breaking news
Godavari harati
-
అద్భుత హారతి
♦ అంగరంగ వైభవంగా గోదావరి పుష్కరాల ముగింపు హారతి ♦ కళ్లు చెదిరేలా బాణసంచా, లక్ష దీపాలు ♦ ముఖ్యమంత్రి సహా రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధుల హాజరు ♦ {పత్యేక అతిథిగా బాబా రామ్దేవ్ సాక్షి, రాజమండ్రి : ఆకాశంలో నక్షత్రాలు ఉరుములు, మెరుపులతో భువికి దిగుతున్నట్లు.. గోదారి పాయలో కలిసిపోయి కోటి కాంతులు ప్రవహిస్తున్నట్లు సాగిన ఆధ్యాత్మిక సంరంభం.. గోదావరి హారతి ఆద్యంతం నభూతో నభవిష్యతి అన్న రీతిలో సాగింది. రాజమండ్రి పుష్కరాల రేవులో వేద పండితుల మంత్రోచ్ఛరణల నడుమ పుష్కరాల ముగింపు మహోత్సవం అత్యంత కన్నుల పండువగా జరిగింది. పుష్కరాలకు అద్భుత హారతితో శనివారం ముగింపు పలికారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సతీసమేతంగా సంప్రదాయ పంచెకట్టుతో ఈ వేడుకకు వచ్చారు. 6.38 గంటలకు నదీమతల్లికి ప్రత్యేక హారతి ఇవ్వడం ద్వారా గోదావరి పుష్కరాలకు ముగింపు పలికారు. ఆయన వెంట రాష్ట్ర మంత్రులు నారాయణ, అచ్చెన్నాయుడు, శిద్దా రాఘవరావు, యనమల రామకృష్ణుడు, పరిటాల సునీత, పైడికొండల మాణిక్యాలరావు, దేవినేని ఉమామహేశ్వరరావు, ప్రత్తిపాటి పుల్లారావులతోపాటు వైఎస్సార్సీపీ శాసనసభాపక్ష ఉపనేత జ్యోతుల నెహ్రూ, పలువురు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎంపీ మురళీమోహన్ ముందుగానే వచ్చి ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి, పలువురు స్థానిక, ఇతర జిల్లాల ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ప్రఖ్యాత యోగా గురువు బాబా రామ్దేవ్ ప్రత్యేక అతిథిగా వచ్చి సీఎంతో కలిసి ముగింపు వేడుకలను వీక్షించారు. హారతి ప్రారంభం, ముగింపు సమయాల్లో సినీ ఫక్కీలో ఏర్పాటు చేసిన బాణసంచా మరింత శోభను తీసుకువచ్చింది. హారతికి ముందు గోదావరి పుట్టుక, ప్రాశస్త్యాలను వివరిస్తూ తనికెళ్ల భరణి వ్యాఖ్యానంతో లేజర్ షో ప్రదర్శించారు. అనంతరం శాండ్ ఆర్ట్తో పుష్కరాల ముగింపును కళాత్మకంగా పలికారు. హారతి ఇస్తున్న సమయంలోనే గోదావరిలో పడవలు, బోట్ల నుంచి లక్ష దీపాలను గోదావరిలో విడిచిపెట్టారు. హారతి జరిగే ప్రదేశానికి వెనుకనుంచి నదీ ప్రవాహంలో ఆ దీపాలు సాగిపోయాయి. రెండు వంతెనల మధ్య గోదావరి హారతి అనంతరం రాష్ట్ర కొత్త రాజధాని అమరావతి పేరుతో ఆకాశదీపం వెలిగించారు. వందలాది ఆకాశదీపాలు బెలూన్లలో దానిని అనుసరించాయి. అనంతరం జరిగిన బాణసంచా, లేజర్ షోలతో ఆకాశం రంగుల హరివిల్లులా మారింది. ముగింపు వేడుకలను సినీ దర్శకుడు బోయపాటి శ్రీను పర్యవేక్షించారు. గోదావరి హారతి, బాణసంచాతోపాటు రెండు వంతెనలకు ప్రత్యేక విద్యుత్ దీపాలంకరణ వరకూ అన్నిటిలోనూ ప్రత్యేకత తీసుకువచ్చారు. పుష్కర యాత్రికులు బోయపాటిని అభినందనల్లో ముంచెత్తారు. -
గోదావరి తీరంలో జనజాతర
రాజమండ్రి : ఎన్నో ఇబ్బందులు.. మరెనో అవాంతరాలు.. ఇవేమీ భక్తిపారవశ్యాన్ని అడ్డుకోలేకపోయాయి. ‘పుష్కర’ రోజులు తరిగిపోతున్నకొద్దీ భక్తుల్లో పుష్కర పుణ్యస్నానం చేయాలనే ఆరాటం పెరిగిపోతోంది. ఒక్కసారైనా గోదావరిలో పుష్కర స్నానం చేయాలని.. లేకుంటే మరో 12 ఏళ్లు పుణ్యస్నాన భాగ్యం దక్కదన్నట్టుగా భక్తులు గోదావరి తీరానికి వెల్లువలా తరలివస్తున్నారు. ఎక్కడెక్కడివారో రెక్కలు కట్టుకు వచ్చి వాలిపోతున్నారు. పుష్కరాల తొమ్మిదో రోజైన బుధవారం కూడా యాత్రికులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మంగళవారం.. సెంటిమెంట్ కారణంగా కాస్త తగ్గినప్పటికీ బుధవారం తిరిగి పోటెత్తారు. భక్తజనుల తాకిడికి ఈ మహాపర్వం తొమ్మిదో రోజుకే 2003 పుష్కరాలకు వచ్చిన భక్తుల రికార్డు బద్దలు కావడం విశేషం. బుధవారం రాత్రి 9 గంటల సమాయానికి జిల్లావ్యాప్తంగా 32 లక్షల మందికి పైగా భక్తులు పుణ్యస్నానాలు చేశారు. దీంతో గడచిన తొమ్మిది రోజులుగా జిల్లావ్యాప్తంగా పుష్కర స్నానాలు చేసినవారి సంఖ్య 2.41 కోట్లకు చేరింది. గత పుష్కరాల్లో 12 రోజుల్లో 2,19,75,140 మంది భక్తులు పుణ్యస్నానాలు చేశారు. ఈ ఏడాది ఈ సంఖ్యను తొమ్మిది రోజులకే అధిగమించారు. మిగిలిన మూడు రోజుల్లో కూడా భక్తుల తాకిడి ఇదేవిధంగా కొనసాగనుంది. జనం రాక చూస్తుంటే ఈ ఏడాది జిల్లాలో పుష్కర స్నానాలు చేసేవారి సంఖ్య మూడు కోట్లు దాటే అవకాశముందని అంచనా వేస్తున్నారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా.. రాజమండ్రి నగరంలో యాత్రికుల తాకిడి అధికంగా కనిపించింది. నగరంలోని ఘాట్లు మరోసారి భక్తులతో కిటకిటలాడాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ అడపాదడపా పెద్ద వర్షమే పడినా భక్తులు లెక్క చేయలేదు. తండోపతండాలుగా ఘాట్లకు చేరుకున్నారు. వృద్ధులు, చంటిబిడ్డలతో వచ్చిన మహిళలు సైతం వర్షంలోనే తడుస్తూ ఘాట్ల వద్దకు చేరుకుని పుణ్యస్నానాలు ఆచరించారు. వర్షంవల్ల ఘాట్లవద్ద పిండప్రదానాలు చేసేవారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చాలీచాలని సౌకర్యాల నడుమ వర్షంలో తడుస్తూనే పితృదేవతలకు పిండప్రదానాలు చేశారు. గోదావరి హారతికి మంత్రివర్గం గోదావరి నిత్యహారతి కార్యక్రమానికి రాష్ట్ర మంత్రివర్గం తరలివచ్చింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఆయన మంత్రివర్గ సహచరులు, ఇతర ఉన్నతాధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మంత్రివర్గంతోపాటు వేలాదిగా భక్తులు రావడంతో గోదావరి హారతి కన్నుల పండువగా సాగింది.