breaking news
deaf and mute boy
-
బధిర విద్యార్థులకు ఉచిత విద్య
ఖమ్మం మామిళ్లగూడెం : మూగ, చెవిటి విద్యార్థులకు ఉచిత విద్యతో పాటు హాస్టల్ వసతి కల్పించనున్నట్లు ఐడీఎల్ స్కూల్ ఫర్ డిజబుల్డ్(ఐఐసీడీ) కార్యదర్శి తబ్రేజ్ తెలిపారు. మంగళవారం బధిరులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ చాదర్ఘాట్లోని అజంపురాలో గల పాఠశాలలో ఒకటో తరగతి నుంచి 10వ తరగతి వరకు మూగ, చెవిటి, మానసిక వికలాంగులకు ఉచిత విద్య, హస్టల్ వసతితో పాటు ఉచితంగా పుస్తకాలు, యూనిఫాం అందిస్తామన్నారు. కుల మతాలకు అతీతంగా ఈ పాఠశాల్లో తమ పిల్లలను చేర్పించాలని కోరారు. భాషలో ప్రావీణ్యులైన అధ్యాపకుల పర్యవేక్షణలో మూగభాషతో పాటు కంప్యూటర్ పాఠాలు కూడా బోధిస్తారని అన్నారు. ఇతర వివరాలకు సెల్ నెం.9059619641కు ఫోన్ చేయాలని కోరారు. -
తొమ్మిదేళ్ల తర్వాత కుటుంబ సభ్యుల చెంతకు..
మందస : ఒకటి కాదు.. రెండు కాదు.. తొమ్మిదేళ్ల తర్వాత ఆ కుర్రాడు ఇంటికి చేరడంతో ఆ కుటుంబంలో ఆనందానికి అవధుల్లేవు. మరణించాడనుకున్న వ్యక్తి తిరిగి రావడంతో సంబ్రమాశ్చర్యానికి గురయ్యారు. వివరాలిలా ఉన్నాయి. మందస పట్టణంలోని కంచమయికాలనీ సమీపంలో నివాసముంటున కరుమోజి సంతోష్ పుట్టుకతో దివ్యాంగుడు(మూగ, చెవిటి). సంతోష్ను ప్రతి ఒక్కరూ జడ్డిడుగా హేళన చేసేవారు. 9 ఏళ్ల కిందట ఇతడు పట్టణంలోని శ్రీవెంకటేశ్వర భోజన హోటల్లో పని చేసేవాడు. ఒక రోజు హఠాత్తుగా కనిపించలేదు. ఇంటికీ వెళ్లలేదు. దీంతో ఆయన కుటుంబ సభ్యులతో పాటు హోటల్ యాజమాన్యం కూడా సంతోష్ ఆచూకీకి ఎంతో ప్రయత్నించారు. ఇతడిపై పోలీసు స్టేషన్లో అదృశ్యం కేసు కూడా నమోదైంది. అయితే, అప్పటిలో ఓ చిరువ్యాపారి సంతోష్ను ఎవరో కారులో తీసుకెళ్లడం చూశానని చెప్పినప్పటికీ ఎవరూ నమ్మలేదు. సంతోష్ కనిపించకుండా దాదాపు తొమ్మిదేళ్లు గడిచాయి. స్థానికంగా పానీపూరి చేసుకుని, అమ్ముకుంటూ జీవించే ఒడిశా వాసులు ఇదే కాలనీలో ఉంటున్నారు. రెండు రోజుల క్రితం వారు తమ సొంత స్థలాలైన ఒడిశాలోని భువనేశ్వర్కు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో భువనేశ్వర్ రైల్వే స్టేషన్లో సంతోష్ కనిపించాడు. అతనితో సైగలతో మాట్లాడారు. తన దగ్గర డబ్బుల్లేవని, సొంత ఊరుకు వచ్చేస్తానని చెప్పడంతో వారు తమ చేతిలోని డబ్బులతో భువనేశ్వర్ నుంచి మందస తీసుకువచ్చి కుటుంబానికి సంతోష్ను అప్పగించారు. తొమ్మిదేళ్ల క్రితం ఆరోగ్యంగా ఉన్న ఇతడు ప్రస్తుతం చిక్కిపోయి ఉండడంతో కుటుంబసభ్యులు కన్నీటి పర్యాంతమయ్యారు. ఇన్నాళ్లు ఎక్కడ ఉన్నావ్.. ఏమి చేస్తున్నావ్.. అని ప్రశ్నించగా, తనను ఎవరో కారులో తీసుకెళ్లిపోయారని, ఇటుకలు తయారీ చేసే బట్టీలో కూలీగా మార్చేశారని సంతోష్ చెబుతున్నాడు. అర్థాకలితో యజమాని వేధింపులకు గురిచేశాడని, అంతేకాకుండా ఒక్క పైసా కూడా ఇవ్వకుండా పని చేయించుకునే వాడన్నాడు. దాదాపుగా తప్పించుకుని పారిపోయే విధంగానే వచ్చానని చెబుతున్నాడు. సుమారు దశాబ్ద కాలం పాటు కనిపించకుండా పోయిన కుమారుడు ఇంటికి రావడంతో తల్లి కమల, అన్నయ్య అప్పన్న ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా, సంతోష్ లేకపోవడంతో రేషన్ కార్డులో పేరును తొలగించారని, ఆధార్కార్డు లేదని, వస్తున్న పింఛన్ను నిలిపివేశారని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము ఎంతో పేదరికంలో ఉన్నామని, అధికారులు స్పందించి, పింఛన్తో పాటు రేషన్కార్డు, ఆధార్కార్డు అందేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి బాలుడి అప్పగింత
డోర్నకల్ : మహబూబాబాద్ రైల్వే స్టేషన్లో దొరికిన ఓ బాలుడిని మంగళవారం వరంగల్లోని బాలల సంరక్షణ కమిటీకి అప్పగించారు. డోర్నకల్ జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ కథనం ప్రకారం.. పుష్పుల్ రైలులో మంగళవారం తిరుగుతున్న ఆరేళ్ల గుర్తుతెలియని బాలుడిని ప్రయాణికులు మహబూబాబాద్ రైల్వే స్టేషన్లో దించి అక్కడ విధులు నిర్వహిస్తున్న జీఆర్పీ కానిస్టేబుల్ రాజుకు అప్పగించారు. కానిస్టేబుల్ 1098కు సమాచారం అందించి బాలుడిని డోర్నకల్ జీఆర్పీకి తరలించారు. బాలుడికి మాటలు రాకపోవడం, చెవులు వినిపించకపోవడంతో బాలుడికి సంబంధించిన ఎలాంటి ఆచూకీ లభ్యం కాలేదు. బాలుడి చిరునామా గురించి ప్రశ్నించగా సైగలు మాత్రమే చేస్తున్నాడు. మహబూబాబాద్ నుంచి 1098 డివిజన్ కోఆర్డినేటర్ తప్పెట్ల వెంకటేష్, టీం సభ్యురాలు ఉమారాణి డోర్నకల్ చేరుకోగా స్టేషన్ మాస్టర్ షరీఫ్ సమక్షంలో బాలుడిని జీఆర్పీ పోలీసులు వారికి అప్పగించారు. వారు బాలుడిని రైలులో వరంగల్కు తీసుకెళ్లి బాలల సంరక్షణ కమిటీ ఎదుట హాజరుపర్చారు.