breaking news
kadambam plant
-
బ్రిటన్ రాజు కానుకగా ఇచ్చిన మొక్క నాటిన ప్రధాని
న్యూఢిల్లీ: బ్రిటన్ రాజు చార్లెస్–3 తనకు 75వ పుట్టిన రోజు సందర్భంగా కానుకగా పంపిన కదంబ మొక్కను శుక్రవారం ప్రధాని మోదీ అధికార నివాస ప్రాంగణంలో నాటారు. ‘తల్లి పేరుతో ఒక చెట్టు’ అన్న ప్రధాని మోదీ నినాదం ప్రేరణతోనే రాజు చార్లెస్ ఈ మొక్కను పంపారని ఢిల్లీలోని బ్రిటిష్ హై కమిషన్ కార్యాలయం తెలిపింది. ప్రతి ఒక్కరూ తమ తల్లి పేరుతో ఒక మొక్కను నాటాలంటూ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపునిచ్చిన విషయాన్ని గుర్తు చేసింది. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రధాని మోదీ, చార్లెస్–3 కట్టుబడి ఉన్నారనేందుకు ఈ కానుకే ఒక ఉదాహరణ అని తెలిపింది. ఈ నెల 17వ తేదీన ప్రధాని మోదీ తన నివాస ప్రాంగణంలో మొక్కను నాటుతున్నప్పటి వీడియోను బ్రిటిష్ హై కమిషన్ కార్యాలయం శుక్రవారం ఆన్లైన్లో షేర్ చేసింది. ఇద్దరు నేతల మైత్రి, పర్యావరణ పరిరక్షణపై ఇద్దరి నిబద్ధతకు ఇది ప్రతీకని తెలిపింది. జూలైలో బ్రిటన్లో ప్రధాని మోదీ పర్యటన సమయంలో రాజు చార్లెస్–3 సొనొమా మొక్కను బహుమతిగా అందజేశారు. ‘కామన్వెల్త్, యూకే–భారత్ ఉమ్మడి భాగస్వామ్య విజన్–2035కు వాతావరణ, పరిశుభ్రమైన ఇంధన రంగాలే కీలకం’ అని బ్రిటిష్ హైకమిషన్ తెలిపింది. -
కదంబం కళ కళ
కురవి శివాలయంలోని కదంబం చెట్టు పూలతో కళకళలాడుతోంది. ఆలయం లో ధ్వజస్తంభం ప్రతిష్ఠకు ముందు ప్రధాన పూజారి పారుపల్లి రామన్న, సిబ్బంది కదంబం మొక్కను తీసుకొచ్చి నాటారు. ఈ మేరకు మెుక్క పెరిగి చెట్టుగా మారి పచ్చని పుష్పాలతో భక్తులను ఆకట్టుకుంటోంది. భద్రకాళి అమ్మవారికి ఇష్టమైన పూలను ప్రతి రోజు ఉదయం, సాయంత్రం వేళల్లో పూజారులు తీసుకొచ్చి భద్రకాళీ సమేత శ్రీవీరభద్రస్వామి ఆలయంలోని ఉత్సవ మూర్తుల వద్ద పెట్టి పూజలు నిర్వహిస్తున్నారు. –కురవి -
కర్కాటక రాశి... కదంబం మొక్క..
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు హరితహారం కార్యక్రమంలో తన జాతకఫలం ప్రకారం మొక్కను నాటబోతున్నారు. నల్లగొండ జిల్లాలో శుక్రవారం ముఖ్యమంత్రి ప్రారంభించనున్న హరిత హారం కార్యక్రమం కోసం సీఎం కర్కాటక రాశి ప్రకారం కదంబం మొక్కను హైదరాబాద్ నుంచి అధికారులు తెప్పించారు. ఈ మొక్కను చౌటుప్పల్ మార్కెట్యార్డు ఆవరణలో ఆయన నాటనున్నారు. అనంతరం అక్కడి నుంచి చిట్యాల మండలం గుండ్రాంపల్లికి వచ్చి అక్కడ ఎన్హెచ్-65 పక్కన పూలమొక్కలను నాటడం ద్వారా ఆయన హరితహారం కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించనున్నారు. అక్కడే ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో బయలుదేరి ఎన్హెచ్-65 పొడవునా కోదాడ మండలం నల్లబండ గూడెం వరకు వెళ్తారు. ఈ దారిలో హరితహారం కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రజలకు అభివాదం చేసుకుంటూ సీఎం వెళ్లనున్నారు. ప్రజలకు సీఎం అభివాదం కనిపించే ఎత్తులోనే హెలికాప్టర్ వెళుతుందని అధికారులు చెపుతున్నారు. హెలికాప్టర్ దిగకుండానే ఆయన మళ్లీ హైదరాబాద్కు తిరుగు ప్రయాణమై వెళ్లిపోతారు. దీంతో నల్లగొండ జిల్లాలో హరితహారం ప్రారంభ కార్యక్రమం ముగియనుంది. కదంబం కథ ఇది... హరిత హారంలో భాగంగా సీఎం కేసీఆర్ నాటనున్న ఈ మొక్కకు చాలా ప్రాశస్త్యమే ఉందని తెలుస్తోంది. దీనిని రుద్రాక్షాంబ అని, కదంబం అని అంటారు. శాస్త్రీయ నామం ఆంథోసెఫాలస్ చినెన్సిస్.. రూబియేసి కుటుంబానికి చెందిన మొక్క. కాఫీ మొక్క కూడా ఇదే కుటుంబానికి చెందినది. దీంతో ఆ చెట్టు లక్షణాలే దీనికి ఉంటాయి. ఎల్లప్పుడూ ఆకురాల్చని, ఆకుపచ్చగా ఉండే మొక్క ఇది. నీడ కోసం బాగా పెంచుతారు. సామాజిక అడవుల పెంపకానికి అనువైన మొక్క ఇది. దీని పుష్పాలు గుండ్రంగా తుమ్మపూల మాదిరిగా కనిపిస్తాయి. ఈ పుష్పాల నుంచి రకరకాల సుగంధభరిత అత్తర్లు తయారు చేస్తున్నారు. పలు రకాల బొమ్మల తయారీకి కూడా ఈ చెట్టు చెక్క పనికివస్తుంది. భగవద్గీతలో కూడా దీని గురించి ప్రస్తావించారు. రాధాకృష్ణులకు నచ్చే మొక్క ఇది... ఈ చెట్టు నీడలో పరిమళాలను ఆస్వాదిస్తూ వారి ప్రేమాయణం కొనసాగిందని, అందుకే దీనిని హిందువులు పవిత్రమొక్కగా భావిస్తారని సమాచారం. గోపికల చీరలను కృష్ణుడు తీసుకెళ్లి ఈ రుద్రాక్షాంబ చెట్టు మీదే ఉంచినట్టు కూడా మహాభారతంలో ఉందట. ఈ చెట్టు 45 మీటర్ల వరకు పెరిగే అవకాశం ఉంది. ఈ మొక్క పెరిగేందుకు ఓ మోస్తరు నీరే సరిపోతుంది. ఉష్ణ మండల ప్రాంతంలో బాగా పెరిగే లక్షణాలను కలిగి ఉంటుంది.