breaking news
kandru kamala
-
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన కాండ్రు కమల
-
నారా లోకేశ్కు ఊహించని షాక్
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్కు ఊహించని విధంగా ఎదురుదెబ్బ తగిలింది. గుంటూరు జిల్లా మంగళగిరి మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల గురువారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. లోటస్ పాండ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆమె కలిశారు. వైఎస్సార్సీపీ కండువాతో ఆమెను పార్టీలోకి సాదరంగా వైఎస్ జగన్ ఆహ్వానించారు. తమ కుటుంబానికి టిక్కెట్ ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు మోసం చేయడంతో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా నారా లోకేశ్ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. (మీ నాన్న టికెట్ ఇస్తామని మోసం చేశారు..) మాట తప్పినందుకు నిరసనగా.. మంగళగిరి స్థానాన్ని బీసీలకు కేటాయిస్తామని చెప్పి చంద్రబాబు మోసం చేశారని కాండ్రు కమల విమర్శించారు. నమ్మించి మాట తప్పినందుకు నిరసనగా టీడీపీకి రాజీనామా చేసినట్టు చెప్పారు. వైఎస్సార్సీపీలో చేరిన తర్వాత ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. టీడీపీని ఓడించడానికి అందరూ పనిచేయాలని పిలుపునిచ్చారు. బేషరతుగా వైఎస్సార్సీలో చేరినట్టు తెలిపారు. బీసీలకు చంద్రబాబు తీరని అన్యాయం చేశానని ఆరోపించారు. చంద్రబాబు మోసాల పట్ల బీసీలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అధికారం నిలబెట్టుకోవడానికి చంద్రబాబు ఎన్నో అబద్ధాలు చెబుతున్నారని, గుంటూరు జిల్లాలో తన సామాజిక వర్గానికే ఎక్కువ సీట్లు ఇచ్చుకున్నారని తెలిపారు. గుంటూరు జిల్లాలో వైఎస్సార్సీపీ తరపున ముగ్గురు మహిళలకు వైఎస్ జగన్ సీట్లు ఇచ్చారని, సామాజిక సమత్యులత పాటించారని వెల్లడించారు. వైఎస్ జగన్కు ఒక్కసారి అవకాశం ఇస్తే రాజన్న పరిపాలన మళ్లీ చూస్తామన్న నమ్మకం తమకు ఉందన్నారు. -
మీ నాన్న టికెట్ ఇస్తామని మోసం చేశారు..
సాక్షి, మంగళగిరి: మంగళగిరి టికెట్ను అధిష్టానం తనకు ప్రకటించిందంటూ నియోజకవర్గానికి వచ్చిన నారా లోకేశ్కు చుక్కెదురైనట్లు సమాచారం. గురువారం రాత్రి పట్టణానికి వచ్చిన లోకేశ్ను మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల నిలదీసినట్లు సమాచారం. ‘మా వియ్యంకుడు మురుగుడు హనుమంతరావుకు టికెట్ ఇస్తామని పార్టీలో చేర్చుకున్నారు. నాకు కానీ.. నా కుటుంబానికి కానీ టికెట్ ఇస్తామన్న మీ తండ్రి హామీతోనే పార్టీలో చేరాము. ఇప్పుడు మమ్మల్ని మోసం చేసి మీరు నేరుగా పోటీ చేస్తే మా పరిస్థితి ఏమిటంటూ’ కమల నిలదీసినట్లు సమాచారం. దీంతో కంగుతిన్న లోకేష్.. మీ అందరి భవిష్యత్తు చంద్రబాబు చూసుకుంటారని అనడంతో ‘అధికారంలో ఉన్నప్పుడే పద్మశాలీలకు ఏమి చేయలేకపోయారని.. అధికారంలో లేకపోతే ఏమి చేస్తారని’ ప్రశ్నించినట్లు తెలిసింది. (చదవండి: 1980 నుంచి టీడీపీ గెలవలేదు!) -
కాంగ్రెస్ నుంచా.. మేమా.. పోటీ చేయం
గుంటూరు జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి పెద్ద షాక్ తగిలింది. ఇద్దరు అభ్యర్థులు ఆ పార్టీకి కోలుకోలేని ఝలక్ ఇచ్చారు. నరసరావుపేట, మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గాలకు పార్టీ అధిష్ఠానం ఎంపిక చేసిన కాసు మహేశ్ రెడ్డి, కాండ్రు కమల.. ఇద్దరూ తాము పోటీ చేసే ప్రసక్తి లేదని తేల్చిచెప్పేశారు. రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ పార్టీ వ్యవహరించి తీరుతో విసుగెత్తిపోయిన ప్రజలు ఆ పార్టీకి గట్టిగా బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో, పోటీ చేస్తే డిపాజిట్లు కూడా దక్కవని, పైగా అనవసరంగా బోలెడు ఖర్చవుతుందని భావించే వాళ్లు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మొత్తమ్మీద విజయవాడ వెస్ట్ నియోజకవర్గానికి అధిష్ఠానం ఎంపిక చేసిన వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆ వెంటనే బీజేపీలో చేరిపోతే.. ఇప్పుడు వీళ్లిద్దరూ ఈ రకమైన ఝలక్ ఇచ్చారు. -
పట్టాలివ్వని హామీలు
అటవీ భూముల డీనోటిఫై మాటే మరచిన ఎమ్మెల్యే కాండ్రు కమల గుర్రుమంటున్న తాడేపల్లి కృష్ణనగర్ కాలనీ వాసులు ప్రకాశం బ్యారేజి పటిష్టత విషయంలోనూ ఉదాశీనత గత ఎన్నికల్లో ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చి మంగళగిరి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన కాండ్రు కమల వాటిని నెరవేర్చకపోవడంతో అవే శాపంగా మారాయి. అటవీ భూముల్లో నివాసముంటున్న పేదలకు ఆ భూమిని డీనోటిఫై చేయించి పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ ఐదేళ్ల కాలంలో పట్టాలు ఇవ్వలేకపోవడంతో కృష్ణనగర్ కాలనీ వాసులు ఆమెపై గుర్రుగా ఉన్నారు. సాక్షి ప్రతినిధి, గుంటూరు మంగళగిరి ఎమ్మెల్యే కాండ్రు కమల... తొలిసారిగా శాసన సభకు గెలుపొంది తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్టు బోర్డు మెంబరుగా కూడా నియమితులయ్యారు. ఇసుక రీచ్ల టెండర్లు, ఇసుక అమ్మకాలు అన్నీ ఆమె కనుసన్నల్లోనే జరిగాయనే విమర్శలు లేకపోలేదు. పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల రైతులకు సాగునీటిని అందిస్తున్న ప్రకాశం బ్యారేజి పటిష్టతకు ముప్పు కలిగించే విధంగా ఇసుక తవ్వకాలు జరిగినా ఉదాశీనంగా వ్యవహరించారు. శాసస సభ్యురాలిగా ప్రజా సమస్యల పరిష్కారంతోపాటు ఆస్తుల పరిరక్షణ బాధ్యత ఉన్నప్పటికీ ఆమె మిన్నకుండి పోయారు. లీజుల పేరుతో కృష్ణానది పరివాహక ప్రాంతంలో వందలాది ఎకరాల్లో అక్రమ సాగు జరుగుతున్నా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లలేదు. శిధిలావస్థకు చేరిన ఇరిగేషన్ వంతెనలపై నిబంధనలకు విరుద్ధంగా పది టైర్ల లారీలు ఇసుకను తరలించినప్పటికీ ఇరిగేషన్, రెవెన్యూ, పోలీస్ అధికారులను ఆమె ఎప్పుడూ ప్రశ్నించలేదు. వీటిన్నిటి కంటే తన ఐదేళ్ల పదవీ కాలంలో మునిసిపాల్టీలోని చిన్న చిన్న పనులు, పోలీసు శాఖ అధికారుల బదిలీలు ఆమె సూచన మేరకు జరిగాయనే ఆరోపణలు లేకపోలేదు. అయితే ఎమ్మెల్యేగా కృష్ణనగర్ ప్రజలకు ఏమీ చేయలేకపోయారు. హామీలు మాత్రం ఘనంగా ఇచ్చి వారిని మభ్యపెట్టే యత్నం చేశారు. అటవీ భూముల్లో నివాసం తాడేపల్లి మునిసిపల్ పరిధిలోని కృష్ణనగర్ ప్రాంతంలో అటవీ భూములను ఆక్రమించు కుని సుమారు రెండు వేల కుటుంబాలు నివాసం వుంటున్నాయి. వీరిని అటవీ శాఖ సిబ్బంది వేధిస్తుండేవారు. వీరంతా రెక్కాడితేగాని, డొక్కాడని కూలీలు. అటవీ శాఖ అధికారులు గతంలో రెండు సార్లు దాడులు చేసి ఇళ్లను నేలమట్టం చేశారు. - దాంతో పేదలంతా ఒక్కటై ఉద్యమించారు. ఈ క్రమంలో అప్పటి కలెక్టర్ రామాంజనేయులు చొరవ తీసుకుని అటవీ భూముల్లో నివసిస్తున్న వారి వివరాలు రెవెన్యూ శాఖ వారిచే సర్వే చేయించారు. ఆ సర్వే ప్రకారం 1870 ఇళ్లను గుర్తించి వారికి గుర్తింపు కార్డులు ఇచ్చారు. ఇకపై కొత్తగా ఆక్రమణలకు పాల్పడితే సహించబోమని, సర్వే ప్రకారం అప్పటికి గుర్తించిన వారికి ప్రత్యామ్నాయ స్థలాలు చూపుతామని వాగ్దానం చేశారు. అటవీ భూమి ఆక్రమించుకున్నవారికి డీఫారెస్టు భూములుగా నోటిఫై చేయిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఆమె పదవీ కాలం పూర్తి కావస్తున్నా ఇచ్చిన హామీ నెరవేరలేదు. ఆ తరువాత వచ్చిన కలెక్టర్ కూడా పట్టించుకోలేదు. ఆ రెండు వేల కుటుంబాల్లో బ్రహ్మానందపురంలోనే 500 కుటుంబాలు 30 సంవత్సరాలుగా స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. మిగిలిన వారు 15 సంవత్సరాలకు పైబడి ఉంటున్నారు. పట్టాల సంగతి అటుంచితే ఆ రెండు వేల కుంటుంబాలకు మౌలిక వసతులు కల్పించలేదు. దీంతో మునిసిపల్ అధికారుల అంగీకారంతో పేదలు చందాలు వేసుకుని నాలుగు తాగునీటి కుళాయిలు ఏర్పాటు చేసుకుంటే ఎమ్మెల్యే తొలగించమన్నారంటూ మునిసిపల్ సిబ్బంది తాగునీటి పైపులను డమ్మీలు చేయడం ఓ సారి వివాదాస్పదమైంది. {పత్యామ్నాయం చూపకపోవడం మౌలిక వసతులు కల్పించలేకపోవడంతో ఎమ్మెల్యేపైనా, కాంగ్రెస్ పార్టీ పైనా అక్కడి ప్రజలు గుర్రుగా ఉన్నారు. తహశీల్దారు వివరణ... ఈ విషయమై తాడేపల్లి తహశీల్దారు డి.రామకృష్ణను ‘సాక్షి ప్రతినిధి’ వివరణ కోరగా, కృష్ణనగర్ కాలనీ వాసులకు పట్టాలు ఇవ్వలేదని చెప్పారు. అటవీభూమిని డీనోటిఫై చేశారా అని ప్రశ్నించగా, తాను ఇటీవలనే ఇక్కడకు బదిలీపై వచ్చానని, సర్వేయరు అందుబాటులో లేకపోవడం వల్ల ఆ వివరాలు చెప్పలేకపోతున్నానన్నారు. అయితే కృష్ణనగర్ కాలనీ వాసులకు పట్టాలు మాత్రం ఇవ్వలేదని స్పష్టం చేశారు.