలిపివేత : ధర ఎంత?
సాక్షి,ముంబై: అప్పుల ఊబిలో కూరుకుపోయి, మూసివేత బాటపట్టిన కాంగ్రెస్ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్కు చెందిన మౌలిక సదుపాయాల కల్పన సంస్థ ల్యాంకో ఇన్ఫ్రాకు మరోభారీ షాక్ తగిలింది. త్వరలోనే కంపెనీ మూత పడనున్న నేపథ్యంలో స్టాక్ ఎక్సేంజ్ బీఎస్ఈ గురువారం లాంకో ఇన్ఫ్రాటెక్ ఈక్విటీ షేర్లలో ట్రేడింగ్ సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించింది. సెప్టెంబర్ 14,2018 నుంచి సస్పెండ్ చేయనున్నట్లు ఒక సర్క్యులర్లో పేర్కొంది. లిక్విడేషన్ ప్రక్రియ మొదలైన నేపథ్యంలో భవిష్యత్లో మార్కెట్ సమస్యలను నివారించేందుకు ఈ చర్య తీసుకున్నట్టుతెలిపింది. దీంతో లాంకో షేరు 4శాతం క్షీణించి 48 పైసల వద్ద ఆల్టైం కనిష్టాన్ని నమోదు చేసింది. దివాలా ప్రక్రియ స్మృతి (ఐబీసీ) ప్రకారం ఆర్బీఐ గుర్తించిన 12 కంపెనీల్లో లాంకో కూడా ఒకటి. లాంకోకు భారీగా రుణాలిచ్చిన ప్రధాన బ్యాంకు ఐడీబీఐ కంపెనీ దివాలా ప్రక్రియను ప్రారంభించాలని కోరుతూ హైదరాబాద్ ఎన్సీఎల్టీలో పిటిషన్ వేసింది. ఐబిబిఐ బ్యాంక్ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియానికి మొత్తం రూ.49,959 కోట్ల మేర బకాయిలు చెల్లించాల్సి ఉందని వాదించింది. దీన్ని విచారించిన ఎన్సీఎల్టీ ఇటీవల లిక్విడేషన్కు ఆదేశాలిచ్చింది. పలు బ్యాంకులకు కనీసం వడ్డీ కూడా చెల్లించే పరిస్థితిలో ఉన్న ల్యాంకో ఇన్ఫ్రా ఆస్తులన్నిటినీ ఆమ్మి అప్పులు తీర్చే ప్రక్రియకు (లిక్విడేషన్) హైదరాబాద్లోని జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ఆగస్టు 27న అనుమతినిచ్చింది. ఈ వ్యవహారానికి పరిష్కార నిపుణుడిగా (ఆర్పీ) ఉన్న సావన్ గొడియావాలాను ల్యాంకో ఇన్ఫ్రా లిక్విడేటర్గా నియమించింది -
ల్యాంకో ఆస్తుల అమ్మకం!
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్కు చెందిన మౌలిక సదుపాయాల కల్పన సంస్థ ల్యాంకో ఇన్ఫ్రా... మూసివేతకు రంగం సిద్ధమైంది. నిండా అప్పుల్లో కూరుకుపోయి... పలు బ్యాంకులకు కనీసం వడ్డీ కూడా చెల్లించే పరిస్థితి లేకపోవటంతో ల్యాంకో ఇన్ఫ్రా ఆస్తులన్నిటినీ ఆమ్మి అప్పులు తీర్చే ప్రక్రియకు (లిక్విడేషన్) హైదరాబాద్లోని జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) అనుమతినిచ్చింది. ఈ మేరకు ట్రిబ్యునల్ సభ్యుడు రాతకొండ మురళి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాక ఈ వ్యవహారానికి పరిష్కార నిపుణుడిగా (ఆర్పీ) ఉన్న సావన్ గొడియావాలాను ల్యాంకో ఇన్ఫ్రా లిక్విడేటర్గా కూడా నియమిస్తున్నట్లు మురళీ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రుణ పరిష్కార ప్రణాళికకు రుణదాతల కమిటీ ఆమోదం తెలపకపోవటంతో ల్యాంకో లిక్విడేషన్కు ఆదేశాలిచ్చినట్లు తెలిపారు. ‘‘ఈ ఉత్తర్వులతో ప్రస్తుతం కొన్నసాగుతున్న ల్యాంకో ఇన్ఫ్రా బోర్డు, ఇతర మేనేజ్మెంట్, భాగస్వాముల అధికారాలన్నీ రద్దవుతాయి. అవన్నీ లిక్విడేటర్కు బదిలీ అవుతాయి. లిక్విడేటర్ ఈ ఆస్తుల విక్రయానికి సంబంధించి బహిరంగ ప్రకటన చేస్తారు. లిక్విడేషన్ మొదలైన నాటి నుంచి 75 రోజుల్లోగా ఈ వ్యవహారానికి సంబంధించిన ప్రాథమిక నివేదికను అడ్జ్యుడికేటింగ్ అథారిటీకి సమర్పించాల్సి ఉంటుంది’’ అని మురళి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఐడీబీఐ పిటిషన్తో దివాలా ప్రక్రియ మొదలు తమ నుంచి రుణంగా తీసుకున్న రూ.3608 కోట్లను ల్యాంకో ఇన్ఫ్రా తిరిగి చెల్లించడం లేదని, అందుకని ఆ కంపెనీ దివాలా ప్రక్రియను ప్రారంభించాలని కోరుతూ ఐబీడీఐ హైదరాబాద్ ఎన్సీఎల్టీలో పిటిషన్ వేసింది. తమకు మొత్తం రూ.49,959 కోట్ల మేర బకాయిలు చెల్లించాల్సి ఉన్నట్లు బ్యాంకులు, ఇతర రుణ సంస్థలు చెప్పగా... అప్పులు రూ.47,721 కోట్లని ల్యాంకో ఇన్ఫ్రా చెబుతోంది. ఈ నేపథ్యంలో విచారణ జరిపిన ట్రిబ్యునల్... దివాలా పరిష్కార నిపుణుడిగా సావల్ గొడియావాలాను నియమించింది. అనంతరం దివాలా పరిష్కార ప్రక్రియలో భాగంగా బహిరంగ ప్రకటన జారీ చేయగా, ఏడు కంపెనీలు తమ ఆసక్తిని తెలియచేస్తూ రుణ పరిష్కార ప్రణాళికలు సమర్పించాయి. ఇందులో త్రివేణి ఎర్త్మూవర్స్, ఇంజన్ క్యాపిల్ గ్రూపులు సమర్పించిన ప్రణాళికలు మినహా మిగిలిన కంపెనీల ప్రణాళికలు చట్ట నిబంధనలకు అనుగుణంగా లేకపోవడంతో అవి తిరస్కరణకు గురయ్యాయి. త్రివేణి ఎర్త్మూవర్స్ రుణ ప్రణాళికలో ఎలాంటి లోపాలూ లేకపోవటంతో దాన్ని రుణదాతల కమిటీ ముందు ఉంచారు. ఓటింగ్లో త్రివేణి ప్రణాళికకు 15.53 శాతం రుణదాతలే ఆమోద ముద్ర వేశారు. దీంతో ల్యాంకో లిక్విడేషన్కు అనుమతించాలంటూ సావల్ గొడియావాలా ఎన్సీఎల్టీ ముందు ఓ దరఖాస్తు దాఖలు చేశారు. దీనిపై ట్రిబ్యునల్ సభ్యులు రాతకొండ మురళీ విచారణ జరిపి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ‘‘చట్ట నిబంధనల ప్రకారం రుణ పరిష్కార ప్రణాళికకు 66 శాతం మంది రుణదాతల ఆమోదం కావాలి. కానీ త్రివేణి ప్రతిపాదనకు 15.53 శాతం మాత్రమే ఆమోదం లభించింది. అందుకని ల్యాంకో లిక్విడేషన్కు అనుమతినిస్తున్నాం’’ అని ఉత్తర్వుల్లో వివరించారు. మరోవంక ల్యాంకో కోసం పవర్ మెక్ కంపెనీ దాఖలు చేసిన దరఖాస్తును ట్రిబ్యునల్ తిరస్కరించింది. పలు అభ్యర్థనలతో ల్యాంకో ఇన్ఫ్రా దాఖలు చేసిన అనుబంధ దరఖాస్తులపై విచారణ సెప్టెంబర్ 12కి వాయిదా పడింది. -
ఇక ల్యాంకో ఆస్తుల వేలం?
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దాదాపు రూ. 45 వేల కోట్ల అప్పుల ఊబిలో కూరుకుపోయిన ల్యాంకో ఇన్ఫ్రా సంస్థ... కష్టాల నుంచి గట్టెక్కే పరిస్థితి కనిపించటం లేదు. దివాలా పరిష్కార ప్రణాళికలో భాగంగా ఈ సంస్థను కొనుగోలు చేసేందుకు త్రివేణి ఎర్త్మూవర్స్ చేసిన ప్రతిపాదనకు ల్యాంకోకు రుణాలిచ్చిన బ్యాంకుల కమిటీ అంగీకరించలేదు. దీంతో పరిష్కారానికి నియమించిన నిపుణులు.. ఈ కంపెనీని మూసివేసి, మిగిలిన ఆస్తుల విక్రయానికి (లిక్విడేషన్) అవసరమైన దరఖాస్తును నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్(ఎన్సీఎల్టీ)లో దాఖలు చేయనున్నారు. నిజానికి లిక్విడేషన్ నుంచి ల్యాంకో బయటపడాలంటే రుణాలిచ్చిన బ్యాంకుల్లో కనీసం 75% త్రివేణీ బిడ్కు అనుకూలంగా ఓటేయాలి. కానీ 15 శాతమే అనుకూలంగా ఓటేసినట్లు సమాచారం. బ్యాంకుల నిరాకరణతో పాత ప్రతిపాదనకు మార్పులు చేసి ఈ నెల 1న త్రివేణి మరో బిడ్ను వేసింది. చివరి రోజున ఇవ్వడంతో రుణదాతల కమిటీ దీన్ని లోతుగా పరిశీలించలేక తదుపరి నిర్ణయం తీసుకోవాల్సిందిగా ఎన్సీఎల్టీని కోరింది. నేటితో ముగియనున్న గడువు..: ఎన్సీఎల్టీ హైదరాబాద్ బెంచ్ 2017 ఆగస్టులో ల్యాంకో బోర్డు అధికారాలను రద్దు చేసి, దివాలా ప్రక్రియ కు సావన్ గోదియావాలాను నిపుణుడిగా నియమించింది. అయితే త్రివేణి మే 1న చేసిన కొత్త ప్రతిపాదన కార్యరూపం దాల్చలేదు. ఎన్సీఎల్టీ ఇచ్చిన 270 రోజుల గడువు శుక్రవారంతో(మే 4) ముగియనుంది. దీంతో లిక్విడేషన్ లేదా ఇతర పరి ష్కారానికి నిపుణుడు ఎన్సీఎల్టీని ఆశ్రయిం చనున్నట్టు ల్యాంకో ఎక్సే్ఛంజీలకు తెలిపింది. అప్పు ల్లో మునిగిన 12 పెద్ద కంపెనీల్లో ల్యాంకో ఒకటి. రూ.45,000 కోట్లు పలు బ్యాంకులకు బకాయి పడింది. వీటిలో ఐసీఐసీఐకి రూ.7,380 కోట్లు, ఐడీబీఐకి రూ.3,680 కోట్లు చెల్లించాల్సి ఉంది. 75 శాతం దాకా బ్యాంకులకు రానట్టే!! ల్యాంకో లిక్విడేషన్ ప్రక్రియ మొదలై ఒక్కో ఆస్తినీ విక్రయిస్తే... బ్యాంకులకు ఇది బకాయి పడ్డ మొత్తంలో 25 శాతమే తిరిగి రావచ్చన్నది నిపుణుల అంచనా. అలోక్ ఇండస్ట్రీస్, ఏబీజీ షిప్యార్డ్ తరహాలో ల్యాంకో విషయంలోనూ బ్యాంకులు 75% రుణాన్ని వదులు కోవాల్సిందేనన్నది వారి అభిప్రాయం. గతవారం ఈ రెండింటికి సంబంధించిన బిడ్లను కూడా తిరస్కరించడం తెలిసిందే. అలోక్ ఇండస్ట్రీస్కు రూ.30,000 కోట్ల రుణాలుండగా దీని ఆస్తుల్ని విక్రయిస్తే రూ.4,500 కోట్లే వస్తుందని అంచనా వేస్తున్నారు. ఇక ఏబీజీ షిప్యార్డు కూడా రూ.18,539 కోట్లు బకాయి పడింది. దీని ఆస్తుల్ని విక్రయిస్తే రూ.2,200 కోట్లు మాత్రమే వసూలవుతాయని బ్యాంకులు అంచనా వేస్తున్నాయి. అయితే యూకేకు చెందిన లిబర్టీ హౌస్ ఈ కంపెనీని రూ.5,400 కోట్లకు కొనుగోలు చేస్తామంటూ బిడ్ వేసినా... సదరు కంపెనీకే బోలెడన్ని అప్పులుండటంతో దాని బిడ్ అర్హత పొందే అవకాశాలు కనిపించటం లేదు. ఆఫర్ రూ.1,400 కోట్లు..? త్రివేణి ఎర్త్మూవర్స్ సంస్థ ల్యాంకో ఇన్ఫ్రాకు రూ.1,400 కోట్ల నగదు చెల్లించటంతో పాటు రూ.38,000 కోట్ల అప్పులను చెల్లించే బాధ్యతను కూడా తీసుకుంటామని తన బిడ్లో పేర్కొన్నట్లు తెలియవచ్చింది. కాగా, ఈ బిడ్లో తాను చెల్లిస్తానన్న నగదు మొత్తం చాలా తక్కువగా ఉన్న నేపథ్యంలో ఆస్తుల అమ్మకమే మంచిదనే అభిప్రాయం మార్కెట్ వర్గాల నుంచి వ్యక్తమవుతోంది. దివాలా ప్రక్రియలో భాగంగా కంపెనీ ఆస్తులను కొనుగోలు చేసేందుకు యూఎస్కు చెందిన పెన్ ఎనర్జీ, ఇంజెన్ క్యాపిటల్, సోలార్ ల్యాండ్ చైనా, కళ్యాణి డెవలపర్స్, దివ్యశ్రీ డెవలపర్స్, క్యూబ్ హైవేస్ సైతం ఆసక్తి కనబరిచాయి. ల్యాంకో ఆస్తులను ఏకమొత్తంగా కాకుండా విడివిడిగా కొనుగోలు చేసేందుకు ఇవి ముందుకొచ్చాయి.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement