breaking news
Kashmir gunfight
-
ఎదురుకాల్పుల్లో ఉగ్రవాది, జవాను మృతి
శ్రీనగర్: జమ్మాకశ్మీర్లోని కుప్వారా జిల్లాలో బుధవారం జరిగిన ఎన్కౌంటర్లో ఓ జవానుతో పాటు ఉగ్రవాది మృతి చెందగా, మరో ముగ్గురు ఆర్మీ జవాన్లు గాయపడ్డారు. మచిల్ సెక్టార్ వెంబడి ఉన్న సరిహద్దు నియంత్రణ రేఖ (ఎల్వోసీ) వద్ద ఉగ్రవాదులు పెద్ద ఎత్తున ఆయుధాలతో అక్రమంగా చొరబడుతున్నారనే సమాచారంతో రాష్ట్రీయ రైఫిల్ 56 బెటాలియన్ కూంబింగ్ నిర్వహించింది. ఈ సందర్భంగా ఆర్మీ జవాన్లకు ఉగ్రవాదుల మధ్య కాల్పులు జరిగినట్లు ఆర్మీ అధికారి తెలిపారు. ఈ కాల్పుల్లో జవానుతో పాటు ఉగ్రవాది మృతి చెందగా, ముగ్గురు జవాన్లు గాయపడినట్లు ఆయన పేర్కొన్నారు. మరోవైపు ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. కాగా నిన్న జరిగిన ఎదురు కాల్పుల్లో అయిదుగురు ఆర్ఆర్ జవాన్లు గాయపడిన విషయం తెలిసిందే. శ్రీనగర్లోని ఆర్మీ బేస్ ఆస్పత్రిలో వారికి చికిత్స అందిస్తున్నారు. -
మరో ముగ్గురు జవాన్ల వీరమరణం
శ్రీనగర్: జమ్మూకశ్మీర్లోని పాంపోర్ పట్టణంలో ఉగ్రవాదులతో పోలీసుల ఎన్కౌంటర్ కొనసాగుతోంది. ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ ఇనిస్టిట్యూట్ (ఈడీఐ) భవనంలో దాక్కున్న ఉగ్రవాదులను అంతం చేసేందుకు జరుగుతున్న ఆపరేషన్లో ఆదివారం మరో ముగ్గురు జవాన్లు అమరులయ్యారు. భద్రతాబలగాల కాల్పుల్లో ఒక ఉగ్రవాది హతమయ్యాడు. ఈ ఎన్కౌంటర్లో అమరులైన జవాన్ల సంఖ్య ఐదుకు చేరింది. ఆదివారం అమరులైన వారిలో ఇద్దరు కెప్టెన్లు ఉన్నారు. తెల్లవారుజామున ఈడీఐ భవనంపై పట్టుకోసం ప్రయత్నించిన పారా యూనిట్ కెప్టెన్ పవన్ కుమార్(23), మరో కెప్టెన్ తుషార్ మహాజన్(26), జవాన్ ఓం ప్రకాశ్పై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. పవన్ అక్కడే అమరుడవ్వగా.. తీవ్రంగా గాయపడిన తుషార్, ఓం ప్రకాశ్ 92 బేస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ.. చనిపోయారని ఆర్మీ అధికారులు వెల్లడించారు. ఉగ్రవాదులు కాల్పలు జరపటంతోపాటు.. మధ్యమధ్యలో గ్రనేడ్లు విసురుతున్నారని ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. వీలైనంత త్వరలో ఆపరేషన్ ముగిస్తామని తెలిపాయి. శనివారం సీఆర్పీఎఫ్ కాన్వాయ్పై ఉగ్రవాదులు కాల్పులు జరపటంతో ఇద్దరు జవాన్లు, ఒక పౌరుడు మరణించగా.. 9 మంది జవాన్లు గాయపడ్డం తెలిసిందే. ఎంతో గర్వంగా ఉంది: పవన్ తండ్రి ఈ దాడిలో అమరుడైన తన కుమారుడి త్యాగానికి గర్వంగా ఉందని కెప్టెన్ పవన్ తండ్రి రాజ్బీర్ సింగ్ తెలిపారు. ‘నాకు ఒక్కడే కుమారుడు. వాడిరీ దేశం కోసం ఆర్మీకి ఇచ్చేశాను. ఇవాళ దేశ సేవలోనే నా బిడ్డ అమరుడయ్యాడు. ఒక తండ్రిగా ఇంతకన్నా గర్వకారణమేముంటుంది’ అని పేర్కొన్నారు. హరియాణాలోని జింద్ ప్రాంతానికి చెందిన పవన్ మూడున్నరేళ్ల క్రితం ఆర్మీలో చేరినప్పటినుంచి పలు ఆపరేషన్లలో చురుకుగా పాల్గొన్నాడని ఆర్మీ అధికారులు వెల్లడించారు. కోటా, స్వాతంత్య్రం కాదు.. దుప్పటి చాలు: కెప్టెన్ పవన్ ‘కొందరు రిజర్వేషన్లు కోరుతున్నారు, కొందరు స్వాతంత్య్రం కావాలంటున్నారు, నా దుప్పటి తప్ప నాకేమీ వద్దు’... ఇది జమ్మూ కశ్మీర్ పాంపోర్లో ఉగ్రవాదులపై పోరులో వీరమరణం పొందిన కెప్టెన్ పవన్కుమార్ చివరి సందేశం. తన ఫేస్బుక్ ఖాతా నుంచి ఈ పోస్ట్ చేశారు. కొన్ని రోజులుగా దేశాన్ని కుదిపేస్తున్న జేఎన్యూ వివాదం, జాట్ల ఉద్యమంతో పవన్ జీవితం ముడిపడడం యాదృచ్ఛికమైనా... వాటిపై అభిప్రాయాలు మాత్రం అందరినీ ఆలోచింపచేస్తున్నాయి. జాట్ వర్గానికి చెందిన పవన్ జేఎన్యూలోనే గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు. ఆర్మీ డే రోజున (జనవరి 15) జన్మించిన పవన్కు బుల్లెట్ వాహనాలు, కమాండో జీపులంటే ఇష్టం. -
కాశ్మీర్లో కాల్పులు : తీవ్రవాది మృతి
శ్రీనగర్ : జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలో మంగళవారం జరిగిన ఎన్కౌంటర్లో తీవ్రవాది మరణించాడు. ఈ రోజు తెల్లవారుజామున జిల్లాలోని కల్హార్ ప్రాంతంలో తీవ్రవాదులు... భద్రత దళాలకు మధ్య హోరాహోరీ కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో తీవ్రవాది మృతి చెందాడని పోలీసులు చెప్పారు. అతడి మృతదేహం వద్ద నుంచి ఏకే 47 రైఫిల్తోపాటు మూడు ఏకే మేగజీనులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అయితే ఈ కాల్పుల్లో భద్రత దళాలకు చెందిన వారికి ఎటువంటి గాయాలు కాలేదని పోలీసు ఉన్నతాధికారి వెల్లడించారు.