టెండర్ల మాయాజాలం
గిట్టుబాటు ధర లభిస్తుందన్న ఆశతో కష్టనష్టాలకోడ్చి తాము పండించిన పత్తిని హాలియా మార్కెట్కు తీసుకువస్తున్న రైతన్నకు నిరాశే మిగులుతోంది. మద్దతు ధర లభించకపోగా.. తరుగు, హమాలీ తదితర కారణాలతో కోత పెడుతుండటం వారిని అయోమయానికి గురి చేస్తోంది. అధికారులు మామూళ్లు పుచ్చుకుంటూ కిమ్మనకపోవడం వల్లే ట్రేడర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి.
మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్కు హాలియాతో పాటు వివిధ మండలాల నుంచి రైతులు తాము పండించిన పంటలను విక్రయానికి తెస్తుంటారు. రైతులు తీరా ఇక్కడి కి వచ్చిన తర్వాత ట్రేడర్ల దయాదాక్షిణ్యాలపై ఆధారపడక తప్పడం లేదు. మార్కెట్లో సీసీఐ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయకపోవడం కూడా వ్యాపారులకు వరంగా మారింది. దీంతో వారు ప్రభుత్వ ధర కాకుండా తమ ఇష్టం వచ్చిన రేట్ నిర్ణయిస్తూ రైతుల నెత్తిన శఠగో పం పెడుతున్నారు. అంతేకాకుండా మార్కెట్ కు వచ్చిన పత్తి క్వింటాల్కు 2కిలోల(ఇప్పటి ధరలో *80నుంచి *100) చొప్పున తరుగు తీస్తూ మోసానికి పాల్పడుతున్నారని తెలుస్తోం ది. అదే విదంగా క్వింటాల్కు రూ.60 చొప్పున హమాలీ పేరుతో కట్ చేస్తున్నారని రైతులు ఆ రోపిస్తున్నారు. రైతులకు అండగా నిలాల్సిన అధికారులు సైతం ట్రేడర్లకే వత్తాసు పలకడం గమనార్హం.
ఇదీ పరిస్థితి
రాష్ట్ర వ్యాప్తంగా ఏ వ్యవసాయ మార్కెట్కు వెళ్లినా క్వింటాల్ పత్తి తొక్కినందుకు రూ. 10నుంచి రూ.20వరకు వసూలు చేస్తారు. కానీ హాలియా వ్యవసాయ మార్కెట్లో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. పత్తిని బస్తాలో తొక్కడంతో పాటు తూకం వేసినందుకు, లారీకి ఎత్తినందుకు హమాలీ పేరుతో రూ.60 రైతు వద్ద కట్ చేస్తున్నారు. వాస్తవానికి రైతు మార్కెట్కు తెచ్చిన పత్తిని వేలం వేసిన అనంతరం తూకం వేసి, ఎత్తినందుకే హమాలీ కట్ చేయాలి. కానీ, ఇక్కడి వ్యాపారులు మాత్రం పత్తిని లారీలోకి ఎత్తినందుకు కూడా క్వింటాల్కు రూ.30 చొప్పున కోత పెడుతున్నారు. ట్రేడర్లు చెల్లించాల్సిన హమాలీని కూడా రైతు నుంచే వసూలు చేస్తుం డటం, సిండికేట్గా మారి గిట్టుబాటు ధర చెల్లించకుండా అన్యాయం చేస్తున్నారు.