breaking news
disappropriate assets case
-
చిన్నమ్మకు చెరసాల
-
చిన్నమ్మకు చెరసాల
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సుప్రీంకోర్టు తీర్పు - జయ, శశికళకు విధించిన 4 ఏళ్ల జైలుశిక్ష సబబే - హైకోర్టు తీర్పును రద్దు చేస్తున్నాం - ప్రత్యేక కోర్టు తీర్పును పునరుద్ధరిస్తున్నాం - మరణించినందున జయపై అప్పీళ్లు రద్దు చేస్తున్నాం - శశికళ, సుధాకరన్, ఇళవరసి వెంటనే లొంగిపోవాలి - వ్యాపార లావాదేవీలు జరగని కంపెనీల ఏర్పాటు - వాటి ద్వారా భారీ మొత్తంలో ఆస్తులు కూడబెట్టారు - జయకు తెలిసే అన్నీ జరిగాయి.. అందుకు వారు శిక్షార్హులే - 577 పేజీల తీర్పులో సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యలు.. - ఈ తీర్పుతో పదేళ్లపాటు ఎన్నికలకు శశికళ దూరం సాక్షి, హైదరాబాద్ దివంగత ముఖ్యమంత్రి జయలలిత, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ, ఆమె కుటుంబ సభ్యులు వి.ఎన్.సుధాకరన్, జె.ఇళవరసిలు ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారని సుప్రీంకోర్టు మంగళవారం నిర్ధారించింది. వారికి నాలుగేళ్లపాటు జైలుశిక్ష, జరిమానాలు విధిస్తూ కర్ణాటక ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పు సబబేనని స్పష్టం చేసింది. ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేస్తూ జయలలిత తదితరులను నిర్దోషులుగా ప్రకటిస్తూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు రద్దు చేసింది. ప్రత్యేక కోర్టు తీర్పుతో పాటు తదనుగుణ ఆదేశాలన్నింటినీ పునరుద్ధరిస్తున్నట్లు తెలిపింది. జయలలిత మరణించిన నేపథ్యంలో ఆమెపై దాఖలైన అప్పీళ్లను రద్దు చేస్తున్నట్లు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మిగిలిన నిందితుల విషయంలో ప్రత్యేక కోర్టు తీర్పు అమల్లోకి వస్తుందన్న సుప్రీంకోర్టు, వారందరినీ కూడా తక్షణమే కింది కోర్టులో లొంగిపోవాలని ఆదేశించింది. శశికళకు నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది. కర్ణాటకలో ఆరునెలల పాటు జైలులో ఉన్న శశికళ మిగిలిన జైలుశిక్షను అనుభవించేలా చర్యలు తీసుకోవాలని కింది కోర్టును సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ తీర్పుతో శశికళ పదేళ్లపాటు ఎన్నికలకు కూడా దూరం కానున్నారు. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ పినాకి చంద్రఘోష్, జస్టిస్ అమితవ రాయ్లతో కూడిన ధర్మాసనం మంగళవారం తీర్పు వెలువరించింది. 577 పేజీలున్నప్పటికీ ముఖ్యమైన భాగాలను మాత్రమే చదివిన జడ్జిలు మొత్తం 8 నిమిషాల్లో పూర్తిచేశారు. సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పుపై మరలా అప్పీలు చేస్తామని అన్నాడీఎంకే సీనియర్ ఎంపీ, శశికళ మద్దతుదారుడు తంబిదురై ప్రకటించారు. కేసు పూర్వాపరాలు: జయలలిత ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారంటూ 14.6.1996న సుబ్రమణ్యస్వామి మద్రాసు ప్రిన్సిపల్ సెషన్స్/స్పెషల్ జడ్జి కోర్టులో ఫిర్యాదు దాఖలు చేశారు. దీనిపై సుప్రీంకోర్టు ఆదేశాలతో కేసు కర్ణాటకకు బదిలీ జరిగి ప్రత్యేక కోర్టు ఏర్పాటైంది. ఈ కేసులో జయలలిత తదితరులకు కోర్టు నాలుగేళ్ల జైలు, జరిమానా విధించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ జయలలిత, శశికళ తదితరులు దాఖలు చేసిన అప్పీళ్లను విచారించిన కర్ణాటక హైకోర్టు వారికి ఊరటనిస్తూ నిర్ధోషులుగా ప్రకటించింది. దీన్ని సవాలు చేస్తూ కర్ణాటక ప్రభుత్వం, డీఎంకే నాయకుడు అన్భళగన్లు సుప్రీంకోర్టులో అప్పీళ్లు దాఖలు చేశారు. కుట్రకు ఆ కంపెనీలే సాక్ష్యం... ‘‘జయ పబ్లికేషన్స్కు సంబంధించి శశికళకు జయలలిత జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ (జీపీఏ) ఇచ్చారు. న్యాయపరమైన ఇబ్బందుల నుంచి తప్పించుకునేందుకే జయలలిత జీపీఏ ఇచ్చారు. జయ పబ్లికేషన్స్లోని తన ఖాతాలను శశికళ నిర్వహించేందుకు వీలుగానే జీపీఏ ఇవ్వడం జరిగింది. నలుగురు నిందితులు కుట్ర పూరితంగా వ్యవహరించారనేందుకు వారు ఏర్పాటు చేసిన కంపెనీలే సాక్ష్యం. పది కంపెనీలు ఒకే రోజు ఏర్పాటు కావడం జరిగింది. ఆ కంపెనీల పేరిట శశికళ, సుధాకరన్లు ఆస్తులు కొనడం తప్ప, మరే వ్యాపార లావాదేవీ నిర్వహించలేదు. నామధు ఎంజీఆర్, జయ పబ్లికేషన్స్కు కొనసాగింపు గానే ఈ కంపెనీలను ఏర్పాటు చేశారనేందుకు పక్కా ఆధారాలున్నాయి. ఈ కంపెనీల నిర్వహణ మొత్తం జయలలిత ఇంటి నుంచే జరిగేది. ఈ విషయం జయలలితకు తెలియదని చెప్పడం ఆమోదయోగ్యం కాదు. అలాగే శశికళ తదితరులు కూడా ఆ కంపెనీల వ్యవహారాల గురించి తెలియదనడం సరికాదు. వాస్తవానికి జయలలితతో శశికళ తదితరులకు రక్తసంబంధం లేకపోయినా, వారంతా ఒకే చోట నివసించేవారు. తమకు వేర్వేరు ఆదాయ మార్గాలున్నాయని శశికళ తదితరులు చెబుతున్నప్పటికీ, జయలలిత ఇచ్చిన డబ్బు ద్వారానే వారు కంపెనీలను ఏర్పాటు చేసి, భారీ మొత్తంలో భూములు కొనుగోలు చేశారు. జయలలిత ఇంటిలోనే అందరూ నివాసం ఉంటూ కుట్ర పన్నారు. జయలలిత తన ఇంట వారికి మానవతా దక్పథంతోనో, మరో కారణంతోనే ఉచిత వసతి కల్పించారు. కాబట్టి వారంతా కలిసే కుట్ర చేశారనేందుకు ఆధారాలున్నాయి. మూలధనం వాటా కింద శశి ఎంటర్ప్రైజెస్కు జయలలిత కోటి రూపాయలు ఇచ్చిననట్లు జయలలిత ప్రతినిధి ఒకరు ఆదాయపు పన్నుశాఖ అధికారులకు వెల్లడించారు. ఆ మొత్తాన్ని సెక్యూరిటీగా ఉంచి జయలలిత రుణం పొందారు. కాబట్టి కంపెనీలతో తమకు సంబంధం లేదని జయలలిత ఎంత మాత్రం చెప్పజాలరు. జయలలిత అక్రమ ఆదాయం ద్వారా కంపెనీల పేర్ల మీద ఆస్తులు కూడబెట్టేందుకు జరిగిన కుట్రను ఒకరి ఖాతా నుంచి మరొకరి ఖాతాల్లోకి జరిగిన నిధుల ప్రవాహం రుజువు చేస్తోంది. అలాగే నిందితుల కుట్రను నార్త్ బీచ్ సబ్ రిజిష్ట్రార్, హార్టీకల్చరల్ అధికారి రాధాకష్ణన్ ఇచ్చిన సాక్ష్యాలు రుజువు చేస్తున్నాయి. ప్రత్యేక కోర్టు అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకునే తీర్పునిచ్చింది. అందువల్ల మేం ఆ తీర్పును సమర్థిస్తున్నాం. ఇక 1992లో జన్మదినం నాడు జయలలితకు అందిన రూ.2.15 కోట్ల విలువైన బహుమతులు, డబ్బును న్యాయమైన ఆదాయంగా భావించలేం. ’’అని ధర్మాసనం తన తీర్పులో పేర్కొంది. నిరాటంకంగా నిధుల మళ్లింపు... ‘‘జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మొత్తం 34 కంపెనీలు ఏర్పాటయ్యాయి. ఇందులో పది కంపెనీలు ఒక్క రోజే ఏర్పాటయ్యాయి, బ్యాంకు ఖాతాలు కూడా ఒక్క రోజే తెరిచారు. ఇదంతా కూడా యాధృచ్చికమేనని నిందితులు చెప్పడం వాస్తవం దూరం. అత్యధిక కంపెనీల్లో మూలధనం వాటా లేనే లేదు. పలు కంపెనీలు ఎటువంటి వ్యాపార లావాదేవీలు నిర్వహించలేదు. అయితే ఆ కంపెనీల పేర్ల మీద నిందితులు భారీ ఆస్తులను కూడబెట్టారు. అక్రమ మార్గంలో కూడబెట్టిన డబ్బును దారి మళ్లించేందుకే ఈ కంపెనీలను ఏర్పాటు చేశారనేందుకు పక్కా ఆధారాలున్నాయి. కుట్రపూరిత నేరానికే జయలలిత ఇంటిని ఉపయోగించారు. జయలలిత ఖాతా నుంచి నిరాటంకంగా ఇతర ఖాతాలకు నిధుల మళ్లింపు జరిగింది. అంతేకాక ఆస్తుల రిజిస్ట్రేషన్ సమయంలోనూ అధికార దుర్వినియోగం జరిగింది. నార్త్ బీచ్ సబ్ రిజిష్ట్రార్ను పోయెస్ గార్డెన్కు పిలిపించి నిబంధనలకు విరుద్ధంగా ఆస్తులను రిజిష్టర్ చేయించారు. చాలా ఆస్తులను తక్కువ విలువ చూసి చూపారు. కొనుగోలుదారుల వివరాలు పొందుపరచకుండానే ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియను అధికారులు పూర్తి చేశారు. ఈ విషయాలన్నింటినీ కూడా ప్రత్యేక కోర్టు పరిగణనలోకి తీసుకునే నలుగురు నిందితులకు జైలుశిక్ష, జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. అంతేకాక బ్యాంకుల్లో ఉన్న ఫిక్సిడ్ డిపాజిట్ల తాలుకు మొత్తాలు, ఇతర నగదు నిల్వలను జరిమానా మొత్తాల కింద జమ చేయాలని బ్యాంకులను ఆదేశిస్తూ ప్రత్యేక కోర్టు ఇచ్చిన ఆదేశాలు కూడా సబబైనవే. ఒకవేళ ఆ మొత్తాలు జరిమానాకు సరిపోకుంటే, బంగారు ఆభరణాలను వేలం వేసి ఆ మొత్తాలను జరిమానా నిమిత్తం జమ చేయాలని కూడా ఆదేశాలిచ్చింది. ప్రత్యేక కోర్టు చాలా జాగ్రత్తగా, లోతుగా అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుని అంతిమ నిర్ణయానికి వచ్చింది. అయితే హైకోర్టు మాత్రం పలు తప్పులను చేసింది. జయలలిత తదితరులు కేవలం 8.12 శాతం మేర మాత్రమే ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని హైకోర్టు చెప్పింది. వాస్తవానికి ఇది ఎంత మాత్రం సరికాదు. తన ముందున్న ఆధారాలను, ఆదాయ వివరాలను లెక్కించడంలో చేసిన పొరపాటు వల్లే హైకోర్టు అటువంటి నిర్ణయానికి వచ్చింది. పబ్లిక్ సర్వెంట్ అవినీతికి ప్రైవేటు వ్యక్తులు సహకరిస్తే వారిని అవినీతి నిరోధక చట్టం కింద విచారించచ్చు. ఈ విషయంలో ప్రత్యేక కోర్టు వ్యక్తం చేసిన అభిప్రాయాలు సరైనవే. అవినీతి నిరోధక చట్టం కింద నిందితులందరూ నేరం చేశారని ప్రత్యేక కోర్టు చెప్పడంలో ఎటువంటి తప్పులేదు.’’అని ధర్మాసనం తన తీర్పులో వివరించింది. -
సీఎంగా శశికళ ప్రమాణాన్ని అడ్డుకోండి
సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజనాల వ్యాజ్యం న్యూఢిల్లీ: అన్నాడీఎంకే అధినేత్రి వీకే శశికళ మంగళవారం తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయకుండా అడ్డుకోవాలని కోరుతూ సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. అక్రమాస్తుల కేసులో జయలలితతోపాటు శశికళ కూడా నిందితురాలుగా ఉన్నారని, ఈ కేసులో వారంలోగా తీర్పు రానున్న నేపథ్యంలో అంతవరకు ఆమె సీఎంగా ప్రమాణం చేయకుండా అడ్డుకోవాలని న్యాయస్థానాన్ని కోరింది. జయలలిత అక్రమాస్తుల కేసులో కర్ణాటక ప్రభుత్వం చేసిన అప్పీల్పై వారంలోగా తీర్పు వెలువరించే అవకాశముందని సుప్రీంకోర్టు సంకేతాలు ఇచ్చిన వెంటనే.. సత్తా పంచాయత్ ల్యాకం స్వచ్ఛంద సంస్థ ప్రధాన కార్యదర్శి అయిన సెంథిల్ ఈ పిల్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై మంగళవారం ఉదయం సుప్రీంకోర్టు వాదనలు వినే అవకాశముంది. జయలలిత అక్రమాస్తుల కేసులో శశికళా నటరాజన్ కూడా సహ నిందితురాలు. ప్రస్తుతం సుప్రీంకోర్టులో విచారణలో ఉన్న ఈ కేసులో తీర్పు మరో వారం రోజుల్లో వెలువడే అవకాశముంది. ప్రత్యేక కోర్టు ఈ కేసులో జయలలిత, శశికళలను దోషులుగా నిర్ధారించగా, కర్ణాటక హైకోర్టు ఆ తీర్పును కొట్టేసి.. ఇద్దరినీ నిర్దోషులుగా విడుదల చేసిన సంగతి తెలిసిందే. దాంతో కర్ణాటక ప్రభుత్వం హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేసింది. ఆ కేసులోనే ఇప్పుడు త్వరలో తీర్పు వెలువడబోతోంది. ప్రత్యేక కోర్టు తీర్పు వెలువడిన సమయంలో జయలలిత తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి, పన్నీర్ సెల్వంకు బాధ్యతలు అప్పగించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు శశికళ మంగళవారం ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఆ తర్వాత నాలుగైదు రోజుల్లోనే సుప్రీంకోర్టు తీర్పు వస్తుంది. ఆ తీర్పు గనక శశికళకు వ్యతిరేకంగా ఉండి, ఆమెను దోషిగా నిర్ధారించి శిక్ష విధిస్తే మాత్రం ఆమె సైతం తన పదవి నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. -
శశికళ పదవికి సుప్రీం తీర్పు గండం?
జయలలిత అక్రమాస్తుల కేసులో శశికళా నటరాజన్ కూడా సహ నిందితురాలు. ప్రస్తుతం సుప్రీంకోర్టులో విచారణలో ఉన్న ఈ కేసులో తీర్పు మరో వారం రోజుల్లో వెలువడబోతోంది. ప్రత్యేక కోర్టు ఈ కేసులో జయలలిత, శశికళలను దోషులుగా నిర్ధారించగా, కర్ణాటక హైకోర్టు ఆ తీర్పును కొట్టేసి.. ఇద్దరినీ నిర్దోషులుగా విడుదల చేసిన సంగతి తెలిసిందే. దాంతో కర్ణాటక ప్రభుత్వం హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేసింది. ఆ కేసులోనే ఇప్పుడు త్వరలో తీర్పు వెలువడబోతోంది. ప్రత్యేక కోర్టు తీర్పు వెలువడిన సమయంలో జయలలిత తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి, పన్నీర్ సెల్వంకు బాధ్యతలు అప్పగించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈనెల తొమ్మిదో తేదీన శశికళ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఆ తర్వాత నాలుగైదు రోజుల్లోనే సుప్రీంకోర్టు తీర్పు వస్తుంది. ఆ తీర్పు గనక శశికళకు వ్యతిరేకంగా ఉండి, ఆమెను దోషిగా నిర్ధారించి శిక్ష విధిస్తే మాత్రం ఆమె సైతం తన పదవి నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అప్పుడు ఆమె చేపట్టే పదవి మూణ్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయి, మరోసారి ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా పన్నీర్ సెల్వం తెరమీదకు వచ్చే అవకాశాలు లేకపోలేవని అంటున్నారు.