breaking news
feritlizers
-
ఎరువుల వెతలకు శాశ్వత పరిష్కారం!
యుద్ధం, కోవిడ్... విధ్వంసంతో పాటు సరికొత్త అవకాశాలనూ వెంట తెచ్చాయి. కోవిడ్ మహమ్మారి రోగ నిరోధక శక్తినిచ్చే ఆరోగ్యదాయకమైన ఆహారోత్పత్తుల ఆవశ్యకతను జనబాహుళ్యం గుర్తెరిగేలా చేసింది. ఉక్రెయిన్పై రష్యా యుద్ధం సృష్టిస్తున్న సంక్షోభం వల్ల భరించలేనంతగా పెరుగుతున్న రసాయనిక ఎరువుల ధరలు సేంద్రియ ప్రత్యామ్నాయాలకున్న ప్రాధాన్యాన్ని పెంచాయి. ప్రకృతి వ్యవసాయ వ్యాప్తిపై మరింతగా దృష్టిని కేంద్రీకరించేలా పాలకులనూ, రైతులనూ పురికొల్పుతున్నాయి. రసాయనిక ఎరువులు, పురుగు మందులను పూర్తిగా పక్కన పెడితే పంట దిగుబడులు కుదేలై ఆహార భద్రతకు ముప్పు వస్తుందనే భయాందోళనలకు ఇప్పుడు తావు లేదు. ఆంధ్రప్రదేశ్లో అనేక ఏళ్లుగా అమల్లో ఉన్న ప్రజల భాగస్వామ్యంతో ప్రకృతి వ్యవసాయ అనుభవాలే ఇందుకు ప్రబల నిదర్శనాలు. ప్రకృతి వ్యవసాయ విస్తరణకు గ్రామస్థాయిలో మద్దతు వ్యవస్థలను నెలకొల్పటం ద్వారా నిర్మాణాత్మక కృషి చేస్తే... ప్రతి రైతునూ ప్రకృతి వ్యవసాయం వైపు దశలవారీగా మళ్లించటం... ఖర్చులు తగ్గించుకుంటూ సంతృప్తికరమైన దిగుబడులు సాధించడం సుసాధ్యమేనని ఆంధ్రప్రదేశ్ అనుభవాలపై థర్డ్ పార్టీ అధ్యయనాలు ఎలుగెత్తి చాటుతున్నాయి. సుసంపన్నమైన ఈ అనుభవాలు మనకే కాదు ప్రపంచ దేశాలకూ గొప్ప ఆశాకిరణంగా కనిపిస్తున్నాయని ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్ఏఓ) వంటి ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థలే చెబుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో సహజ వాయువు ధరలు ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూస్తే ప్రతి ఆర్నెల్లకూ రెట్టింపయ్యే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తు న్నారు. రసాయనిక ఎరువుల ధరలు వేగంగా పెరుగుతున్నాయి. ధరలు పెరుగుతున్నకొద్దీ కేంద్ర ప్రభుత్వం ఎరువులపై ఇస్తున్న రాయితీని కూడా తగ్గిస్తోంది. అంతిమంగా రైతుకు ఎరువులు మోయలేని భారంగా మారి పోతున్నాయి. వీటిపై కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ ఇప్పటికే తడిసి మోపెడైంది. 2020–21లో రూ. 1,27,921 కోట్లుండగా, 2021–22 నాటికి రూ. 1,40,122 కోట్లకు చేరింది. ఈ సంవత్సరం ఇది ఇంకా పెరుగుతుంది. రసాయనిక ఎరువుల ధరలు విపరీతంగా పెరగడమే కాదు, లభ్యత కూడా తగ్గిపోతున్నందున... అవసరానికి మించి రసాయనిక ఎరువుల వాడకాన్ని అరికట్టేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలి. దీనితోపాటు, రసాయనికేతర సుస్థిర ప్రత్యామ్నాయాల వైపు వెళ్లటమే శాశ్వత పరిష్కారం. ఆంధ్రప్రదేశ్లో రసాయనిక ఎరువుల వినియోగం గణనీయంగా తగ్గుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ప్రకృతి వ్యవసాయ విస్తరణ వల్లనే ఇది సాధ్యమవుతోంది. ప్రకృతి సేద్యం విస్తారంగా సాగులో ఉన్న కర్నూలు జిల్లాలో 2020–21తో పోలిస్తే 1,25,427 టన్నుల ఎరువుల వాడకం తగ్గింది. ఏపీలో 2020–21లో 42.26 లక్షల మెట్రిక్ టన్నుల రసాయనిక ఎరువుల వినియోగం జరిగింది. 2021–22 నాటికి ఇది 36.22 లక్షల మెట్రిక్ టన్నులకు తగ్గింది. (చదవండి: వ్యవసాయరంగంలో నిశ్శబ్ద విప్లవం) రసాయనాల విచ్చలవిడి వాడకం సహా అస్థిర వ్యవసాయ పద్ధతుల వల్ల భూమి ఉత్పాదక శక్తిని కోల్పోతున్నది. ఇప్పటికే 35% సాగు భూమి నిస్సారమై ఎడారిగా మారిపోయింది. 2045 నాటికి 13.5 కోట్ల మంది ప్రజలు ప్రపంచవ్యాప్తంగా ఎడారీకరణ వల్ల సొంత భూములను వదిలి పొట్ట చేతపట్టుకొని వలస పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఐక్యరాజ్య సమితి హెచ్చరిస్తోంది. (చదవండి: ప్రపంచ ఆహార భద్రతకు ప్రమాదం) వ్యవసాయం... ప్రకృతి వనరులపైన ఆధార పడిన జీవనోపాధి. అది ప్రకృతి వనరులను, పర్యావరణాన్ని ప్రభావితం చేస్తుంది. అలాగే ప్రకృతి వనరులు, పర్యావరణం తిరిగి వ్యవసాయాన్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి. మన దేశంలో సగానికి పైగా ప్రజలు జీవనోపాధి కోసం వ్యవసాయం మీద ఆధారపడి వున్నారు. కాబట్టి, పర్యావరణంలో వస్తున్న మార్పుల్ని తట్టుకునే దిశగా వ్యవసాయం మారాల్సిన అవసరం వుంది. ప్రజల భాగస్వామ్యంతో ప్రకృతి వ్యవసాయాన్ని దశల వారీగా విస్తరింపజేయడం ద్వారా మాత్రమే భవిష్యత్తులో పెరిగే జనాభాకు సైతం ఆహార భద్రతన్విగలుగుతాం. – పంతంగి రాంబాబు, సీనియర్ జర్నలిస్ట్ -
రబీజోరు
వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన రైతులు ఈసారి రెట్టింపు విస్తీర్ణంలో సాగైన జొన్న వరి సాగూ పెరిగే అవకాశం ఈ సీజన్పైఅన్నదాతల ఆశలు సాక్షి, రంగారెడ్డి జిల్లా: రబీసాగు జిల్లాలో వడివడిగా సాగుతోంది. గత సీజన్లో కురిసిన అతి వృష్టితో పంటలు పోయి కుదేలైన రైతాం గం రబీపైనే రైతాంగం గంపెడాశలు పెట్టుకుంది. జిల్లాలో పెద్ద ప్రాజెక్టులేవీ లేకపోవడంతో రైతాంగం మొత్తం భూగర్భ జలాలపైనే ఆధారపడి ఉంది. ఇటీవల జిల్లాలో కురిసినవర్షాలతో భూగర్భజలాలు మెరుగుపడ్డాయి. దీంతో రబీ సాగుపై రైతులకు ధీమా పెరిగింది. ఫలితంగా సాగు పనులు ఊపందుకున్నాయి. ప్రస్తుత రబీ సీజన్లో జిల్లాలో 42,287 హెక్టార్లలో వివిధ పంటలు సాగవుతాయని జిల్లా వ్యవసాయ శాఖ అంచనాలు వేసి ప్రణాళిక సిద్ధం చేసింది. ఈమేరకు ఎరువులు, విత్తనాలు సరఫరా చేసింది. అయితే ఇప్పటివరకు సాధారణ విస్తీర్ణంలో 65 శాతం పంటలు సాగైనట్లు వ్యవసాయ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. జొన్నసాగు జోరు జిల్లాలో రబీ సాధారణ విస్తీర్ణం 42,287 హెక్టార్లు. అయితే ఇప్పటికి 25,186 హెక్టార్ల విస్తీర్ణంలో పంటలు సాగు కావాల్సి ఉందని వ్యవసాయ శాఖ నివేదికలు చెబుతున్నాయి. అయితే 27,550 హెక్టార్లలో సాగైనట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. ప్రస్తుత సీజన్లో జొన్న పంట అత్యధిక విస్తీర్ణంలో సాగైంది. జిల్లాలో జొన్న పంట సాధారణ విస్తీర్ణం 5,238 హెక్టార్లు కాగా.. ఇప్పటివరకు రెట్టింపు స్థాయిలో 11,852 హెక్టార్లలో సాగైంది. మరోవైపు శనగ, వేరుశనగ పంటల సాగు ఆశాజనకంగా ఉందని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం జిల్లాలో వరి రైతులు నారు మడులతో సిద్ధంగా ఉన్నారు. కొన్ని చోట్ల నాట్లు మొదలయ్యాయి. భూగర్భ జలాలు పెరిగిన నేపథ్యంలో వరిపంట కూడా అధిక విస్తీర్ణంలో సాగయ్యే అవకాశం ఉందని వ్యవసాయశాఖ భావిస్తోంది.