breaking news
diamond mine
-
వజ్రాలు ఉచితం
ధగధగలాడే వజ్రాల మెరుపులు కళ్లు మిరుమిట్లు గొలుపుతాయి. వజ్రాల మెరుపులే కాదు, వాటి ధరలు కూడా కళ్లు చెదిరేట్లు చేస్తాయి. వజ్రాల విలువ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎంతో ధర చెల్లిస్తే గాని, రవ్వంత వజ్రమైనా కొనడం సాధ్యం కాదు. అలాంటిది వజ్రాలు ఉచితం ఏమిటని ఆశ్చర్యంగా ఉందా?ప్రపంచంలో వజ్రాలు ఉచితంగా దొరికే చోటు ఒకే ఒక్కటి ఉంది. ఈ ఫొటోల్లో కనిపిస్తున్నది ఇదే! ఇది అమెరికాలోని అర్కాన్సాస్ రాష్ట్రంలో ఉంది. మర్ఫ్రీబరో గ్రామానికి చేరువలో ఉన్న ఈ వజ్రాల ఆలవాలం పేరు ‘క్రేటర్ ఆఫ్ డైమండ్స్ స్టేట్ పార్క్’. దాదాపు 37.5 ఎకరాల విస్తీర్ణం ఉన్న ఈ ప్రదేశం ఒకప్పుడు వజ్రాల గని. దీనిని 1972లో స్టేట్ పార్కుగా మార్చారు. అప్పటి నుంచి ఇది పర్యాటకులకు ప్రత్యేక ఆకర్షణగా ఉంటోంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ పార్కులో 35 వేలకు పైగా వజ్రాలు దొరికాయి. వీటిలో కొన్ని అరుదైన రకాలకు చెందినవి కూడా ఉన్నాయి.ఈ పార్కులోకి ప్రవేశించడానికి, ఇందులో టెంట్లు ఏర్పాటు చేసుకుని బస చేయడానికి మాత్రమే డబ్బు చెల్లించాలి. ఇక్కడ ఎవరైనా నేల తవ్వుకుని, వజ్రాలను ఏరుకోవచ్చు. చాలామంది సెలవురోజుల్లో ఇక్కడకు కుటుంబ సమేతంగా వచ్చి, తవ్వకాలు జరుపుతూ అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ఉంటారు. మట్టిని, ఇసుకను జల్లెడపడుతూ గంటల తరబడి ఓపికగా వెదుకులాట సాగిస్తుంటారు. తవ్వకాల్లో ఎవరికైనా ఒక్క వజ్రం దొరికినా, వారి పంట పండినట్లే! ఈ పార్కులో గడపడానికి పెద్దలకు రోజుకు 15 డాలర్లు (రూ.1285), పన్నెండేళ్ల లోపు పిల్లలకు 7 డాలర్లు (రూ.600) చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. కొందరు ఇక్కడ టెంట్లు వేసుకుని రోజుల తరబడి వజ్రాల కోసం అన్వేషణ సాగిస్తుంటారు. పార్కు బయట టెంట్లను అద్దెకు ఇచ్చే దుకాణాలు, తవ్వకాల కోసం ఉపయోగించే పనిముట్లు, పరికరాలను అద్దెకిచ్చే దుకాణాలు కూడా ఉంటాయి. ఇంటి నుంచి పలుగు పార వంటివి తెచ్చుకోనివారు వాటికి ఈ దుకాణాల్లో అద్దెకు తీసుకోవచ్చు. ఇక్కడ వజ్రాలు దొరికినట్లయితే, వాటిని ఎలాంటి మూల్యం చెల్లించాల్సిన పనిలేదు. చక్కగా వాటిని ఉచితంగానే ఇంటికి తీసుకుపోవచ్చు.మిన్నెసోటా ప్రాంతానికి చెందిన డేవిడ్ డికుక్ అనే వ్యక్తికి ఇక్కడ అరుదైన బ్రౌన్ డైమండ్ దొరికింది. గత నెల అతడు ఇక్కడ వజ్రాల కోసం అన్వేషణ కొనసాగిస్తుండగా, చాక్లెట్ రంగులో «మెరుస్తున్న రాయి కనిపించింది. దానిని పరీక్షించి చూస్తే, అది 3.81 కేరట్ల బ్రౌన్ డైమండ్గా తేలింది. ఈ పార్కులో ఇప్పటి వరకు దొరికిన వజ్రాల్లో ఎక్కువ శాతం పారదర్శకమైన తెల్లవజ్రాలే అయినా, కొందరికి అరుదైన బ్రౌన్ డైమండ్స్, యెల్లో డైమండ్స్ కూడా దొరికాయి. ఈ పార్కులో వజ్రాలు మాత్రమే కాకుండా కొంత తక్కువ విలువ కలిగిన అమెథిస్ట్, జాస్పర్, ఎగేట్, క్వార్ట్జ్ వంటి రత్నాలు కూడా దొరికాయి. అర్కాన్సాస్–టెక్సస్ సరిహద్దులో ఉన్న ఈ పార్కు సెలవురోజుల్లో జనాలతో కళకళలాడుతూ కనిపిస్తుంది. -
ఎన్ఎండీసీ వజ్రాల వేట!
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగంలోని ఎన్ఎండీసీ లిమిటెడ్ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో విస్తరించి ఉన్న 9 బిలియన్ డాలర్ల విలువైన (రూ.57,600 కోట్ల) వజ్రాల గనులకు బిడ్లు వేసే ఆలోచనతో ఉంది. ఇప్పటికే అదానీ, వేదాంత ఈ వజ్రాల గనులపై కన్నేసిన విషయం తెలిసిందే. వీటి సరసన పోటీలోకి ఎన్ఎండీసీ కూడా రానున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. మధ్యప్రదేశ్ రాష్ట్ర అధికారులతో మాట్లాడేందుకు ఎన్ఎండీసీ త్వరలోనే ఓ బృందాన్ని కూడా పంపనున్నట్టు ఈ వ్యవహారంతో సంబంధమున్న వర్గాలు తెలిపాయి. వజ్రాల గనిని నామినేషన్ ప్రాతిపదికన తమకు నేరుగా కేటాయించాలని కోరగా, దాన్ని కేంద్రం తోసిపుచ్చినట్టు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. విశాల ప్రయోజనాల కోణంలో గనులను వేలం వేయాలని ప్రభుత్వం భావిస్తోందని ఆ వర్గాలు చెప్పాయి. మధ్యప్రదేశ్లోని బందర్ ప్రాంతంలో 32 మిలియన్ క్యారట్ల నిల్వలు ఉన్నట్టు అంచనా. ఈ గనిని అంతర్జాతీయంగా వజ్రాల మైనింగ్లో పేరొందిన రియో టింటో ఈ ఏడాది ఆరంభంలో వదిలిపెట్టి వెళ్లిపోయిన విషయం గమనార్హం. ఈ నెలాఖరులోపు బందర్ వజ్రపు గనికి మధ్యప్రదేశ్ సర్కారు వేలం నిర్వహించే అవకాశాలున్నాయి. ఈ నెల 30 నాటికి టెండర్లను ఆహ్వానిస్తూ ప్రకటన వెలువడుతుందని మధ్యప్రదేశ్ మినరల్ రిసోర్సెస్ ఉన్నతాధికారి మనోహర్లాల్ దూబే తెలిపారు. అటవీ అనుమతులు వేగంగా ఇచ్చేందుకు పర్యావరణ శాఖ లోగడే హామీ ఇచ్చినట్టు చెప్పారు. ఇక నూతన ఖనిజ వనరుల విధానంలో భాగంగా భారీ ప్రాజెక్టులకు బిడ్లు వేసేందుకు అర్హతలను సడలించనున్నారు. వజ్రాల వేట: మధ్యప్రదేశ్లో దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న బందర్ గనిపై రియోటింటో సంస్థ 14 ఏళ్ల పాటు శ్రమించింది. 90 మిలియన్ డాలర్లు (రూ.576 కోట్లను) ఖర్చు చేసింది. ఈ ప్రాంతం పులులకు ఆవాసం కావడంతో పర్యావరణ అనుమతుల్లో ఆలస్యం చోటు చేసుకుంది. దీంతో రియోటింటో ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంది. తాజా వేలం ప్రతిపాదన నేపథ్యంలో ఇటీవలే వేదాంత రిసోర్సెస్, అదానీ గ్రూపు ప్రతినిధులు ఈ ప్రాంతంలో పర్యటించారు. మరోవైపు ఎన్ఎండీసీ ఇప్పటికే వజ్రాల వెలికితీతలో ఉంది. మధ్యప్రదేశ్లోనే మజ్గావన్ గని నుంచి మిలియన్ క్యారట్ వజ్రాలను వెలికితీసిన అనుభవం కూడా ఉంది. దీంతో బందర్ గనికి కూడా పోటీ పడాలనుకుంటోంది. -
ఇక వజ్రాల వేట షురూ..
న్యూఢిల్లీ: దేశంలో మొదటి సారి వజ్రాల గనుల తవ్వకాల కోసం ప్రభుత్వం టెండర్లు పిలవనుంది. మధ్యప్రదేశ్ లోని పన్నా జిల్లాలో విరివిగా వున్న వజ్రాల గనులకు వేలం పాటల్ని వచ్చే నెలలోనే నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. వచ్చేవారం టెండర్లను ఆహ్వానిస్తూ నోటీసులు ఇవ్వనున్నట్టు మైన్స్ సెక్రటరీ బల్విందర్ కుమార్ పీటీఐకి తెలిపారు. ఫిబ్రవరిలో మొదటి సారి బంగారు గనులకు వేలం నిర్వహించిన ప్రభుత్వం ఇపుడు వజ్రాల అన్వేషణ కోసం నడుం బిగిస్తోంది. ఈ గనుల లీజు ప్రక్రియ కోసం రాష్ట్ర ప్రభుత్వం వచ్చేవారం నోటీసులు ఇస్తుందని బల్విందర్ కుమార్ తెలిపారు. సుమారు మూడువారాలలో టెండర్ల పరిశీలన పూర్తవుతుందన్నారు. ప్రస్తుతం ప్రభుత్వ రంగ సంస్థ ఎన్ఎండిసి మాత్రమే మైనింగ్ నిర్వహిస్తోందని తెలిపారు. దేశంలో ఇది ఏటా 81,000 క్యారెట్ల పైగా ఉత్పత్తి చేస్తోందన్నారు. దీంతోపాటుగా పన్నా, శాంతా జిల్లాలో 400 క్యారెట్ల షాలో డైమండ్స్ ను ఉత్పత్తి చేస్తోందని తెలిపారు. మధ్యప్రదేశ్ లో 10,45,000 క్యారెట్ల వజ్రాల నిధులు ఉండగా, పన్నా 976,05 వేల క్యారెట్లవరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో మొదటి దశలో మొత్తం 42 గనులను గుర్తించినట్టు తెలిపారు. ఇనుప ఖనిజం, బాక్సైట్, బంగారు, సున్నపురాయి నిక్షేపాలతో ఇవి నిండివున్నాయన్నారు. వీటిలో ఆరు గనుల విజయవంతంగా వేలం వేశారు.