ఏపీకి దిత్వా ముప్పు!
విశాఖపట్నం: సెన్యార్ ముప్పు తొలగిందని అనుకునేలోపే మరో తుపాను దూసుకొస్తోంది. దీనికి దిత్వాగా నామకరణం చేశారు. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయు గుండం.. శ్రీలంక వైపు కదులుతూ రాగల 12 గంటల్లో తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలను భారత వాతావరణ శాఖ(IMD) అప్రమత్తం చేసింది. దిత్వా ప్రస్తుతం ట్రింకోమలీ(శ్రీలంక)కి 200 కి.మీ, పుదుచ్చేరికి 610 కి.మీ, చెన్నైకి ఆగ్నేయంగా 700 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. గడిచిన 6 గంటల్లో 15 కి.మీ వేగంతో కదిలింది. ఆదివారం తెల్లవారుజాముకి నైరుతి బంగాళాఖాతం తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణకోస్తా తీరాలకు చేరుకునే అవకాశం ఉంది. ఈ ప్రభావంతో.. ఏపీలో రేపు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడొచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. శని, ఆదివారాల్లో మాత్రం భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది. తుపాను నేపథ్యంలో దక్షిణకోస్తా, రాయలసీమ జిల్లాల అధికార యంత్రాంగాలు అప్రమత్తం అయ్యాయి. తీరం వెంబడి 80-90 కిలోమీటర్ల వేగంగా ఈదురు గాలులు వీస్తాయని.. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. దిత్వా తుపాను నేపథ్యంలో అన్ని పోర్టులలో రెండో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. మత్స్యకారులను వేటకు వెళ్లొద్దని సూచించారు.మరోవైపు దిత్వా ప్రభావం ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరిలపై కూడా ఉండనుంది. దీంతో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఈ తుపానుకు దిత్వాగా యెమెన్ నామకరణం చేసింది. దీనర్థం పువ్వు అని.