breaking news
Gangisetti Vijaya Kumar
-
రెచ్చిపోయిన గంగిశెట్టి : వైస్ చైర్మన్ వెకిలి చేష్టలు
కర్నూలు, బొమ్మలసత్రం: అధికార పార్టీకి చెందిన నంద్యాల మునిసిపల్ వైస్ చైర్మన్ గంగిశెట్టి విజయ్కుమార్ రెచ్చిపోయారు. కౌన్సిల్ సమావేశంలో హుందాగా ప్రవర్తించాల్సింది పోయి.. వెకిలిచేష్టలతో వెగటు పుట్టించారు. చేతిలో ఉన్న మైకుతో ఏకంగా సభ్యులపై దాడికి యత్నించారు. ప్రజా సమస్యలను పట్టించుకోకుండా.. సభా సమయాన్ని వృథా చేస్తూ ఆయన ప్రవర్తించడంపై సభ్యులు మండిపడ్డారు. స్థానిక మునిసిపల్ కౌన్సిల్ హాలులో సోమవారంచైర్ పర్సన్ దేశం సులోచన అధ్యక్షతన సాధారణ సమావేశం నిర్వహించారు. ముందుగా జమ్మూ కశ్మీర్లో వీరమరణం పొందిన జవాన్లకు రెండు నిమిషాలు మౌనం పాటించారు. అజెండాను ప్రారంభించే ముందు నూతనంగా బాధ్యతలు చేపట్టిన కమిషనర్ భవానీ ప్రసాద్ను పరిచయం చేశారు. సమావేశం సజావుగా కొనసాగే సమయంలో వైస్ చైర్మన్ గంగిశెట్టి విజయకుమార్ చైర్పర్సన్ అనుమతి లేకుండానే లేచి నిలబడ్డారు. ‘మాట్లాడేది పూర్తయ్యిందా... అయ్యిందా?’ అంటూ వెకిలి చేష్టలతో కౌన్సిల్హాలు మధ్యలో నిలబడి హల్చల్ చేశారు. మధ్యలో లేచి మాట్లాడటం సభ్యత కాదని, సభ్యులకు సమాధానం చెప్పేటప్పుడుఅడ్డుతగలటం సరైన పద్ధతి కాదని చైర్పర్సన్ వారించినా వినలేదు. పదే పదే ఏకవచనంతో సంబోధిస్తూ అడ్డు తగులుతుండడంతో చైర్పర్సన్ సమావేశం మధ్యలోనే వెళ్లి పోయారు. తర్వాత వైస్చైర్మన్ అక్కడున్న సభ్యులను పరుష పదజాలంతో దూషిస్తూ అడ్డుపడిన వారిపై మైకు విసిరారు. రౌడీలా వ్యవహరించిన ఆయనతో వాదించలేక సభ్యులు కూడా అక్కడి నుంచి వెళ్లిపోయారు. గంగిశెట్టి విజయ్కుమార్ గతంలో కూడా మహిళా కౌన్సిలర్లు ఉన్న వాట్సాప్ గ్రూపులో అశ్లీల చిత్రాలు పోస్ట్ చేసి విమర్శలు ఎదుర్కొన్నారు. మరోసారి అనుచిత ప్రవర్తనతో హల్చల్ సృష్టించడం గమనార్హం. సభాగౌరవం మంట కలుపుతున్నారు – శోభారాణి, కౌన్సిలర్ కౌన్సిల్ మీట్లో టీడీపీ సభ్యులు కావాలనే అడ్డు తగులుతున్నారు. గందరగోళం సృష్టిస్తూ ప్రజా సమస్యలు పరిష్కారం కాకుండా చేస్తున్నారు. సభా మర్యాదను పాటిస్తూ ప్రశ్నలు వేయకుండా.. ఇష్టానుసారం మధ్యలో నిలబడి ఏకవచనంతో సంబోధించటం సరైంది కాదు. సభలో రాజకీయాలు పనికిరావు – దేశం సులోచన, చైర్పర్సన్ ప్రజలు ఎన్నుకున్నది వారి సమస్యల పరిష్కారం కోసం. కౌన్సిల్మీట్లో ఇష్టమొచ్చినట్లు ప్రవర్తించడం మంచిది కాదు. ఎదుటి వారు పార్టీలు మారారని విమర్శించే ముందు ఇప్పుడు టీడీపీలో ఉన్న వారంతా ఏపార్టీ గుర్తుతో గెలిచారో చెప్పాలి. సభలో రాజకీయాలు మాట్లాడటం మంచిది కాదు. సభాసమయం వృథా చేయకూడదనే ఉద్దేశంతోనే బయటికి వచ్చేశా. -
రెచ్చిపోయిన అధికార పార్టీ వైస్ చైర్మన్
సాక్షి, నంద్యాల: అధికార పార్టీకి చెందిన నంద్యాల మున్సిపాలిటీ వైస్ చైర్మన్ విజయ్ కుమార్ రెచ్చిపోయారు. సోమవారం జరిగిన మున్సిపల్ సమావేశంలో విజయ్ కుమార్ చాలా దురుసుగా ప్రవర్తించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మున్సిపల్ చైర్ పర్సన్ దేశం సులోచనమ్మపై ఆరోపణలు చేయడమే కాకుండా.. ఆమెను ఏకవచనంతో సంభోదిస్తూ ఇబ్బందికరంగా ప్రవర్తించారు. సమావేశం జరుగుతున్న సమయంలో పదే పదే అడ్డు తగులుతూ గందరగోళం సృష్టించారు. తన ప్రశ్నకు సమాధానం చెప్పాలంటూ వితండ వాదనకు దిగారు. విజయ్ కుమార్ ప్రవర్తనతో సభ సజావుగా సాగకపోవడంతో సులోచనమ్మ సభను వాయిదా వేశారు. అనంతరం బయటకు వెళ్తున్న సులోచనమ్మపై సమాధానం చెప్పకుండా ఎలా వెళ్తారని విజయ్ కుమార్ గట్టిగా కేకలు వేశారు. అడ్డు చెప్పిన వైఎస్సార్ సీపీ కౌన్సిలర్పై ఆయన తన చేతిలో మైకును విసిరివేశారు. -
ఫరూక్ వర్గానికి ఝలక్
నంద్యాల: పురపాలక సంఘ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు శిల్పావర్గానికి దక్కాయి. దీంతో నంద్యాల అసెంబ్లీకి మూడు సార్లు ఎన్నికై 15 సంవత్సరాల పాటు మంత్రిగా పని చేసిన ఫరూక్ మాట చెల్లుబాటు కాలేదు. కనీసం రెండు పదవుల్లో ఏదో ఒకటి అప్పగిస్తారని ఆయన వర్గానికి చెందిన కౌన్సిలర్లు భావించారు. ఈ నేపథ్యంలో గత వారం రోజుల నుంచి తన వర్గానికి చెందిన కౌన్సిలర్లు దియ్యాల సులోచన, మామిడి ఉషారాణిలను చైర్మన్ అభ్యర్థులుగా ఎంపిక చేయాలని పట్టుబట్టారు. ఈ మేరకు సులోచన భర్త మాజీ కౌన్సిలర్ రంగప్రసాద్, ఉషారాణి భర్త మామిడి నాగరాజులకు ఫరూక్ పరోక్షంగా హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే చివరికి ఊహించిన విధంగానే మాజీ కౌన్సిలర్ దేశం సుధాకర్రెడ్డి సతీమణి సులోచన, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గంగిశెట్టి విజయకుమార్లను చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు వరించాయి. వీరు 2004 నుంచి 2014 వరకు శిల్పా అనుచరులుగా కొనసాగుతూ వచ్చారు. ఎన్నికల ముందు శిల్పా వెంట టీడీపీలోకి వచ్చి రెండు పదవులు వారే దక్కించుకోవడంతో ఫరూక్ వర్గంలో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఎందుకు ఫరూక్కు ప్రాధాన్యత లభించలేదో అర్థం కావడం లేదని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. దేశం కండువాల్లో కూడా ఫరూక్ చిత్రం గల్లంతు.. గురువారం ఉదయం మున్సిపల్ కార్యాలయానికి వచ్చిన టీడీపీ కౌన్సిలర్లు పచ్చకండువాలతో హాజరయ్యారు. అయితే వారు వేసుకున్న కండువాల్లో చంద్రబాబుతో పాటు శిల్పామోహన్రెడ్డి చిత్రాలు మాత్రమే ఉన్నాయి. ఫరూక్ చిత్రం లేకపోవడాన్ని పలువురు విలేకరులు కౌన్సిలర్లను ప్రశ్నించగా అలాంటిదేమీలేదని ఎన్నికల సమయంలోని కండువాలని వివరించారు. చివరికి ఫరూక్ వర్గంగా భావిస్తున్న దియ్యాల సులోచన, మామిడి ఉషారాణిలు కూడా శిల్పా ఫొటోలు ఉన్న కండువా వేసుకోవడం గమనార్హం. అయిష్టంగానే చేతులెత్తిన దియ్యాల, చంద్రావతి.. నంద్యాల పురపాలక సంఘం చైర్మన్ పదవి కోసం పోటీ పడి నాలుగో వార్డు నుంచి ఎన్నికైన దియ్యాల సులోచన, 17వ వార్డు నుంచి ఎన్నికైన చంద్రావతి అయిష్టంగానే చేతులెత్తారు. దేశం సులోచనకు మద్దతు ఇచ్చే సభ్యులు చేతులెత్తాలని ప్రిసైడింగ్ ఆఫీసర్, ఆర్డీఓ నరసింహులు కోరారు. ఎవరు చేతులెత్తలేదని ముందుగా కూర్చుకున్న వైస్ చైర్మన్ గంగిశెట్టి విజయ్కుమార్, అనిల్ అమృతరాజ్లు వెనక్కి చూడగా అప్పుడు వారిద్దరు బలవంతంగా పూర్తి స్థాయిలో చేతులెత్తారు. మొత్తం మీద చైర్మన్ పదవి దక్కలేదనే అసంతృప్తి వారిలో వ్యక్తమైంది. స్వేచ్ఛగా వైఎస్సార్సీపీ... మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలకు వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు స్వేచ్ఛగా హాజరయ్యారు. 13మంది కౌన్సిలర్లు ఎవరికి వారు సొంత వాహనాల్లో మున్సిపల్ కార్యాలయం చేరుకున్నారు. అదే టీడీపీకి చెందిన వారిలో చైర్మన్ ఎంపికలో బేధాభిప్రాయాలు ఉండటంతో 29 మంది కౌన్సిలర్లను బుధవారం రాత్రి ఒక చోటకు చేర్చారు. అక్కడి నుంచి నేరుగా గురువారం ఉదయం కార్యాలయానికి తీసుకొచ్చారు. టీడీపీ సభ్యుడి ఆంగ్లంలో ప్రమాణం.. టీడీపీ మున్సిపల్ కౌన్సిలర్, ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయుడు పడకండ్ల సుబ్రమణ్యం ఆంగ్లంలో ప్రసంగం చేయడం పలువురిని విస్మయానికి గురి చేసింది. తెలుగు అనర్గలంగా మాట్లాడే సుబ్రమణ్యం టీడీపీలో ఉంటూ తెలుగులో ప్రమాణస్వీకారం చేయకపోవడంపై చర్చనీయాంశమైంది. ఈయన 9వ వార్డు కౌన్సిలర్గా ఎన్నికయ్యారు. 42 మంది కౌన్సిలర్లలో ఏడుగురు నిరక్షరాస్యులే... నంద్యాల పురపాలక సంఘం కౌన్సిలర్లుగా ఎన్నికైన 42 మందిలో మొత్తం ఏడుగురు నిరక్షరాస్యులని తేలింది. అందులో వైఎస్సార్సీపీకి చెందిన 13మందిలో ఇద్దరు, తెలుగుదేశం పార్టీ నుంచి గెలుపొందిన 29మంది కౌన్సిలర్లలో ఐదుగురు నిరక్షరాస్యులని ప్రమాణస్వీకారం సందర్భంగా తేలింది. టీడీపీ కౌన్సిలర్లుగా 1,3, 8, 31,42 వ వార్డుల నుంచి గెలుపొందిన మాతంగి కన్నమ్మ, ఎన్కే సర్తాజ్, నూర్జహాన్, ఫాతిమున్నిసా, సోనాల పిల్లి లక్ష్మీదేవిలతో పాటు వైఎస్సార్సీపీ నుంచి 2,32 వ వార్డుల నుంచి గెలుపొందిన గొరెముర్తుజా, ఎ. చెన్నమ్మలు ఎన్నికల అధికారులు ఇచ్చిన ప్రమాణస్వీకార పత్రాన్ని చదవలేకపోయారు. వీరితో ఆర్డీఓ చదివించారు.