breaking news
Hajj Committee
-
దరఖాస్తు చేస్తే చాలు.. హజ్ యాత్రకు..
సాక్షి, హైదరాబాద్: హజ్ కమిటీ చరిత్రలో తొలిసారి దరఖాస్తు చేసుకున్న వారందరికీ హజ్ యాత్రకు వెళ్లే అవకాశం దక్కింది. తొలిసారి రాష్ట్రం నుంచి దాదాపు 10 వేల మంది యాత్రికులు 2025 హజ్ యాత్రకు వెళ్లనున్నట్టు రాష్ట్ర హజ్ కమిటీ ఈవో లియాకత్ హుస్సేన్ వెల్లడించారు. ఏటా గరిష్టంగా 6 నుంచి 7 వేల మందికే యాత్రకు అవకాశం దక్కేది. గతంలో దరఖాస్తు చేసుకున్న వారిలో కేవలం 40–50 శాతం మందికే యాత్రకు వెళ్లే అవకాశం లభించేది. కానీ ఈసారి రాష్ట్ర హజ్ యాత్ర కోటా పెరగడం.. దరఖాస్తులు తక్కువగా రావడంతో యాత్రకు వెళ్లే అవకాశం అందరికీ దక్కింది. ఈ ఏడాది 10 వేల వరకు దరఖాస్తులు వచ్చాయి. వీటిలో ఇప్పటికే 8,500 మంది యాత్రకు ఎంపికయ్యారు. మిగతా 1,500 మంది మరో 2–3 నెలల్లో ఎంపికవుతారని రాష్ట్ర హజ్ కమిటీ అధికారులు తెలిపారు. ఈ ఏడాది 2024 హజ్ యాత్రకు 11 వేల దరఖాస్తులు రాగా.. ఇందులో రాష్ట్రం నుంచి 7,500 మందికి మాత్రమే యాత్రకు వెళ్లే అవకాశం దక్కింది. 2025కు కేంద్ర హజ్ కమిటీ.. రాష్ట్ర హజ్ యాత్రికుల కోటా పెంచడంతో వెయ్యి దరఖాస్తులు తగ్గాయి. వచ్చే ఏడాది జూన్ 4వ తేదీ నుంచి 9వ తేదీ వరకు హజ్ యాత్ర కొనసాగనుంది. యాత్రకు నెల రోజుల ముందు నుంచే.. నగరం నుంచి హజ్ కమిటీ ద్వారా ప్రయాణం ప్రారంభం కానుందని లియాకత్ హుస్సేన్ చెప్పారు. -
హజ్ యాత్రకు జూన్ 7న తొలి విమానం
సాక్షి, అమరావతి: ఏపీకి చెందిన హజ్ యాత్రికులు ఈసారి విజయవాడ (గన్నవరం) విమానాశ్రయం నుంచి ప్రయాణం ప్రారంభించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో చేసిన కృషి ఫలించడంతో విజయవాడలో ఎంబార్కేషన్ పాయింట్ ఏర్పాటైంది. దీంతో హజ్ యాత్రకు శ్రీకారం చుడుతూ జూన్ 7 న విజయవాడ నుంచి తొలి విమానం ఎగరనుంది. రోజుకు 155 మంది హజీలు విజయవాడ నుంచి వెళ్లనున్నారు. ఒక్కో బృందం 41 రోజుల పాటు హజ్ యాత్రను చేపట్టనుంది. ఏపీ నుంచి హజ్ యాత్రకు 2,116 మంది ఎంపికవ్వగా వీరిలో 1,115 మంది పురుషులు..1,001 మంది మహిళలున్నారు. కాగా, విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ నుంచి 1,814 మంది వెళ్తున్నారు. అనంతపురం, చిత్తూరు, వైఎస్సార్ కడప, కర్నూలు, శ్రీసత్యసాయి, అన్నమయ్య జిల్లాలకు చెందిన హజీలు బెంగళూరు నుంచి వెళతారు. కృష్ణా, గుంటూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్సార్ కడప తదితర జిల్లాలకు చెందిన వారు హైదరాబాద్ నుంచి వెళ్లనున్నారు. హజ్ యాత్రను విజయవంతం చేసేలా ఏపీ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఏపీ హజ్ కమిటీ ఆధ్వర్యంలో వ్యాక్సినేషన్ పూర్తి చేసి యాత్రకు మార్గదర్శకాలను హజీలకు అందజేసింది. విజయవాడ–గుంటూరు ఎన్హెచ్లోని నంబూరు వద్ద మదరసాలో బస ఏర్పాట్లు చేసి భోజన, వసతి, రవాణా వంటి విభాగాల వారీగా కమిటీలను వేసి యాత్ర విజయవంతానికి ఏర్పాట్లు పూర్తి చేసింది. ఒక్కో హజీకి రూ.3.8 లక్షల ఖర్చు హజ్–2023కు దేశంలో 22 ఎంబార్కేషన్ పాయింట్లు ఉండగా వాటి నుంచి వెళ్లే హజీలు ఒక్కొక్కరికి ఎంత ఖర్చు అవుతుందన్నది కేంద్ర హజ్ కమిటీ నిర్ణయించింది. వాటిలో బెంగళూరు, ముంబై, హైదరాబాద్ల నుంచి వెళ్లే వారికే తక్కువ ఖర్చు కానుంది. వాటితో పోల్చితే విజయవాడతో పాటు మరో 9 ఎంబార్కేషన్ పాయింట్ల నుంచి వెళ్లేవారిపై అదనపు భారం పడుతోంది. కాగా, ఒక్కొక్క హజీకి విజయవాడ నుంచి రూ.3,88,580 గా ఖర్చును కేంద్ర హజ్ కమిటీ నిర్ణయించింది. ఏపీ నుంచి హజ్ యాత్రకు వెళ్లేవారిపై పడుతోన్న అదనపు భారాన్ని ప్రభుత్వమే భరించడంతో ముస్లింలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సమస్య తెలిసిన వెంటనే సీఎం జగన్ ఆదేశాలతో ఉపముఖ్యమంత్రి అంజాద్బాషా, హజ్ కమిటీ చైర్మన్ గౌస్ అజామ్లు కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి స్మృతిఇరానీ, కేంద్ర హజ్ కమిటీని సంప్రదించారు. విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ నుంచి వెళ్లే వారిపై అదనపు భారం తగ్గించే పరిస్థితి లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వమే హజీలపై పడుతోన్న అదనపు ఖర్చుల భారం రూ.14.51 కోట్లను విడుదల చేసింది. -
విజయవాడ నుంచి హజ్ యాత్రకు అనుమతించాలి
సాక్షి, అమరావతి: విజయవాడ (గన్నవరం) అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి హజ్ యాత్రకు అనుమతించాలని కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి స్మృతి ఇరానీకి ఏపీ హజ్ కమిటీ చైర్మన్ బద్వేల్ షేక్ గౌసల్ ఆజామ్ విజ్ఞప్తి చేశారు. కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో శనివారం ఢిల్లీలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ విజయవాడ నుంచి అంతర్జాతీయ విమానాల రాకపోకలు తిరిగి ప్రారంభమయ్యాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ నుంచి 2023లో హజ్యాత్రకు వెళ్లేవారిని విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి పంపేందుకు వీలుగా పాయింట్ను ప్రకటించాలని కోరారు. హజ్ యాత్రకు నెల ముందుగా ఏపీ హజ్ కమిటీ నుంచి ఒక అధికారిక బృందం మక్కా, మదీనా నగరాలకు వెళ్లి అక్కడి వసతిగృహాల్లో యాత్రికులకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేసేలా సౌదీ ప్రభుత్వ అనుమతిని ఇప్పించాలని కోరారు. ఏపీ హజ్ కమిటీ సభ్యులు ఇషాక్ బాషా, రాష్ట్ర హజ్ కమిటీ ప్రత్యేక అధికారి అబ్దుల్ ఖాదిర్ పాల్గొన్నారు. -
హజ్ అరుదైన భాగ్యం.. ఈ నెల 31తో ముగియనున్న గడువు
అల్లిపురం (విశాఖ దక్షిణ): ఇస్లాం ఐదు మూల స్తంభాలపై ఆధారపడి ఉండగా అందులో మొదటిది విశ్వాసం. ఆ తర్వాతి స్థానాలు నమాజ్, రోజా, జకాత్, హజ్లకు లభిస్తాయి. నమాజ్, రోజాలకు ఆర్థిక స్థోమత అవసరం ఉండదు. నాలుగోది జకాత్ (అంటే దాన ధర్మాలు). హజ్ అనేది ఆర్థిక స్థోమతను బట్టి జీవితంలో ఒక్కసారైనా వెళ్లాల్సిన పవిత్ర యాత్ర. దీనినే జీవిత సాఫల్య యాత్రగా పరిగణిస్తారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోట్లాది ముస్లింలు 40 రోజుల పవిత్ర హజ్ యాత్ర చేస్తారు. ఈ యాత్ర ఒకప్పుడు ప్రయాసతో కూడుకున్నది. సుదీర్ఘ ఓడ ప్రయాణం, ఆ తరువాత సౌదీలో ఒంటెలు, గుర్రాలపై ప్రయాణం వంటి దశలు ఉండేవి. విమాన ప్రయాణం మొదలైనప్పటి నుంచి ఎంతో సులువుగా మారింది. విశాఖతో పాటు విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నుంచి ముస్లింలు ఏటా హజ్ యాత్రకు వెళ్తుంటారు. హజ్ కమిటీ ద్వారా ఎంపిక కాని వారు ప్రైవేట్ ట్రావెల్స్ను ఎంచుకుంటారు. ఉత్తరాంధ్ర నుంచి వెళ్లే హజ్ యాత్రికులకు విశాఖలోనే శిక్షణ ఇస్తారు. చదవండి: యుద్ధ ప్రాతిపదికన డిజిటల్ లైబ్రరీలు త్యాగానికి నిర్వచనంగా జరుపుకునే బక్రీదు పర్వదినం రోజున సౌదీ అరేబియాలోని పుణ్యస్థలం మక్కా ముకార్రమ్ ప్రదేశంలో కాబతుల్లా వద్ద హజ్ జరుగుతుంది. హజ్ పేరుతో వెళ్లే యాత్రికులు 40 రోజుల మక్కాతో పాటు ప్రవక్త హజరత్ మహమ్మద్ రసూలుల్లా(సాల్లెల్లాహు అలైహి వసల్లం) జన్మస్థలం మదీనా తదితర ప్రాంతాల్లో గడుపుతారు. నమాజులు, తవాఫ్, జికర్, దువా, ఖురాన్ పఠనం వంటి కార్యక్రమాలతో నిత్యం అల్లాను స్మరించుకోవడం, హజ్ జరిగే రోజు ప్రత్యేక ప్రార్థనలు చేయడమే ఈ యాత్ర ప్రత్యేకత. దైవ ప్రవక్తలు హజరత్ ఇబ్రహీమ్ ఖలీలుల్లా, హజరత్ ఇస్మాయిల్ జబీవుల్లా త్యాగాలకు ప్రతి రూపంగా ఏర్పడిన హజ్ ముస్లింలకు ఫరజ్ (తప్పనిసరిగా)గా మారిందని చెప్పవచ్చు. దీంతో ప్రపంచ దేశాల నుంచి ఏటా లక్షలాది మంది హజ్ యాత్రకు వెళుతుంటారు. ఈ ఏడాది హజ్ యాత్రకు ఉత్తరాంధ్ర నుంచి ఇప్పటివరకు 24 మంది దరఖాస్తు చేసుకున్నారని కమిటీ ప్రతినిధి రహమతుల్లా బెయిగ్ యాసీన్ తెలిపారు. 65 ఏళ్ల లోపు వారే అర్హులు.. గతంలో 75 ఏళ్లు నిండిన సీనియర్ సిటిజన్లకు హజ్యాత్రలో రిజర్వు కేటగిరీ కేటాయించేవారు. ప్రస్తుతం కోవిడ్–19 వచ్చాక నిబంధనలు మారాయి. 65 ఏళ్లలోపు వయసు కలిగిన వారు మాత్రమే యాత్రకు వెళ్లాలి. రెండేళ్లలోపు పిల్లలను వెంట తీసుకెళితే పాస్పోర్టు అవసరం ఉండదు. అంతకు పైబడి వయసు కలిగిన పిల్లలకు ప్రత్యేక పాస్పోర్టు అవసరం. మహిళలకు ఒంటరిగా వెళ్లే అవకాశం ఉండదు. నిబంధనల్లో సూచించిన వ్యక్తి (మెహరం) తోడుండాలి. లేదా 31.05.2022 నాటికి వయసు 45 ఏళ్లు పైబడిన నలుగురు మహిళలు గ్రూప్గా వెళ్లవచ్చు. దరఖాస్తుల్లో రెండు విధాలు.. కుటుంబంలో ఒక్కరే హజ్యాత్రకు వెళ్లాలనుకుంటే వ్యక్తిగత వివరాలతో దరఖాస్తు చేసుకుంటే చాలు. అదే కుటుంబంలోని నలుగురు సభ్యులు వెళ్లాలనుకుంటే ఒకే దరఖాస్తులో అందరి వివరాలు పొందుపరచవచ్చు. ఇలాంటి దరఖాస్తును ‘కవర్’ అంటారు. కవర్లో కవర్హెడ్ అందరి తరపున బాధ్యతలు తీసుకోవాల్సి ఉంటుంది. కవర్లో ఐదుగురు కుటుంబ సభ్యులు, బంధువులు వెళ్లవచ్చు. ఇందులో (09.09.2022 నాటికి) రెండేళ్లలోపు వయసు కలిగిన ఇద్దరు చిన్నపిల్లలు కూడా ఉండవచ్చు. (వీరికి టికెట్టులో 10 శాతం చెల్లించాల్సి ఉంటుంది.) యాత్రికులు అందజేసిన దరఖాస్తులను హజ్ కమిటీలు, సొసైటీల ప్రతినిధులు బాధ్యత తీసుకుని ఆన్లైన్ చేస్తారు. కవర్ నంబర్ మాత్రం ఐహెచ్పీఎంఎస్ సాఫ్ట్వేర్ ద్వారా జనరేట్ చేస్తారు. హజ్ యాత్రికులకు తోఫా హజ్ యాత్రకు వెళ్లే ముస్లింలకు రాష్ట్ర ప్రభుత్వం తోఫా (బహుమతి) అందజేయనుంది. రూ.3 లక్షలు లోపు ఆదాయం కలిగిన వారికి రూ.60 వేలు, రూ.3 లక్షల పైన ఆదాయం కలిగిన వారికి రూ.30 వేలు తోఫా అందజేయనుంది. అర్హతలు భారత పౌరసత్వం కల్గిన ముస్లింలు హజ్ కమిటీ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. హజ్ చేయాలంటే వారు తప్పనిసరిగా ఇండియన్ పాస్పోర్టు కలిగి ఉండాలి. (అది మిషన్ రీడబుల్, ఇంటర్నేషన్ పాస్పోర్టు అయి ఉండాలి) 2022 హజ్ యాత్ర కోసం పాస్పోర్టు కాలపరిమితి 2022, డిసెంబరు 31వ తేదీ వరకు ఉండాలి. ఒక్కరోజు తక్కువ ఉన్నా అనుమతించరు. రెండు కేటగిరీల్లో యాత్ర.. హజ్ యాత్రకు వెళ్లే వారిలో చెల్లించే ఫీజును బట్టి గ్రీన్, అజీజియా అనే రెండు కేటగిరీలు ఉంటాయి. గ్రీన్ కేటగిరీ వారికి మక్కాకు సమీపంలో బస చేసే సదుపాయం కల్పి స్తారు. అయితే ప్రస్తుత సంవత్సరంలో గ్రీన్ కేటగిరీకి ‘ఎన్సీఎన్టీజడ్’ అని పేరు మార్చారు. అంటే ‘నాన్ కుకింగ్ నాన్ ట్రాన్స్పోర్ట్ జోన్’ అని అర్థం. వ్యాక్సినేషన్ తప్పనిసరి.. హజ్ యాత్రకు వెళ్లే ముందు ప్రతి యాత్రికుడు తప్పనిసరిగా రెండు డోసుల కోవిడ్–19 వ్యాక్సిన్ వేయించుకుని ఉండాలనే నిబంధన ఉంది. వ్యాక్సినేషన్ చేయించుకోవడమే కాకుండా ఆ మేరకు సర్టిఫికెట్ కూడా పొందుపరచాల్సి ఉంటుంది. 31తో ముగియనున్న రిజిస్ట్రేషన్ హజ్ యాత్రకు వెళ్లే వారు ఈ నెల 31లోగా తమ పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ ఫీజు రూ.300 చెల్లించాలి. దరఖాస్తులో ఒక్క గడి తప్పుగా పూరించినా హజ్ యాత్రలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. లేదా సెంట్రల్ హజ్ కమిటీ తరఫున హజ్ యాత్ర చేసే అవకాశం కోల్పోవచ్చు. అన్ని అంశాలను కూలంకషంగా అర్థం చేసుకున్న తర్వాతే పూరించాల్సి ఉంటుంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు చెందిన హజ్ యాత్రికులు విశాఖపట్నం, ద్వారకానగర్లోని హజ్ వెల్ఫేర్ సొసైటీ, డోరు నంబర్ 47–7–49, సుందర్ రెసిడెన్సీ, గ్రౌండ్ ఫ్లోర్, నెహ్రూ బజార్ ఎదురుగా, ద్వారకానగర్, విశాఖపట్నం–530016 చిరునామాలో గానీ 98481 95722, 93481 95722 ఫోన్ నంబర్లలో సంప్రదించవచ్చు. ఎంపికైన వారికి విశాఖలోనే మూడు విడతలుగా, మూడు నుంచి నాలుగు రోజుల పాటు శిక్షణ ఇస్తారు. ఈ యాత్రకు రూ.3,35,000 నుంచి రూ.4,07,000 వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉందని సొసైటీ ప్రతినిధులు తెలిపారు. హజ్ దరఖాస్తుకు జత చేయాల్సినవి.. పూరించిన హజ్ దరఖాస్తుతో పాటు సెంట్రల్ హజ్ కమిటీ అకౌంట్పై బ్యాంక్లో (ఎస్బీఐ బ్యాంక్లో) చెల్లించిన రూ. 300 చలానా, పాస్పోర్టు జిరాక్స్, అకౌంట్ నంబర్ కనిపించే విధంగా బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్, నాలుగు ఫొటోలు (వెనక తెల్లటి బ్యాక్గ్రౌండ్ ఉండాలి. తెలుపు కాకుండా తలకు ఇతర రంగు టోపీ ధరిస్తే మంచిది) అందజేయాల్సి ఉంటుంది. మహిళలు చెవులు కనిపించేలా ఫొటోలు దిగాలి. ఒకవేళ పాస్పోర్టులో సూచించిన ఇంట్లో నివాసం ఉండకపోతే ప్రస్తుత చిరునామాను సూచించే ధ్రువపత్రం (ఆధార్ లేక రేషన్ కార్డు) కూడా జతపరచాలి. వీరు అనర్హులు.. గర్భిణులు, మానసిక రోగులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు, కుషు్ట, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉండదు. నామినీ.. హజ్ యాత్రికుల వెంట రాకుండా ఇంట్లో ఉండే కుటుంబ సభ్యుల పేరును (పూర్తి చిరునామాతో) మాత్రమే నామినీగా పొందుపరచాలి. లక్కీ డ్రా.. దరఖాస్తులు అధిక సంఖ్యలో వచ్చినా సెంట్రల్ హజ్ కమిటీ నిర్ణయించిన కోటా మేరకే యాత్రికులు ఎంపికవుతారు. ముంబయిలో డ్రా తీస్తారు. డ్రాలో వచ్చిన వారికి మాత్రమే కమిటీ తరఫున హజ్ యాత్రకు వెళ్లే అవకాశం కలుగుతుంది. శిక్షణ తీసుకోకపోతే ఇక్కట్లే హజ్కు వెళ్లాలంటే సాధారణ దుస్తులను వదిలేసి ఇహ్రాం అనే వ్రస్తాన్ని ధరించాల్సి ఉంటుంది. దేశం వదిలి ఇతర దేశానికి వెళతాం కాబట్టి అక్కడి చట్టం, అక్కడి నియమ నిబంధనలపై అవగాహన ఉండాలి. హజ్ యాత్రలోని ప్రధాన ఘట్టాలు కూడా తెలిసి ఉండాలి. ఇందుకు హజ్ సొసైటీలు నిర్వహించే శిక్షణ తరగతులు బాగా ఉపయోగపడతాయి. అప్లికేషన్ భర్తీ చేసేటప్పుడు ఒక్క గడి తప్పున్నా అవకాశం కోల్పోయే ప్రమాదం ఉంది. నేను విద్యావంతుడినైనా కూడా ఆన్లైన్ అప్లికేషన్ను సొసైటీ ద్వారానే భర్తీ చేయించుకున్నాను. – కరీమ్ బేగ్, రిటైర్డ్ ఇంజినీర్, విశాఖపట్నం పోర్టు ట్రస్టు నియమాలు పాటించాలి హజ్ యాత్రకు వెళ్లే వారు నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. వలంటీర్లు చెప్పినట్లు నడుచుకోవాలి. ప్రభుత్వం ఆదేశాల మేరకు యాత్రకు వెళ్లే ప్రతి ఒక్కరూ పాస్పోర్టు, ఆధార్ కార్డు, కోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్, బ్యాంకు వివరాలు ముందుగా హజ్ కమిటీకి సమర్పించాల్సి ఉంటుంది. అన్ని అర్హతలు కలిగిన వారిని ఎంపిక చేసి, వారికి శిక్షణ ఇస్తాం. అర్హులైన వారిని ఇక్కడ నుంచి హైదరాబాద్ హజ్ హౌస్కు పంపించి, అక్కడ నుంచి నేరుగా మక్కాకు విమానంలో పంపిస్తాం. – రహమతుల్లా బెయిగ్ యాసిన్,హజ్ వెల్ఫేర్ సొసైటీ, విశాఖపట్నం ఒంట్లో సత్తువ ఉన్నప్పుడు వెళ్లి రావడమే మేలు ఆర్థిక స్థోమత కలిగిన వాళ్లు వృద్ధాప్యం వచ్చేంత వరకు నిరీక్షించాల్సిన అవసరం లేదు. ఎవరి ఆయుష్షు ఎంత ఉంటుందో ఎవరికి తెలియదు కదా.. పైగా వృద్ధాప్యంలో లేనిపోని జబ్బులు వస్తుంటాయి. వాటిని భరించి 40 రోజుల ప్రయాణంలో ఇబ్బందులు పడటం కంటే, యవ్వన ప్రాయంలోనే హజ్ యాత్రకు వెళ్లి రావడం ఉత్తమం. చిన్నతనంలోనే రెండు పర్యాయాలు పవిత్ర హజ్ యాత్రకు వెళ్లి రావడం అదృష్టంగా భావిస్తున్నా. – సయ్యద్ నౌషద్ అలీ, పూర్ణామార్కెట్ -
యాత్రికులకు మెరుగైన సౌకర్యాలు
సాక్షి హైదరాబాద్: హజ్ –2018 యాత్రికులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్గా ఎన్నికైన మసీవుల్లా ఖాన్ అన్నారు. దేశంలోనే ఈ కమిటీని నంబర్వన్గా నిలుపుతామని ఆయన తెలిపారు. నాంపల్లి హజ్ కార్యాలయంలో గురువారం జరిగిన రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ ఎన్నికల్లో ఆయన నూతన చైర్మన్గా ఎన్నికైనట్లు హజ్ కమిటీ ప్రత్యేక అధికారి ఎస్.ఎ.షుకూర్ ప్రకటించారు. ఈ ఎన్నికతో కొత్త రాష్ట్ర హజ్ కమిటీ ఏర్పాటైందని, ఈ కమిటీ మూడేళ్ల పాటు కొనసాగుతుందని తెలిపారు. కొత్త చైర్మన్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ముచేయనని, ఈ పదవికి ఎన్నుకున్న సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర వక్ఫ్ బోర్డు సీఈవో మన్నాన్ ఫారూఖీ ఎన్నికల అధికారిగా పాల్గొన్నారు. -
హజ్ యాత్రికులు 12 నుంచి మదీనాకు ప్రయాణం
హజ్ కమిటీ ప్రత్యేక అధికారి షుకూర్ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ నుంచి హజ్ కమిటీ ద్వారా ఎంపికైన హజ్ యాత్రికులు ఈ నెల 12 నుంచి మదీనా నగరానికి వెళ్తున్నట్లు రాష్ట్ర హజ్ కమిటీ ప్రత్యేక అధికారి ఎస్ఏ షుకూర్ సోమవారం తెలిపారు. హజ్ ఆరాధనల్లో భాగంగా మదీనాకు వెళ్తున్నట్లు చెప్పారు. 10 రోజులపాటు మదీనాలోని మస్జీదే నబవీలో ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నట్లు చెప్పారు. ఇక్కడి నుంచి మక్కా నగరానికి ఎలా వెళ్లారో అదే పద్ధతిలో మక్కా నుంచి గ్రూప్ల వారీగా మదీనాకి వెళ్తారన్నారు. అనంతరం ఈ నెల 21 నుంచి నగరానికి తిరుగు ప్రయాణం అవుతారన్నారు.