breaking news
karimanagar Collectorate
-
చివరి రక్తపు బొట్టు వరకు దళితుల కోసం పోరాడతా: సీఎం కేసీఆర్
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ‘‘మొన్నీ మధ్య టీవీలో చూసిన.. ఉత్తరభారతంలో ఓ దళిత యువకుడు పెళ్లి ఊరేగింపులో గుర్రం ఎక్కిం డని కొందరు అతన్ని కొట్టి చంపారు. ఎవడు పెట్టిండో, ఎప్పట్నుంచి పెట్టిండోగానీ ఈ దుర్మార్గమైన ఆచారం ఇంకా పోలేదు. సమాజంలో ఇప్పటికీ దళితులంటే చిన్నచూపే, అంటరానితనం పోయినా వివక్ష పోలేదు. ఆ వివక్షను రూపుమాపడమే మా ప్రభుత్వ లక్ష్యం. దళితుల జీవితాలు పూర్తిగా మారాలి. అందుకోసం నా చివరి రక్తపు బొట్టు వరకు పోరాటం చేస్తా..’’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ప్రకటించారు. ఎన్నో పోరాటాలు, త్యాగాలు చేసి తెలంగాణ తెచ్చుకున్నామని, ఈ ఏడేండ్లలో అద్భుతంగా అభివృద్ధి చేసుకున్నామని చెప్పారు. కునారిల్లుతున్న కులవృత్తుల వారికోసం కోట్ల రూపాయలు వెచ్చించి ఆర్థికంగా నిలబెట్టుకున్నామని తెలిపారు. శుక్రవారం కరీంనగర్ కలెక్టరేట్లో ‘దళితబంధు’ పథకంపై మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్షించారు. పలు అంశాలపై వారికి దిశానిర్దేశం చేశారు. సమీక్షలో సీఎం చెప్పిన అంశాలు ఆయన మాటల్లోనే.. అన్ని వర్గాలకు అండగా.. ‘‘తెలంగాణలో సాగునీటి రంగాన్ని పునరుజ్జీవనం చేసుకున్నాం. దండగన్న వ్యవసాయాన్ని పండగ చేసుకున్నాం. నిరంతరాయంగా కరెంటు ఇచ్చుకుంటున్నాం. ఒకనాడు కూలీ పనులకు పోయిన రాష్ట్రంలో ఇప్పుడు.. 3 కోట్ల టన్నుల ధాన్యాన్ని పండించుకుంటున్నాం. గొర్రెల పెంపకం, చేపల పెంపకం, చేనేతకు ఆసరా, ఎంబీసీలకు అండగా మా ప్రభుత్వం నిలబడింది. అన్ని రంగాలకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు సహా అన్ని వర్గాలకు అండదండలు అందిస్తూ నేనున్నాననే ధీమాను ప్రభుత్వం అందిస్తోంది. నేను ఎప్పటినుంచో అనుకుంటున్న దళిత అభివృద్ధి కార్యాచరణకు ఇప్పుడు సమయం వచ్చింది. హుజూరాబాద్లో పైలట్ ప్రాజెక్ట్ కింద అమలుపరుస్తున్న దళితబంధు కార్యక్రమాన్ని అందరి సహకారంతో తప్పకుండా విజయవంతం చేస్తాం. దేశానికే పాఠం నేర్పే విధంగా దళిత బంధును నిలబెడదాం చదవండి: 27 ఏళ్లుగా పనిచేస్తున్నా జీతం రూ.22 వేలే.. ఇది ఓట్ల కోసం కాదు.. సబాల్ట్రన్ స్టడీస్ సెంటర్ ఏర్పాటు చేసి దళితుల సామాజిక, ఆర్థిక స్థితిగతుల పట్ల అధ్యయనం చేశాం. ప్రపంచవ్యాప్తంగా 165 జాతులు ఆర్థిక, సామాజిక వివక్షకు గురవుతున్నయనే విషయాన్ని గుర్తించాం. భారతదేశ దళితుల పరిస్థితి కూడా ఆ 165 జాతుల మాదిరిగానే ఉందనే విషయం నిర్ధారణ అయింది. అందుకే దళితుల అభివృద్ధి కోసం పథకం తెస్తున్నాం. ఇది చిల్లర మల్లర ఓట్ల కోసం చేపట్టిన కార్యక్రమం కాదు, ఆదరాబాదరా అవసరం లేదు. ప్రతి దళిత కుటుంబాన్ని పేరు పేరునా అభివృద్ధిపరిచే దాకా ఈ కార్యక్రమం కొనసాగుతుంది. రైతుబంధు ఆర్థిక సాయాన్ని ఎలాంటి పరిమితులు లేకుండా ఎలా అందిస్తున్నామో.. అదే పద్ధతిలో దళితబంధుకు కూడా పరిమితులు ఉండవు. దళితబస్తీల్లోని దరిద్రాన్ని బద్దలుకొట్టాలంటే ఉద్యోగస్తులకు కూడా దళితబంధు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎస్సీ వర్గాల్లోని అన్ని ఉప కులాలకు దళిత బంధు వర్తిస్తుంది. హుజూరాబాద్ నుంచి ప్రారంభమయ్యే దళిత చైతన్య జ్యోతి తెలంగాణ వ్యాప్తంగా విస్తరించి దేశానికే వెలుగులు పంచుతుంది. అణగారిన దళితవర్గాల్లో చైతన్యాన్ని తీసుకువస్తుంది. భిన్నమైన పనులు ఎంచుకోండి అందరూ ఒకే పని కాకుండా భిన్నమైన పనులను ఎంచుకోవడం ద్వారా ఆర్థికంగా మరింత లబ్ధి పొందవచ్చు. అధికారులు దళితబంధు పథకం ద్వారా అమలుపరుస్తున్న వివిధ కార్యక్రమాల వివరాలున్న కరపత్రాన్ని వెంట తీసుకెళ్లి.. ఆయా వ్యాపార, ఉపాధి మార్గాలను లబ్ధిదారులకు వివరించాలి. లబ్ధిదారులు స్వయంగా వారి పనిని ఎంచుకునేందుకు సహకరించాలి. ప్రభుత్వం లైసెన్సులు ఇచ్చే ఫర్టిలైజర్, మెడికల్, వైన్స్ తదితర రంగాల్లో దళితులకు రిజర్వేషన్లు కల్పిస్తాం. హాస్టళ్లు, హాస్పిటళ్లు, విద్యుత్ రంగ సంస్థలకు వివిధ మెటీరియల్ సరఫరా, సివిల్ సప్లయ్స్ రంగాల్లో కూడా దళితులకు అవకాశాలను మెరుగుపరుస్తాం. కాంట్రాక్టుల విషయంలోనూ కొంత రిజర్వేషన్ కోసం ఆలోచన చేస్తాం’’ అని సీఎం కేసీఆర్ చెప్పారు. చదవండి: తీన్మార్ మల్లన్నను అరెస్టు చేసిన పోలీసులు..! హుజూరాబాద్లో డెయిరీ ఏర్పాటు చేయండి ఎస్సీ వెల్ఫేర్ మంత్రి, బీసీ వెల్ఫేర్ మంత్రి, కరీంనగర్ జిల్లా వారే కావడం, ఆర్థికమంత్రిది కూడా పక్క నియోజకవర్గమే కావడంతో.. హుజూరాబాద్ పైలట్ ప్రాజెక్టు విజయవంతానికి మార్గం మరింత సుగమమైందని సీఎం కేసీఆర్ అన్నారు. పాల ఉత్పత్తి రంగంలో కరీంనగర్ డెయిరీ విజయం గర్వకారణమని చెప్పారు. దళితబంధు పథకంలో భాగంగా ఔత్సాహికులు డెయిరీ ఫారాలు ఏర్పాటు చేసుకునేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. హుజూరాబాద్లో డెయిరీ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. దీనిపై స్పందించిన కరీంనగర్ డెయిరీ నిర్వాహకులు.. ‘అవసరమైతే లక్ష లీటర్ల వరకు పాలను అదనంగా కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు’ తెలిపారు. దీనిపై సీఎం కేసీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. కలెక్టరేట్లో జరిగిన సమీక్షలో మంత్రులు హరీశ్రావు, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, ఎంపీ సంతోష్కుమార్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, మాజీ మంత్రులు కడియం శ్రీహరి, ఇనుగాల పెద్దిరెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండా శ్రీనివాస్, మేయర్ సునీల్రావు, అధికారులు పాల్గొన్నారు. సీఎం ఎత్తుకున్న శిశువుకు కేటీఆర్ పేరు కలెక్టరేట్లో సమీక్ష అనంతరం రామగుడు ఎంపీపీ ఎలిగేటి కవిత–లక్ష్మణ్ దంపతులు సీఎం కేసీఆర్ను కలిశారు. తమకు కుమారుడు జన్మించాడని, ఆశీర్వాదించాలని కోరారు. కేసీఆర్ ఆ చిన్నారిని ఎత్తుకుని ఆశీర్వదించారు. తర్వాత కవిత–లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ.. తమ కుమారుడికి కేటీఆర్ అని పేరు పెట్టుకుంటున్నామని తెలిపారు. ‘దళితబంధు’తో పునరుత్పాదకత రాష్ట్రంలో పరిశ్రమలకోసం ఇప్పటివరకు 2 లక్షల 20 వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. తద్వారా 15 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు దక్కాయి. అలాగే మేం 1.75 లక్షల కోట్ల రూపాయలను దళితులకు పెట్టుబడిగా పెట్టడం ద్వారా.. అది తిరిగి పునరుత్పాదకతను సాధిస్తుంది. లక్షలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలను అందిస్తుంది. రిజర్వేషన్లు పెంచుకుందాం రాష్ట్రంలో 17 లక్షల దళిత కుటుంబాలు ఉన్నాయని సమగ్ర కుటుంబ సర్వేలో తేలింది. రాష్ట్ర జనాభాలో సుమారు 18 శాతం మేర.. అంటే సుమారు 75 లక్షల దళిత జనాభా ఉంది. వారి జనాభా పెరుగుతున్నది. దానికి తగ్గట్టు రాబోయే కాలంలో దళిత రిజర్వేషన్ల శాతం పెంచుకునే ప్రయత్నం చేద్దాం. ఏం నర్సయ్యా.. హైదరాబాద్ రా.. మొగ్ధంపూర్ సర్పంచ్కు సీఎం కేసీఆర్ ఆహ్వానం కరీంనగర్ రూరల్: కరీంనగర్ జిల్లా పర్యటనలో భాగంగా తీగలగుట్టపల్లిలోని తెలంగాణభవన్లో బస చేసిన సీఎం కేసీఆర్ను.. కరీంనగర్ మండలానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు కలిశారు. ఈ సందర్భంగా మొగ్ధుంపూర్ సర్పంచ్ జక్కం నర్సయ్యను కేసీఆర్ పలకరించారు. ‘పిల్లలు బాగున్నారా.. అంతా మంచిదేనా.. ఒకసారి హైదరాబాద్ రా..’ అని ఆహ్వానించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో నర్సయ్య సీఎం కేసీఆర్తో కలిసి పనిచేశారు. ఇప్పుడు కేసీఆర్ ఇలా నర్సయ్యను ప్రత్యేకంగా పలకరించడం, హైదరాబాద్కు ఆహ్వానించడం అందరికీ ఆసక్తి కలిగించింది. చదవండి: అక్కడ తప్పించుకున్నాడు.. ఇక్కడ దొరికిపోయాడు -
అడవిలోకి రానివ్వడం లేదు
వెదురు కోసం తమను అటవీ అధికారులు అడవిలోకి అనుమతించడం లేదని మేదరులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచ వెదురు దినోత్సవం సందర్భంగా జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో మేదరులు ర్యాలీలు తీశారు. వెదురు పెంపకానికి గ్రామాల్లో ప్రత్యేకంగా స్థలం కేటాయించాలని కోరుతూ కలెక్టర్ శరత్కు వినతిపత్రం ఇచ్చారు. సాక్షి, సారంగాపూర్: ప్లాస్టిక్ను పూర్తిగా నిషేధిస్తేనే మేదరులు బతికి బట్టకడతారని మండల మేదరులు పేర్కొన్నారు. ఈమేరకు తహసీల్దార్ నవీన్కు వినతిపత్రం ఇచ్చారు. ప్రపంచ వెదురు దినోత్సవం సందర్భంగా సారంగాపూర్లో మేదరులు భారీ ర్యాలీ నిర్వహించారు. వారు మాట్లాడుతూ ప్లాస్టిక్ వినియోగం పెరగడంతో పర్యావరణం పూర్తిగా దెబ్బతింటుందన్నారు. ప్రభుత్వం స్పందించి ప్లాస్టిక్పై నిషేధం విధించాలని కోరారు. ప్లాస్టిక్ వాడకంతో తాము ఉపాధి కోల్పోతున్నానమని, తమ వెదురు వస్తువులను కొనుగోలు చేయడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అటవీశాఖ అధికారులు తమను అడవిలోకి అనుమతించడం లేదన్నారు. వెదరు పెంపకాన్ని ప్రొత్సహించేందుకు ప్రతీ మండలంలో ఐదెకరాలు వెదురు పెంపకానికి అటవీశాఖకు సంబంధం లేకుండా భూమిని కేటాయించాలని కోరారు. మేదరులా ర్యాలీలో వారు ధరించిన వెదురు టోపీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వెదరుతో చేసిన టోపీలు నీడతోపాటు చల్లని గాలిని ఇస్తుండడంతో పలువురు కొనేందుకు ఆసక్తి చూపారు. ర్యాలీలో మేదరుల సంఘం మండలాధ్యక్షుడు చంద శ్రీహరి, ఉపాధ్యక్షులు బొమ్మిడి లచ్చన్న, ప్రధాన కార్యదర్శి మామిడిపెల్లి శ్రీనివాస్, కోశాధికారి బొమ్మిడి వెంకటేశ్, గౌరవ అధ్యక్షుడు లస్మయ్య, సలహాదారు చింతల చిన్నగంగరాజం, ప్రచార కార్యదర్శి వేముల లక్ష్మీరాజం, కార్యవర్గ సభ్యులు చంద మల్లేశం, పోతు నర్సయ్య, తుమ్మల రాజేశం, మామిడిపెల్లి రాజేందర్, చింతల దుబ్బరాజం పాల్గొన్నారు. జగిత్యాలటౌన్: తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మేదరులు బుధవారం జిల్లాకేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టర్ శరత్ను కలిసి వినతిపత్రం ఇచ్చారు. అటవీ విస్తీర్ణం తగ్గిపోతుండడంతో వెదురుబొం గులు దొరకడం లేదని, వెదురు పెంపకానికి ప్రత్యేకంగా స్థలం కేటాయించాలని కోరారు. మే దరులకు డబుల్బెడ్రూం ఇళ్లు, ప్రభుత్వ రుణా లు ఇప్పించాలని కోరారు. అటవీశాఖ సిబ్బంది వేధింపుల నుంచి రక్షించాలని కోరారు. -
జిల్లాలో విపత్తు సహాయక సెల్
కరీంనగర్: వరదలు, విపత్తులు సంభవిస్తే తక్షణం స్పందించేందుకు 24 గంటలూ పనిచేసే సెల్ను కరీంనగర్ కలెక్టర్ నీతూప్రసాద్ ఏర్పాటు చేశారు. ఈ సెల్లో 120 మంది రెవెన్యూ, వ్యవసాయ శాఖ సిబ్బందిని నియమించారు. ఈ సెల్ సోమవారం నుంచి పనిచేయటం ప్రారంభించింది. జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు తమ సమస్యలను విన్నవించుకునేందుకు టోల్ ఫ్రీ నంబర్ 1800-4254-731, 0878-2234-731 ఫోన్ నంబర్లను కేటాయించారు. ఈ నంబర్లకు అందిన ఫిర్యాదును వెంటనే తహశీల్దార్లకు, ఆర్డీవోలకు అందిస్తారు. వారు తీసుకున్న చర్యలపై కలెక్టర్ నీతూప్రసాద్ సమీక్షించనున్నారు.