-
ఉద్యమ వారసత్వమే ఊపిరి
ప్రపంచ చరిత్రలో భారతీయ జాతీయోద్యమం, దాన్ని నిర్వహించిన నాయకత్వం, వారు అనుసరించిన ఎత్తుగడలు, నిర్వహించిన కార్యక్రమాలు అపూర్వమైనవి. వలస పాలనలో కుంగి, కృశించిన సామాన్య ప్రజానీకం ఉద్యమ నాయకత్వం ఇచ్చిన ప్రతి పిలుపునకూ స్పందించిన తీరు దానికి ఓ ముఖ్యమైన పార్శ్వం. అలనాటి జాతీయోద్యమ ప్రధాన వారసత్వం – దేశ సమైక్యత, మతసహనం, భిన్న సంస్కృతుల మధ్య సయోధ్య. జాతీయోద్యమ వారసత్వంలో చెప్పుకోదగిన మరో అంశం – రాజకీయ స్వాతంత్య్రంతో పాటు పౌరహక్కులు. ఇటీవలి కాలంలో ఇవన్నీ ఒత్తిళ్లకు గురవుతున్నాయి. దీన్ని సరిదిద్దాలి. ఆర్థిక ప్రయోగాలతో పాటు లౌకిక సమాజ నిర్మాణం, స్వతంత్ర విదేశాంగ విధానం నేటి అవసరం. స్వాతంత్య్ర అమృతోత్సవ వేళ ఇదే మన లక్ష్యం కావాలి. ► ఒక దేశ చరిత్రలో 75 ఏళ్ళు గణింపదగ్గ కాలమే! ఇదొక ఉద్విగ్నభరిత సన్నివేశం. మన స్థితిగతులు, దేశ పరిస్థితులు ఎలా ఉన్నా, వాటిని పక్కనబెట్టి, సంబరాలు చేసుకోవలసిన సమయం. అదేక్రమంలో మనం అనుభవిస్తున్న స్వాతంత్య్రం వెనుక ఒక సుదీర్ఘ పోరాటం దాని ఆశయాలు, ఆకాంక్షలు ఉన్నాయి. ప్రపంచ చరిత్రలోనే భారతీయ జాతీయోద్యమం, దాన్ని నిర్వహించిన నాయకత్వం, వారు అనుసరించిన ఎత్తుగడలు, నిర్వహించిన కార్యక్రమాలు అపూర్వమైనవి. అవి అందరి ప్రశంసలూ అందుకొన్నాయి. నాయకత్వం రూపొందించిన కార్యక్రమాలు, నిర్వహించిన ఉద్యమాలు, అనుసరించిన ఎత్తుగడలు ఒక పార్శ్వం. ► కాగా, మరొకవైపు వలస పాలనలో కుంగి, కృశించి, దినదిన గండంగా కాలం వెళ్ళదీస్తున్న సామాన్య ప్రజానీకం – అక్షరం ముక్క తెలియని గ్రామీణ ప్రజలు – ఉద్యమ నాయకత్వం ఇచ్చిన ప్రతి పిలుపుకూ స్పందించిన తీరు మరో ముఖ్య పార్శ్వం. బెంగాల్ విభజన, సహాయ నిరాకరణోద్యమం, బార్డోలీ రైతు సత్యాగ్రహం, క్విట్ ఇండియా – ఇలా అన్ని దశల్లోనూ, అన్ని పోరాటాల్లోనూ పురుషులతో పాటు స్త్రీలూ పాల్గొని ఉద్యమాలను నడిపించారు. పోరాటాలు, త్యాగాలు ఎందుకోసం? ఉజ్వల భవిష్యత్తు కోసం! స్వతంత్ర జాతిగా ఆత్మ గౌరవంతో బతకడం కోసం! రానున్న భవిష్యత్తు తరాలకు బంగారు బాటలు వేయడం కోసం! ► జాతీయోద్యమ వారసత్వం ఏమిటి? ఆ వారసత్వానికి నేడు ప్రాసంగికత (రిలవెన్స్) ఉందా? ఆంగ్లపాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాల్లో ముఖ్యంగా, ప్రధానంగా చెప్పుకోవాల్సింది 1857 తిరుగుబాటు. చరిత్రకారులు వర్ణించినట్లు... ఇది ‘ఫస్ట్ వార్ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్’. ప్రథమ భారత స్వాతంత్య్ర సంగ్రామం. జాతీయతాభావం ఎక్కడో మసక మసకగా అంతర్లీనంగా ఉన్నా, ఇది ప్రధానంగా ఆంగ్లపాలనకు వ్యతిరేకంగా జరిగిన చరిత్రాత్మక తిరుగుబాటు. హిందూ, ముస్లిం మత విభేదాలు లేకుండా, కలసికట్టుగా, అనేక సందర్భాల్లో సామాన్య ప్రజానీకంతో కలిసి జరిపిన సైనిక తిరుగుబాటు. ఇది ఫలవంతం కాకున్నా మనకు మిగిల్చిన వారసత్వం – ఆంగ్ల పాలనకు వ్యతిరేకత, స్వతంత్రత, వీటిని మించి హిందూ–ముస్లిం ఐక్యత! జాతీయోద్యమంలో ఈ ధార దాదాపు 1940వ దశకం దాకా కొనసాగింది. ► రవీంద్రుని ‘జనగణమన’ గీతం, బంకించంద్రుని ‘వందేమాతరం’, ఇక్బాల్ గేయం ‘సారే జహాసే అచ్ఛా’ – ఇవి దేశ నైసర్గిక, ప్రజా సముదాయాలను ఉద్దేశించి రాసినవే! ఈ సమైక్యతను దెబ్బతీయడానికి విదేశీ పాలకులు ‘ద్విజాతి’ సిద్ధాంతాన్ని ప్రతిపాదించి, ప్రోది చేశారు. జాతీయోద్యమ ప్రధాన వారసత్వం – దేశ సమైక్యత, మతసహనం, భిన్న సంస్కృతుల మధ్య సయోధ్య. జాతీయోద్యమ క్రమంలో పౌరహక్కులను, ప్రజాస్వామిక భావాలను, పార్లమెంటరీ వ్యవస్థను నిర్ద్వంద్వంగా బలపరిచి, పదిలపరచి, భారత రాజ్యాంగంలో పొందుపరచగలిగిందీ జాతీయోద్యమ వారసత్వమే! ► జాతీయోద్యమం కేవలం రాజకీయ స్వాతంత్య్రం, వ్యక్తిపర ప్రాథమిక హక్కుల కోసమే పాటుపడలేదు. ఆర్థికాభివృద్ధి వైపు దృష్టి సారించింది. ఆంగ్లపాలన... ఒకవైపు తాను పారిశ్రామికంగా బలపడుతూ, మరో పార్శ్వంలో భారతదేశ ఆర్థిక వ్యవస్థను తమ దేశ ఆర్థిక పురోభివృద్ధికి ఉపయోగించుకుంది. ఈ అంశాన్ని ‘సంపద తరలింపు’గా సిద్ధాంతీకరించాడు దాదాభాయ్ నౌరోజీ. జాతీయ నాయకత్వం దీన్ని గ్రహించి, అది భారతీయ ఆర్థిక వ్యవస్థకు చేస్తున్న కీడును ప్రజలకు ఎరుకపరిచింది. వాస్తవంలో వలసపాలన ఆర్థికదోపిడీని బట్టబయలు చేసింది తొలితరం జాతీయోద్యమ నాయకులే! ఆధునిక యంత్ర పరిశ్రమల ప్రాధాన్యాన్ని గుర్తించి, అవి రాజ్య(స్టేట్) పరిధిలో ఉండి ప్రజల అభ్యున్నతికి తోడ్పడాలని ఉద్ఘాటించారు. ► జాతీయోద్యమం ప్రారంభదశ నుండి పౌరహక్కుల సంరక్షణ కోసం పోరాడుతూ వచ్చింది. లోకమాన్య తిలక్ నిర్వహించిన ఆంగ్ల వ్యతిరేక సమీకరణలు (మహారాష్ట్రలో), ఆ తర్వాత జరిగిన విదేశీ వస్తు బహిష్కరణ, సహాయ నిరాకరణ ఉద్యమాలు భారతీయుల్లో దేశభక్తి, స్వేచ్ఛ, స్వాతంత్య్రాలను ప్రోదిచేశాయి. పౌరహక్కుల పరిరక్షణకు వాక్, పత్రికా స్వాతంత్య్రాలు జాతీయోద్యమంలో ప్రధాన భాగాలు. గాంధీజీ మాటల్లో, ‘‘సివిల్ లిబర్టీ... ఈజ్ ద ఫస్ట్ స్టెప్ టువార్డ్స్ స్వరాజ్. ఇటీజ్ వాటర్ ఆఫ్ లైఫ్. ఐ హ్యావ్ నెవర్ హర్డ్ ఆఫ్ వాటర్ బీయింగ్ డైల్యూటెడ్.’’ ► జాతీయోద్యమమనేది ప్రారంభంలో సమాజంలోని శిష్టులకే (ఎలైట్స్కే) పరిమితమైనా, ఆ తర్వాత సహాయ నిరాకరణ ఉద్యమానికి (1920–21) పూర్వమే విస్తృత ప్రజాపోరాటంగా రూపుదిద్దుకుంది. సహాయ నిరాకరణ, గ్రామ పునర్నిర్మాణం, మద్యపాన నిషేధం, కుటీర పరిశ్రమల పెంపుదల – ఇవన్నీ మహాత్ముడు ఆరంభించిన ప్రజా కార్యక్రమాలు. ఇవి సామాన్య ప్రజానీకాన్ని – స్త్రీ, పురుషులను ఉద్యమ భాగస్వాములుగా చేశాయి. ఈ ధోరణి ‘క్విట్ ఇండియా’ ఉద్యమం (1942)తో పరాకాష్ఠకు చేరుకొంది. ఉద్యమాలు నాయకులు ప్రారంభించినా, వాటిని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళిందీ, ఊపిరులూదిందీ సామాన్య ప్రజానీకమే! జాతీయోద్యమ వారసత్వంలో గ్రహించాల్సిన ప్రధాన అంశం ఇదే! దీనికి ప్రబల ఉదాహరణ – సర్దార్ వల్లభాయ్ పటేల్ నిర్వహించిన ‘బార్డోలీ రైతు సత్యాగ్రహం’. పటేల్ పిలుపునందుకొని లక్షలాది స్త్రీ, పురుషులు, రైతులు ఉద్యమాన్ని విజయవంతం చేశారు. ప్రజలే ఉద్యమానికి ఊపిరులు! ► జాతీయోద్యమ వారసత్వంలో ప్రధానంగా చెప్పుకోదగింది – రాజకీయ స్వాతంత్య్రంతో పాటు పౌరహక్కులు. ఇటీవలి కాలంలో ఇవి ఒత్తిళ్లకు గురవుతున్నాయి. ప్రజాఉద్యమాలు, వార్తాసాధనాలు వీటిని కాపాడుకొంటూ వస్తున్నాయి. జాతీయోద్యమ స్వప్నం భావితరాలకు అందించిన సందేశం, చూపిన దారి ఏమిటి? ఉద్యమ ఆశయాలు, కన్న కలలు, రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులుగా పొందుపరచబడ్డాయి. ఇవి చట్టపరమైనహక్కులు. వీటికి భంగం కలగకూడదు. కానీ, ఇవి ఇటీవలి కాలంలో ప్రశ్నార్థకమవుతున్నాయి. కాగా రాజ్యాంగంలో మరో ముఖ్య అధికరణం – రాజ్యం అనుసరించదగ్గ ‘ఆదేశిక సూత్రాలు’(ప్రిన్సిపుల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ). ప్రజా శ్రేయస్సుపరంగా ఆచరింపదగ్గవి. అయితే, ఇవి ఆశించే ఫలితాలు చేకూరతాయా? ఈ ప్రశ్నకు సమాధానం – విశాల భారతీయ సమాజం స్పందించి, చేపట్టే కార్యాచరణపై ఆధారపడి ఉంటుంది. ► జాతీయోద్యమ వారసత్వం... ప్రజాశ్రేయస్సు – పేద వర్గాల అభ్యున్నతి, శాస్త్రీయ విజ్ఞానసమాజ నిర్మాణం, పౌరహక్కులు, చట్టం ముందు అందరూ సమానం! వీటిని సాధించే క్రమంలో ఆర్థిక ప్రయోగాలతో పాటు లౌకిక సమాజ నిర్మాణం, స్వతంత్ర విదేశాంగ విధానం అవలంబించడం నేటి అవసరం. భారతీయ సంస్కృతిని ‘భిన్నత్వంలో ఏకత్వం’గా చెప్పుకుంటాం. ఇటీవలి కాలంలో దేశంలో వేగంగా మారుతున్న రాజకీయ, ఆర్థిక పరిణామాల దృష్ట్యా... దేశీయతలో ఏకత్వం లోపించి, భిన్నత్వం మరింత వృద్ధి చెందుతోంది. ప్రాంతీయ రాజకీయ పక్షాలు ఆయాప్రాంతాల్లో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల వల్ల ఉత్పన్నమై, రాజ్యస్వభావంలో మౌలిక మార్పులకు దోహదం చేస్తున్నాయి. ► ఈ పరిణామం భారత దేశీయతకు అడ్డు కాదు. భిన్నత్వంలో ఏకత్వాన్ని గూర్చి పరిగణిస్తూనే, మారుతున్న పరిస్థితుల దృష్ట్యా భిన్నత్వాన్ని గుర్తించి దానికి తగిన చోటును మనం కల్పించుకోవాలి. అలా చేసినప్పుడు భారతదేశ సమైక్యత, జాతీయత మరింతగా వృద్ధి చెందుతాయి. జాతీయోద్యమ బృహత్ ప్రణాళికలో లక్ష్యాలైన పేదరిక, నిరక్షరాస్యత నిర్మూలన ఇంకా అపరిష్కృత సమస్యలుగానే ఉండిపోయాయి. నిజానికి ఇవే మన దేశీయతకు భంగం కలిగించే ముఖ్యాంశాలు. వీటిని అధిగమించగలిగితే మనం భారతీయతను సాధించగలం. స్వాతంత్య్ర అమృతోత్సవ వేళ ఇదే మన లక్ష్యంగా ఉండాలి. డా‘‘ వకుళాభరణం రామకృష్ణ వ్యాసకర్త చరిత్ర పరిశోధకులు, ఆచార్యులు -
జైహింద్ స్పెషల్: చంద్రయ్య, జగ్గయ్య.. రంపలో రఫ్ఫాడించారు..
‘‘భారత స్వాతంత్య్ర సంగ్రామంలో అమరులైన వారి వివరాలతో కూడిన ఒక నిఘంటువు తయారు కావాలి. దేశ చరిత్రలో ఒక ముఖ్య భాగమైన వారిని గురించి లేదా చరిత్రను సృష్టించిన వారిని స్మరించుకోని, గౌరవించుకోని దేశానికి భద్రమైన భవిష్యత్తు ఉండదు’’ అని ప్రధాని నరేంద్ర మోడీ ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ కార్యక్రమాల ఆరంభ సందర్భంలో అన్నారు. స్వాతంత్య్ర ఉద్యమ వీర ఘట్టాలను, స్వాతంత్య్ర సమరయోధుల అసమాన ధైర్య సాహసాలను స్మరించుకోవాలి, అలాంటి విలువలను పెంపొందించుకోవాలి. మన స్వాతంత్య్ర ఉద్యమ పోరాటంలో భాగస్వాములైన ఆదివాసీ నాయకుల అసమాన ధైర్య సాహసాలను సైతం స్మరించుకొంటూ భవిష్యత్ తరాలకు స్ఫూర్తిని నింపాలి. అడవి బిడ్డలపై బ్రిటిష్ దౌర్జన్యం తూర్పు గోదావరి, ఖమ్మం, విశాఖ జిల్లాలలో మన్యం అటవీ ప్రాంతం విస్తరించి వుంది. అక్కడ సాగు చేసుకుంటున్న రైతులను ముఠాదార్లు, భూస్వాములూ, జమీందార్లూ, బ్రిటిష్ ప్రభుత్వం దౌర్జన్యంగా, పోడు వ్యవసాయం చేయరాదని, అటవీ వస్తువులను సేకరించరాదనీ, అడవి జంతువులను వేటాడరాదనీ, కాయలూ, పండ్లూ, కట్టెలూ ఏరుకోరాదనీ అటవీ చట్టం అమలు చేసింది ఎవరైనా వీటిని అతిక్రమిస్తే శిక్షార్హులని హెచ్చరించింది. అడవిని ఆధారంగా చేసుకుని బ్రతికే అడవి బిడ్డలు అమాయకులు. ఎక్కడికి పోగలరు? ఎలా బ్రతకగలరు? వీరిని దౌర్జన్యంగా అణగతొక్కుతూ పంటలను దోచుకుంటూ ఉండేవారు. దానితో అన్ని విధాలా విసిగిపోయి.. నాటి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా 1879 లో ద్వారబంధాల చంద్రయ్య లేదా చంద్రారెడ్డి నాయకత్వం లో ఆదివాసీలు తిరుగుబాటు చేశారు. ఆ తిరుగుబాటును బ్రిటిష్ అధికారులు ‘రంపా పితూరీ‘ ఉద్యమం అని పిలిచారు. అడుగో... చంద్రయ్య! ద్వారబంధాల లక్ష్మయ్య, లక్ష్మమ్మల కుమారుడే ద్వారబంధాల చంద్రారెడ్డి లేక ద్వారబంధాల చంద్రయ్య, తూర్పు గోదావరి జిల్లా శంఖవరం మండలం, నెల్లిపూడిలో తన మేనమామల ఇంట పెరిగాడు. ఆరు అడుగుల ఆజానుబాహువు, తేనె రంగు శరీర ఛాయ, ఉంగరాల జుత్తూ, వెనక జులపాలు కలిగి గుర్రంపై తుపాకీతో కూర్చుని వీపుమీద కత్తి, మొలలో బాకు, చేతిలో గండ్ర గొడ్డలితో సంచారం చేసేవాడు. ఖమ్మం జిల్లాలోని భద్రాచలం, రేఖపల్లి నుండి విశాఖపట్నం జిల్లాలోని గొలుగొండ ప్రాంతం వరకూ తన ఆధిపత్యంలో ఉండేది. ఈయనకు సహచరులుగా పులిచింత సాంబయ్య, బాదులూరి అంబుల్రెడ్డి, ఎలుగూరి జగ్గయ్య, జంపా పండయ్య, కోడుం నరసయ్యలు ఉండేవారు. వారి సహాయంతో చంద్రయ్య పెద్ద సైన్యాన్ని తయారు చేశాడు. నాటి బ్రిటిష్ అధికారులలో గిరిజన ఆడపిల్లల పై అత్యాచారం చేసిన వారి తలలు తెగనరికేవాడు. బ్రిటిష్ వారికి దొరక్కుండా ముప్పుతిప్పలు పెడుతూ అడవి లో దాక్కునేవాడు. 1879 ఏప్రిల్ లో అడ్డతీగల పోలీస్ స్టేషన్ ను ధ్వంసం చేసి అక్కడి నుండి అనేక ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాడు. అయితే అదే సంవత్సరం నవంబర్ లో ఇతని అనుచరులను 79మందిని అత్యంత నేర్పుతో వలపన్ని పట్టుకుని ‘విల్లాక్‘ అనే పోలీసు అధికారి ఉరి తీయించాడు. అప్పటికే లాగరాయి కేంద్రంగా దుచ్ఛేర్తి దగ్గర ద్వారబంధాల చంద్రయ్య తిరుగుబాటు చేస్తున్నాడు. ఈ గొడవలన్నీ చూశాక సైన్యాన్ని రప్పించాలని ప్రయత్నాలు మొదలయ్యాయి. సెంట్రల్ ప్రావిన్స్ నుండి ‘కల్నల్ లోబ్’ నాయకత్వం లో పోలీసు బలగాలు వచ్చాయి. పిఠాపురం సంస్థానం నుంచి 500 మంది గైడ్లను దింపారు. ద్వారబంధాల చంద్రయ్యను పట్టించిన వారికి 2000 రూపాయలు బహుమానం ప్రకటించారు. బ్రిటిష్ వారు తనకు నమ్మకస్థుడు, అనుయాయుడుగానున్న జంపా పండయ్యను ఉసిగొల్పితే, 1880 ఫిబ్రవరి 12న గుర్తేడు లో అతడు చంద్రయ్యను పట్టించాడు. ద్వారబంధాల చంద్రయ్యను కాల్చి చంపారు. అయినా రంపా పితూరీ (ఉద్యమం) ఆగలేదు. ఆ ఉద్యమాన్ని ఎలుగూరి జగ్గయ్య కొనసాగించాడు. అడుగడుగో.. జగ్గయ్య! ఎలుగూరి జగ్గయ్య తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం మండలం వెడ్ల గెడ్డ వాసి. 1879 లో ద్వారబంధాల చంద్రయ్యకు కుడిభుజంగా పని చేశాడు. ఇతను అడవి పక్షులను, జంతువులను వేటాడి తన పొట్ట పోసుకునేవాడు. అడవి పక్షులను చంపడం నేరమని అలా చేస్తే శిక్షార్హమవుతుందని అధికారులు హెచ్చరించారు. పైగా అతనిపై వేటకు వెళ్లకుండా నిఘా పెట్టారు బ్రిటిష్ వారు. తద్వారా తన జీవనోపాధిని కోల్పోయాడు. ద్వారబంధాల చంద్రయ్య తో కలసి పోరాటం ప్రారంభించాడు. అడ్డతీగల పోలీస్ స్టేషన్ ను రెండు సార్లు తగలబెట్టడానికి మూలకారకుడు ఎలుగూరి జగ్గయ్యే. ఈయన్ని పట్టుకోవడానికి ఇన్స్పెక్టర్ ఎంగ్లిడో ను నియమించారు బ్రిటిష్ వారు. జడ్డంగిలో క్యాంపు ను ఏర్పాటు చేసుకుని ప్రణాళికలు రచించారు. ఎలుగూరి జగ్గయ్య ఆచూకీ చెప్పిన వారికి 2000 రూపాయల బహుమానం ప్రకటించి ‘కొటుమ్ నరసయ్య‘ అనే తన అనుచరుడికి డబ్బుపై ఆశ చూపారు, ఎన్నో కానుకలు ఇచ్చారు. ఎలుగూరి జగ్గయ్య వెలగలపాలెం అడవిలో దాక్కున్న సంగతి నరసయ్యకు తప్ప మరెవ్వరికీ తెలియదు. డబ్బుకు ఆశపడి వెలగలపాలెం ఎలా వెళ్లాలో మార్గం కూడా చెప్పాడు కొటుమ్ నరసయ్య. కొటుమ్ నరసయ్య ఇచ్చిన ప్రణాళిక ప్రకారం ఇన్స్పెక్టర్ ఎంగ్లిడో 10 మంది శిక్షణ పొందిన కానిస్టేబుల్స్ను తీసుకుని వెలగలపాలెం లో తిరుగుబాటుదారులు దాక్కున్న స్థావరానికి నేరుగానే వెళ్లి చుట్టుముట్టాడు. అక్టోబర్ 31, 1880 సరిగ్గా సాయంత్రం నాలుగు గంటలకు ఎలుగూరి జగ్గయ్యను కాల్చగా అది సరిగ్గా బొడ్డు కింద భాగంలో తగిలింది, పారిపోవాల నుకున్నాడు. ఓ 100 గజాలు పరుగెత్తి కింద పడిపోయాడు. కొన ఊపిరితో ఉన్న అతన్ని ఓ పెద్ద కర్రకు కట్టి తమ ‘జడ్డంగి క్యాంపు‘ కు తీసుకు వస్తూండగా దారిలోనే చనిపోయాడు. ఇలా ఎందరో అడవి బిడ్డలు తమ ప్రాణాలను తృణప్రాయంగా దేశం కోసం త్యాగం చేశారు. జాతీయోద్యమంలో సైతం ఆటవికులు చురుగ్గా పాల్గొని తమ దేశభక్తి ని చాటుకున్నారు. స్వాతంత్య్రం కొరకు, మాతృదేశ దాస్య విముక్తికై పోరాడి అసువులు బాసారు. – కాశింశెట్టి సత్యనారాయణ విశ్రాంత ఆచార్యుడు -
ఉద్యమశీల కార్యకర్త.. రామ్ మనోహర్ లోహియా
లోహియా కులాంతర వివాహాలయితేనే∙ఏ పెళ్లికయినా వెళ్లేవారు. విడాకులను సమర్థించారు. ఆస్తికి ఆయన వ్యతిరేకి. దానిని ఆచరణలో చూపించారు కూడా. ఆయన హరిజన దేవాలయాలకూ వెళ్లారు. జాతికి కొత్త జవ జీవాలను తీసుకురావడానికి ఆయన తాను చేయగలిగిందంతా చేశారు. ఆయన తన యాభై ఏడేళ్ల జీవితంలో మొత్తం ఇరవై సార్లు అరెస్టు అయినట్లు ఎక్కడో చదివాను. చదవండి: ఉక్కు మహిళకు తగిన మహిళ.. కిరణ్ బేడి లోహియా ఢిల్లీ వార్తాపత్రికలకు పెద్ద పెద్ద ఆదర్శాలతో వ్యాసాలు రాయడానికే పరిమితం కాలేదు. పేదల కోసం తన పోరాటాన్ని స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా కొనసాగించారు. బహుశా అందుకే కావచ్చు మొత్తం 20 అరెస్టుల్లో 12 అరెస్టులు స్వాతంత్య్రం వచ్చాకే జరిగాయి! ఆయన బాగా చదువుకున్న, బాగా పర్యటనలు చేసిన రాజకీయ నాయకుడు. డాక్టర్ లోహియా అనే పేరులోని డాక్టర్ అనే మాట ఆయన చేసిన పరిశోధనలకు లభించింది. బెర్లిన్ నుంచి ఎకనామిక్స్లో ఆయనకు డాక్టరేట్ లభించింది. అప్పుడు ఆయన వయసు 23 ఏళ్లు. పరిశోధనను జర్మనీ భాషలో చేశారు. బ్రిటన్లో చదువుకోడానికి ఆయన ఆసక్తి చూపలేదు. కులం, మతం, జాతి, రాజకీయాలు, సంగీతం, కళలు, అర్థశాస్త్రం, రాజ్యాంగం, న్యాయశాస్త్రం, సాహిత్యం వంటి అంశాలను సమదృష్టితో పరిశీలించి, విమర్శించారు. ఆయన ఢిల్లీలోని రాకబ్గంజ్లో ఉన్న తన ఇంటి తలుపులను అందరికీ ఎప్పుడూ తెరిచే ఉంచేవారు. ఎవరైనా ఎప్పుడైనా వచ్చి తన మాట్లాడవచ్చు. మా నాన్నగారు, కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీలో ఆయనకు సహచరుడు. ఆయన తరచు లోహియా ఇంటికి వెళుతుండేవారు. లోహియా హిందీ, ఉర్దూ, బెంగాలీ, ఫ్రెంచ్, జర్మన్ భాషల్లో అనర్ఘళంగా మాట్లాడుతుండేవారు. ఇంగ్లిషు మీద ఆయన పోరాటం సాగించినప్పటికీ, ఆ భాషలో కూడా నిష్ణాతుడే. ‘‘ప్రపంచంలో ఎక్కడ చూసినా చిన్న, పెద్ద మనుషుల మధ్య అసమానతలు ఉంటూనే ఉన్నాయి. అయితే భారతదేశంలో ఈ అంతరం మరీ దుర్భరంగా ఉంటోంది’’ అని ఆయన ఆవేదన చెందేవారు. ఆయన బతికి ఉంటే ఇప్పుడు కూడా జైల్లోనే ఉండేవారేమో. – నిరంజన్ రామకృష్ణ, లోహియా వెబ్సైట్ రూపకర్త -
గాందీజీ అంటే నాకు ఎంతో గౌరవం: ఎంపీ హెగ్డే
-
గాంధీజీపై బీజేపీ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు
బనశంకరి : వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలిచే బీజేపీ ఎంపీ అనంతకుమార్ హెగ్డే శనివారం మహాత్మాగాంధీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సత్యాగ్రహం చేసి దేశానికి స్వాతంత్ర్యం తీసుకువచ్చారని, ఇలాంటి వ్యక్తి దేశానికి మహా పురుషుడా..? అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శనివారం బెంగుళూరులో జరిగిన ఓ కార్యక్రమంలో అనంతకుమార్ హెగ్డే మాట్లాడుతూ.. ఎవరు దేశం కోసం ఆయుధాలు పట్టుకుని పోరాటం చేశారో వారందరూ ఉరికి వేలాడారని, ఎవరు తమ సిద్ధాంతాలు, వాదనలతో దేశ నిర్మాణం కోసం ప్రయత్నించారో వారందరూ చీకటి గదుల్లో మగ్గిపోయారని అన్నారు. ఎవరు బ్రిటీషు వారితో ఒప్పందం కుదుర్చుకుని స్వాతంత్య్రం కోసం పోరాడుతున్నారని సర్టిఫికెట్ తీసుకున్నారో వారందరూ నేటి చరిత్ర పుటల్లో విరాజిల్లుతున్నారని చెప్పారు. ఇదంతా దేశం చేసుకున్న దైర్భాగ్యం అంటూ గాంధీని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. స్వాతంత్య్ర పోరాటంలో మూడు వర్గాలు ఉండేవని, ఒకరు విప్లవకారులు, మరొకరు ఆయుధాలు పట్టుకున్నవారు, మరో వర్గం ప్రముఖ జాతీయవాదులని తెలిపారు. బెంగుళూరు హిందుత్వ రాజధాని కావాలని, ప్రపంచాన్ని హిందుత్వంగా మార్చడానికి ప్రణాళికలు రూపొందించాలన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement